9, సెప్టెంబర్ 2012, ఆదివారం

చిన్న బ్రేకు తర్వాత ఉద్యమిద్దాం!

ఆంధ్ర భూమి సంపాదకీయ పేజీ (02/09/2012) :  ఉద్యమాలకీ ‘బ్రేకు’లుంటాయి. లేకుంటే, ఉద్యమాలు చేసే వాళ్ళకీ, చూసే వాళ్లకీ కూడా బోరు కొడుతుంది. ఆ బ్రేకులు ఒక్కొక్కసారి సినిమాల్లో ‘ఇంటర్వల్ బ్రేకు’ల్లా వుండొచ్చు. లేదా టీవీ సీరియల్స్‌లో ‘కమర్షియల్ బ్రేకు’ల్లాగయినా వుండవచ్చు.

నిజమే మరి. ఉద్యమాలు కూడా డొన్ని సినిమాల్లా మూడు గంటల్లో తేలిపోతాయి. కొన్ని సీరియళ్ళలాగా ఏళ్ళతరబడి, ఎపిసోడ్ల తరబడి సాగుతుంటాయి. బంగి అనంతయ్య తరహా ఉద్యమాలున్నాయనుకోండి. నడి రోడ్డు మీద ఒక మారువేషంతో మూడు గంటల పాటు నడుస్తుంది. వంటగ్యాస్ ధరకు వ్యతిరేకంగా ఆయన ఆడ వేషం కట్టుకుని నెత్తిమీద గ్యాస్ బండ పెట్టుకుని నినాదాలిస్తారు. ఎంత సేపని బండను మోస్తారు? గంటన్నర తర్వాత వంక కోసం చూస్తారు. ఈ లోగా ఎవరో అధికారి వచ్చి ట్రాఫిక్ దిగ్బంధమయిందని చర్చలకు చెట్టుకిందకు తీసుకు వెళ్తాడు. బండ దించి పక్కకు వెళ్తారు అనంతయ్య. ఇదే ఇంటర్వెల్ బ్రేకు. తర్వాత మళ్ళీ బండ ఎత్తుకుంటారు. ఈ లోగా మీడియా వారు ‘గొట్టాల’ (కెమేరాల)తో వస్తారు. ఉద్యమం క్లయిమాక్సుకు వస్తుంది. నినాదాలు హోరెత్తించేస్తారు. వెంటనే పోలీసులు చక్కటి వ్యానుతో వస్తారు. నెత్తిన బండతో పాటు వ్యాను ఎక్కేస్తారు. అంతే శుభం కార్డు పడిపోతుంది.

ఈ ఉద్యమం ఒక పూటలో తేలిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్వంటీ-ట్వంటీ మ్యాచ్ లాంటిది. ఇది లోబడ్జెట్ ఉద్యమం. చేయడానికి వందలమంది ఉండనవసరం లేదు. ఒక్కరున్నా చేసుకోవచ్చు. ప్రేమించి, పెళ్ళాడలేక పోతున్నవారూ, రిటయిరయ్యాక పింఛను రానివారూ- ఇలా ఎవరయినా సరే, ఈ తరహా ఉద్యమాన్ని ప్రయత్నించవచ్చు. ఒక టెలిఫోన్ టవర్‌నో, ఒక హోర్డింగ్, ఒక నీళ్ళ ట్యాంకునో చూసుకుని ఎక్కేయటమే. బాజా లూ (మీడియా), భజంత్రీలు (పోలీసులూ) తమ స్వంత ఖర్చుల మీద వచ్చేస్తారు. ‘దూకేస్తాను, దూకేస్తాను’- అని బెదిరించ వచ్చు. మధ్యలో అలిసిపోతే, ఇంటర్వెల్ బ్రేకు ఇచ్చుకోవచ్చు. కిందనుంచి పోలీసులు, ‘బర్గలో, పిజ్జాయో’ పొట్లాం కట్టి పైకి విసురుతారు. బంతిని అందుకున్నట్టు, అందుకుని భోంచేయవచ్చు. ఈలోగా కింద ఉత్కంఠతో నరాలు తెగిపోతున్న జనం కూడా, పక్కకు వెళ్ళి టీ తాగి వస్తారు. ఆ తర్వాత పోలీసులే పరిష్కార మార్గం వెతుకుతారు. ప్రేమించిన ప్రియుణ్ణి వెతికి పట్టి, వాడి చేతికి పుస్తెలు తాడు యిచ్చి నీళ్ళ ట్యాంకు పైకి పంపిస్తారు. వాడు గాలిలో మూడు ముళ్ళూ వేశాక దిగివచ్చేస్తే, జనంతోపాటు అందరూ ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఉద్యమాలకు మధ్యలో ఒకే ఒక్క బ్రేకు సరిపోతుంది.

