ఆంధ్రప్రభ వ్యాసం: ఆలస్యంగానైనా, నిజాలు తెలిస్తే అదిన్నూ పన్నెండేళ్లుగా, పుట్టెడు పచ్చి అబద్ధాల్ని గుక్కతిప్పుకోకుండా చెబుతూ వచ్చిన వారి పరంగానే జరిగితే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. ఇన్నాళ్లుగా అన్నేసి అబద్ధాలతో, సాంస్కృతిక చారిత్రక వక్రీకరణలతో మభ్యపెట్టి, మోసం చేసినందుకు కాస్తో కూస్తో కోపం రాకపోదు కానీ, ఇప్పటికైనా నిజాలు కక్కేరు, వినాశనాన్ని, మనకి అప్రతిష్ఠని నివారించారులే అనే ఆనందంలో అది మరుగున పడిపోతుంది! అయినా పరివర్తనని, పశ్చాత్తాపాన్ని, అంతిమంగా నిజాల ఒప్పుకోలుని సహృదయంతో స్వాగతించే సుగుణం తెలంగాణ ప్రజలకి ఉండదేమోనని అనుమానించడం సరైంది కాదు. కాబట్టి ఇన్నేళ్లుగా 'గోబెల్స్' మాదిరిగా ప్రతివాదం వినిపించనీయని, హింసాయుత ధోరణులనాశ్రయించి, ప్రయోగించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రవాదం పేరిట, ఏకపక్షంగా ప్రచారం చేసిన అసత్యాలు, అభూతకల్పనలు, చారిత్రక, సాంస్కృతిక వక్రీకరణలు, తప్పుడు గణాంకాలు, తమ దుష్ప్రభావాన్ని చాలావరకు కోల్పోయిన ఈ తరుణంలో, విభజనవాద వక్రచక్రాల మాయారథసారథి, ఆయన కుటుంబీకులు, అనుంగు అనుయాయులు, ఇతర విభజన వాదులందరూ తెలంగాణ ప్రజల ముందుకొచ్చి, నిజాయితీగా, పశ్చాత్తాప పూర్వకంగా ఒప్పుకోవాల్సిన నిజాల్ని, అంశాల్ని చర్చించుకుందాం. ఎంతైనా 'మనోళ్లే' కదా అన్న అభిమానంతో ఇటువంటి పశ్చాత్తాప ప్రకటన నిజాల ఒప్పుకోలు క్రమంలో, మరీ ప్రమాదం జరగకుండా ఉండడానికి పాటించాల్సిన కొన్ని కిటుకుల్ని లేదా జాగ్రత్తల్ని కూడా సూచించుదాం. విభజన వాద సెల్టవర్ శిఖరాగ్రం నుంచి తమ అనివార్య అవరోహణా క్రమాన్ని, మెట్టుమెట్టుగా దిగే రీతిలోనే జరపాలి గానీ, ఒక్కసారిగా పైనుంచి సమైక్యంగా నేలపైకి దూకేయరాదని, దొరవారితో సహా, ప్రత్యేక రాష్ట్రవాదులుగా ప్రస్తుతానికి చలామణి అవుతున్న వాళ్లందరికీ తెలుసు! 'మాది మాగ్గావాలె' అని అరవడం మానకుండానే, ఏదోటి తేల్చండి అని సన్నాయి నొక్కులూ మంద్రస్వరంలో ఆలపిస్తున్నారందుకే?
ఏమైనా ఇప్పటికే అధినేతతో సహా, వీర విభజనవాదులందరూ తాము గతంలో పదే పదే వల్లె వేసిన వితండ వాదాంశాలెన్నింటినో, వెనకబాటుతనం, ఒప్పందాల ఉల్లంఘనలు, నీళ్లు, ఉపాధి అవకాశాల దోపిడీ, చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత, వంటివాటిని తమకు తామే పరిత్యజించేశారు, అవన్నీ అసమంజసమైనవిగా, నిర్ద్వంద్వంగా నిరూపితమైనందువల్ల ఇకపోతే మనజాతి, సంస్కృతి, రీతి వేషభాషలు, ఆఖరికి దేవుళ్లు, దేవతలు కూడా లేరన్నది పిచ్చివాదనగా తేలిపోయిందనీ గ్రహించేరు! రాష్ట్రానికి దేశానికి ఏం నష్టం జరిగినా మాకనవసరం, మాది మాగ్గావాలె అంతే, అనడం మొత్తం దేశ ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు ఏమాత్రం నచ్చడం లేదన్నదీ తెలుసుకున్నారు. 2009, డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటన అమలు చేస్తే బాగుంటుందంటూనే, పోనీ ఏదోటి తేల్చండి అనీ అంటున్నారు. దీని భావమేమి తిరుమలేశ?! రాకపోతే పోనీలే, ఇవ్వలేకపోతే సరేలే, మా రాజకీయ మెడలకే ఉచ్చు చుట్టుకోకుండా ప్రజలకేం చెప్పుకోవాలన్నదే మన ఘనత వహించిన ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్య ఈ నేపథ్యంలో వాళ్లు పాటించాల్సిన అవరోహణా క్రమవ్యూహం ఎలా ఉంటే బాగుంటుందో, రాజకీయ అట్టుని ఎలా తిరగేయాలో సూచించుదాం పాపం!
