ఆంధ్రప్రభ వ్యాసం: ఒక పెనుముప్పుని తక్షణాగత్యంగా ఎదుర్కొంటున్న అనివార్యతా క్రమంలో, లేదా దేహంలోని ఒక భాగంలో ప్రస్తుతం విపరీతంగా బాధిస్తున్న 'పుండు' ని నయం చేసుకునే ప్రయత్నంలో, ఇంకా ప్రమాదకరమైన ఇతర సమస్యల్ని, అనారోగ్యాల్ని అలక్ష్యం చేయటం సహజంగా జరుగుతుంటుంది. కానీ ప్రస్తుత సమస్య కొంత ఉపశమించిన తర్వాతనైనా, ఇతర జాఢ్యాలపై దృష్టి సారించాలి. సమాంతర వైద్యం జరగాలి. ఊపిరితిత్తుల్లో వ్యాధికి మందులిచ్చి ఊరుకోకుండా కాలి గోటికున్న పుండుకి కూడా మందుపూయాలి. అంతిమంగా అన్ని సమస్యలకు పరిష్కారం, సంపూర్ణ ఆరోగ్యం లభించేలా ఏ రోగమూ తిరగబెట్టని రీతిలో బహుళ చికిత్స జరగాలి. (దీన్నే వైద్యుల పరిభాషలో (మల్టిపుల్ ట్రీట్మెంట్) అంటారు). ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ వాదం కొంత బలహీనపడిందన్నది నిర్వివాదాంశం.
ఈ పరిణామానికి ప్రశంసార్హులు క్రమంగా వాస్తవాలను, ఉద్యమకారుల అరాచకాల్ని మూ(మా)టకారుల అసలు ధ్యేయాల్ని, రంగుల్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు మాత్రమే కానీ, ఏ ఎండకాగొడుగు పట్టే మన రాజకీయ నేతలు సంచలనాలు, అరాచకాలకే ప్రాధాన్యమిచ్చే మీడియా కానీ కానే కాదు! తెలంగాణ ప్రజల్లో అంతర్మథనం పరివర్తన ప్రారంభమైన ఈ తరుణంలో, అన్ని ప్రాంతాల తెలుగువాళ్లకున్న తెగుళ్ల గురించి, వాటి నివారణోపాయాల గురించి చర్చించుకోవాల్సిన అగత్యముంది, ప్రస్తుత సమస్యకు మూలకారణాలు అవే కాబట్టి వర్తమాన ప్రపంచంలో అన్ని వర్గాల వారికున్న జాఢ్యాలన్నీ, స్వార్థం, అవినీతి, విలువల పతనం వంటివి మనకూ ఉన్నాయి. అయితే, తెలుగువాడికున్న కొన్ని ప్రత్యేక రోగాల గురించి మాత్రమే చెప్పుకొందాం.
(1) అనైక్యత: ఆరంభ శూరత్వం మాటేమోకానీ, అమెరికాలో అస్సాంలో, అమలాపురంలో, ఆదిలాబాద్లో ఎక్కడున్నా సరే, ఒక బండగుర్తుగా తెలుగువాళ్లని పట్టిచ్చే గుణం అనైక్యత. ఎక్కడైనా ఇద్దరు తెలుగువాళ్లుంటే మూడు సంఘాలుంటాయన్న ఖ్యాతి మనకుంది గదా! ఇంకే ఇతర భాషా వర్గానికి లేనిది, మనకు మాత్రమే ఉన్న దుర్గుణం 'యాసా వైషమ్యం'. ప్రపంచంలో ఆరువేల భాషలున్నాయంటారు. అన్ని ఏకలిపి భాషల్లోనూ అసంఖ్యాక యాసలుంటాయి (స్లాంగ్స్). యాస అనేది, ఒక వ్యక్తి కుటుంబ నేపథ్యం, విద్యాస్థాయి, జన్మస్థలం, శాశ్వత నివాస ప్రాంతం, వృత్తి ఇతర భాషలతో, వర్గాలతో సాహచర్యం, ఇలా ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది.
