17, మే 2013, శుక్రవారం

ఆంధ్ర రాష్ట్రోద్యమము - విశేషాలు

మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా 1912 మే లో నిడదవోలు లో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. ఆన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని వాయిదా  వేసారు.

నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం 1913 మే 26 గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. తరువాతి కాలంలో అనేక ఆంధ్ర పట్టణాలలో ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఈ సభల స్ఫూర్తితో వివిధ  ఆంధ్రేతర నగరాలలోను విదేశాలలోనూ ఆంధ్ర మహాసభల పేరుతో ఆంధ్రులు కలసి తమ సమస్యలకు తగు  పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చెశారు. అప్పటి కొన్ని విశేషాలు:









 

  
 Ramineni Bhaskaredra Rao through email

11, మే 2013, శనివారం

వేర్పాటువాద తిమిరంతో సమరం


ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ: వేర్పాటువాదాన్ని సమర్థించడం మాత్రమే తెలంగాణ పట్ల అభిమానానికి గీటురాయిగా, సమైక్యతను కోరడం అంటే తెలంగాణ శ్రేయస్సును వ్యతిరేకించడంగా చిత్రీకరించడంలో విభజన వాదులు కొంతవరకు సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర సమైక్యతను కోరే లక్షలాది మంది ఇవాళ మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడడానికి ఇది ముఖ్య కారణం. ఈ చిత్రీకరణ కేవలం వేర్పాటువాద వ్యూహకర్తల గడుసైన ఎత్తుగడ మాత్రమే. ఇది నిశిత పరీక్షకు నిలబడలేదు. వాస్తవాల వెలుగు ప్రసరిస్తే ఈ చీకటి పారిపోతుంది.

విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యతను కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం ప్రధానంగా మేధోపరమైనది. మేము మన రాష్ట్రం ఎందుకు ఒకటిగా ఉండాలి అనే విషయమై రాస్తున్నాము. రాష్ట్ర విభజనను కోరేవారు చేస్తున్న ఆరోపణలు, ఆక్షేపణలు, ప్రకటనలు అసత్యాలనీ, అర్థ సత్యాలనీ, వక్రీకరణలనీ నిరూపిస్తూ ప్రచురణలు, పుస్తకాలు వెలువరిస్తున్నాము. ప్రదర్శనలు, మీడియా వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాము. టెలివిజన్ చర్చల్లో పాల్గొని మా వాదన వినిపిస్తున్నాము. సోషల్ మీడియాలో మా అభిప్రాయాలని ప్రకటిస్తున్నాము. వేర్పాటువాదుల అసమంజస ప్రవర్తనని, అసంబద్ధ వాదనలని, అప్రజాస్వామిక వైఖరిని, వారి బలప్రయోగాన్ని, హింసాత్మక ధోరణుల్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము.

మాకు ఏ ప్రాంతం పట్ల అయిష్టత లేదు. ఏ ప్రాంత ప్రజల పట్ల ద్వేష భావం లేదు. మేము వ్యతిరేకించేది వేర్పాటు వాదాన్ని. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వేర్పాటు వాదులను, మేము వ్యతిరేకించేది కేవలం తెలంగాణ వేర్పాటు వాదులను మాత్రమే కాదు. రాయలసీమ వేర్పాటు వాదులను, కోస్తా వేర్పాటు వాదులను కూడా అంతే పట్టుదలతో వ్యతిరేకిస్తున్నాం. వ్యతిరేకిస్తాం. విభజనవాదం ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నది అని చరిత్ర ఎరిగిన వారు ఎవ్వరూ అనరు. 1969లో తెలంగాణ వేర్పాటు వాదులు విజృంభిస్తే 1972లో కోస్తా, రాయలసీమల్లో పెద్ద ఎత్తున వేర్పాటు ఆందోళన జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మరోసారి జరుగుతోంది. అంతే.