మేమైతే ఇప్పటికీ విభజన భక్తులమే! పదవులపై మోజులేని త్యాగరాజులమే (!?) కానీ విభజన జరిగితే, సంభవించే కష్టనష్టాల్ని మీకు, అంటే మా ప్రియమైన తెలంగాణ ప్రజలకు ముందుగా చెప్పడం మా పవిత్ర కర్తవ్యంగా భావిస్తున్నాం. ఇలాంటి ఉపోద్ఘాత సన్నాయి నొక్కులతో ప్రారంభించి, ఇంకా ఏం చెప్పాలంటే (1) మనం ముందుగా భారతీయులం, తర్వాతనే తెలంగాణీయులం, దేశ ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు మన కోరికకు ప్రతికూలంగా ఉన్నారు. ఇక్కడిస్తే అది అన్ని ఇతర రాష్ట్రాల విభజనకు దారితీస్తుందని తద్వారా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని అంతిమంగా దేశ సమైక్యతకే ముప్పు కలుగుతుందన్న భయాందోళనలు సర్వత్రా ఉన్నాయి. మనం మొండి పట్టుదల పట్టడం మంచిదికాదేమో, అలాంటి చెడ్డపేరు మా ప్రజలకి రావడం మాకిష్టం లేదు. అయినా మాదేముంది, మీరే సోచాయించండి? (2) అదలా ఉంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి మనం చెబుతున్న ఏ ఒక్క కారణాన్ని- వెనుకబాటుతనం, చిన్న రాష్ట్రాల ఆవశ్యకత, యాస,సంస్కృతిలలో స్వల్ప భేదాలు, ఇలా ఏది వర్తింప చేసినా తెలంగాణను మరెన్నో చిట్టి రాష్ట్రాలుగా చేయవలసి వస్తుంది (3) హైదరాబాద్ మన గుండెకాయ (నిజం చెప్పాలంటే ఈ నగరంలో 45 శాతం సీమాంధ్రలో మూలాలున్న వాళ్లు, 20 శాతం భాషాపరంగా మైనారిటీలు, మరో 20 శాతం మతపరంగా మైనారిటీలు ఉన్నారు. వీళ్లలో అందరూ కానీ, ఏ ఒక్కవర్గం కానీ సంఘటితమైతే మాలో ఏ ఒక్కరూ ఎన్నికలలో గెలవం. ఇతర జిల్లాల్లో కూడా కనీసం 20 శాతం తెలంగాణేతరులున్నారు. వాళ్లూ ఎన్నికల ఫలితాల్ని శాసించగలరు. కొత్త రాష్ట్రం ఏర్పడినా తెలంగాణేతరులు, హైదరాబాద్ని కానీ ఏ ఇతర ప్రాంతాన్ని కానీ వీడిపోరు. అలాగే మనోళ్లు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. సోచాయించండి. (4) ఇంకో చేదు నిజం ఏమంటే హైదరాబాద్తో కూడిన ప్రత్యేక రాష్ట్రం వచ్చే అవకాశం లేనేలేదు. భాగ్యనగరం లేని దౌర్భాగ్యం మనకెందుకన్నా! అది మన గుండెకాయ కదా!! (5) మనకి మనమే 1954, నవంబర్ 1 నాటి సరిహద్దులతో కూడిన రాష్ట్రం కావాలని కమిటైపోయాం. భద్రాచలం డివిజన్, మునగాల పరగణా వదలుకోవాల్సిందే గదా! తిరుపతి, శ్రీశైలం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు అటే ఉన్నాయి. భద్రాద్రి రాముణ్ణి కూడా వదలుకుందామా? (6) చిన్న రాష్ట్రం చిన్నబోతుంది. ఉన్న రాష్ట్రాన్ని ఉంచేసుకుంటే పోలా? (7) విభజన జరిగితే, సీమాంధ్రోళ్లు మహా అసాధ్యులు, నీళ్లలో, నిధుల్లో పెద్ద వాటా కొట్టేస్తారు, లాబీయింగు చేసేసి మనమే నష్టపోతాం -నీళ్లు పల్లమెరుగునన్నది తెలుసుకదా. ప్రపంచంలో ఏ నది అయినా దిగువ ప్రాంతాల్నే డెల్టాలుగా రూపొందిస్తుందని, అది ప్రకృతి సహజ సూత్రమని తెలుసుకదా. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కూడా, దిగువ ప్రాంతాలకే కొన్ని ప్రత్యేక జల హక్కులుంటాయి. ఐనా మనమంతా సమష్టిగా కర్ణాటక మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాల వారి జలదోపిడీని ఎదుర్కోవాలి కానీ, దిగువన స్వభాషీయులతో పోటీ తగదు. (8) ఉద్యోగాల సంగతి ఆలోచించండి. రాష్ట్రం విడిపోతే ఇక్కడి ఉద్యోగులకి ఏదో ఒక రాష్ట్రంలో సర్వీసు ఎంచుకునే హక్కు ఉంటుంది.బలవంతంగా పంపించేయడం కుదరదు. ఇక్కడ ఇళ్లు, ఆస్తులు, పిల్లల చదువులు ఉన్నవాళ్లంతా సహజంగా ఇక్కడే ఉండిపోతారు. అంటే మనకి ఎక్కువ ఉద్యోగులు అక్కడ ఖాళీలు మనకు వాళ్లు పదవీ విరమణ చేసే వరకు ఖాళీలుండవు. ఆ కొత్త రాష్ట్రంలో ఎన్నో కొత్త ఉద్యోగాలు, కొత్త రాజధాని నిర్మాణం కోసం ఎన్నో నిధులు, కొత్త పరిశ్రమలు మనకేమో నిరుద్యోగం ప్రబలడం, అభివృద్ధి మందగించడం, పరిశ్రమలు తరలిపోవడం -జర సోచాయించాల్సిన విషయాలే కదా -విడిపోదామంటారా -బాగా సోచాయించండి. మాదేముంది ప్రజల నిర్ణయమే మాకు శిరోధార్యం.
-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు



