29, ఏప్రిల్ 2012, ఆదివారం

ఉక్రోషాలు వద్దు!ఉభయతారక పరిష్కారం రాబోతుంది!

ఆంధ్రప్రభ వ్యాసం: అడపా దడపా అన్య విషయాలపై కూడా రాస్తున్నా, ఈ శీర్షిక కింద గత అయిదారేళ్లుగా వారం వారం ప్రచురితమవుతున్న నా వ్యాసాల్లో ప్రతిబింబించిన అంతస్సూత్రం, ఒకవేళ ఈ రాష్ట్ర విభజన జరిగితే, యావత్‌ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ, ఇప్పటికే సగం చచ్చి ఉన్న తెలుగు భాషకి అలాగే యావద్భారత దేశ సమైక్యతకు తీరని నష్టం వాటిల్లుతుందన్నది మాత్రమే! ఈ చేదు ఆవేదనకి అప్పుడప్పుడు సభ్యత వీడని వ్యంగ్యం, అపహాస్యం దరిచేరని హాస్యం రంగరించడం తప్పనుకోవడం లేదు. ఈ వ్యాస పరంపరలో'విడిపోతే నష్టమెవరికి' అన్న శీర్షికన 4-4-12న ప్రచురితమైన వ్యాసంలోని అంశాలకు మళ్లీ ఉక్రోషం వచ్చిన చొల్లేటి శ్రీశైలం గుప్త -అదుపు చేసుకోలేని ఆగ్రహంతో రాసిన 'విడిపోతే లాభమెవరికి' అన్న వ్యాసానికి (18-4-12న) తగువిధంగా ప్రతిస్పందించడం, నా పవిత్ర పాత్రికేయ బాధ్యతగా అంగీకరిస్తున్నాను. అలానే, తన వ్యాసంలో వారు నాపై చేసిన ఆరోపణలకి (నిజానికి దూషణ లనాలి!) గతంలో లానే చొల్లేటికి స్వభాషీయునిగా గౌరవాభిమానాలు ప్రకటిస్తూనే, స్వీయ నిర్దేశిత సంయమనా ప్రమాణాలకి లోబడి తగు వివరణ లీయడం నా వ్యక్తిగత హక్కుగా కూడా భావిస్తున్నాను. అయితే స్థలాభావం దృష్ట్యాను, గతంలోనే పలుమార్లు ఆధారాలు, గణాంకాల సహితంగా తగు సమాధానాలిచ్చి ఉన్నందున, వాటిని మళ్లీ వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనే చర్చా సూత్రాన్ని కూడా పాటిస్తూ, నా జవాబుని క్లుప్తీకరిస్తున్న విషయం గ్రహించాలని ప్రార్థన -(నిజానికి చొల్లేటి వారి తాజా వ్యాసం ఇప్పటికే అభూత కల్పనలు, కల్పిత గణాంకాలు, అపోహలుగా నిరూపితమైన తేలిపోయిన అపస్వరాలతో కూడిన పాతపాట మాత్రమే).

ముందుగా తన వ్యాసారంభంలోనే చొల్లేటి పట్టలేని ఉక్రోషంతో మూడు వ్యక్తిగత ఆరోపణలు (దూషణలు) చేశారు. నా వ్యాసాలలో తెలంగాణ ప్రాంతంపై అక్కసుతో అక్కరకురాని 'ప్రేలాపనలు' చేస్తున్నానని (2) సీమాంధ్ర పక్షపాతినని (3) ప్రత్యేక రాష్ట్ర వాదం సాధించిన అఖండ విజయాలను చూసి బెంబేలెత్తిపోయి సమైక్యవాదాన్ని వదిలేస్తూ ఒక్కో మెట్టు దిగుతున్నానని. ఈ అసత్యారోపణలకు చొల్లేటి కోసమేకాదు... అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలకోసం సమాధానమీయాలనుకుంటున్నాను. నా వ్యాసాలలో నేను పదే పదే సహేతుకంగా ప్రస్తావించిన అంశం, తెలుగు జాతి, భాష  తెలంగాణాగా నేడు వ్యవహరింపబడుతున్న ఈ ప్రాంతంలోనే ఆవిర్భవించి కాలక్రమేణా నదీ నదాల ప్రవాహాల వెంబడి ఇతర ప్రాంతాలకు విస్తరించిందని, ఆ విధంగా నేడు సీమాంధ్రులుగా పిలువబడుతున్న వాళ్లకి మూలపురుషులు తెలంగాణీయులేనన్నది -నన్నయ నుండి నారాయణరెడ్డి వరకు పోతన వేమనాది సాహితీమూర్తులంతా ప్రాంతాలకు అతీతంగా మనకు ఆరాధనీయులని ఎన్నోసార్లు పేర్కొన్నాను. అంతేకాదు విభజనవాదం ఏ ప్రాంతంలో తలెత్తినా కాలకూట విషమని, ఆ ప్రాంతానికి ప్రజలకి కూడా చాలా చేటు చేస్తుందని, అన్ని ప్రాంతాలలోని విభజన వాదాన్ని సమంగా నిష్పక్షపాతంగా నిష్కర్షగా విమర్శించడం జరిగింది. విభజన వాదాన్నే గానీ, ఏ ప్రాంతపు ప్రజల్నీ కించపరచలేదు.

బహుశా, మనోళ్లు ఎలానూ సాధించలేరు కనీసం అక్కడోళ్లైనా విభజన కోసం ఉద్యమిస్తే బాగుంటుందనే దింపుడు కళ్లాం ఆశతో ఉన్న చొల్లేటి లాంటి వారికి ఈ ధోరణి నచ్చడం లేదు. పైగా ఉక్రోషాన్ని రేపుతోందని అనుకుని ఊరుకుందాం.

సకల జనుల సమ్మె అఖండ విజయం సాధించిందన్న చొల్లేటి వారి ప్రగల్భం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తమకు సకల సంకేతాలు ప్రసాదించిన ఆ సమ్మె(ట) దెబ్బకి విలవిల లాడిపోయింది -ప్రధానంగా తెలంగాణ ప్రజలే! పొరుగు రాష్ట్రాల ప్రజల్లోను, ఆ మాటకొస్తే యావద్భారత దేశ ప్రజల్లో అత్యధిక సంఖ్యాకుల్లో ప్రత్యేక తెలంగాణ వాదం పట్ల దేశం ఏమైపోయినా సరే 'మాది మాగ్గావాలే' అంటున్న విభజన వాదుల ప్రజాప్రతినిధుల మొండి చర్యల మూలంగా, చాలా వైముఖ్యం ఏర్పడిందన్నది వాస్తవం. మరి ఆ అఖండ విజయాన్ని గ్రహించి బెంబేలెత్తిపోయి ఒక్కో మెట్టు దిగుతున్నది కెసిఆర్‌ తో సహా విభజనవాదులే గానీ నాలాంటి రాజకీయేతర సమైక్యతావాదులు కాదని చొల్లేటి గ్రహిస్తే బాగుంటుంది. వారు గ్రహించితీరాల్సిన మరో ముఖ్యమైన అంశం విభజన కనుకూలంగా తనతో సహా కొందరు చెప్పే పరిపాలనా సౌలభ్యం -చిన్న రాష్ట్రాలు, పాత సంస్థానాల పునరుద్ధరణ సంస్కృతులలో స్వల్ప వ్యత్యాసాలు... ఇలాంటి ఏ ఒక్క కారణాన్ని వర్తింపజేసినా ఈ దేశాన్ని వందలాది రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది. తెలంగాణని కూడా ఎన్నో చిన్న చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది!

చొల్లేటి వారి పాత పాట లోని మరికొన్ని అపస్వరాలని కూడా క్లుప్తంగా పరిశీలిద్దాం. ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతం వాళ్లు జల దోపిడీ చేశారన్నారు (అందుకు కారణం ఈ ప్రాంతపు నేతల నిర్వాకం అని కూడా అన్నారనుకోండి!) విలీనం తర్వాత 1956 నుండి 2007 వరకు, ప్రణాళికా సంఘం యొక్క అధికారిక గణాంకాల ప్రకారం కోస్తాలో నీటి పారుదల కింద అదనంగా వచ్చిన భూమివృద్ధి శాతం 57, రాయలసీమలో 44 శాతం ఉంటే తెలంగాణాలో 91 శాతం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణాల్లో వృద్ధి కోస్తాలో 107 శాతం, రాయలసీమలో 15 శాతం ఉండేది. తెలంగాణలో 244 శాతం ఉంది. అలాగే పరిశ్రమల పురోగతి, ఉపాధి కల్పన, విద్యావ్యాప్తి సగటు ఆదాయం ఇలా ఏ పెరామీటరు (అభీష్ట పరిమాణం)లో చూసినా తెలంగాణాలో విలీనం తర్వాత బహుముఖీన అభివృద్ధి జరిగి ఉన్నది వాస్తవం. ఇది గ్రహించే కెసిఆర్‌తో సహా విభజనవాదులు వెనకబాటు తనం అన్న ప్రాతిపదికను ఎప్పుడో వదిలేశారు. చొల్లేటి వారే ఇంకా పట్టుకుని వేలాడుతున్నారు. వారు గ్రహించాల్సిన మరో అంశం. గోదావరి, కృష్ణా నదులు మన రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతానికో సొంతం కాదు. అవి అంతర్‌ రాష్ట్ర నదులు. ఇప్పటికే దిగువనున్న మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. మన అనైక్యత దాన్ని ఇంకా పెంపొందిస్తుంది. మనలో మనం తగు విధంగా జలపంపిణీ న్యాయంగా చేసుకోవాలి. వరదలతో నష్టపోయే దిగువ రాష్ట్రంగా మన హక్కుల్ని ఐక్యంగా సాధించుకోవాలి. ఆఖర్లో ఒకమాట - భద్రాచలం మాత్రమే కాదు.. రాయలసీమ, కోస్తాంధ్రలు కూడా నైజాం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఆంగ్లేయులకి ధారాదత్తం చేసే వరకు కలిసే ఉన్నాయి కదా. మరి కెసిఆర్‌ ఇతరులు రహస్యంగా రాజీపడుతున్న విధంగా 1956 అక్టోబర్‌ 31 నాటి సరిహద్దుల రాష్ట్రం కోరుకోవడమెందుకు? ఏది ఏమైనా, ఉద్యమం పేరుతో తెలుగు వైతాళికుల విగ్రహాలను విధ్వంసం చేయడాన్ని, ఉద్యమం ముసుగులో కుటుంబ ఆస్తుల్ని పెంచుకుంటున్నవారిని ఖండించలేకపోతున్న చొల్లేటి వారి నిస్సహాయతకు నా సానుభూతి ప్రకటిస్తూ ముగిస్తున్నా.

-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు

21, ఏప్రిల్ 2012, శనివారం

శభాష్‌ కవితమ్మా!

ఆంధ్రప్రభ వ్యాసం : సహజ ప్రవృత్తి, సంస్కారాలకి విరుద్ధంగా ఎవరైనా సరే తాత్కాలికంగా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుడు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా, నెమ్మదిగా వాటి నుంచి వైదొలగుతూ, క్రమంగా (ఒక్కసారిగా సాధ్యం కాదు కదా!) మంచి కార్యక్రమాలకు మరలుతూంటే ఆ పరివర్తనా పరిణామాన్ని ప్రోత్సహించాలి, హర్షించాలి. శభాష్‌ అనాలి. అందుకే, పోయినవారంలో, తనలోని పరివర్తనా క్రమానికి నాందిగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఆవరణలో మాత్రమే కాదు, భారతదేశంలోని అన్ని చట్టసభల ప్రాంగణాల్లో కూడా, మనరాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాల్ని సత్వరం నెలకొల్పాలన్న ఒక సముచిత డిమాండ్‌తో ఏకంగా 48 గంటల నిరాహారదీక్ష చేసిన కల్వకుంట్ల కవితమ్మను అభినందించాలి. శభాష్‌ తల్లీ అనాలని అనిపించింది.