కానీ ‘సీరియల్ ఉద్యమాల’తోనే సమస్య. ఎందుకంటే వీరు తీసుకునే సమస్యలకు వెనువెంటనే పరిష్కారాలు దొరకవు. ఆ మాటకొస్తే, అలా పరిష్కారాలు దొరకని సమస్యలనే వీరు ఎంచుకుంటారు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ, మంద కృష్ణ ఎస్సీల వర్గీకరణ, అద్వానీ, మోడీల రామమందిర నిర్మాణం, అన్నా హజారే లోక్‌పాల్- ఇలాగన్నమాట. ‘మొగలి రేకులు’ సీరియల్ అయినా ముగుస్తుందేమో కానీ, ఈ ఉద్యమాలు ముగియవు. అందుకని వీటికి ‘ఇంటర్వెళ్ళు’ సరిపోవు. మాటిమాటికీ ‘కమర్షియల్ బ్రేకుల్లాం’టివి ఇస్తూ వుండాలి. ఇందువల్ల వారు విశ్రాంతి తీసుకోవచ్చు. నిరాహార దీక్షల వల్ల బరువు తగ్గి వున్నట్లయితే పూడ్చుకోవచ్చు. ఈ ఉద్యమాలను అభిమానించే జనం కూడా, మధ్య, మధ్యలోచదువుల్లాంటివి చదువుకోవచ్చు. ఉద్యోగాల్లాంటివి చేసుకోవచ్చు. అయితే పేరుకు ‘కమర్షియల్’ బ్రేకులయినా, ప్రయోజనమున్నట్టుండాలి. పక్క చానెల్‌కు వెళ్ళకూడదు. ‘చూస్తూనే వుండాలి’. కాబట్టి ఉద్యమాలు నడపటానికే కాదు, బ్రేకులు ఇవ్వడానికి కూడా వ్యూహం ఉండాలి.

తెలంగాణ ఉద్యమానికి ఇలాంటి బ్రేకులు ఇవ్వడంలో ఆరితేరి పోయారు కేసీఆర్. అందుకనే బ్రేకుల వేళల్లో కూడా ఆయన అభిమానులూ, అనుచరులూ ఆయన్ను వదలి పక్క పార్టీలకు వెళ్ళరు. ఆ మధ్య ఆయన తన ఉద్యమానికి వరుసగా ఇచ్చిన రెండు బ్రేకుల్ని చూడండి. ఒక్కటి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కోసం ఆయన కుమార్తె కె. కవిత చేశారు. ఈ బ్రేకు అందర్నీ ఆకర్షించింది. విరామం ఇచ్చినట్టూ వుంది. ప్రయోజనమూ ఉంది. కేవలం కేసీఆర్ సామాజిక వర్గానికో, లేక కేసీఆర్ కుంటుంబానికో టీఆర్‌ఎస్ పరిమితమయిందన్న అతిపెద్ద ఆరోపణలకు, ఈ బ్రేకు అతి చిన్న సమాధానం.

అలాగే ఈ మధ్య జగన్మోహన రెడ్డి తన ‘నిరవధిక ఓదార్పు’కు కూడా ‘బ్రేకు’ ఇచ్చారు. ఈ ‘బ్రేకు’లో తల్లి విజయమ్మ ‘చేనేత కార్మికుల ఆకలి చావులు’, ‘రైతుల సమస్యలు’ అంటూ తెలంగాణలో చొచ్చుకు పోతున్నారు. అప్పుడు కేసీఆర్ ఏం చేశారు? బ్రేకుకు బ్రేకే సమాధానం అనుకున్నారో లేక ‘పక్క చానెల్లో బ్రేకు ఇచ్చిన వేళకే మనమూ బ్రేకు ఇవ్వాలి’ అని అనుకున్నారో ఏమో- ఇదే సమయానికి తెలంగాణ ఉద్యమాన్ని అలా ఉంచి, ‘విద్యుత్ కోత’ల మీద ఆందోళనలు మొదలుపెట్టారు.