కోస్తా, రాయలసీమల్లో విభజనవాదం తలెత్తినపుడు అంతకు మూడు సంవత్సరా ల మునుపు ఆందోళన చేసిన తెలంగాణ వేర్పాటువాద నాయకులు మిన్న కుండడం చూస్తే రాష్ట్ర విభజన వాంఛనీయత పట్ల వారికి ఏ మాత్రం నిబద్ధత లేదని ఇట్టే అవగతమవుతుంది. 'దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమం' అన్నది కేవలం కట్టుకథ అనీ అతిశయోక్తి అలంకార ప్రయోగమని తెలుస్తుంది. ఈ ఆందోళనలు కేవలం వారి రాజకీయ వ్యూహాలలో, బేరసారాలలో, లావాదేవీలలో భాగాలు మాత్రమే అనేది తేటతెల్లమవుతుంది. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం అభం శుభం తెలియని సామాన్య ప్రజలను అబద్ధాలతో, అర్ధ సత్యాలతో, వక్రీకరణలతో రెచ్చగొట్టి వారిలో ప్రాంతీయ విద్వేష భావం ప్రజ్వలింపచేసి, వారిని వేర్పాటు వాదం వైపు మళ్లించే ఈ నాయకుల మీద మా పోరాటం.

ఇటువంటి స్వార్థ నాయకుల మాటలు విని, అవి యదార్థమని నమ్మి, రాష్ట్ర విభజనే మార్గాంతరం అని అనుకుంటున్న సామాన్య ప్రజల పట్ల మాకు వ్యతిరేకత లేదు. వారికి వాస్తవాలు తెలియచేసి, సమైక్యతా వాదాన్ని వినిపించి, వారి ఆలోచనలను మార్చి, రాష్ట్ర సమైక్యతను కాపాడాలన్నది మా ఆశయం. వారి మనసులను గెలుచుకోవడం మా లక్ష్యం. మూడు ప్రాంతాలలోనూ ప్రజల మస్తిష్కాలలో నుంచి వేర్పాటు వాదాన్ని ఆనవాళ్ళు కూడా లేకుండా తొలగించడం మా ఉద్దేశం. ఓట్ల కోసం కల్లబొల్లి మాటలతో వేర్పాటు వాదాన్ని రెచ్చగొడుతూ నాలుక భుజాన వేసుకుని తిరిగే మాటకారి రాజకీయనాయకులకు వారి పార్టీలకు ఎక్కడా, ఏ ప్రాంతంలోనూ ఆదరణ లభించని వాతావరణాన్ని నిర్మించడం మా ధ్యేయం.

మా ఆశయ సాధనకున్న అవరోధాలు చాలా పెద్దవి. మా మాట సామాన్య ప్రజలకు చేరనివ్వకుండా ఈ నాయకులు, వారి తాబేదార్లు అనేక అడ్డంకులు కలిగిస్తున్నారు. మేము ఎక్కడ సభపెట్టినా దాన్ని భగ్న ం చేయడం, మా మీద దాడులు చెయ్యడం, మమ్మల్ని కొట్టడం, మా పుస్తకాలు తగుల బెట్టడం వారికి పరిపాటి అయిపోయింది. మేము చెప్పే మాట జనసామాన్యానికి చేరితే, వీరి ఆటలు సాగవు అని వీరి భయం. ఒక చిన్న పుస్తకానికి, ఒక ఉపన్యాసానికి, ఒక పత్రికా ప్రకటనకి, ఒక ప్రదర్శనకి, ఒక బహిరంగ చర్చకి భయపడే ఉద్యమం కూడా ఒక ఉద్యమమేనా? వాదనలో పసలేని వారే దౌర్జన్యాలకి దిగుతారు అన్నదానికి తెలంగాణ వాదుల వేర్పాటు వాదుల హింసాత్మక ప్రవర్తన కంటే రుజువు ఏమి కావాలి?

'రుజువులు లేని ఉద్యమం: తెలంగాణ వేర్పాటు వాదుల 101 అబద్ధాలు వక్రీకరణలు' అన్న పుస్తకంలో ఆందోళనకారులు రాష్ట్ర విభజనకు చూపిస్తున్న కారణాలలో నిజం లేదని సమగ్రంగా వివరించాం. మా పుస్తకం ఎంత శక్తిమంతమైనదో వేర్పాటువాదులు అందులో మేము రాసిన ఒక్క విషయాన్ని కూడా పూర్వపక్షం చేయలేకపోయారు. ఒక్క అంశాన్ని కూడా తప్పుపట్టలేకపోయారు. పుస్తకం మీద జరిగిన ప్రతి చర్చలోనూ మమ్మల్ని ఆడిబోసుకున్నారు. మాది దురహంకారమన్నారు; మేము రెచ్చగొడుతున్నామన్నారు; మేము తెలంగాణ ప్రజల మనో భావాలను అగౌరవ పరుస్తున్నామన్నారు; ప్రజాభిప్రాయంపట్ల మాకు గౌరవం లేదన్నారు; ఇంతమంది అవునంటున్నది మేమెలా కాదనగలమన్నారు; మరెన్నో మాటలు మిగిలారు. కొంతమంది సోషల్ మీడియాలో మా మీద పచ్చి బూతులు కూడా ప్రయోగించారు. వ్యక్తిగత దూషణలకు హద్దూ పద్దూ లేకుండాపోయింది.

కాని ఒక్కరంటే ఒక్కరు ఇదిగో ఈ పుటలో ఇక్కడ ఈ దోషం ఉంది అని మాత్రం ఎత్తి చూపలేకపోయారు. మా గణాంకాలను తప్పు పట్ట లేకపోయారు. మా తర్కాన్ని వేలెత్తి చూపలేకపోయారు. మేము ఇచ్చిన భాష్యానికి ప్రత్యామ్నాయ వివరణ ఇవ్వలేకపోయారు. మా విశ్లేషణకు సమాధానం చెప్పలేక పోయారు. మా భావ ప్రకటనా స్వేచ్ఛ మీద సాక్షాత్తు ప్రెస్‌క్లబ్‌లో దాడి జరిగితే, పాత్రికేయులే మా పుస్తకాన్ని తగుల బెడితే దేశవ్యాప్తంగా లబ్ధ ప్రతిష్ఠులైన మన పౌర హక్కుల సంఘాల పెద్దలు ఒక్కరంటే ఒక్కరికి ఆ దుశ్చర్యను ఖండించడానికి నోరు రాలేదు. హక్కుల పరిరక్షకులుగా దశాబ్దాలుగా సంపాదించుకున్న ప్రతిష్ఠను ఇంత చవకగా వారు పోగొట్టుకుంటారని మేము ఊహించలేదు.

మొత్తం తెలంగాణ ప్రాంత ప్రజలందరి పక్షాన మాట్లాడుతున్నట్లు వేర్పాటువాద నాయకులు మనల్ని నమ్మమంటారు. కాదు, వారు కేవలం రాష్ట్ర విభజనను కోరుకునే వారి పక్షాన మాత్రమే మాట్లాడుతున్నారని యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానీకం పక్షాన కాదనీ మేమంటున్నాం. రాష్ట్రంలో మూడు ప్రాంతాలలోనూ విభజన వాదులున్నారు. అలాగే మూడు ప్రాంతాలలోను సమైక్య వాదులున్నారు ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి విభజన వాదం బిగ్గరగా వినపడుతుంది. బిగ్గరగా వినపడినంత మాత్రాన బలంగా ఉన్నట్టు లెక్క కాదు. ఈవాళ్టికి వేర్పాటు వాదులు ఇంత బీభత్స వాతావరణం సృష్టించినా తెలంగాణలో విశాలాంధ్ర వాదం బలంగా ఉంది. విశాలాంధ్ర మహాసభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు చాలా ఎక్కువ మంది సభ్యులుగా ఉండడమే దీనికి ప్రబల తార్కాణం.

తమ వాదన బలంగా ఉందనడానికి ఈ మధ్య జరిగిన కొన్ని ఉప ఎన్నికల ఫలితాలు తప్ప వేర్పాటు వాదులకు మరొక ఆధారం లేదు. 1969 నుంచి 2009 దాక తెలంగాణలో -నాలుగు దశాబ్దాల పాటు -విభజనవాదానికి ఎక్కడా పచ్చి మంచినీళ్ళు కూడా పుట్ట లేదు. భారతీయ జనతా పార్టీ, ఇంద్రారెడ్డి పార్టీ, దేవేందర్ గౌడ్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితిలు ఎంత ఆయాస పడ్డా వారు సాధించిన ఎన్నికల ఫలితాలు అంతంత మాత్రమే అన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం. మొన్న పరకాల ఉప ఎన్నికలో నెగ్గడానికి టి ఆర్ ఎస్‌కి తలప్రాణం తోకకొచ్చింది. పట్టుమని పదివేల మంది కూడా లేని సమీకరణని చూపించి దాన్నే 'మిలియన్ మార్చ్'అనుకోమన్నప్పుడే వేర్పాటు వాదులకున్న ప్రజా బలమెంతో అర్థమయ్యింది. బుకాయింపులకు, డబాయింపులకు కూడా ఒక అడ్డూ ఆపూ ఉంటాయి.

విభజన వాద సమైక్యవాద భావజాలాల మధ్య ఎప్పుడు సంఘర్షణ జరిగినా సమైక్యవాదమే విజయం సాధించింది. ఈ సారి కూడా సమైక్యవాదమే గెలుస్తుందని మా విశ్వాసం. తెలంగాణలో మా సభలు సజావుగా జరుపుకుని అసలు విషయాలను ప్రజలకు వివరిస్తే ఇప్పుడున్న కొద్ది బలం కూడా విభజనవాదులు కోల్పోతారు. అందుకే మమ్ములను ప్రజలలోకి వెళ్ళకుండా మా వాదనను ప్రజలకు చేరకుండా వారు మమ్మల్ని శతవిధాలా అడ్డుకుంటున్నారు. మా వాదన అంటే వారికి అభద్రతా భావం. లేకపోతే వారు ఆ పని చెయ్యరు.

మాతో బహిరంగ చర్చలకు అడపాదడపా వేర్పాటు వాదులు సవాళ్ళు విసురుతూ ఉంటారు. కానీ సమయం వచ్చేటప్పటికి పత్తా లేకుండా పోతారు. వారు విసిరిన ప్రతి సవాలునూ మేము స్వీకరించాం. చర్చకు సిద్ధమయ్యాం. గతంలో ఒక మాజీ మంత్రి చర్చకు పిలిచి ఆయన అనుచరులతో మా మీద దాడి చేయించి ఉడాయించారు. నిన్న కాక మొన్న ఒక విభజనవాద శాసనసభ్యుడు చర్చకు రమ్మని సవాలు విసిరారు. మేము స్వీకరించాం. ఇవ్వాళ్టి వరకూ అతగాడు మళ్ళీ కిమ్మనలేదు.

భావజాల వ్యాప్తికి అప్రజాస్వామిక మూకలు సృష్టించే అడ్డంకులను అదృష్టవశాత్తు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రానురాను బలహీన పరుస్తోంది. మేము ఇంటర్నెట్‌లో పెట్టిన 'రుజువులు లేని ఉద్యమం' పుస్తకం సాప్ట్ కాపీలు కొన్ని వేలు డౌన్‌లోడు అవుతున్నాయి. పుస్తకాల ప్రతులు కావలసిన వారు సంప్రదించాల్సిన ఈ మెయిలు అడ్రసు, ఫోన్ నెంబరు సోషల్ మీడియా లో ప్రకటించాం. రోజు కు కొన్ని వందల మంది పుస్తకాల కోసం అడుగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఎడెతెరిపిలేకుండా పుస్తకాలు కావాలని ఎస్ ఎం ఎస్‌లు, ఈ మెయిల్సు వస్తున్నాయి. మా వాదన, మా మాట, మేము చెప్పే వాస్తవాలు ప్రజ లలోకి లోతుగా, నిశ్శబ్దంగా వెడుతున్నాయి.

మేము వేర్పాటు వాదాన్ని వ్యతిరేకిస్తే దాన్ని తెలంగాణ ప్రజానీకానికి మేము వ్యతిరేకమన్నట్టుగా వేర్పాటువాదులు చిత్రీకరిస్తున్నారు. విభజన వాదుల అబద్ధాలను ఎత్తి చూపితే తెలంగాణ ప్రజలను అబద్ధాలాడేవాళ్ళు అంటారా అని తిరగేస్తున్నారు. తెలంగాణలోని సామాన్య ప్రజలకు సమైక్యవాదులను శత్రువులుగా చూపించాలని వీరి ప్రయత్నం.

వేర్పాటువాదాన్ని సమర్థించడం మాత్రమే తెలంగాణ పట్ల అభిమానానికి గీటురాయిగా, సమైక్యతను కోరడం అంటే తెలంగాణ శ్రేయస్సును వ్యతిరేకించడంగా చిత్రీకరించడంలో విభజన వాదులు కొంతవరకు సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర సమైక్యతను కోరే లక్షలాది మంది ఇవాళ మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడడానికి ఇది ముఖ్య కారణం. ఈ చిత్రీకరణ కేవలం వేర్పాటువాద వ్యూహకర్తల గడుసైన ఎత్తుగడ మాత్రమే. ఇది నిశిత పరీక్షకు నిలబడలేదు. వాస్తవాల వెలుగు ప్రసరిస్తే ఈ చీకటిపారిపోతుంది. తెలంగాణలో ఉన్న అసంఖ్యాక విశాలాంధ్ర వాదులు ఈ ఎత్తుగడను, ఈ అభూత కల్పనను ఛేదించాలి. ముసిరిన ఈ తిమిరంతో సమరం చేయాలి.

ఇంతకు ముందూ ఇప్పుడు విశాలాంధ్ర కోరిన వారు, కోరుతున్న వారూ నిఖార్సయిన తెలంగాణ ప్రాంత శ్రేయోభిలాషులు అనడానికి రావి నారాయణరెడ్డి తో మొదలుకొని పీవీ నరసింహరావు వరకూ, దేవులపల్లి రామానుజరావు నుంచి నర్రా మాధవరావు వరకూ అనేక మంది నిష్ఠ గల నాయకులు మనకు ఉదాహరణలుగా నిలబడతారు. కాని ఇవాళ రాష్ట్ర విభజన కోరే నాయకులందరూ తెలంగాణ హితైషులు అనడానికి వారి రాజకీయ చరిత్రలలో దాఖలాలు బహు తక్కువ.

తెలంగాణ మీద అభిమానానికి విభజనవాదం గీటురాయి కాదు. విభజన వాదం వేరు, తెలంగాణ మీద మమకారం వేరు. ఈ రెండిటినీ ఒకటిగా చూపించి పబ్బం గడుపుకోవాలని వేర్పాటువాద నాయకుల ప్రయత్నం. అయితే ఈ రెండిటికీ వైరుధ్యం లేదని, విశాలాంధ్రలో మన ప్రాంత ప్రయోజనాలు సురక్షితమని తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశాలాంధ్ర వాదులు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వెలిబుచ్చడానికి సంకోచించకుండా ధైర్యంగా ఇక ముందుకురావాలి. చరిత్ర, ఆర్థిక గణాంకాలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక సహజీవన పరంపర వారి వాదనకు పెట్టని కోటలుగా నిలుస్తాయి. 'వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ కాదు' అన్న రావి నారాయణ రెడ్డి గర్జన తెలంగాణలో విశాలాంధ్ర వాదుల మంత్రం కావాలి.

తెలంగాణ ప్రయోజనాలకి తెలంగాణ వేర్పాటువాదులు, రాయలసీమ ప్రయోజనాలకి ఆ ప్రాంతానికి చెందిన విభజనవాదులు, కోస్తా ప్రయోజనాలకి అక్కడ విభజనవాదం వినిపించేవారు గుత్తేదార్లుగా చెలామణీ అయ్యే క్షుద్ర రాజకీయ క్రీడకి తెర దించాలి. మూడు ప్రాంతాలలో ఉన్న సమైక్య వాదులంతా ఉదాసీనతను వీడి క్రియాశీలకంగా పనిచేస్తే విభజన వాద భావజాలాన్ని తెలుగు నేల నుంచి శాశ్వతంగా సాగనంపగలుగుతాం.


- డాక్టర్ పరకాల ప్రభాకర్
ప్రధాన కార్యదర్శి, విశాలాంధ్ర మహాసభ