తెలంగాణ ప్రాంతంలో ఆ మాటకొస్తే ఏ ఊళ్లోనూ, ఏ కుటుంబంలోకూడా ఒకే యాస ఉందని చెప్పలేం. ఉదాహరణకి కెసిఆర్, ఈ మధ్యకాలంలో ఎంతో కష్టపడి అభ్యాసం చేసి, కృతకంగా అలవరచుకున్న యాసను ఆయన కొడుకు, కూతురు కూడా సంపూర్ణంగా అనుకరించలేకపోతున్నారు! యాసలు భాషా సూర్యుని శతకోటి కిరణాలు. దేని గొప్ప దానిదే. ఎప్పుడో, సినారె అన్నట్లు 'వచ్చాడన్నా, వచ్చిండన్నా' రెండూ తీపి తెలుగుపదాలే! కాని మన ఖర్మ ఏమిటో కానీ యాసా సంబంధిత ద్వేషాలు మనకు మాత్రమే సొంతం. ఈ సమస్యకు పరిష్కారం ఒక ప్రామాణిక వ్యవహారిక భాషను రూపొందించుకొని, నిర్దేశించడం కాదు.
ఇతర భాషల వారి లాగానే భాషాభిమానం పెంపొందించుకోవడం, ఇతర స్వభాషీయులు మాట్లాడే తీరుల్లోని స్వల్ప తారతమ్యాలను ఎగతాళి చేసే దుర్గుణాన్ని మానుకోవటం, మాత్రమే ఈ మాయరోగానికి మందు. యాసాద్వేషాలని ప్రేరేపించే వారిని వెలివేయాలంతే! ఏది ఏమైనా అనైక్యత మూలాన్నే తెలుగువాళ్లంటేనే అందరికీ చులకన భావం ఏర్పడిపోయి ఉంది. జాతీయ స్థాయిలో కూడా మన సంఖ్యాబలానికి తగిన దామాషాలో రాజకీయ ప్రాధాన్యం, గౌరవం, నిధులు, ప్రాజెక్టులు లభించడం లేదని తెలుసుకదా.
(2) మనకు మాత్రమే ఉన్న అవలక్షణం మాతృభాషపై ఉండాల్సినంత గౌరవం, ఆదరణ లేకపోవడం. తర్వాతి తరాలవారికి భాషాభిమానం కల్పించే ప్రయత్నం చేయకపోగా, వారి పరంగా నిరాదరణను ప్రోత్సహించడం 'మనోళ్ల'కే చెల్లు అన్యభాషా మాధ్యమాల్లో పిల్లలకి ప్రాథమిక స్థాయి నుంచి చదువులు చెప్పించడం మనలో అధిక సంఖ్యాకులు తెలిసీ చేస్తున్న పాపం. కొన్ని సంవత్సరాల క్రితమే, యునెస్కో వారు రానున్న కొద్ది దశాబ్దాలలో తెలుగు మృత భాషగా మారనున్నదనే హెచ్చరిక చేసినా మనకు చీమకుట్టినట్లైనా లేదు. దాదాపు 30 శాతం మందికి ఆ భాషలో రాయడం, చదవడం రాకపోతే, అది త్వరలో అంతరించిపోతుందన్న ప్రామాణికతను మనం ఇప్పటికే సాధించాం.