రాజకీయ (కొండొకచో ఆర్థికం కూడా!) వారసత్వాల్ని గాఢంగా కోరుకునే కుమార్తెలు పుట్టింటి ఇంటిపేరుతో చలామణి కావడం మనదేశంలో కొత్త కాదు. తప్పు అసలే కాదు! కాబట్టి మన తెలుగింటి ఆడపడుచు, కవిత వివాహానంతర రికార్డుల్లో సర్టిఫికెట్లతో అమెరికా వీసా పత్రాలలో ఇంకా ఇతర అపార ఆస్తుల పత్రాల్లో ఏ ఇంటిపేరు నమోదై ఉందో మనకనవసరం! ఆ రమణి కల్వకుంట్ల వంశంలో జన్మించిన ఒక మహోజ్వలమణి! అగధా సంగ్మా, సుప్రియా సూలె, ప్రియాదత్‌, కనిమొళి (వారందరూ ఇప్పటికే ఎంపిలు) వంటి దేశంలోని ఇతర మహిళా నేతల సరసన ఉండాల్సిన అర్హతలున్న గొప్పమహిళ. ఈమెకు కూడా వారికి లభించినంత పితృవాత్సల్యం, వారసత్వ బలం లభించడం ఒక నేతగా వెలిగేందుకు కొంతవరుకు తోడ్పడిన మాట వాస్తవమే కావచ్చు. అయితే జయలలిత, మమత, మాయావతిల స్థాయి స్వీయప్రతిభ చొరవ, చతురత తనకున్నాయని కవితమ్మ నిరూపించుకున్నారని మర్చిపోరాదు. అంతేకాదు, సహజ వాగ్ధాటి, వాదనా పటిమ, నాయకత్వ లక్షణాలు, శ్రమించేతత్వం, సొంత అనుచరణగణాల్ని ఏర్పరచుకునే నైపుణ్యం, తగు సమయం సందర్భం కోసం ఎదురు చూసే ఓర్మి కవితను ఇప్పటికే మన రాష్ట్రంలో ఒక అగ్రశ్రేణి అసామాన్య నేతగా నిలిపాయనడంలో అతిశయోక్తి లేదు. ఆమాటకొస్తే ఃనాన్న, అన్న కన్న మిన్నః అనిపించుకుని వారికీ సంతుష్టి, సంతోషాల్ని కలగజేస్తూండడం సామాన్యమైన విషయం కాదు. కవితే ఒకసారి చెప్పేరు, బాల్యంలో ఆదర్శనగర్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నివాస కాలంలో ఉన్నత విద్యాభ్యాస సమయంలో తాను అమెరికాలో ఉన్నట్లు, తనకు అన్ని ప్రాంతాల, వర్గాల తెలుగు ప్రజలతో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయని, అవి ఇప్పటికీ చక్కగా కొనసాగుతున్నాయని. ఇకపోతే ప్రస్తావిత దీక్షా విరమణ సమయంలో కవిత, ఇతర ప్రాంతాల ప్రజల నుంచి తన కార్యక్రమానికి అపారంగా లభించిన ఆదరణకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో తాను జాతీయ స్థాయి సమస్యలపై పోరాటాలు చేస్తానని కూడా ప్రతిజ్ఞ చేశారు. ఉదాహరణకి జాతీయ ఉపాధి పథకంలో పనిదినాల్ని, వేతనాల్ని బాగా పెంచాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తానని అన్నారు. ఇకముందు తన కార్యకలాపాలు ఏదో ఒక ఉపప్రాంతానికి మాత్రమే పరిమితం చేయబోనని చెప్పకనే చెప్పారు. ఇదంతా ఒక సత్పరిణామక్రమాన్ని స్పష్టంగా సూచిస్తోందని అర్థం చేసుకోకపోతే అది మన తప్పే అవుతుంది. అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలపై పోరాడతానంటే స్వాగతించక పోవడం మూర్ఖత్వం అవుతుంది. నిజానికి ముందే చెప్పినట్లు కవిత సహజ ప్రవృత్తి, సంస్కారం రీత్యా విభజన వాది కాదు.

అరాచకవాది అసలే కాదు. అయినా ఆమె తన విశాల భావాల నుంచి తాత్కాలికంగా నైనా మరలడం తెలుగు ప్రజల దురదృష్టమనుకుందాం. నాన్న వద్దన్నప్పటికీ అమెరికాలో సుఖజీవనాన్ని వదలుకుని, తనకు తానే నిర్ణయించుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చేసి, ప్రజాక్షేత్రంలోకి దూకేశానని తనే చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఆయన్ని నిందించడం తగదు. కానైతే, ఆమె తనకు ఏ రాజకీయ పరమైన ఆకాంక్షలు లేవని, కేవలం తెలంగాణ ప్రజల సాంస్కృతికోద్ధరణకు మాత్రమే పాటు పడతానని కూడా ఎన్నోమార్లు వక్కాణించారు. (ఇప్పటికీ తనకు తెరాసతో సంబంధం లేదని కూడా చెబుతుంటారు.) కానీ ప్రస్తుతం చేసేవన్నీ రాజకీయ కార్యక్రమాలే! మొదట్లో, అంటే అమెరికా నుంచి తిరిగొచ్చేసిన కొత్తలో ఎంతో శ్రమించి మెదక్‌ జిల్లాలో ఇటీవల బయల్పడిన కొన్ని ప్రాచీన తెలుగు శాసనాల గురించి, ఉమ్మడి తెలుగు భాష విశిష్టత గురించి ప్రచారం చేశారు. తనే స్వయంప్రకటిత అధ్యక్షురాలిగా తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించి, దాన్ని అనతికాలంలో బాగా విస్తరించేరు. బతుకమ్మ పండుగ వైశిష్ట్యాన్ని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు. కనిమొళినీ తీసుకోచ్చేరు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా తండ్రి తరఫున ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా, ఫలవంతంగా నిర్వహించిన ఘనత సాధించడంతో తృప్తి పడలేదు. పలు రాజకీయ కార్యక్రమాల్లో సంసారాన్ని కూడా విస్మరించి పాల్గొంటూ వచ్చారు. దూరదృష్టితో తన సొంత సంస్థ -జాగృతిని ప్రణాళికా బద్ధంగా ఈ ప్రాంతమంతటా విస్తరించారు, పార్టీకి సమాంతరంగా జాగృతికిప్పుడు రాజధానిలో మాత్రమే కాదు, పలు పట్టణాలలో కార్యాలయాలు, వనరులు, నిధులతోబాటు మంచి కార్యకర్తల పటాలాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా నాన్న, అన్నల కన్న కొన్ని విషయాలలో నైనా మిన్న అని నిరూపించుకున్నారన్నమాటే కదా!