మంద కృష్ణ కూడా అంతే. ఆయన చేపట్టిన ఎస్సీల వర్గీకరణ సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. కానీ, మధ్యమధ్యలో బ్రేకులు ఇచ్చి, ఆయన గుండెకు చిల్లులు పడ్డ బాలల గురించీ, వికలాంగుల గురించీ నిరసనలూ, నిరాహారదీక్షలూ చేస్తుంటారు. మోడీనే చూడండి. కాసేమపు ‘హిందూ త్వ’ఎజెండాను పక్కన పెట్టి ‘సద్భావనా యాత్ర’ మొదలు పెట్టలేదూ? లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ తన పార్టీ ప్రధాన కార్యక్రమాలను పక్కన పెట్టి, ‘సురాజ్య’ యాత్ర చేస్తున్నారా? లేదా?

కానీ, ఈ దేశంలో బ్రేకులు లేనిది కేవలం ఒక్క ఉద్యమానికే- అదే సామాన్యుడి బతుకు పోరు. అది వాడికి నచ్చినా నచ్చకపోయినా, సాగుతూనే ఉంటుంది. ఒక్క బ్రేకూ ఉండదు. కడకు మృత్యువే శుభం కార్డు వేస్తుంది.

-సతీష్ చందర్ 

3, సెప్టెంబర్ 2012, సోమవారం

తెలంగాణాలో విశాలాంధ్రోద్యమము - మూడవ భాగము

రెండవ భాగం తరువాయి

కొంత కాలము పట్టినది

ఈ విధముగ ప్రారంభమైన విశాలాంధ్రోద్యమము హైదరాబాదు నగరములో అడుగుపెట్టి, తెలుగు సీమలో వ్యాపించుటకు కొంతకాలము పట్టినది. ఉస్మానియా విశ్వవిద్యాలయమున జరిగిన మొట్టమొదటి ఆంధ్రాభ్యుదయోత్సవాల సందర్భమున అయ్యదేవర కాళేశ్వరరావుగారు హైదరాబాదుకు వచ్చి, విశాలాంధ్ర మహాసభను మాడపాటి హనుమంతరావు పంతులుగారి సలహాతో ప్రారంభించుటకు ప్రయత్నించిరి. ఈ సందర్భమున సుల్తాను బజారులోని ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యాలయమున ఇందుకొరకై ఒక సమావేశము జరిగియుండెను. ఆ సమావేశానికి అపుడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుకు ఉపాధ్యక్షులుగానున్న పల్లెర్ల హనుమంతరావు గారు అధ్యక్షత వహించిరి. సమావేశములో మాడపాటి హనుమంతరావు పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు, పి.పుల్లారెడ్డి,  దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావు, యం.ఎస్.రాజలింగం మొదలైన వారు పాల్గొని, కొంతకాలము ఆగి ఈ ఉద్యమమును ప్రారంభింపవలెనని అభిప్రాయపడిరి.