ఎలాగంటే, ఇతర రాష్ట్రాలలో విదేశాల్లో ఉన్న ఎనిమిది కోట్ల మంది తెలుగువారిలో, వారి వారసుల్లో దాదాపు సగం మందికి తెలుగు రాయడం, చదవడం సంగతలా ఉంచి మాట్లాడడమూ అంతంత మాత్రమే. మన రాష్ట్రంలోను సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 10 కోట్ల మంది తెలుగువాళ్లలోనైనా రాయడం, చదవడం వచ్చిన వాళ్ల శాతం సంగతలా ఉంచి, ఇష్టంగా స్వచ్ఛంగా మాట్లాడే వాళ్లెంతమందో చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి. కాబట్టి ఇప్పటికే తెలుగు సగం చచ్చిపోయి ఉంది. మృత భాషగా మిగిలి పోకూడదంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రవాసాంధ్రులు భాషాంతరీకరణం చెందకుండా మనవంతు సహకారం అందించాలి. ఈ విషయంలో తమిళ సోదరులను ఆదర్శంగా తీసుకోవాలి.
(3) అన్యభాషలపై మోజు: ఇది మనకున్న మరో పెద్ద అవలక్షణం. ఇతర భాషలను నేర్చుకోవడం తప్పుకాదు, మాతృభాషకే పెద్ద పీట వేసినంత వరకు తెలంగాణ ప్రజాకవి కాళోజీ 'అన్యభాషలు నేర్చి ఆంధ్రము రాదని సకిలించువేందిరా' అని అందుకే మనల్ని తిట్టేరు. ఇతర భాషల వారు కూడా అన్యభాషా పదాల్ని అవసరమైన మేరకు ఆహ్వానిస్తారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మన హిందీ పదాలు, ఘెరావ్, బంద్ వంటివి చేరేయి కానీ వాళ్లు తమ భాషలో సరైన పదాలు లేకపోతేనే ఆ పని చేస్తారు. కానీ మనం అలాకాదు. మనకున్న మంచి పదాల స్థానంలో వాటిని నెత్తికెక్కించుకుంటాం. పాలకుల, ఇతరుల ప్రాపకం కోసం మన ఊళ్లపేర్లు కూడా మార్చేసుకున్నాం. ఊళ్లకు, పట్టణాలకు ఉర్దూ పేర్లు తెలంగాణాలో మాత్రమే ఉన్నాయనుకోవద్దు. ఉర్దూ పేర్లున్న ఊళ్లెన్నో సీమాంధ్రలో ఉన్నాయి. ఆంగ్లేయులు తమ సౌకర్యం కోసం, రాజమండ్రి, బెజవాడ అని మార్చిన పేర్లు మనకింపుగానే ఉన్నాయి ఇంకా.
(4) ప్రాంతీయ తత్వం: ఇతరులకన్న ఎంతో అధికంగా మనకున్న మరో అవలక్షణం ప్రాంతీయ దురభిమానం సొంత ఊరుని ప్రేమించడం తప్పుకాదు. కానీ ఉంటున్న ఊరుని, అక్కడి సంస్కృతీ, సంప్రదాయాల్ని సంపూర్ణంగా అలవరచుకోలేకపోయినా గౌరవించాలి. అన్నిప్రాంతాల తెలగువాళ్లకీ ఈ సుగుణం తగుస్థాయిలో ఉండదన్నది వాస్తవం. అందుకే విభజనవాదులు స్థానికులకి, స్థిరపడిన వారికి మధ్య విభేదాలు సృష్టించడంలో కొంతమేరకు సఫలమయ్యారన్నది గ్రహించాలి.