ఃఅదుర్సు రభసః ఇంటర్‌ విద్యార్థుల పరీక్షా పత్రాలు ప్రాంతీయ మూల్యాంకనం, సినిమా షూటింగులకు ఆటంకాలు ఇటువంటి కొన్ని కార్యక్రమాలు మరీ ఃదూకుడుఃగా నిర్వహించి కొంత అప్రదిష్టని మూటకట్టుకున్నారని, ఉద్యమపరంగా కొన్ని చాలా లాభదాయకమైన చందాల దందాల ముడుపుల విభాగాల్ని సొంతం చేసుకున్నారని, ఇలాంటి కొన్ని విమర్శలు కవితమ్మపై విభజనవాద వర్గాల నుంచే వచ్చేయి. ఇంకా వస్తున్నాయి ఈ విమర్శల్లోని నిజానిజాల సంగతెలా ఉన్నా ఒకటిమాత్రం నిజంగా నిజం. తెరాస పార్టీ పరంగా జరిగిన అన్ని ఉద్యమ కార్యకలాపాల్లోనూ ప్రజలకు ఏర్పడిన విలాపాల్లోను) కవితమ్మ పాత్ర చాలా ఎక్కువగా ఉంటూ వచ్చింది. వంటావార్పూ కానీండి, రైల్‌రోకో, లేదా సకల జనుల సమ్మె కానీండి ఇతర పార్టీ నేతల కన్న, ఆ మాటకొస్తే నాన్న, అన్నల కన్న మిన్నగా ప్రజాక్షేత్రంలోకి ప్రత్యక్షంగా దూసుకుపోయేరు. పోరాట పట్టాలపై కూర్చున్నారు. ఎక్కువ రాజకీయ చతురత చూపారు. ఆవిధంగా అందరికన్న అధికంగా దృశ్యతః (విజిబిలిటీ) సాధించారు.

ఇతర ప్రాంతాల ప్రజలనూ ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఇంతటి అసామాన్య ప్రతిభగల ఒక తెలుగు యువతి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే దానికి నాందిగా వచ్చే ఎన్నికలలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే అది మనం హర్షించదగిన విషయమే. వచ్చే ఎన్నికల నాటికి దొరవారికే నియోజకవర్గాన్ని మార్చవలసిన అవసరమేర్పడి తానే నిజామాబాద్‌కే తరలిపోదామనుకుంటే చెప్పలేం గానీ, కుమార్తె ముచ్చట తీర్చడానికే ఆయన మొగ్గు చూపవచ్చు. లేదా కరుణానిధి కనిమొళికి ప్రసాదించినట్లు రాజ్యసభకి పంపించే అవకాశం ఎలానూ ఉంటుంది. ఏమైనా మన కవితమ్మ త్వరలో ఎంపీ కావడం, తర్వాత కేంద్రంలో మంత్రి పదవిని పొందడం దాదాపు ఖాయం, కాదంటే ఆమె భర్తకి, అన్నకి రాష్ట్రంలోనే వేరే పదవుల్ని చూడాల్సి ఉంటుంది దొరవారికి. తనది జాతీయ స్థాయి అన్న ఆత్మ విశ్వాసం ఉన్నందువల్ల, ఎలానూ అంతిమంగా విభజనేతర పరిష్కారమే రానున్నదన్న విజ్ఞత, అవగాహన ఉన్నందువల్లనే కల్వకుంట్ల కవితమ్మ తన పంథాని క్రమంగా మార్చుకుంటున్నారని, విస్తరించుకుంటున్నారని అర్థమవుతూనే ఉంది. మన తెలుగింటి ఆడపడుచుకి అభినందనలు చెబుదాం. శభాష్‌ కవితమ్మా! అందాం.

( దీనిని వ్యంగ్యం అనుకునేరు సుమా!)

-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు 

19, ఏప్రిల్ 2012, గురువారం

విశాలాంధ్రమహాసభ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో విశాలాంధ్రోద్యమం’ పుస్తకావిష్కరణ

Eenadu 18/04/2012

విశాలాంధ్ర దినపత్రిక : ‘తెలంగాణలో విశాలాంధ్రోద్యమం” పుస్తకావిష్కరణ సభ మంగళవారం నగరంలో జరిగింది. తెలంగాణలో జరిగిన ఉద్యమ ఘట్టాలు, విశాలాంధ్ర దినపత్రికతో పాటు వివిధ పత్రికల్లో ప్రచురించిన వార్తలు, కథనాలతో కూడిన విశాలాంధ్ర మహాసభ ముద్రించిన పుస్తకాన్ని స్వాతంత్య్ర సరమయోధులు నర్రా మాధవరావు ఆవిష్కరించారు. సభకు విశ్రాంత ఐపిఎస్‌ అధికారి సి. ఆంజనేయరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సంద ర్భంగా మాధవరావు మాట్లాడుతూ, దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ, కమ్యూనిస్టులు గతంలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విశాలాంధ్ర నుంచి తెలంగాణను వీడదీయవద్దని కోరారు. తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకే రాష్ట్రంగా ఉండాలని కోరుతూ ఆనాడు పెద్ద ఎత్తున పోరాటాలు చేశామని ఆయన చెప్పారు. విశాలాంధ్ర మహాసభ ప్రధానకార్యదర్శి పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పోరాటాలు సాగాయని, అనంతరం ఆంధ్ర మహాసభ విశాలాంధ్రగా మారింద న్నారు. స్వాతంత్య్ర సమ యోధుడు మహబూబ్‌ అలీ మాట్లా డుతూ, విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం కమ్యూనిస్టులు పోరాటాలు జరిపా రని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్న మాటల్లో నిజం లేదని అభిప్రాయపడ్డారు. విశా లాంధ్ర మహాసభ అధ్యక్షులు ఎన్‌. చక్రవర్తి, నాయకులు వి.లక్ష్మణరెడ్డి చేగొండి రామజోగయ్య పాల్గొన్నారు.