అంకురార్పణ- ప్రజాస్వామిక వాతావరణము 


ఇట్టి పరిస్థితులలో హైదరాబాదు రాష్ట్రమున జనరల్ ఎన్నికలు జరిగినవి. మొట్టమొదటిసారిగా శాసనసభకు బాధ్యతవహించు ప్రభుత్వము ఏర్పడినది. కమ్యునిస్టులు తెలంగాణ పోరాటమును విరమించి శాసనసభలో ప్రవేశించిరి. ఈ ప్రజాస్వామిక వాతావరణములో విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి తగిన తరుణము ఆసన్నమైనదని ఉద్యమకారులు అభిప్రాయపడినారు. ఈ అభిప్రాయముతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల కార్యాలయమున మీర్ అహమ్మదలీఖాన్ గారి ప్రేరణతో మీర్ అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావు, నందగిరి వెంకట్రావు గారలు 13 ఆగస్టు, 1953 నాడు సమావేశమయి, హైదరాబాదు రాష్ట్రములో విశాలాంధ్రోద్యమము ప్రారంభింపవలెనని నిర్ణయించి, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి గారలతో సంప్రదింపవలెనని నిశ్చయించిరి. ఈ సంప్రదింపులు 20 ఆగస్టు 1953 నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్సులోని ఉస్మానియా విశ్వవిద్యాలయ పట్టభద్రుల కార్యాలయములో జరిగినవి. ఈ సంప్రదింపులలో మాడపాటి హనుమంతరావు, అహమ్మదలీఖాన్, సురవరం ప్రతాపరెడ్డి, నందగిరి వెంకట్రావు , దేవులపల్లి రామానుజరావు, పల్లెర్ల హనుమంతరావు, సర్దారుల్లాఖాన్, భోజ్ రాజ్ గారలు పాల్గొని యుండిరి. ఆనాడు ఈ ఎనిమిది మంది సంతకాలతో 1953 సెప్టెంబరు 14 వ తేదీనాడు సాయంకాలం 5 గంటలకు పట్టభద్రుల కార్యాలయములో ఒక పెద్ద సమావేశమును జరుపుటకు నిర్ణయించబడినది. ఆ సమావేశమునకు నగరము నుండి, జిల్లాల నుండి నూరుమందికి పైగా ప్రతినిధులు ఆహ్వానింపబడిరి. సమావేశపు నోటీసు సురవరం ప్రతాపరెడ్డి గారు ఇంగ్లీషులో వ్రాసిరి. 14 సెప్టెంబరు 53 నాటి  సమావేశమున మాడపాటి హనుమంతరావు, పల్లెర్ల హనుమంతరావు, భోజ్ రాజ్, బొజ్జం నరసింహులు, కొమ్మవరపు సుబ్బారావు, ఆదిరాజు వీరభద్రరావు, ఎస్.శ్యామారావు, కమతం వెంకటరెడ్డి, మీర్ అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావు, సర్దారుల్లాఖాన్ , మడూరి శంకరలింగం, రంజిత్ సింగ్, భద్రదేవ్, నూకల సర్వోత్తమరెడ్డిగారలు పాల్గొనిరి. మాడపాటి హనుమంతరావుగారు ఈ సమావేశమునకు అధ్యక్షత వహించిరి. ఈ విధముగ హైదరాబాదు నగరమున, జిల్లాలలో విశాలాంధ్రోద్యమ అభిప్రాయాలు క్రమక్రమముగ వ్యాపింపసాగినవి. విశాలాంధ్ర మహాసభను స్థాపించవలెనని అభిప్రాయములు బలపడినవి. ఇది ఇట్లుండగా మద్రాసులో ఆంధ్రరాష్ట్రము కొరకు పొట్టి శ్రీ రాములు ఆత్మార్పణము తరువాత భారత ప్రభుత్వముచే ఆంధ్ర రాష్ట్ర స్థాపన ప్రకటన జరిగినది. ఈ పరిస్థితిలో 1953 ఏప్రిల్ నెలలో విజయవాడ యందు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యనిర్వాహక వర్గ సమావేశము జరిగియుండెను. ఈ సమావేశము మిక్కిలి ముఖ్యమైనది. అప్పుడు ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘానికి సంజీవరెడ్డిగారు అధ్యక్షులుగా నుండిరి. ఈ సందర్భమున తెలంగాణా ప్రతినిధులు కొందరు విజయవాడకు వచ్చిన బాగుండునని కాళేశ్వరరావుగారు మాడపాటి హనుమంతరావు పంతులు గారికి వ్రాసిరి. మాడపాటి హనుమంతరావుగారు తమ ఆంతరంగికులను సంప్రదించి, అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావులను విజయవాడ వెళ్ళమని కోరిరి. వీరి విజయవాడకు వెళ్లకముందు కొండా వెంకటరంగారెడ్డిగారిని కలుసుకొనిరి. రంగారెడ్డి గారు కొంత ముందుగానో, ఆలస్యముగనో, అనివార్యముగ విశాలాంధ్ర ఏర్పడగలదనియు, ఈ విషయమై తమను కలుసుకొనిన ముగ్గురు, అనగా మాడపాటి హనుమంతరావు,అహమ్మదలీఖాన్, దేవులపల్లి రామానుజరావుగారలు పనిచేయుట తమకు సమ్మతమేనని ప్రోత్సహించిరి. విజయవాడలో ఈ ఉభయులకు ఘన స్వాగత మీయబడినది. అక్కడ ఈ ఉభయులు సంజీవరెడ్డి, కాళేశ్వరరావు మొదలైన కాంగ్రెస్ నాయకులతో సంప్రదించిరి. ఆంధ్రనాయకులు విశాలాంధ్రకు తమ సంపూర్ణ సముఖత్వమును వెల్లడించి, విశాలాంధ్ర ఉద్యమము తెలంగాణమునుండియే సాగవలెనని అభిప్రాయపడిరి. ఆనాడు విజయవాడలో యీ విషయమై జరిగిన బహిరంగ సభలో పై ఉభయులు ప్రసంగించిరి. దీని తరువాత హైదరాబాదు, సికిందరాబాదు మునిసిపల్ కార్పొరేషనులు హైదరాబాదు రాష్ట్ర విభజన జరిగి, హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర ఏర్పదవలెనని తీర్మానించినవి. 2  వ జూన్ 1953  నాడు హైదరాబాదులో హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసు సర్వసభ్య సమావేశము రామానందతీర్థ అధ్యక్షతన జరిగినది. అందులో విశాలాంధ్ర, ఐక్య కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రముల స్థాపన వాంఛించుచు తీర్మానము జరిగినది. ఈ సంఘటనలు హైదరాబాదు, సికిందరాబాదు నగరాలలోను తెలంగాణ జిల్లాలలోను విశాలాంధ్రోద్యమ వ్యాప్తికి బలమైన ఊతనిచ్చినవి. కమ్యునిస్టు పార్టీ విశాలాంధ్రను బలపరుచుచు ప్రకటన గావించినది. 1953 ఆగస్టు 14 ,15 తేదీలలో హిమాయత్ నగర్ లో తెలంగాణా రైతుసంఘ కార్యాలయమున బద్ధం ఎల్లారెడ్డిగారి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభ కార్యవర్గ సమావేశములో విశాలాంధ్ర కావలెనను తీర్మానము ఆమోదింపబడినది. తరువాత కొన్నినెలలకు ఈ ఆంధ్రమహాసభ సమావేశము ప్రతాపగీర్జి కోఠిలో జరిగినది. విశాలాంధ్రము సత్వరముగ ఏర్పడవలెనని  తీర్మానింపబడినది. 1953  ఆగస్టు 24  వ తేదీనాడు రెడ్డి విద్యార్ధి వసతి గృహమున విశాలాంధ్రోద్యమమును బలపరచుటకై మాడపాటి హనుమంతరావుగారి అధ్యక్షతన ఒక సమావేశము జరిగినది. ఇందులో దేవులపల్లి రామానుజరావు, వి.బి. రాజు, గురుమూర్తి, వెంకటేశం, వాసుదేవనాయక్,  అహమ్మదలీఖాన్, సర్దారుల్లాఖాన్, డాక్టరు రంగాచారిగార్లు విశాలాంధ్ర నిర్మాణము తొందరగా జరుగావలెనని ఉపన్యసించిరి. 1953  అక్టోబరు 2 వ తేదీన ఆంధ్రరాష్ట్ర స్థాపన జరిగినది. ఈ సందర్భమున కర్నూలులో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సమావేశమున హైదరాబాదు రాజధానిగ విశాలాంధ్ర స్థాపన జరుగావలెనని తీర్మానింపబడినది. ఇది గమనించదగినది. ఆంధ్ర రాష్ట్రావతరణ ఉత్సవాలలో పాల్గొనుటకు హైదరాబాదునుండి సుమారు రెండునూర్ల మంది విశాలాంధ్రోద్యమాభిమానులు కర్నూలుకు వెళ్లియుండిరి. 1953 అక్టోబరు ఒకటవ తేదీ సాయంకాలము కర్నూలులో తెలంగాణా ప్రతినిధుల సమావేశము జరిగినది. ఆ సమావేశములో అనంతశయనం అయ్యంగార్, బెజవాడ గోపాలరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైన ఆంధ్ర నాయకులు పాల్గొనిరి. సమగ్రమైన చర్చలు జరిగిన పిదప తెలంగాణా ప్రతినిధులు విశాలాంధ్రకు కృషి చేయడానికి నిర్ణయించిరి.


డా.దేవులపల్లి రామానుజరావు