(5) ప్రాంతేతర బంధాలపై విముఖత తమిళులు కానీ, ఇతర భాషల వారు కానీ, ఎక్కడ కలుసుకున్నా తమ భాషలోనే మాట్లాడుకుంటారు. ఏ ప్రాంతం వాళ్లవెరన్న దానికి అసలేమీ ప్రాధాన్యమివ్వరు. మనోళ్లు అలాకాదు. విదేశాల్లో ఉన్న వాళ్లలో కూడా ఒక ప్రాంతం, జిల్లా వాళ్ల మధ్యనే ఎక్కువ సౌహార్దం ఉంటుంది. మతపరమైన కట్టుబాట్లు, కులాల కుంపట్లు కూడా తెలుగువాళ్లలో అధికం. ప్రాంతీయ భావాలు మరీ ఎక్కువ. ఒక ప్రాంతం వాళ్లు అన్యప్రాంతాల వాళ్లతో వైవాహిక బంధాలకి అంతగా ఇష్టపడరు. మతాంతర, కులాంతర వివాహాలు జరుగుతున్న స్థాయిలోనైనా తెలుగువాళ్లలో ప్రాంతేతర వివాహాలు జరగడం లేదు. అసలు జరగడం లేదని చెప్పలేం కానీ, ఆ రోజుల్లోనే హైదరాబాద్ వాసి, మాజీ కేంద్ర మంత్రి పుంజాల శివశంకర్, విజయనగరం జిల్లా వాసి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి కుటుంబంతో వివాహబంధం ఏర్పరచుకొన్నారు. ఇది మర్చిపోని సీమాంధ్రులు ఆయన్ని తెనాలి నుంచి ఎంపి గా గెలిపించుకున్నారు. వర్తమానకాలంలో కూడా మహబూబ్నగర్ మంత్రి డి.కె.అరుణ, మొగల్తూరు మొనగాడు చిరంజీవి, కృష్ణా జిల్లా కోనమేరు రంగారావు, తెరాస దళిత నేత చంద్రశేఖర్ల కుటుంబాలు ఇతర ప్రాంతాలతో వియ్యమందాయి.
కానీ ఇలాంటి ప్రాంతేతర వివాహాలు బహు అరుదుగానే ఉంటున్నాయి.అమెరికాలో ఉన్న అమలాపురం కుర్రాడు, ఆస్ట్రేలియాలోని ఆదిలాబాద్ పోరడు, తమ తల్లిదండ్రులతో, మనవైపు సంబంధమే చూడమనే చెప్తుంటాడు! పూర్వం మొఘలులు, రాజ్పుత్లతో వైవాహిక బంధాలనేర్పరుచుకుని సత్ఫలితాలు సాధించారు. అలానే ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారితో, ఇతర యూరోపియన్లతో వివాహబంధాల ద్వారానే వారికి తమపట్ల ఉన్న వైషమ్యాన్ని తగ్గించగలిగారు. కాబట్టి తెలుగువాళ్లలో కూడా ప్రాంతాంతర వివాహాలు ఇంకా ఎక్కువగా జరిగితే బాగుంటుంది. తర్వాతి తరాల వారిలోనైనా ప్రాంతీయ విభేదాలు తగ్గుతాయి. స్వల్ప సాంస్కృతిక తారతమ్యాలను భూతద్దంలో చూసే దుర్గుణం కూడా తగ్గుతుంది.
ఈ తెలుగు తెగుళ్లన్నీ త్వరలో మాసిపోయి, పాత చరిత్ర అయిపోతుందని ఆశిద్దామా?!
-చేగొండి రామజోగయ్య
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు






తాటాకు చప్పుళ్లకు బెదరం… మాది ఎప్పటికీ సమైక్యవాదమే… మమ్మల్ని కొట్టినా, తిట్టినా దాడులు చేసినా వెనక్కు తగ్గేదే లేదని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ స్పష్టంచేశారు. 2012 సంవత్సరాన్ని విశాలాంధ్ర నామ సంవత్సరంగా ప్రకటించుకుందామని పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ‘రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందాం’ అనే నినాదంతో విశాలాంధ్ర మహాసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో పాటు తెలంగాణలో కూడా లక్షలాది మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ వాదనలో సత్యం ఉంది కాబట్టే వేర్పాటు వాదులకు వినేందుకు ధైర్యం చాలక దాడులకు పూనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 30 ఏళ్లుగా పౌర హక్కులపై మాట్లాడుతున్న తమపై అనేకరకాల ఆరోపణలు, దాడులు జరుగుతున్నా బోగస్ హక్కుల సంఘాల నేతలు ఏమాత్రం స్పందించక పోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.