 

Download E-Book here తెలంగాణలో విశాలాంధ్రోద్యమం

15, ఏప్రిల్ 2012, ఆదివారం

"తెలంగాణలో విశాలాంధ్రోద్యమం" - పుస్తకావిష్కరణ సభ



"విశాలాంధ్ర మహాసభ" 17.04.2012 మంగళవారం ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు, హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆవరణలో పుస్తకావిష్కరణ సభ నిర్వహించనున్నది. విభజనవాదులు గత కొంతకాలంగా, ఏకపక్షంగా దుష్ప్రచారం  చేస్తున్న చారిత్రక అసత్యాలను, సాంస్కృతిక వక్రీకరణలను ఖండించి, నిజానిజాలను, ప్రతివాదాన్ని తగు ఆధారాలతో సహా ప్రజల ముందుంచే ప్రయత్నంలో భాగంగా ఈ పుస్తకం సంకలనం కాబడింది. పుస్తకావిష్కరణ సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్య్రసమరయోధులు, నాటి విశాలాంధ్రోద్యమ భాగస్వామ్యులు  శ్రీ నర్రా మాధవరావు మరియు శ్రీమతి శాఖమూరి సుగుణమ్మ పాల్గొంటారు. "విశాలాంధ్ర మహాసభ" సంస్థ తరపున శ్రీయుతులు సి.ఆంజనేయరెడ్డి, పరకాల ప్రభాకర్, చేగొండి రామజోగయ్య, కుమార్ యాదవ్ చౌదరి, సుంకర వెంకటేశ్వరరావు, వి. లక్ష్మణరెడ్డి, కె.శ్రీనివాసరెడ్డి ప్రభ్రుతులు పాల్గొంటారు.


 నలమోతు చక్రవర్తి
అధ్యక్షుడు
విశాలాంధ్ర మహాసభ 

Visalandhra.org : ‘Telanganalo Visalandhrodyamam’ – Book Release Function

Date: Tuesday, April 17th 2012

Time: 11.00 AM

Venue: Somajiguda Press Club, Hyderabad


Andhra Pradesh was the first linguistic State that came into existence after India achieved independence. The State came into being as a result of collective sacrifices made by scores of our venerable leaders such as Amarajeevi Potti Sriramulu, Burgula Ramakrishna Rao, Konda Venkatapayya, Tanguturi Prakasam Pantulu, Suravaram Patap Reddy, Andhra Pitamaha Madapati Hanumanth Rao, Ravi Narayan Reddy, Ayyadevara Kaleswar Rao and many more.

When the dream of a Telugu State was close to fruition, Nehru criticized Telugu’s desire for a linguistic state as bearing a “tint of imperialist expansionism”. A few opportunistic politicians of that era saw an opening to further their feudal politics. They have brought up the demand for a separate Telangana state that will be carved out of erstwhile Nizam ruled Hyderabad State. However, the demand which lacked intellectual honesty, never gained traction.

Right from 1950s, the history of separatist movement is littered with half-truths and falsehoods. Also, ironically almost all the separatist leaders were once integrationists. Some of the prominent flip-floppers are the most respected leaders of the current separatist movement. For example, Konda Laxman Bapuji, the man that was in the forefront of the 1969 separatist movement was originally a staunch integrationist. K.V. Ranga Reddy, Marri Chenna Reddy as well as the current separatist movement leader K. Chandra Shekhar Rao also once strongly stood for integration. There are leaders from Kosta and Rayalaseema who were once integrationists that turned separatists. Former Deputy C.M. B.V. Subbar Reddy and Kakani Venkatratnam fall into that category. This goes on to show the opportunistic nature of the separatist leaders across all regions of the State.

The research material unearthed by Visalandhra Mahasabha shows how the separatist leaders have changed colors and misled people over the past few decades with their false propaganda. Our team came up with an intelligent way of showcasing the hypocrisy of the separatist leaders. They extracted newspaper clips starting from 1950’s as well as quotes of the prominent separatist leaders from the Assembly proceedings. As a result, readers are presented with the original content from the last sixty years, that will take them by surprise.
This book will be an eye opener for anyone that was led to believe that Andhra Pradesh State came into existence against the wishes of people of Nizam Telangana state. VMS offers ample evidence to prove that there was a groundswell support for a united Telugu State across Nizam Telangana, Coastal Andhra, and Rayalaseema in 1950s.

As the separatists make an attempt to revive their movement by feeding false information to the young minds, this book will provide a perspective that is badly needed in the countering the divisive propaganda.

After the book is released, a link to the soft copy of the book will be posted on this website.
I request you to join us and show your solidarity for a United Andhra Pradesh State.

Nalamotu Chakravarthy


11, ఏప్రిల్ 2012, బుధవారం

వన విహారమూ నేరమేనా?!

ఆంధ్రప్రభ వ్యాసం : ఎంత అన్యాయం! మాట్లాడితే విమర్శలు! మౌనం వహిస్తే కూడా విమర్శల జడివాన! ఇవన్నీ ఓపిగ్గా దిగమింగుకుంటున్న దొరవారికి ఈ వారం ఇంకోసారి ఎదురవుతున్న విడ్డూరమైన విమర్శ. వారు సన్నిహిత కుటుంబీకులతో కలిసి మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ శివారులో, సొంత వ్యవసాయ క్షేత్రంలోని విలాస గృహంలో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని, మీడియాకి దూరంగా దాదాపు అజ్ఞాతంలో ఉండాలన్న వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడం! మరీ ఇంగితం లేకుండా చేస్తున్న విమర్శలేమంటే (1) తెలంగాణలో మళ్ళీ కొన్ని బలిదానాలు జరుగుతుంటే వారినేం పట్టించుకోకుండా సొంత తోటలో (కోటలో) తొంగోటమేంటి? (2) సొంత జిల్లాలో మతఘర్షణలు చెలరేగితే వాటిని అరికట్టడానికి ఒక నేతగా తమరికేబాధ్యతా లేదా? (3) అసలు ఇంత విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రం, ఇంకా అపారమైన కుటుంబ ఆస్తులు ఎలా వచ్చాయి? (4) ఫాంహౌజ్‌ నుంచే కాంగ్రెస్‌ హైకమాండర్లతో రహస్య సంప్రదింపులు జరుగుతూ ఉంటాయని అంతిమంగా విభజనేతర పరిష్కారానికి క్రమంగా ఒప్పుకోవడానికి రాజకీయ ఆర్థిక కుటుంబ రక్షణ ప్యాకేజీ ఇప్పటి నిర్ణయమై పోయిందన్న లీకేజీ గుసగుసల్లో పసలేకపోలేదూ? (5) కేవలం కుమారుడు కుమార్తెలకు తప్ప, కనీసం, విజయశాంతి, హరీష్‌, వినోద్‌ వంటి వారికి కానీ, పార్టీలోని జిల్లా ప్రముఖులకు కానీ ఎందుకు 'ప్రవేశం' ఉండదు? ఇవండీ ఇప్పుడు వెల్లువెత్తుతున్న ప్రశ్నలు-

వ్యంగ్యం అనుకున్నా, నమ్మలేకపోయినా, ఏమీ చేయలేను కానీ ఆయన విశాల దేశ ప్రయోజనాల కోసం అంతిమంగా ఏదో ఒక విభజనేతర పరిష్కారాన్ని సాధించడానికి తోడ్పడతారని, ఆ క్రమంలో త్వరలో సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బృహత్తర బాధ్యతను స్వీకరించడానికి భయపడరన్న విశ్వాసం ఈ వ్యాసకర్తకుంది -అందుకేపైన పేర్కొన్న విడ్డూరమైన విమర్శలకు విలోమ క్రమంలో, దేశ కాలమాన పరిస్థితుల కనుగుణమైన సమాధానాలిచ్చే ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను -తమకు తామే వివరణలు, సంజాయిషీలిచ్చుకోవడం దొరలకు నామోషీ కదా?

(1) ఆయన నెహ్రూ జీ అంతటి ప్రజాకర్షక నేత. పండిట్‌ జీకి కూడా అప్పుడప్పుడు కుమార్తె ఇందిరతో కలిసి కొంతకాలం ప్రశాంతంగా ఏదో ఒక ప్రాంతంలో రాజకీయాలకు దూరంగా ఉండి, విశ్రాంతి తీసుకునే అలవాటుండేది -ప్రపంచాధినేతలలో కూడా చాలామంది ఈ పనే చేస్తుంటారు -మరి పన్నెండేళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న (అంతిమ ధ్యేయం ఏమిటన్నది వదిలేయండి!) నిన్నా మొన్న సహజ అభీష్టానికి వ్యతిరేకంగా పార్లమెంటుకి హాజరై ఏకంగా ముచ్చటగా మూడురోజులు పరిమిత లొల్లి చేసి, బాగా అలసిపోయిన అధినేత కొంత విశ్రాంతి కోరుకోవడం తప్పా? దానికి సొంత తోటని, కోటని ఎంచుకోవడం దొరవారి దోషమా? సన్నిహిత బంధువుల కన్న పార్టీ శ్రేణులకన్న సంతానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం భారతదేశ రాజకీయ నాయకులందరిలో ఉన్న గుణం -అయినా రాజ్‌ఠాక్రే వంటి మేనల్లుణ్ణి మరీ నెత్తికెక్కించుకోకూడదు. విజయశాంతి వంటి విలక్షణ, చంచల స్వభావురాలినీ అంతే! (2) ఫాంహౌజ్‌ నుంచే కాంగ్రెస్‌ హైకమాండర్లతో సంప్రదింపులు జరుగుతాయని ఆరోపిస్తున్న వారి ఉద్దేశమేంటి? అటువంటి జాతీయ ప్రాముఖ్యం కల అంశాల్ని ఆంతరంగికంగా రహస్యంగా కాకుండా, బహిరంగంగా, అబిడ్స్‌ ప్రధాన తంతి తపాలా కార్యాలయానికొచ్చి పబ్లిక్‌ బూత్‌ నుంచి బిగ్గరగా మాట్లాడాలా? (3) ఇన్ని విలాసవంతమైన వ్యవసాయ క్షేత్రాలు, అపార కుటుంబ ఆస్తులు, నౌకావ్యాపారాలు సొంత మీడియా ఎలా వచ్చేయని ప్రశ్నించే వాళ్లకి దేశ కాల మాన పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేదని అనుకోవాలి.

ఈ దేశంలో ఒక్క టర్మ్‌ సర్పంచిగా పనిచేసిన వాడే ఎంత సంపాదిస్తున్నాడు? పలుదఫాలు ఎమ్మెల్యేగా, ఎంపిగా, కొంతకాలం రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రిగా, గత పుష్కరకాలంగా ఒక మహోద్యమ నేతగా వెలిగిన ఒక మహానేతను మీ వర్తమాన కుటుంబ ఆస్తుల విలువెంతో చెప్పమని అడగడం భావ్యంకాదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కాకపోతే ఆ విషయం ఎప్పటికైనా బయటపడుతుంది. ఇప్పుడా శషభిషలనవసరం! (4) మొదటి రెండవ విమర్శలు కూడా అన్యాయమే -తెలంగాణలో బలిదానాలు, సొంత జిల్లాలో మతఘర్షణలు జరుగుతున్నప్పుడు తోటలో తొంగొటమేమిటనే వాళ్లకు, ఈ పరిణామాలు కలుగజేసిన ఆవేదనని మరిచిపోవడానికే, తన అసంతృప్తిని వెలిగక్కడానికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆవేదనల్ని మర్చిపోవడానికి ఎవరి వ్యక్తిగత అలవాట్లు వాళ్లకుంటాయి! ఆఖర్లో స్థలాభావం దృష్ట్యా దొరవారికి క్లుప్తంగా కొన్ని విజ్ఞప్తులు:

-(1) పచ్చని వ్యవసాయ క్షేత్రాల్ని అభివృద్ధి పరచడాన్ని డబ్బు రంగు మార్చే ప్రక్రియగా విమర్శించే వాళ్లని పట్టించుకోవద్దు -అది ప్రకృతి పరిరక్షణ కోసం ఏమాత్రం సొమ్ము ఉన్నవాళ్లైనా చేయాల్సిన సత్కార్యం -(2) ప్రపంచంలో ఇప్పటికే నెలకొని ఉన్న క్లిష్టమైన సమస్య నీటికరవు -మీ వ్యవసాయ క్షేత్రాల్లో ప్రారంభించిన బిందుసేద్య ప్రయోగాలు కొనసాగించండి (3) మీ విశాల దృక్పథానికి అనుగుణంగా మీ క్షేత్రాల్లో నూజివీడు మామిడి చెట్లు, మహబూబ్‌నగర్‌ ఫలవృక్షాలు, టెక్కలి టేకు చెట్లు, కోనసీమ కొబ్బరి చెట్లు, అదిలాబాద్‌ అరటి, జామ రకాలు, గుంటూరు మిర్చి, నెల్లూరు నేరేళ్లు ఇంకా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల చామంతి, గులాబీ, మల్లెల అంటులు, అన్నీ పెంచండి -అన్నట్టు ఆనపకాయ అన్నా సరే సొరకాయ అన్నా సరే, ఆ పాదులతో పాటు అన్ని కూరగాయలు, ఆకుకూరలు పండించండి -దొరవారికి దండాలతో ఉంటాను మరి.
-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు  

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

విడిపోతే నష్టమెవరికి ?

ఆంధ్రప్రభ వ్యాసం: ఆలస్యంగానైనా, నిజాలు తెలిస్తే అదిన్నూ పన్నెండేళ్లుగా, పుట్టెడు పచ్చి అబద్ధాల్ని గుక్కతిప్పుకోకుండా చెబుతూ వచ్చిన వారి పరంగానే జరిగితే తెలంగాణ ప్రజలు సంతోషిస్తారు. ఇన్నాళ్లుగా అన్నేసి అబద్ధాలతో, సాంస్కృతిక చారిత్రక వక్రీకరణలతో మభ్యపెట్టి, మోసం చేసినందుకు కాస్తో కూస్తో కోపం రాకపోదు కానీ, ఇప్పటికైనా నిజాలు కక్కేరు, వినాశనాన్ని, మనకి అప్రతిష్ఠని నివారించారులే అనే ఆనందంలో అది మరుగున పడిపోతుంది! అయినా పరివర్తనని, పశ్చాత్తాపాన్ని, అంతిమంగా నిజాల ఒప్పుకోలుని సహృదయంతో స్వాగతించే సుగుణం తెలంగాణ ప్రజలకి ఉండదేమోనని అనుమానించడం సరైంది కాదు. కాబట్టి ఇన్నేళ్లుగా 'గోబెల్స్‌' మాదిరిగా ప్రతివాదం వినిపించనీయని, హింసాయుత ధోరణులనాశ్రయించి, ప్రయోగించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రవాదం పేరిట, ఏకపక్షంగా ప్రచారం చేసిన అసత్యాలు, అభూతకల్పనలు, చారిత్రక, సాంస్కృతిక వక్రీకరణలు, తప్పుడు గణాంకాలు, తమ దుష్ప్రభావాన్ని చాలావరకు కోల్పోయిన ఈ తరుణంలో, విభజనవాద వక్రచక్రాల మాయారథసారథి, ఆయన కుటుంబీకులు, అనుంగు అనుయాయులు, ఇతర విభజన వాదులందరూ తెలంగాణ ప్రజల ముందుకొచ్చి, నిజాయితీగా, పశ్చాత్తాప పూర్వకంగా ఒప్పుకోవాల్సిన నిజాల్ని, అంశాల్ని చర్చించుకుందాం. ఎంతైనా 'మనోళ్లే' కదా అన్న అభిమానంతో ఇటువంటి పశ్చాత్తాప ప్రకటన నిజాల ఒప్పుకోలు క్రమంలో, మరీ ప్రమాదం జరగకుండా ఉండడానికి పాటించాల్సిన కొన్ని కిటుకుల్ని లేదా జాగ్రత్తల్ని కూడా సూచించుదాం. విభజన వాద సెల్‌టవర్‌ శిఖరాగ్రం నుంచి తమ అనివార్య అవరోహణా క్రమాన్ని, మెట్టుమెట్టుగా దిగే రీతిలోనే జరపాలి గానీ, ఒక్కసారిగా పైనుంచి సమైక్యంగా నేలపైకి దూకేయరాదని, దొరవారితో సహా, ప్రత్యేక రాష్ట్రవాదులుగా ప్రస్తుతానికి చలామణి అవుతున్న వాళ్లందరికీ తెలుసు! 'మాది మాగ్గావాలె' అని అరవడం మానకుండానే, ఏదోటి తేల్చండి అని సన్నాయి నొక్కులూ మంద్రస్వరంలో ఆలపిస్తున్నారందుకే?

ఏమైనా ఇప్పటికే అధినేతతో సహా, వీర విభజనవాదులందరూ తాము గతంలో పదే పదే వల్లె వేసిన వితండ వాదాంశాలెన్నింటినో, వెనకబాటుతనం, ఒప్పందాల ఉల్లంఘనలు, నీళ్లు, ఉపాధి అవకాశాల దోపిడీ, చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత, వంటివాటిని తమకు తామే పరిత్యజించేశారు, అవన్నీ అసమంజసమైనవిగా, నిర్ద్వంద్వంగా నిరూపితమైనందువల్ల ఇకపోతే మనజాతి, సంస్కృతి, రీతి వేషభాషలు, ఆఖరికి దేవుళ్లు, దేవతలు కూడా లేరన్నది పిచ్చివాదనగా తేలిపోయిందనీ గ్రహించేరు! రాష్ట్రానికి దేశానికి ఏం నష్టం జరిగినా మాకనవసరం, మాది మాగ్గావాలె అంతే, అనడం మొత్తం దేశ ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు ఏమాత్రం నచ్చడం లేదన్నదీ తెలుసుకున్నారు. 2009, డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటన అమలు చేస్తే బాగుంటుందంటూనే, పోనీ ఏదోటి తేల్చండి అనీ అంటున్నారు. దీని భావమేమి తిరుమలేశ?! రాకపోతే పోనీలే, ఇవ్వలేకపోతే సరేలే, మా రాజకీయ మెడలకే ఉచ్చు చుట్టుకోకుండా ప్రజలకేం చెప్పుకోవాలన్నదే మన ఘనత వహించిన ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్య ఈ నేపథ్యంలో వాళ్లు పాటించాల్సిన అవరోహణా క్రమవ్యూహం ఎలా ఉంటే బాగుంటుందో, రాజకీయ అట్టుని ఎలా తిరగేయాలో సూచించుదాం పాపం!

మేమైతే ఇప్పటికీ విభజన భక్తులమే! పదవులపై మోజులేని త్యాగరాజులమే (!?) కానీ విభజన జరిగితే, సంభవించే కష్టనష్టాల్ని మీకు, అంటే మా ప్రియమైన తెలంగాణ ప్రజలకు ముందుగా చెప్పడం మా పవిత్ర కర్తవ్యంగా భావిస్తున్నాం. ఇలాంటి ఉపోద్ఘాత సన్నాయి నొక్కులతో ప్రారంభించి, ఇంకా ఏం చెప్పాలంటే (1) మనం ముందుగా భారతీయులం, తర్వాతనే తెలంగాణీయులం, దేశ ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు మన కోరికకు ప్రతికూలంగా ఉన్నారు. ఇక్కడిస్తే అది అన్ని ఇతర రాష్ట్రాల విభజనకు దారితీస్తుందని తద్వారా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని అంతిమంగా దేశ సమైక్యతకే ముప్పు కలుగుతుందన్న భయాందోళనలు సర్వత్రా ఉన్నాయి. మనం మొండి పట్టుదల పట్టడం మంచిదికాదేమో, అలాంటి చెడ్డపేరు మా ప్రజలకి రావడం మాకిష్టం లేదు. అయినా మాదేముంది, మీరే సోచాయించండి? (2) అదలా ఉంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి మనం చెబుతున్న ఏ ఒక్క కారణాన్ని- వెనుకబాటుతనం, చిన్న రాష్ట్రాల ఆవశ్యకత, యాస,సంస్కృతిలలో స్వల్ప భేదాలు, ఇలా ఏది వర్తింప చేసినా తెలంగాణను మరెన్నో చిట్టి రాష్ట్రాలుగా చేయవలసి వస్తుంది  (3) హైదరాబాద్‌ మన గుండెకాయ (నిజం చెప్పాలంటే ఈ నగరంలో 45 శాతం సీమాంధ్రలో మూలాలున్న వాళ్లు, 20 శాతం భాషాపరంగా మైనారిటీలు, మరో 20 శాతం మతపరంగా మైనారిటీలు ఉన్నారు. వీళ్లలో అందరూ కానీ, ఏ ఒక్కవర్గం కానీ సంఘటితమైతే మాలో ఏ ఒక్కరూ ఎన్నికలలో గెలవం. ఇతర జిల్లాల్లో కూడా కనీసం 20 శాతం తెలంగాణేతరులున్నారు. వాళ్లూ ఎన్నికల ఫలితాల్ని శాసించగలరు. కొత్త రాష్ట్రం ఏర్పడినా తెలంగాణేతరులు, హైదరాబాద్‌ని కానీ ఏ ఇతర ప్రాంతాన్ని కానీ వీడిపోరు. అలాగే మనోళ్లు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. సోచాయించండి. (4) ఇంకో చేదు నిజం ఏమంటే హైదరాబాద్‌తో కూడిన ప్రత్యేక రాష్ట్రం వచ్చే అవకాశం లేనేలేదు. భాగ్యనగరం లేని దౌర్భాగ్యం మనకెందుకన్నా! అది మన గుండెకాయ కదా!! (5) మనకి మనమే 1954, నవంబర్‌ 1 నాటి సరిహద్దులతో కూడిన రాష్ట్రం కావాలని కమిటైపోయాం. భద్రాచలం డివిజన్‌, మునగాల పరగణా వదలుకోవాల్సిందే గదా! తిరుపతి, శ్రీశైలం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు అటే ఉన్నాయి. భద్రాద్రి రాముణ్ణి కూడా వదలుకుందామా? (6) చిన్న రాష్ట్రం చిన్నబోతుంది. ఉన్న రాష్ట్రాన్ని ఉంచేసుకుంటే పోలా? (7) విభజన జరిగితే, సీమాంధ్రోళ్లు మహా అసాధ్యులు, నీళ్లలో, నిధుల్లో పెద్ద వాటా కొట్టేస్తారు, లాబీయింగు చేసేసి మనమే నష్టపోతాం -నీళ్లు పల్లమెరుగునన్నది తెలుసుకదా. ప్రపంచంలో ఏ నది అయినా దిగువ ప్రాంతాల్నే డెల్టాలుగా రూపొందిస్తుందని, అది ప్రకృతి సహజ సూత్రమని తెలుసుకదా. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కూడా, దిగువ ప్రాంతాలకే కొన్ని ప్రత్యేక జల హక్కులుంటాయి. ఐనా మనమంతా సమష్టిగా కర్ణాటక మహారాష్ట్ర వంటి ఎగువ రాష్ట్రాల వారి జలదోపిడీని ఎదుర్కోవాలి కానీ, దిగువన స్వభాషీయులతో పోటీ తగదు. (8) ఉద్యోగాల సంగతి ఆలోచించండి. రాష్ట్రం విడిపోతే ఇక్కడి ఉద్యోగులకి ఏదో ఒక రాష్ట్రంలో సర్వీసు ఎంచుకునే హక్కు ఉంటుంది.బలవంతంగా పంపించేయడం కుదరదు. ఇక్కడ ఇళ్లు, ఆస్తులు, పిల్లల చదువులు ఉన్నవాళ్లంతా సహజంగా ఇక్కడే ఉండిపోతారు. అంటే మనకి ఎక్కువ ఉద్యోగులు అక్కడ ఖాళీలు మనకు వాళ్లు పదవీ విరమణ చేసే వరకు ఖాళీలుండవు. ఆ కొత్త రాష్ట్రంలో ఎన్నో కొత్త ఉద్యోగాలు, కొత్త రాజధాని నిర్మాణం కోసం ఎన్నో నిధులు, కొత్త పరిశ్రమలు మనకేమో నిరుద్యోగం ప్రబలడం, అభివృద్ధి మందగించడం, పరిశ్రమలు తరలిపోవడం -జర సోచాయించాల్సిన విషయాలే కదా -విడిపోదామంటారా -బాగా సోచాయించండి. మాదేముంది ప్రజల నిర్ణయమే మాకు శిరోధార్యం.

-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు