బుధవారం 15 ఫిబ్రవరి 2012

దీర్ఘకాల తెలుగు తెగుళ్లు!

ఆంధ్రప్రభ వ్యాసం: ఒక పెనుముప్పుని తక్షణాగత్యంగా ఎదుర్కొంటున్న అనివార్యతా క్రమంలో, లేదా దేహంలోని ఒక భాగంలో ప్రస్తుతం విపరీతంగా బాధిస్తున్న 'పుండు' ని నయం చేసుకునే ప్రయత్నంలో, ఇంకా ప్రమాదకరమైన ఇతర సమస్యల్ని, అనారోగ్యాల్ని అలక్ష్యం చేయటం సహజంగా జరుగుతుంటుంది. కానీ ప్రస్తుత సమస్య కొంత ఉపశమించిన తర్వాతనైనా, ఇతర జాఢ్యాలపై దృష్టి సారించాలి. సమాంతర వైద్యం జరగాలి. ఊపిరితిత్తుల్లో వ్యాధికి మందులిచ్చి ఊరుకోకుండా కాలి గోటికున్న పుండుకి కూడా మందుపూయాలి. అంతిమంగా అన్ని సమస్యలకు పరిష్కారం, సంపూర్ణ ఆరోగ్యం లభించేలా ఏ రోగమూ తిరగబెట్టని రీతిలో బహుళ చికిత్స జరగాలి. (దీన్నే వైద్యుల పరిభాషలో (మల్టిపుల్‌ ట్రీట్‌మెంట్‌) అంటారు). ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ వాదం కొంత బలహీనపడిందన్నది నిర్వివాదాంశం.

ఈ పరిణామానికి ప్రశంసార్హులు క్రమంగా వాస్తవాలను, ఉద్యమకారుల అరాచకాల్ని మూ(మా)టకారుల అసలు ధ్యేయాల్ని, రంగుల్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు మాత్రమే కానీ, ఏ ఎండకాగొడుగు పట్టే మన రాజకీయ నేతలు సంచలనాలు, అరాచకాలకే ప్రాధాన్యమిచ్చే మీడియా కానీ కానే కాదు! తెలంగాణ ప్రజల్లో అంతర్మథనం పరివర్తన ప్రారంభమైన ఈ తరుణంలో, అన్ని ప్రాంతాల తెలుగువాళ్లకున్న తెగుళ్ల గురించి, వాటి నివారణోపాయాల గురించి చర్చించుకోవాల్సిన అగత్యముంది, ప్రస్తుత సమస్యకు మూలకారణాలు అవే కాబట్టి వర్తమాన ప్రపంచంలో అన్ని వర్గాల వారికున్న జాఢ్యాలన్నీ, స్వార్థం, అవినీతి, విలువల పతనం వంటివి మనకూ ఉన్నాయి. అయితే, తెలుగువాడికున్న కొన్ని ప్రత్యేక రోగాల గురించి మాత్రమే చెప్పుకొందాం.

(1) అనైక్యత: ఆరంభ శూరత్వం మాటేమోకానీ, అమెరికాలో అస్సాంలో, అమలాపురంలో, ఆదిలాబాద్‌లో ఎక్కడున్నా సరే, ఒక బండగుర్తుగా తెలుగువాళ్లని పట్టిచ్చే గుణం అనైక్యత. ఎక్కడైనా ఇద్దరు తెలుగువాళ్లుంటే మూడు సంఘాలుంటాయన్న ఖ్యాతి మనకుంది గదా! ఇంకే ఇతర భాషా వర్గానికి లేనిది, మనకు మాత్రమే ఉన్న దుర్గుణం 'యాసా వైషమ్యం'. ప్రపంచంలో ఆరువేల భాషలున్నాయంటారు. అన్ని ఏకలిపి భాషల్లోనూ అసంఖ్యాక యాసలుంటాయి (స్లాంగ్స్‌). యాస అనేది, ఒక వ్యక్తి కుటుంబ నేపథ్యం, విద్యాస్థాయి, జన్మస్థలం, శాశ్వత నివాస ప్రాంతం, వృత్తి ఇతర భాషలతో, వర్గాలతో సాహచర్యం, ఇలా ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది.

తెలంగాణ ప్రాంతంలో ఆ మాటకొస్తే ఏ ఊళ్లోనూ, ఏ కుటుంబంలోకూడా ఒకే యాస ఉందని చెప్పలేం. ఉదాహరణకి కెసిఆర్‌, ఈ మధ్యకాలంలో ఎంతో కష్టపడి అభ్యాసం చేసి, కృతకంగా అలవరచుకున్న యాసను ఆయన కొడుకు, కూతురు కూడా సంపూర్ణంగా అనుకరించలేకపోతున్నారు! యాసలు భాషా సూర్యుని శతకోటి కిరణాలు. దేని గొప్ప దానిదే. ఎప్పుడో, సినారె అన్నట్లు 'వచ్చాడన్నా, వచ్చిండన్నా' రెండూ తీపి తెలుగుపదాలే! కాని మన ఖర్మ ఏమిటో కానీ యాసా సంబంధిత ద్వేషాలు మనకు మాత్రమే సొంతం. ఈ సమస్యకు పరిష్కారం ఒక ప్రామాణిక వ్యవహారిక భాషను రూపొందించుకొని, నిర్దేశించడం కాదు.

ఇతర భాషల వారి లాగానే భాషాభిమానం పెంపొందించుకోవడం, ఇతర స్వభాషీయులు మాట్లాడే తీరుల్లోని స్వల్ప తారతమ్యాలను ఎగతాళి చేసే దుర్గుణాన్ని మానుకోవటం, మాత్రమే ఈ మాయరోగానికి మందు. యాసాద్వేషాలని ప్రేరేపించే వారిని వెలివేయాలంతే! ఏది ఏమైనా అనైక్యత మూలాన్నే తెలుగువాళ్లంటేనే అందరికీ చులకన భావం ఏర్పడిపోయి ఉంది. జాతీయ స్థాయిలో కూడా మన సంఖ్యాబలానికి తగిన దామాషాలో రాజకీయ ప్రాధాన్యం, గౌరవం, నిధులు, ప్రాజెక్టులు లభించడం లేదని తెలుసుకదా.

(2) మనకు మాత్రమే ఉన్న అవలక్షణం మాతృభాషపై ఉండాల్సినంత గౌరవం, ఆదరణ లేకపోవడం. తర్వాతి తరాలవారికి భాషాభిమానం కల్పించే ప్రయత్నం చేయకపోగా, వారి పరంగా నిరాదరణను ప్రోత్సహించడం 'మనోళ్ల'కే చెల్లు అన్యభాషా మాధ్యమాల్లో పిల్లలకి ప్రాథమిక స్థాయి నుంచి చదువులు చెప్పించడం మనలో అధిక సంఖ్యాకులు తెలిసీ చేస్తున్న పాపం. కొన్ని సంవత్సరాల క్రితమే, యునెస్కో వారు రానున్న కొద్ది దశాబ్దాలలో తెలుగు మృత భాషగా మారనున్నదనే హెచ్చరిక చేసినా మనకు చీమకుట్టినట్లైనా లేదు. దాదాపు 30 శాతం మందికి ఆ భాషలో రాయడం, చదవడం రాకపోతే, అది త్వరలో అంతరించిపోతుందన్న ప్రామాణికతను మనం ఇప్పటికే సాధించాం.
ఎలాగంటే, ఇతర రాష్ట్రాలలో విదేశాల్లో ఉన్న ఎనిమిది కోట్ల మంది తెలుగువారిలో, వారి వారసుల్లో దాదాపు సగం మందికి తెలుగు రాయడం, చదవడం సంగతలా ఉంచి మాట్లాడడమూ అంతంత మాత్రమే. మన రాష్ట్రంలోను సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 10 కోట్ల మంది తెలుగువాళ్లలోనైనా రాయడం, చదవడం వచ్చిన వాళ్ల శాతం సంగతలా ఉంచి, ఇష్టంగా స్వచ్ఛంగా మాట్లాడే వాళ్లెంతమందో చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి. కాబట్టి ఇప్పటికే తెలుగు సగం చచ్చిపోయి ఉంది. మృత భాషగా మిగిలి పోకూడదంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రవాసాంధ్రులు భాషాంతరీకరణం చెందకుండా మనవంతు సహకారం అందించాలి. ఈ విషయంలో తమిళ సోదరులను ఆదర్శంగా తీసుకోవాలి.

(3) అన్యభాషలపై మోజు: ఇది మనకున్న మరో పెద్ద అవలక్షణం. ఇతర భాషలను నేర్చుకోవడం తప్పుకాదు, మాతృభాషకే పెద్ద పీట వేసినంత వరకు తెలంగాణ ప్రజాకవి కాళోజీ 'అన్యభాషలు నేర్చి ఆంధ్రము రాదని సకిలించువేందిరా' అని అందుకే మనల్ని తిట్టేరు. ఇతర భాషల వారు కూడా అన్యభాషా పదాల్ని అవసరమైన మేరకు ఆహ్వానిస్తారు. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో మన హిందీ పదాలు, ఘెరావ్‌, బంద్‌ వంటివి చేరేయి కానీ వాళ్లు తమ భాషలో సరైన పదాలు లేకపోతేనే ఆ పని చేస్తారు. కానీ మనం అలాకాదు. మనకున్న మంచి పదాల స్థానంలో వాటిని నెత్తికెక్కించుకుంటాం. పాలకుల, ఇతరుల ప్రాపకం కోసం మన ఊళ్లపేర్లు కూడా మార్చేసుకున్నాం. ఊళ్లకు, పట్టణాలకు ఉర్దూ పేర్లు తెలంగాణాలో మాత్రమే ఉన్నాయనుకోవద్దు. ఉర్దూ పేర్లున్న ఊళ్లెన్నో సీమాంధ్రలో ఉన్నాయి. ఆంగ్లేయులు తమ సౌకర్యం కోసం, రాజమండ్రి, బెజవాడ అని మార్చిన పేర్లు మనకింపుగానే ఉన్నాయి ఇంకా.

(4) ప్రాంతీయ తత్వం: ఇతరులకన్న ఎంతో అధికంగా మనకున్న మరో అవలక్షణం ప్రాంతీయ దురభిమానం సొంత ఊరుని ప్రేమించడం తప్పుకాదు. కానీ ఉంటున్న ఊరుని, అక్కడి సంస్కృతీ, సంప్రదాయాల్ని సంపూర్ణంగా అలవరచుకోలేకపోయినా గౌరవించాలి. అన్నిప్రాంతాల తెలగువాళ్లకీ ఈ సుగుణం తగుస్థాయిలో ఉండదన్నది వాస్తవం. అందుకే విభజనవాదులు స్థానికులకి, స్థిరపడిన వారికి మధ్య విభేదాలు సృష్టించడంలో కొంతమేరకు సఫలమయ్యారన్నది గ్రహించాలి.

(5) ప్రాంతేతర బంధాలపై విముఖత తమిళులు కానీ, ఇతర భాషల వారు కానీ, ఎక్కడ కలుసుకున్నా తమ భాషలోనే మాట్లాడుకుంటారు. ఏ ప్రాంతం వాళ్లవెరన్న దానికి అసలేమీ ప్రాధాన్యమివ్వరు. మనోళ్లు అలాకాదు. విదేశాల్లో ఉన్న వాళ్లలో కూడా ఒక ప్రాంతం, జిల్లా వాళ్ల మధ్యనే ఎక్కువ సౌహార్దం ఉంటుంది. మతపరమైన కట్టుబాట్లు, కులాల కుంపట్లు కూడా తెలుగువాళ్లలో అధికం. ప్రాంతీయ భావాలు మరీ ఎక్కువ. ఒక ప్రాంతం వాళ్లు అన్యప్రాంతాల వాళ్లతో వైవాహిక బంధాలకి అంతగా ఇష్టపడరు. మతాంతర, కులాంతర వివాహాలు జరుగుతున్న స్థాయిలోనైనా తెలుగువాళ్లలో ప్రాంతేతర వివాహాలు జరగడం లేదు. అసలు జరగడం లేదని చెప్పలేం కానీ, ఆ రోజుల్లోనే హైదరాబాద్‌ వాసి, మాజీ కేంద్ర మంత్రి పుంజాల శివశంకర్‌, విజయనగరం జిల్లా వాసి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి కుటుంబంతో వివాహబంధం ఏర్పరచుకొన్నారు. ఇది మర్చిపోని సీమాంధ్రులు ఆయన్ని తెనాలి నుంచి ఎంపి గా గెలిపించుకున్నారు. వర్తమానకాలంలో కూడా మహబూబ్‌నగర్‌ మంత్రి డి.కె.అరుణ, మొగల్తూరు మొనగాడు చిరంజీవి, కృష్ణా జిల్లా కోనమేరు రంగారావు, తెరాస దళిత నేత చంద్రశేఖర్‌ల కుటుంబాలు ఇతర ప్రాంతాలతో వియ్యమందాయి. 

కానీ ఇలాంటి ప్రాంతేతర వివాహాలు బహు అరుదుగానే ఉంటున్నాయి.అమెరికాలో ఉన్న అమలాపురం కుర్రాడు, ఆస్ట్రేలియాలోని ఆదిలాబాద్‌ పోరడు, తమ తల్లిదండ్రులతో, మనవైపు సంబంధమే చూడమనే చెప్తుంటాడు! పూర్వం మొఘలులు, రాజ్‌పుత్‌లతో వైవాహిక బంధాలనేర్పరుచుకుని సత్ఫలితాలు సాధించారు. అలానే ఆంగ్లేయులు, ఫ్రెంచ్‌ వారితో, ఇతర యూరోపియన్లతో వివాహబంధాల ద్వారానే వారికి తమపట్ల ఉన్న వైషమ్యాన్ని తగ్గించగలిగారు. కాబట్టి తెలుగువాళ్లలో కూడా ప్రాంతాంతర వివాహాలు ఇంకా ఎక్కువగా జరిగితే బాగుంటుంది. తర్వాతి తరాల వారిలోనైనా ప్రాంతీయ విభేదాలు తగ్గుతాయి. స్వల్ప సాంస్కృతిక తారతమ్యాలను భూతద్దంలో చూసే దుర్గుణం కూడా తగ్గుతుంది.

ఈ తెలుగు తెగుళ్లన్నీ త్వరలో మాసిపోయి, పాత చరిత్ర అయిపోతుందని ఆశిద్దామా?!


-చేగొండి రామజోగయ్య 
విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్ర మహాసభ సభ్యులు

సోమవారం 13 ఫిబ్రవరి 2012

భాషాప్రయుక్త రాష్ట్రాల విధానం వీడితే దేశ సమగ్రతకే ముప్పు : విశాలాంధ్రమహాసభ సదస్సులో వక్తలు



మొగల్రాజపురం, న్యూస్ టుడే: విభజన పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న స్వార్థపరుల కుట్రను భగ్నం చేయాల్సిన అవసరం అందరిపైనా ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. విశాలాంధ్రమహాసభ అధ్వర్యంలో సనివారం మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా వర్కుషాపులో పలువురు సమైక్యవాదులు పాల్గొని, తమ వాణీని వినిపించారు. విడిపోవడానికి తెలంగాణవాదులు 100 కారణాలు చెబితే రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలో తాము వెయ్యి కారణాలు చూపుతామంటూ సవాల్ విసిరారు.రాష్ట్ర విభజన కోసం  జరుగుతున్న యత్నాలను ఆందోళనకారులను మహాసభ తీవ్రంగా ఖండిస్తోందని, విభాజనవాదులు చేస్తున్నవన్నీ కేవలం అసత్యాలు, అభూతకల్పనలని, 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాలలో గణనీయమైన అభివృద్ధి జరిగిందనేది నిర్వివాదమని, ఒక ప్రాంతంలో ఆర్ధికపరమైన సమస్యలకు విభజన పరిష్కారమని ఆందోళన చేపట్టడంలో అర్థం లేదని, భాషాప్రయుక్త రాష్ట్రాలు దేశఐక్యతకు పట్టుకొమ్మలని, భాషాప్రయుక్త రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ అవతరణ అంకురార్పణ చేసిందని, భాషా ప్రయుక్త రాష్ట్రాల విచ్ఛిన్నం దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రమాద హేతువని, దేశంలో ఏ భాషాప్రయుక్త రాష్ట్రాన్ని కూడా విభజించే ఆలోచనను భారత  ప్రభుత్వం చేయరాదంటూ పలు తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా విభజన పేరుతో కొన్ని నెలల కిందట తెలంగాణవాదులు సృష్టించిన బీభత్సకాండ, భౌతికదాడులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రతీఒక్కరినీ ఆలోచింపజేసింది. పలువురు విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించి వేర్పాటువాదుల చేతుల్లో రాష్ట్రం అగ్నిగుండంగామారిన దృశ్యాలను చూసి చలించిపోయారు. మిలియన్ మార్చ్ సందర్భంగా విగ్రహాల విధ్వంసం,రాజధానిలో చెలరేగిన విధ్వంసకాండ, రాష్ట్ర ప్రథమ పౌరుడిపైన , లోక్ సత్తా అధినేతపైన దాడి,బస్సులు , రైళ్లపై ఆందోళనకారుల ప్రతాపం, వరుస సమ్మెలు, బంద్ లతో జనజీవనం అస్తవ్యస్తం , ఒస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సంఘ వ్యతిరేకుల తిష్ట, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసం ...ఇలా పలు చిత్రాలతో పాటు తెలంగాణ అభివృద్ధిపై స్పష్టమైన గణాంకాలతో ఏర్పాటు చేసిన అందర్నీ ఆలోచింపజేసింది. 

దీనిలో పాల్గొన్న వక్తలు ఎవరేమన్నారంటే... 

గణాంకాలు తప్పుల తడకలు : పరకాల ప్రభాకర్ , ప్రధాన కార్యదర్శి , విశాలాంధ్ర మహాసభ
తెలంగాణవాదుల వాదన మొత్తం అసత్యంతో కూడుకుంది. వారు చూపుతున్న గణాంకాలన్నీ తప్పుల తడకలే. విశాలాంధ్ర మహాసభ సభ్యుల్లో ఎక్కువమంది నైజాం ప్రాంతానికి చెందినవారున్నారు. తెలంగాణ ప్రజల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నవారు ఎక్కువ మంది ఉన్నారు.ఈ విషయాన్ని ప్రశ్నించే వారిపై భౌతికదాడులకు పాల్పడడంతో ఎవరూ బయటకొచ్చి మాట్లాడే సాహసం చేయడంలేదు. రానున్న కాలంలో ఈ ప్రదర్శనను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహిస్తాం
సమైక్యవాదం వినిపిస్తాం : నలమోతూ చక్రవర్తి, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు 
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎదాదికాలంగా కృషి చేస్తున్నాం.అందులో భాగంగానే ఢిల్లీ తరువాత ప్రదర్శనను హైదరాబాద్, విజయవాడల్లో ఏర్పాటు చేశాం. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది.
విభజన జరిగితే తెలుగు ఉనికికే నష్టం: ఆంజనేయరెడ్డి, రాష్ట్ర మాజీ డీజీపీ
కొందరు స్వార్థపరులు విభజన యత్నం కోరడం బాధాకరం. విభజన జరిగితే తెలుగు ఉనికికే నష్టం వాటిల్లుతుంది. రాజకీయాలకతీతంగా కలిసో సమైక్యవాదం వినిపిస్తాం
తాత్కాలిక ప్రయోజనాల కోసమే : నరసింహారావు, విశాలాంధ్ర మహాసభ అడ్వైజర్ 
ప్రధాన రాజకీయ పక్షాలన్నీకలిసి భయంకరమైన కుట్ర చేశాయి. తాత్కాలిక ప్రయోజనాల కోసమే విభజన యత్నం చేస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని చీల్చాల్సిన అవసరం లేదు.
ఇటువంటి ప్రదర్శనలు అవసరం : అడుసుమిల్లి జయప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే 
విభజన పేరుతో తెలంగాణవాదులు దాడులకు పాల్పడినప్పటికీ సమైక్యంగా ఉద్యమం సాగించడం అభినందనీయం. రాగద్వేషాలు పక్కన పెట్టాలి. ఇటువంటి ప్రదర్శనలు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాయి.
విభజనకు ఎక్కువమంది అనుకూలం కాదు: రామజోగయ్య, విశ్రాంత బ్యాంకు అధికారి,సమైక్యవాది 
తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదులందర్నీ అభినందించాలి. విభజన కోరేవారిలో ఎక్కువమంది అనుకూలురు కారు.ఉద్యమం ముసుగులో కొందరు స్వార్థపరులు కుటుంబ ఆస్తులను పెంచుకుంటున్నారు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.





 
భౌతికదాడులు దారుణం: శ్రీనివాసరెడ్డి, మహాసభ సభ్యులు, కరీంనగర్ 
స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. సమైక్యతా అన్నవారిపైన భౌతికదాడులకు తెగబడడం దారుణం. కొందరు రాజకీయ పార్టీల నాయకులు విభజన పేరుతో కబ్జాకు యత్నిస్తున్నారు
కనువిప్పు కలగాలి : వేములపల్లి వామనరావు, స్వాతంత్య్ర సమరయోధులు
రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూడడం సమంజసం కాదు. వాస్తవం తెలుసుకొని మాట్లాడాలనుకునేవారికి ఈ ప్రదర్శన కనువిప్పు కలిగిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో నాకు చాలా బాంధవ్యం ఉంది. 60 ఏళ్ళ పాటు ఖమ్మంలోని ఓ గ్రామంలో వ్యవసాయం చేశాను. పడి ఊళ్లలో ఉపాధ్యాయునిగా పనిచేశాను.రాజకీయ పార్టీల నాయకులు ఆత్మస్తుతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బయటకు చెప్పేది ఒకటైతే మనస్సులో మరొకటి ఉంటుంది.

ఇతర మీడియా కథనాలు
ఆంధ్రజ్యోతి : రాష్ట్ర విభజన ప్రమాదకరం

ఆంధ్రభూమి: భాషాప్రయుక్త రాష్ట్రాల విధానం వీడితే దేశ సమగ్రతకే ముప్పు

విశాలాంధ్ర : ప్రాంతీయ విద్వేషాలు పక్కన పెట్టి...

సాక్షి: విశాలాంధ్ర సభ సమైక్యతా సమరం

ప్రజాశక్తి:  రాష్ట్ర సమగ్రతే ఆశయం

సూర్య: ప్రాంతీయతత్వం విడనాడదాం

 
 

గురువారం 9 ఫిబ్రవరి 2012

ఫిబ్రవరి 11 న విజయవాడలో 'విశాలాంధ్రమహాసభ' సదస్సు మరియు ప్రదర్శన

మిత్రులారా,

‘విశాలాంధ్ర మహాసభ’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడడం కోసం కృషి చేస్తున్న సంస్థ. రాజకీయాలకు అతీతమైనది. ‘విశాలాంధ్ర మహాసభ’ తెలంగాణ, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలకు చెందిన మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు మరియు సమాజశ్రేయస్సు కోసం కృషి చేస్తున్న అనేకమంది వ్యక్తులు కలిసి స్థాపించిన సంస్థ.

మనరాష్ట్రంలో జరుగుతున్న వేర్పాటువాద ఆందోళన, హింస మరియు విధ్వంసక చర్యలను ప్రోత్సహిస్తూ, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురైయ్యారన్న అసత్య ఆరోపణల ఆధారంగా సాగుతున్నది. విభజనవాదులు అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.మా ఉద్దేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఆందోళన పూర్తిగా అసమంజసమైనది.

ఈ సందర్భంలో, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యతను కాపాడుదాంఅనే అంశం పై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ నిర్వహించతలపెట్టింది. మన రాష్ట్రానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక మరియు చారిత్రక నిజాలను మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ ద్వారా ప్రజల ముందుకు తేవడం యీ ప్రయత్నం యొక్క ముఖ్య ఉద్దేశం.

వేర్పాటువాద ఆందోళన ప్రచారం చేస్తున్న నిందలు,అవాస్తవాలు,వక్రీకరణలు, అసత్యాలను ఖండించి నిజానిజాలను తెలిసుకోవడంలో మా యీ ప్రయత్నం సహాయపడుతుందని ఆశిస్తున్నాము.

సదస్సు 1:
ఫిబ్రవరి 11, 11.00 AM – 1.00 PM
సదస్సు 2:
ఫిబ్రవరి 11,  3.00 PM – 5.00 PM
   ప్రదర్శన
   ఫిబ్రవరి 11, 11.00 AM- 5.00 PM
 

వేదిక:సిద్ధార్థ ఆడిటోరియం,పి.బి.సిద్ధార్థ కాలేజి             మొగల్ రాజ్ పురం, విజయవాడ
              





ఇట్లు,
నలమోతు చక్రవర్తి
ప్రెసిడెంట్, విశాలాంధ్రమహాసభ 


బుధవారం 8 ఫిబ్రవరి 2012

ఎవరి 'పన్నాగం' వారిది !

ఆంధ్రప్రభ వ్యాసం:  'పెడదారి వీడడానికి మరికొంత సమయం 'మాగ్గావాలె', ప్రస్తుతానికి మాత్రం 'మా తెలంగాణ మాగ్గావాలె' అని పైకి అంటూనే ఉంటం. అంతిమంగా, ఇవ్వకపోయినా 'ఫర్వాలె' గానీ ఇప్పటికిప్పుడే ఇవ్వమని మరీ స్పష్టంగా చెప్పొద్దు, కుండబద్ధలు గొట్టొద్దు' అని బతిమాలుకుంటున్న మన విభజనవాదుల (తమతో రహస్య ఒప్పందం ఉన్న దొరవారితో సహా) ఆక్రందనలకి, 'అఖిల భారత కాంగ్రెస్‌' కొంత కరుణించిందనుకోవడానికి ఆస్కారమిస్తున్న పరిణామమొకటి గతవారం చోటుచేసుకుంది. అది ఒక రకంగా గొంతులో పచ్చివెలక్కాయపడ్డ రీతిలో ఉన్నా, ఎప్పుడూ మిశ్రమ భాషలో కేకలేసే కెకెతో సహా తెలంగాణ వాదులెవరూ దానిపై పెద్దగా స్పందించలేదు. దొరవారూ కోప్పడలేదు, వీర విభజనవాదులూ పట్టించుకోలేదు. అంతగా రుచించకపోయినా సమైక్యవాద నేతలూ మౌనం దాల్చారు. ఇంతకీ ఆ పరిణామమేమంటే, 31, జనవరి, 2012న అఖిల భారత కాంగ్రెస్‌ కేంద్రమంత్రి సిబాల్‌, తదితరుల ద్వారా విడుదలైన, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రణాళిక (వాగ్దాన) పత్రంలో తెలంగాణ సమస్యపై చేసిన ఒక క్లుప్త ప్రస్తావన! ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు వున్న ప్రాధాన్యం దృష్ట్యా, అందులో ప్రస్తావించిన ఏ ఒక్క విషయమూ సోనియా, రాహుల్‌ గాంధీల ప్రమేయం, పూర్వానుమతి, 'గేమ్‌' ప్లాన్‌ల ప్రభావం లేకుండా చోటు చేసుకుందని భావించలేం. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ వాగ్దానాల పత్రంలో స్థానం సంపాదించిన ఆ క్లుప్త ప్రస్తావన లోని గుప్తార్థాన్ని విశ్లేషించుకోవాలంటే, దాన్ని యధాతథంగా, తెలుగులోకి అనువదించుకోవాలి. చిన్నదైనా, ఆ పేరానంతా ఒక్కసారే పూర్తిగా కాకుండా ఒక్కోవాక్యాన్ని (ఉన్నవే నాలుగు) అనువదించుకుంటూ అధికార పార్టీ అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిద్దాం.

మొదటి వాక్యం ఇలా ఉంది. 'మెరుగైన పరిపాలన, అమలు యంత్రాంగం సమర్థ వినియోగం కోసం 'చిన్న రాష్ట్రాలు' అవసరం ఐతే కావచ్చు. ఇందులో చివరి పదం 'కావచ్చు' అన్నదే బహుకీలకం, 'కాకపోవచ్చు' అన్న భావం కూడా ఇందులో ఇమిడి ఉంది! (మే ఆల్సో మీన్స్‌ మే నాట్‌!) స్పష్టమైన విధాన నిర్ణయం కాదు. సందేహం పాలే ఎక్కువగా ఉంది. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లోని విభజనవాదులకు ఒక హెచ్చరిక కూడా ఉంది ఇందులో. ప్రత్యేకంగా తెలంగాణ వాదులకిదో చురక. కీలెరిగి పెట్టిన వాత కూడా! ఔను మరి, 'మనోళ్లు' పదే పదే వల్లించే చిన్న రాష్ట్రాల మంత్రం లేదా చెప్పే ఏ ఇతర కారణాన్ని వర్తింపజేసినా, హైదరాబాద్‌నీ, ఒక ప్రత్యేక రాష్ట్రంగా, ఆ మాటకొస్తే తెలంగాణ ప్రాంతాన్ని ఎన్నో చిన్ని, చిట్టి రాష్ట్రాలుగా చీల్చాల్సివస్తుంది గదా, 'చిన్న' అనే దానికి ప్రామాణికత ఏముంది? 

ఇక రెండో వాక్యం, 'ఒక కొత్త రాష్ట్రం లేదా రాష్ట్రాలను ఏర్పాటు చేసే క్రమంలో అనేక సంక్లిష్ట సమస్యలను ఆహ్వానించరాదు'. పొయ్యిమీద నుంచి పెనంలో పడే ఉద్దేశం లేదని ఆ మధ్యన, సాక్షాత్తు ప్రధానమంత్రి మన్మోహన్‌, అన్నదాన్నే ఇంకా స్పష్టంగా ప్రతిబింబిస్తోందీ రెండో వాక్యం. మొదటి వాక్యాన్ని మాత్రం చదివి మురిసిపోయే వాళ్లెవరైనా ఉంటే, గింటే వారికిదో చేదుమందు, మంటపుట్టించే మాత్ర. నా చెవిలో 'ఇస్తనని' చెప్పేరులే అని ఇంకా అంటున్న వారికో చెంపపెట్టు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎప్పటికైనా ఇస్తదిలే అని గప్పాలు కొడుతున్న టి.కాంగ్రేస్సోళ్ల కప్పుల్ని, గొప్పల్ని బద్ధలు చేస్తున్న సుతిమెత్తని దెబ్బ. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎప్పుడూ తెలంగాణ 'ఇస్తనని' చెప్పనే లేదు, కాంగ్రెస్‌ పార్టీ 2004లో తెరాసతో కుదుర్చుకున్న లిఖిల ఒప్పందంలో కానీ ఏ ఎన్నికల ప్రణాళికలో కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని నిర్దిష్టంగా చెప్పలేదు.రాష్ట్రంలో, దేశంలో ఏకాభిప్రాయం వంటి షరతులతోబాటు, విభజన మూలంగా సంభవించే పలు సమస్యలను, కాంగ్రెస్‌ పార్టీ, అధికార ప్రతినిధులు, కేంద్ర మంత్రులు పలు సందర్భాల్లో పేర్కొంటూనే ఉన్నారు. విభజన కుదరదని పరోక్షంగా చెబుతూనే వచ్చారు. 'అమ్మో నీకదిస్తే ఎన్నో వినాశకర పరిణామాలుంటాయి, నీకూ, నాకూ, అందరికీ' అంటే 'ఇవ్వను' అని చెప్పడమే కదా! 

ఆ బుల్లి పేరాలోని మూడోవాక్యాన్ని పరిశీలిద్దాం, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి సంబంధించిన డిమాండ్లన్నింటినీ రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిటీ ద్వారా భావోద్వేగాలకతీతంగా చర్చించవలసిన అవసరముంది', దీని అర్థం ఏమిటి? 'మాది మాగ్గావాలె' అంటే కుదరదు. ఇదో జాతీయ సమస్య, మొత్తం దేశానికి ఒకే విధానం ఉండాలి అనేకదా! మేము ఏ మోసమూ చేయలేదు, 1999లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఇదే చెప్పాం 2004లో తెరాస కూడా లిఖిత పూర్వకంగా ఎస్సార్సీకి ఒప్పుకుంది. మాదెప్పుడూ ఒకటే మాట, అది ఎస్సార్సీ బాట అని చెప్పుకునే అవకాశం కాంగ్రెస్‌కు ఉంది కదా. 'భావోద్వేగాలకతీతంగా' అన్నమాటను ఇప్పుడు అదనంగా కలిపారు. సెంటిమెంటు (అబద్దాలు చెప్పి చెప్పి దొరవారు, అనుయాయులు రగిల్చిన మంటే తప్ప, నిజానికి ఇది విస్తృత ప్రజాభిప్రాయం కానేకాదు!) 'గింటిమెంట్‌ జాన్తానై' అన్న బేఖాతరు మాదిరి నిర్ణయం ఉంది ఇందులో. విభజనవాదులకీ ఇది తెలుసు. రెండో ఎస్సార్సీ విషయాన్ని పరిశీలిస్తే, మొదటి ఎస్సార్సీ నిర్ణయాన్నే పునరుద్ఘాటిస్తూ, కలపాలని అది చెప్పింది. కలిసే ఉండాలని నిష్పక్షపాతంగా ఉండే ఏ ఇతర నిపుణుల కమిటీ అయినా, మరోసారి చెబుతుందని తెలుసుకాబట్టే ఎస్సార్సీ, గిస్సార్సీ వద్దంటారు విభజనవాదులు. 

ఇక ఆఖరి వాక్యం ఇలా ఉంది. 'ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సమస్యకు (అంటే తెలంగాణతో సహా అన్ని ఇతర రాష్ట్రాలలోని విభజన డిమాండ్లను ఏక మొత్తంగా) పరిష్కారం చూపేందుకు రెండో ఎస్సార్సీ వేయమని కేంద్రాన్ని కోరతాం', శభాష్‌! ఇందులోనే ఉంది, 125 సంవత్సరాల అనుభవం, రాజకీయ చతురత. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి కాంగ్రెస్‌ రాదని అందరికీ తెలుసు.మహాఅయితే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం లభించవచ్చేమో కానీ, అంతకు మించి జరిగేదేమీ లేదు, భాజపా కూడా తెలంగాణ విషయంలో 1999లో అలానే అంది, సంకీర్ణ సంకటాల మూలంగా ఇవ్వలేమంటూ అధికారంలో ఉన్నప్పుడు తప్పించుకుంది. ఎలానూ అధికారంలోకి రాలేములే, అన్న భరోసాతో మళ్లీ ఇప్పుడు ఇస్తానని అంటోంది. సరే ఇదంతా అలా ఉంచి, ఈ వాక్యంలో ఇమిడి ఉన్న కాంగ్రెస్‌ 'గేమ్‌ ప్లాన్‌' ని అర్థం చేసుకోవద్దా? ఇస్తామన్న హామీ లేనే లేదు. ఎస్కేప్‌ రూటుని ఉంచుకుంటున్నారు కదా. ఎస్సార్సీ సిఫార్సులని యధాతథంగా అమలు చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు.

అయినా ఏ ఎస్సార్సీ. ఏ భాషాప్రయుక్త రాష్ట్ర విభజనకూ అనుకూలంగా సిఫార్సు చేసే అవకాశం లేదు. ఒకవేళ చేసినా విభజన ప్రతిపాదన పార్లమెంటులో గట్టెక్కే పరిస్థితి ఉండదు. తెలంగాణ కొరివితో తమ సొంత రాష్ట్రాల సమగ్రతకు చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని అన్ని ఇతర రాష్ట్రాల ఎంపీలు (వారేపార్టీవారైనా సరే), అడ్డుకుని తీరుతారు. సంకీర్ణ సంకాటాలు ఎలానూ ఉంటాయి. కాబట్టి ఏతావాతా చూస్తే తెలంగాణ సమస్యను మరి కొంతకాలం నాన్చి తుదకు విభజనేతర పరిష్కారాన్ని సాధించాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ గేమ్‌ప్లాన్‌ అని అర్థమవుతోంది కదా! 

యుపి గురించే ఇదంతా వచ్చింది కాబట్టి మాయావతి గేమ్‌ ప్లాన్‌ సంగతీ చెప్పుకోవాలి. కేవలం ఎన్నికల్లో లబ్దిపొందే ధ్యేయంతోనే యుపిని విభజించాలని ఆమె ప్రతిపాదించిందే తప్ప చిత్తశుద్ధి, లక్ష్యసిద్దితో కాదని అందరికీ తెలుసు.ఇప్పటికే ఆమెకు కొంత జ్ఞానోదయమై, ఎన్నికల ప్రచారంలో విభజనాంశాన్ని పెద్దగా ప్రచారం చేయడం లేదు. అధికారంలోకి వచ్చినా, రాకపోయినా చంచల స్వభావురాలైన మాయావతి ఎన్నికలైన తర్వాత తన రూటు ఎలాగైనా మార్చుకోగలరు. 

ఇక దొరవారి గేమ్‌ ప్లాన్‌ కూడా మనకు తెలిసిందే. తనకు, తన కుటుంబానికి రాజకీయ, ఆర్థిక, రక్షణ ప్యాకేజీ కోసమే ఆయన ప్రయత్నమంతా, అందుకే సంక్రాంతి వెళ్లాక ఇప్పుడు 'మార్చి' అంటున్నారు, కేవలం ప్రజలను ఏమార్చడానికే! టి. కాంగ్రెస్సోళ్ల గేమ్‌ ప్లాన్‌ ముందే చెప్పుకున్నాం. టిటి దేశం వాళ్ళు, 'ఇస్తే ఇచ్చుకోండి' అని పైకి అంటున్నా, ఇవ్వకపోతేనే మంచిదన్నది వాళ్ల ఆకాంక్ష. ఇలా ఎవరి గేమ్‌ ప్లాన్‌ వారి కున్నా అంతిమంగా విభజనేతర పరిష్కారమే అందరూ కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది.

-చేగొండి రామజోగయ్య 
విశ్రాంత బ్యాంకు అధికారి, 'విశాలాంధ్రమహాసభ' సభ్యులు

మంగళవారం 7 ఫిబ్రవరి 2012

విజయవాడ, తిరుపతిలలో 'విశాలాంధ్రమహాసభ' సమావేశాలు

ఢిల్లీ, హైదరాబాద్ లలో విజయవంతంగా తన వాదనను వినిపించిన 'విశాలాంధ్రమహాసభ' ఈ నెల విజయవాడ, తిరుపతిలలో ‘రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం’ అన్న అంశంపై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ నిర్వహించబోతుంది.

ఆంధ్రజ్యోతి: రాష్ట్ర సమైక్యతను పరిరక్షించేందుకు విశాలాంధ్ర మహసభ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు.ఈనెల 11 న విజయవాడలో, 25న తిరుపతిలో సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తన వాదనను చెప్పుకునే స్వేచ్ఛ ఉందని, తెలంగాణను వ్యతిరేకించే వారిపై దాడులు, హెచ్చరికలు సరికాదని ప్రభాకర్ అన్నారు.

శనివారం 4 ఫిబ్రవరి 2012

నొప్పించకండి!

ఆంధ్రప్రభ వ్యాసం : ఇంకో పది, పదిహేను రోజుల్లో మన రాష్ట్ర శాసనసభ శీతాకాలం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి మరీ వారం పదిరోజులకు పరిమితం కాకుండా, ఏకంగా నెల రోజులకు పైనే జరుగుతాయి. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు కూడా వచ్చేనెల మొదటివారంలో ప్రారంభం కానున్నాయి. ఈ మధ్యకాలంలో మన రాజకీయ నేతలే కాదు పార్టీలు కూడా వాద ప్రతివాదాల ముసుగులో ఎంత విపరీతంగా, అసభ్యంగా పరస్పరం దూషించుకుంటున్నాయో చూస్తున్నాం వింటున్నాం. విమర్శను ఎదుర్కోవడానికి, ప్రత్యర్థుల వాదాన్ని తిప్పికొట్టడానికి, తిట్ల పురాణాన్ని ఆశ్రయించటం తప్పని సరన్న రీతిలో అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మన రాజకీయ నేతలు, ఉద్యమకారులు (రాజకీయ, ఆర్థిక, సామాజిక, సమైక్య, విభజన, వర్గ ప్రయోజన, ఇలా ఉద్యమం ఏదైనా కానీండి) కొంత హాస్య ప్రియత్వం, సమయస్ఫూర్తి, సందర్భ శుద్ధి నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది. అందుకే ఈ వారం 'రిపార్టీ' కళ గురించి చెప్పుకుందాం.

నవరసాలలో హాస్యం అందరికీ ఇష్టమైందని తెలిసిందే. హాస్యం లాస్యం చేసే 'రిపార్టీని' కూడా అందరూ మెచ్చుతారు. 'రిపార్టీ' అనే ఆంగ్లపదానికి నిఘంటువులో ఉన్న అర్థం -తెలివిగా, హాస్యాన్ని జోడించి వెంటనే ఇచ్చే జవాబు -ఇది సమస్త ప్రజల్ని మెప్పించి, నవ్వించటంతో బాటు, కువిమర్శ చేసిన ప్రబుద్ధుణ్ణ నవ్వులపాలు చేసే, అతడికి కూడా నవ్వితీరాల్సిన (ఏడ్వలేకే) అనివార్యత కల్పించే ఒక చమత్కార ప్రక్రియ -ఇదేదో ఆంగ్లేయులే మనకి నేర్పించారనుకోరాదనడానికి, మన ప్రాచీన సాహిత్యంలో కూడా కొన్ని ఉదాహరణలున్నాయి.

ఒక్కటే చెప్పుకుందాం 'తెనాలి రామకృష్ణుడు కోడిపెట్టను ఒళ్లో పెట్టుకుని ఉన్న 'మొల్ల'ను ఏదో అశ్లీలంగా అడిగితే, ఆమె సాంతంగా 'నేనమ్మనుగా' అంటుంది -నీకు మాతృ సమానురాలిని, విక్రయించను అనే అర్థాల్లో -సరే ప్రస్తుతాంశం చట్టసభలలో, వాద ప్రతివాదాల్లో చర్చల్లో హాస్యం లాస్యం చేయాలన్న దాని గురించి కాబట్టి, ప్రజాస్వామ్య విధానాలకి 'మూలపుటమ్మ' లాంటి బ్రిటిష్‌ పార్లమెంటులో నవ్వులు పూయించిన ఉదంతాల గురించి, ముందుగా కొన్ని చెప్పుకుని, తర్వాత మన దేశానికి, రాష్ట్రానికి వద్దాం -హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ (బ్రిటన్‌లో దిగువసభ) లో ఒకసారి చర్చ సందర్భంగా సభా నాయకుడు గ్లాడ్‌స్టన్‌కి విపరీతమైన ఉక్రోషం వచ్చి 'డిజ్రేలి' (ప్రతిపక్ష నాయకుడు) తో ఇలా అన్నాడు 'నువ్వు ఎప్పటికైనా ఏదో గుడిసెలో భయంకరమైన సుఖవ్యాధితో దిక్కులేని చావు చస్తావ్‌ -తప్పదు'. దానికి డిజ్రేలీ అతిశాంతంగా 'ఆ ఖర్మ నాకు నీ విధానాల్ని గానీ, నీ భార్యని గానీ కౌగిలించుకుంటే మాత్రమే సంభవిస్తుంది -అలా చేయనులే' అన్నాడు. ఈ జవాబుతో ప్రత్యర్థికి చావురాలేదు గాని, ముఖంలో ప్రేతకళ వచ్చింది. అయినా నవ్వాల్సి వచ్చింది. 

మన పార్లమెంటుకి వద్దాం. బ్రిటిష్‌ వారి కాలంలో, మన పార్లమెంటులో పాలకుల తాబేదార్లే ఎక్కువమంది ఉన్నప్పుడు బిపిన్‌ చంద్రపాల్‌కి ప్రసంగించే అవకాశం వచ్చింది.ఆయన గొప్ప వక్తే గాని, పార్లమెంటుకి ఎన్నికైన తర్వాత చేస్తున్న తొలి ప్రసంగం అదే కాబట్టి కొంత తత్తరపాటుకిగురై, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి హెచ్చు స్వరంలో మాట్లాడసాగేరు. సభా నాయకుడు 'సర్‌ మాల్కొమ్‌హైలీ' ఆయన్ని అపహాస్యం చేయాలన్న ఉద్దేశంతో తన చెవుల్ని రెండు చేతుల్లో మూసుకున్నాడు. అది చూసిన ఇతర సభ్యులు పాల్‌ని గేలి చేయడానికి చప్పట్లు కొట్టేరు. అప్పుడు పాల్‌ ఒక్క క్షణం మాత్రం మౌనం వహించి, వెంటనే ఇలా అన్నారు. 'ప్రజలగోడు పట్టని' వినపడని చెవిటి ప్రభుత్వానికి ఏం చెప్పాలన్నా గట్టిగా అరవాల్సి వస్తోంది'. దాంతో హైలీ చేతులు చెవులమీద నుంచి తొలగిపోయాయి, అందరూ ఆయన ప్రసంగాన్ని కిమ్మనకుండా విన్నారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు ఓ ప్రతిపక్ష సభ్యురాలు తను ప్రధానికి రోజుకో ఉత్తరం రాస్తున్నా అసలేం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ 'నా ఉత్తరాల్ని చించి చెత్తబుట్టలో పారేస్తున్నారా' అని నిలదీసింది. దానికి శాస్త్రీజీ అమాయకంగా ముఖం పెట్టి' 'మీకెలా తెలిసిందో గాని నిజమేనండి. మీ ఉత్తరాల్ని వచ్చినవి వచ్చినట్లుగా చించి పడేస్తున్నా. ఎందుకంటే ఒక అందమైన స్త్రీ నాకు రోజూ ఉత్తరం రాస్తోందని నా భార్యకు తెలిస్తే ప్రమాదం కదా మరి, అన్నారు. దాంతో ఆ ప్రతిపక్ష నాయకురాలి బుగ్గలు కందిపోయేయి. నాడు మంత్రిణిగా సభలో ఉన్న ఇందిరాగాంధీతో సహా అందరి పొట్టలు పగిలిపోయేయి. ఆపుకోలేని నవ్వులతో, ఇలాంటిదే మరో రిపార్టీ ఉదంతం -ఒకసారి విదేశీయులతో భారతీయుల వివాహాల గురించి పార్లమెంటులో వాడి వేడి చర్చ జరుగుతున్న సందర్భమది. రామ్‌మనోహర్‌ లోహియాని ఉద్దేశించి మంత్రి తారకేశ్వరి సిన్హా 'బ్రహ్మచారి అయిన లోహియాకు సంసారాల గొడవెందుకు?' అని ఎత్తిపొడిస్తే, దానికి ఆయన వెంటనే 'నేను పెళ్లి చేసుకోవడానికి రెడీనే. నువ్వే ఛాన్స్‌ ఇవ్వటంలేదు' అని తిప్పికొట్టేరు. ఇంకోసారి బక్కగా ఉన్న ఒక కేంద్రమంత్రిని చూపిస్తూ పీలూమోడీ అనే స్వతంత్ర పార్టీ సభ్యుడు దేశంలో కరవుకు ప్రతిరూపంలో ఉన్నావని అన్నారు. దానికాయన కరవు దేశంలో ఎందుకు వచ్చిందో నిన్ను చూస్తే తెలుస్తోందని బదులిచ్చారు.మోడీ చాలా స్థూలకాయుడు లెండి. 

ఇక మన శాసనసభకి వద్దాం. బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ గౌతు లచ్చన్న 'ప్రభుత్వం దగ్గర కాసులు లేవు, ప్రజలకు నూకలు లేవు' అన్నారు. నాడు కాసు బ్రహ్మానందరెడ్డి ఆర్థికమంత్రి నూకల రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖామంత్రి ముందే చెప్పినట్టు ఈ 'మాటకు మాట' (రిపార్టీ) కళ సాహితీ మూర్తులలోనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణలు పెక్కు. కొన్ని చెప్పుకోవాలన్నా ఒక పెద్ద గ్రంథం రాయాలి. ఒకట్రెండు మాత్రం చెప్పుకుందాం -ఒకసారి ఏదో కవి సమ్మేళనానికి హాజరవ్వడానికి వచ్చిన శ్రీశ్రీ విశ్వనాథలకు ఒకేచోట బసకల్పించారు. శ్రీశ్రీ తువ్వాలు కట్టుకుని, ఆరుబయట నూతిదగ్గర స్నానం చేస్తూంటే చూసి, విశ్వనాథ, 'కవిశ్రేష్టులు నీళ్లాడుచున్నారు' అని చమత్కరిస్తే, శ్రీశ్రీ తడుముకోకుండా 'ఔను కవిసార్వభౌములు కనుచుండగా' అనేశారు. నెలతప్పిన అనే అర్థంలో నీళ్లాడుతున్నావా అని ఆయన అంటే 'ప్రసవిస్తున్న' అనే అర్థంలో ఈయన కనుచుండగా అన్నారన్నమాట. ఇంకోసారి విశ్వనాథ వారు 'నా అంతటికవి మరో వెయ్యేళ్లదాకా పుట్టడు' అంటే శ్రీశ్రీ 'తమరు వెయ్యేళ్ల కిందటే పుట్టేరు' అన్నారట, ఆయన ఛాందసత్వాన్ని ఎత్తిపొడుస్తూ. ఇద్దరూ నవ్వుకున్నారని వేరే చెప్పాలా -కూర్మా గోపాలస్వామి నాయుడు ఆంధ్రా యూనివర్శిటీలో రిజిస్ట్రారుగా ఉన్నప్పుడు ఒక సభలో ఆయన్ని ఉద్దేశించి ఒక విద్యార్థి ఆయన స్థూలకాయాన్ని ఎద్దేవా చేయాలని, 'హాయ్‌ భీమా' అని అరిస్తే దానికాయన 'ఓయ్‌! ఘటోత్కచా!' అని చేతులూపి అందర్నీ నవ్వించేరు.  

ఇలాంటి చమత్కార భరిత వాద ప్రతివాద పటిమను మన రాజకీయనేతలు, ఉద్యమకారులు అలవర్చుకోవాలి గాని, దొరవారు నేర్పుతున్న తిట్ల పురాణాల్ని కాదు

-చేగొండి రామజోగయ్య,
విశాలాంధ్ర మహాసభ సభ్యులు

బుధవారం 25 జనవరి 2012

ఎవరో మీకే తెలుసు!!

ఆంధ్రప్రభ : సత్యం, అహింస వంటి విలువల గురించి ప్రస్తావిస్తే చాలు, మనకు గాంధీజీ గుర్తుకు వస్తారు. అలాగే ఏకపత్నీ వ్రతం, పితృవాక్య పరిపాలన, పరస్త్రీ వ్యామోహం, అనుచిత ఆగ్రహం, దానశీలం, పాతివ్రత్యం చంచలత్వం వంటి గుణగుణాల్ని గురించి మాట్లాడుకుంటే పేర్లు పనిగట్టుకుని చెప్పకపోయినా ఏ పురాణ పురుషులు, స్త్రీలు జ్ఞాపకం వస్తారో తెలిసిందే. వర్తమానంలో కూడా కొందరు విశిష్ట లేదా విలక్షణ వ్యక్తులకూ ఈ సూత్రం వర్తిస్తుంది. అంటే, వాళ్లు (రాజకీయంతో సహా ఏ రంగానికి చెందినవారైనా సరే!) తమ గుణగణాల ద్వారానే ఎక్కువ ప్రసిద్ధులు. తాము సాధించిన సత్ఫలితాలో, దుష్పలితాలో.

విజయాలో, అపజయాలో, మాటలో చేతలో, వాటి మూలంగా కీర్తో అపకీర్తో సాధించి ఆ విధంగా అందరికీ తెలిసిన వాళ్లైపోతారు. అలా కొన్ని ప్రత్యేక లక్షణాల మూలంగా విశేష గుర్తింపు పొందిన రాజకీయ నేత ఒకరు మన రాష్ట్రంలో ఉన్నారు. ఆయన మాట -మౌనం, క్రియ -నిష్క్రియ పుట్టిన ఊరు, పెరిగిన తీరు, చదువు -సంధ్య, చుట్టాలు పట్టాలు, కుటుంబ మూలాలు, ఇంటి దూలాలు, తిట్లు, ఒట్లు, బెట్లు, గతంలో చేసిన వ్యాపారాలు, వ్యవహారాలు వ్యాఖ్యలు, వర్తమానంలో భాగ్యం -ఆరోగ్యం, ఇలా అదనీ ఇదనీ కాదు, తనకి సంబంధించిన సమస్తం అస్తమానూ ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకునే విషయాలైపోయాయి. పేరు చెప్పకపోయినా, కొన్నిగుణాలు విషయాలు ప్రస్తావిస్తే చాలు మనోఫలకాలమీద ఆయన సాక్షాత్కరించే స్థాయిలో సామాన్య ప్రజల అవగాహన ఉంది. పుట్టిన తేదీ, ఊరు, సహజ లక్షణాలు, తెచ్చిపెట్టుకున్న లక్షణాలు, ప్రవచిస్తున్న సిద్ధాంతాలు అలవాట్లు, వాపు, బలిమి, కలిమి, వంటి అందరికీ తెలిసిన వాటి గురించి చెప్పేసి, ఃఃఎవరో చెప్పుకోండిఃః అంటే అంత గొప్పగా ఉండదు. కాబట్టి కొందరికే గాని ఇంకా అందిరకీ పెద్దగా తెలియని వాటి గురించే చెప్పుకుందాం. ప్రధాన లక్షణాలని వదిలేద్దాం.

(1) మూలాల ప్రభావమే కావొచ్చు, ఆయనకి చాలామంది అపోహపడుతున్నట్లు ప్రాంతీయ దురభిమానం మనసులో చేతల్లో ఉండదని చెప్పడానికి కొన్ని నిదర్శనాలున్నాయి (అ) కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తనచేతిలో ఉన్న పదవుల్ని ఇతర ప్రాంతాల వారికే కట్టబెట్టేరు. (ఆ) ఆ ప్రాంతాలకి ప్రధానమైన, వరమైన, పోలవరం ప్రాజెక్టు ఃఃటెండర్ల వండర్లఃఃలో విశాల హృదయంతో, క్రియాశీలక (స్వ)లాభ దాయక పాత్ర పోషించేరు. (ఇ) స్వయంగా చేసిన యాగాల్లో స్థానికేతర రుత్విక్కులకే ఎక్కువ ప్రాధాన్యత నీయటమే కాదు, సంభావనలు కూడా అధికంగా చెల్లించారు. అందుకు స్థానిక పురోహితులు యాగస్థలంలో కోపాగ్నిని రగిలిస్తే లెక్కచేయలేదు. (ఉ) వాస్తు వైద్య సలహాలు సేవలు పొందటంలోనూ ప్రాంతీయాతీతంగానే వ్యవహరించారు. (ఊ) ఆయన విశాల హృదయం ఇరుగు ప్రాంతాలవారి పట్ల మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రాల ప్రజల బాగుకోసం కూడా తపించిందనుకోవడానికి, బాబ్లీ, ఆల్మట్టి ప్రాజెక్టుల విషయాల్లో, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కనుగుణంగా వ్యవహరించడాన్ని ఉదహరించాలి.

(2) కీలక సమయంలో ఃఃఫాంహౌస్‌ఃఃలో పండుకున్నాడని ఆరోపించేవాళ్లని నమ్మొద్దు -ఆ సమయంలో ఎంత అంతర్మధనానికి గురయ్యారో అర్థం చేసుకోకపోతే ఎలా ఃఃపులి స్వారీఃఃని సురక్షితంగా ఎలా విరమించుకోవాలో, కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ హైకమాండ్‌ పైనుంచి అందించబోయే రక్షణ తాళ్లనందుకుని, పులివీపు మీదనుంచి, ప్రత్యామ్నాయ (విభజనేతర) పరిష్కారం చెట్టుమీదికి, ఎలా ఎగబాకాలో, తగు స్థాయి వారితో సంప్రదించాలంటే, అబిడ్స్‌ ప్రధాన పోస్టాఫీసు నుంచి కాల్‌ చేసి పబ్లిక్కుగా మాట్లాడటం కుదురుతుందా అలాగే రాంగ్‌రూటులో పోతున్న కారుని దారి మరల్చాలంటే, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏ సురక్షిత మలుపును ఎంచుకోవాలా అన్నదే కదా ఆయన ప్రస్తుత సమస్య -ఇవేమీ అర్థం చేసుకోకుండా, అడపాదడపా అజ్ఞాతంలోకి పోయినా, మౌన వ్రతం పట్టినా, ఆక్షేపించటం న్యాయం కాదు. ఫాంహౌస్‌లో ఉన్నప్పుడు అదుర్స్‌, దూకుడు వంటి సినిమాల్ని డి.వి.డిలో చూసి ఆనందిస్తారని కొద్దిమందికే తెలుసు! పాట సాయం జైబోలో తెలంగాణాకి దక్కింది సొమ్ముల సాయం కాదు.

(3) ఆయనకు స్వపర భేదాలు లేవు -ఇతర ప్రాంతాల ప్రజలను గంపగుత్తగా, రాక్షస సంతతి, దొంగలు, దోపిడీదారులు, మోసకారులు అని నిందిస్తారన్న దొక్కటే పరిగణనలో తీసుకుంటే ఎలా తన ఆధిపత్యాన్ని సంపూర్ణంగా అంగీకరించలేకపోతున్న సొంత ప్రాంత నేతల్ని కూడా ఃఃచవటలు, దద్దమ్మలు, ద్రోహులు, అటూ ఇటూ కానోళ్లు, అని ఒక్కోసారి ఇంకా ఘాటుగా ఃమై సన్స్‌ః ఃయువర్‌ మదర్‌ః వంటి ఆంగ్ల పద ద్వయాలు యొక్క ముతకానువాద తెలుగుపదాలతో సత్కరించటం లేదా?

(4) ఎవరోలా రెండెకరాల కుటుంబంలో పుట్టలేదు. ఎన్నో ఎకరాలలో విస్తరించిన సొంత ఇల్లు ఉన్నవాణ్ణి అని దైర్యంగా ప్రకటించారాయన -ఇంకెవరో అంటున్నట్లు నిజంగా 50 వేల కోట్లు సంపాదించి ఉంటే సరైన సమయం వచ్చినప్పుడు ఆ సంగతీ నిర్భయంగా చెప్పేస్తారు! సున్నాలను ముట్టుకోకుండా మొదటి అంకె ఐదు బదులు రెండు ఉండాలో ఏడు ఉండాలో ప్రకటించేస్తారు. ఈ లోగా మనం కాకి లెక్కలు వేసుకోవటం అనవసరం. 

(5) వసూళ్లు లేకుండా ఏ ఉద్యమం జరిగింది ఈ ప్రపంచంలో ఈ ప్రశ్న ఆయనకాదు గాని కుటుంబ సభ్యులు, అనుయాయులు ఇప్పటికే లేచి, పరోక్షంగా కొంత నిజాన్ని ఒప్పుకున్నారు గదా -ఎవరు, ఎంత, సొమ్ములిచ్చారో ఎలా సహకరించారో అంతా బట్ట బయలుచేసేస్తే, పరువుపోయేది, ఇతర ప్రాంతాలకు చెందిన పారిశ్రామిక సినిమా, మీడియా, రియల్‌ ఎస్టేట్‌ వర్గాలదే! అందుకే ఆ వివరాలు చెప్పటంలేదు -ఈ నేపథ్యంలో జమాఖర్చు -మిగులు లెక్కలు అడగటం ధర్మం కానేకాదు -సభ్యత అసలే కాదు-

(6) ఆయనను క్షమాగుణం కూడా ఎక్కువే! ఏదో ఒకసారి మూడ్‌ బాగోక, అలవాటైన రీతిలో చనువుగా మందలిస్తే, ఒక దళిత నాయకుడు నన్ను పలానా అశ్లీల పదంతో (ల గుణింతంలోది లెండి!) అచ్చతెలుగులో తిట్టేడని బయటికొచ్చి టీవీల సాక్షిగా నానాయాగీ చేసినా, కొన్నాళ్ల తర్వాత మళ్లీ పార్టీ లోకి తీసుకుని పెద్ద పదవినిచ్చేరాయన -ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఃఃచెయ్యిచ్చినఃః ఎమ్మెల్యేలకూ త్వరలోనే క్షమాభిక్ష ప్రసాదించారు. అంతేనా, తనని ఎంతో పరుషంగా తిట్టిన వాళ్లనెందరినో అక్కున చేర్చుకున్న ఉదాహరణలు పెక్కు-

(7) పితృవాత్సల్యం ఆయన సుగుణాల్లో ఒకటి -కుటుంబ సభ్యుల్ని ప్రేమించనివాడు, వాళ్లను పైకి తీసుకురాని వాడు, ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని ఉద్ధరించలేడు.

(8) ఆయనకి దూరదృష్టి కూడా మిక్కుటం -అందుకే ఃఃఇక్కడ పుట్టినోళ్లంతా మావోళ్లేఃః అనేశారు ఉదారంగా -తగిన సమయం వచ్చినప్పుడు తెలుగువాళ్లంతా, ఆ మాటకొస్తే భారతీయులంతా ఒక్కటే అంటారు. భారత రాజ్యాంగం గురించి ఆయనకు తెలియదనుకోవద్దు -బుడ్డిపేట బుల్లోడు అని ఎద్దేవా చేయరాదు.

(9) ఏదో అవసరార్థం, నేడు ఎన్ని వితండ వాదాలు వినిపిస్తున్నా విపరీత వ్యాఖ్యలు చేస్తున్నా, ఇదంతా ప్రజలు అంతిమంగా జ్ఞానోదయం పొందడానికి, నిజాన్ని గ్రహించడానికి చేసే ఒక వినూత్న నకారాత్మక ప్రక్రియలో భాగంగా అర్థం చేసుకోవాలి. పూర్వం నాస్తికులను లేదా సంశయాత్ములను ఆస్తికులుగా మార్చడానికి కొందరు రుషులు ఇలాంటి విధానాన్నే అవలంబించేవారట. దైవదూషణ ఏవగింపు కలిగే స్థాయిలో చేసేవారట. అందరికీ తెలిసిన నిజాల్ని ఖండించేవారట. అబద్ధాలు అలవోకగా చెప్పేవారట. అదే రీతిలో మనజాతి, రీతి, నీతి, సంస్కృతి, వేషభాషలు, ఆఖరికి దేవుళ్లు, దేవతలు అన్నీ లేరనే సిద్ధాంతాన్ని ప్రచారం చేయటంలో ఆయన అంతిమధ్యేయం, ఇదో పిచ్చిరాద్ధాంతమని ప్రజలే తెలుసుకుంటారన్నదే మార్గం ఏదైతేనేం, అంతిమ ఫలితం ముఖ్యం కదా.

ప్రధాన వివరాలు, గుణగణాలు వదిలేసినా పైన చెప్పిన క్లూలతో పేరు చెప్పక పోయినా ఈ ప్రముఖుడెవరో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. అందరికీ కరెక్టు ఆన్సరే వస్తుంది. కాబట్టి నగదు బహుమతి ఏదీ ఉండదు. కాదంటే అనంతం అమూల్యమైన తెలుగుతల్లి దీవెనలు లభిస్తాయి వచ్చేవారం ఇంకో విషయంపై వ్యాసం ఉంటుంది గాని కరెక్టు ఆన్సర్‌ ప్రకటించబడదు.

చేగొండి రామజోగయ్య
(వ్యాసకర్త విశ్రాంత బ్యాంకు అధికారి, విశాలాంధ్రమహాసభ సభ్యులు)

సోమవారం 23 జనవరి 2012

ఎం.ఎస్. రాజలింగం అమర్ రహే!

 స్వాతంత్య్రసమరయోధుడు, రాష్ట్ర మాజీ మంత్రి, అలనాటి 'విశాలాంధ్ర మహాసభ'లో ప్రముఖ పాత్ర పోషించిన శ్రీ ఎంఎస్ రాజలింగం గారు సోమవారం ఉదయం మృతి చెందారు.ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం- విశాలాంధ్ర మహాసభ 


కలసి ఉన్నా.. విడిపోయనా.. విద్వేషం వద్దు : ఎం ఎస్ రాజలింగం ( ఆంధ్రభూమి, మే 28,2010)  

కాకతీయ సామ్రాజ్యం ఆంధ్రలోకానికి ఎన్నో పాఠాలు నేర్పింది. సామ్రాజ్య చరిత్రలో విజయంగురించి ఎంత ఘనంగా చెప్పుకున్నామో ఓటనిని గూర్చి కూడా చెప్పుకొని అంత మిక్కుటంగా బాధపడ్డాము. కాకతీయుల చరిత్రలో విజయం, పరాజయం ఒకరి సొత్తుకాదని అది దైవ నిర్ణయంపై ఆధారపడినదని అనుభవము చెప్పుచున్నది. శైవ, వైష్ణవ సాంప్రదాయాల ఘర్షణలు, రెడ్డి, వెలమ పరస్పర వైషమ్యాలు సామ్రాజ్యాన్ని కూల ద్రోశాయి. ఓరుగల్లు, కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకొని గర్వించడం మాత్రమే మనకు మిగిలింది. చరిత్ర పుటలు త్రిప్పినప్పుడు సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు ఓరుగల్లు ప్రాశస్త్యమును గూర్చి చెప్పినప్పుడు గర్వించని సన్నివేశము లేదు. ఆంధ్ర విద్యాభివర్థనీ సంఘానికి ఉదయరాజు రాజేశ్వరరావు అధ్యక్షులుగాను , నేను కార్యదర్శిగానూ పనిచేశాము. చందా కాంతయ్యఆర్థిక సహాయముతో సంస్థ ఏర్పడ్డది. ఈ సంస్థ ద్వారా ఎ.వి. హైస్కూలు ప్రారంభించబడి క్రమాభివృద్ధి చెందింది. 1950లో ఎ.వి. హైస్కూలు ఉత్సవాలలో బూర్గుల రామకృష్ణారావు చారిత్రకప్రాధాన్యం ఉన్న ఓరుగల్లు ఆంధ్రప్రదేశ్‌కు రాజధానికాక తప్పదని అన్నారు.ఫజల్ ఆలీ కమీషన్ వచ్చిన రోజులలో నీటి వసతి లేని కారణంగా ఓరుగల్లు రాజధానిగా సూచించుటకు వెనకా, ముందు అయినాము. 1949-50 సంవత్సరంలో విశాలాంధ్ర మహాసభ ఓరుగల్లులో శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారి అధ్యక్షతన జరిగింది. నేను, ఒరిస్సా ప్రాంతమునకు చెందిన ప్రకాశ్ చంద్ర శతపథి కార్యదర్శిలుగా ఉన్నాము. తెలంగాణ నుంచి రామానంద తీర్థ స్వామి, బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, కోదాటి, కాళోజీ, ప్రభృతులు పాల్గొన్నారు. ఆ సమయంలో , చందా కాంతయ్య ఆంధ్రుల ఆధిపత్యమును గూర్చి తెలంగాణ వారికి భయం ఉందన్నారు. ఈ విషయం ఆనాటి మహాసభకు హాజరైన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, వావివాల, మాదల వీరభద్రరావు లాంటి పెద్దలకు తెలియజెప్పడం జరిగింది. ఆంధ్రకేసరి శ్రీ ప్రకాశం పంతులు‘‘ నేను బ్రతికుండగా మీకు అన్యాయం జరుగుతుందా?’’ అని ప్రశ్నించారు. దానితో ఆ సమస్య అప్పుడు సమసిపోయింది. 

విశాలాంధ్ర మహాసభ హైద్రాబాద్‌రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇరు పక్షాలకి భిన్న విశ్వాసాలు ఉన్నా మనసా, వాచా, కర్మణా ఎవరి విశ్వాసాలను వారు ప్రజలవద్దకు తీసుకువెళ్ళారు. పరస్పర దూషణలు, దెబ్బలాటలు లేకుండా ఎవరి భావాలను వారు సభల ద్వారానూ, పత్రికల ద్వారానూ ప్రచారం చేసుకున్నారు. కాని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంవారు ఇరువురూ ఒకరి ప్రాంతానికి మరొకరు రాకూడదని పొరపాటున కూడా అనలేదు.ఆరోజులలోనే ఇల్లెందులో గ్రంథాలయ మహాసభ జరిగింది. ఆ మహాసభకి సురవరం ప్రతాపరెడ్డి (గోల్కొండ పత్రికాధిపతి)గడియారం రామకృష్ణ శర్మ, వానమాముల వరదాచార్యులు, కాళోజీనారాయణరావు, కాళోజీ రామేశ్వరరావు ప్రభృతులు హాజరయ్యారు. ఆ మహాసభలో ఆంధ్రమాత, తెలుగుతల్లి కీర్తనలు ప్రతిధ్వనించాయ..... ప్రాంతీయ భావాలు, విడిపోవాలనే ధోరణులు ఎక్కడా కనపడలేదు. ఇరు ప్రాంతాల వారు కలిసి ఉండాలనే సమైక్యభావములు చల్లపల్లి వెంకటశాస్ర్తీ, దాశరథి రంగాచార్యుల కలాలలో అక్షర రూపం దాల్చాయి. 1946లో ఆంధ్ర సారస్వత పరిషత్ మహాసభ ఓరుగల్లు లో జరిగింది. అక్కడ ఆంధ్ర, తెలంణ కవుల సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంలో జాతీయ వ్యతిరేక శక్తులు విచక్షణా రహితంగా నా (ఈ రచయిత) పై దాడి చేశాయ. దెబ్బలు తగిలినవి. ఈ విషయం మహాత్మా గాంధీకి తెలిపాము. గాంధీ- అహింసతో మీరు ఈ ఉద్యమాన్ని ఎదుర్కొన్నారు. సర్‌మీర్జా ఇస్మాయిల్ త్వరలో హద్రాబాద్ రాష్ట్రానికి ప్రధానిగా వస్తున్నారు. మీరు తొందరపడవద్ద-ని సందేశాన్ని పంపారు.. ఓరుగల్లు కోటలో జాతీయ జెండా ఎగురవేయబడ్డది. ఆ సందర్భంలో జాతీయ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ కార్యకర్త, బలహీన వర్గాలకు చెందిన బత్తిని మొగలయ్యను బహిరంగంగా బల్లెంతో పొడిచి, చంపిరు. ఇట్టి పరిస్థితులలో హంతకుడు కర్నూలులో ఉన్నాడని తెలిసి, ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు ఆ నిందితతుని తరలింపునకు వారంట్ ఇప్పించాఠు. ఆంధ్ర, తెలంగాణ భాషలో యాస వేరైనా అందరి సంస్కృతి ఒక్కటే అని గుర్తించి వ్యవహరించిన రోజులవి. ఇలాంటి ఘట్టాలలో ఆంధ్రా, తెలంగాణ వాదులు ఎవరైనా, వాచా, మనసా, కర్మణా, మానవతా దృష్టితో మాత్రమే వ్యవహరించినందువల్లనే చిక్కులూ విభేదాలు ఆనాడు అవుపడలేదు.ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ నాయకుల ఆలోచనలలోని ఆంతర్యము తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. రాజకీయ పరిశీలకులు, గత అనుభవాలు, 50 సంవత్సరాలకు పైగా చూచినవారికి ఈ ఉద్యమాలన్నీ ప్రజలకు దూరం అవుతున్నాయేమో అనిపిస్తున్నది. కాని ఉద్యమ నిర్వాహకులు మాత్రం ప్రజలకు చాలా సన్నిహితంగా ఉన్నామనే భావనలో ఉన్నారు. 

సైద్ధాంతిక విభేదాలు తీవ్రంగా ఉన్న రోజులలో కూడా పరస్పరంగా వారివారి సిద్ధాంతాలను ప్రచారం చేసుకున్నారు గాని ఒక పార్టీవారు మరొక పార్టీవారిని తమ ఊరిలోకి రాకూడదని ఎవరూ శాసించలేదు. ఇప్పుడు ఈ హక్కు కేవలం ప్రొఫెసర్ కోదండరాంకే ఉన్నట్లుగా కనపడుచున్నది. సర్వదేవభట్ల రామనాథం సిసలైన కమ్యూనిస్టు నాయకులు. ఆస్తినంతా కమ్యూనిస్టు ఉద్యమానికి ధారపోసిన మహా వ్యక్తి. వారితో 1952 సార్వత్రిక ఎన్నికలో శాసనసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేయవలసి వచ్చింది. ఎన్నడూ ద్వేషపూరిత స్వార్ధపూరిత వాతావరణం కనిపించలేదు. పార్టీ ప్రతిష్ఠ, సంస్థల ప్రతిష్ఠలు మాత్రమే ప్రాధాన్యత వహించేది. ఆనాటి నాయకులుగాని, కార్యకర్తలుగాని ఆలోచించేది, చెప్పేది, చేసేది ఒకటిగా ఉండేది. ఆ కారణంగా వైరుధ్యాలు ఉన్న దశలో కూడా పరస్పర విశ్వాసము ఉండేది. సభలు, సమావేశాలు ఉధృతంగా జరిగినాయి. మేము కాంగ్రెస్ వారము, కమ్యూనిస్టులు ఒక టేబుల్ వద్ద కూర్చొని భోజనంచేశాము. ఇది ఆనాటి విద్యాలయాలు గురువులు అభ్యసింపచేసిన పాఠాలు. కాని దీనికి భిన్నంగా ‘‘నేడు విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, అధినేతలు కొందరు వ్యవహరించడం చాలా బాధాకరంగా ఉంది.చిల్లంచర్లలో 1957లో శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థినైన నాకు, కమ్యూనిస్టు అభ్యర్థి గోపాలరావుకు పోటీ జరిగింది. చెట్లముప్పారం గ్రామంలో గోపాలరావు అనుయాయులు మమ్ములను మీటింగ్ పెట్టుకోనివ్వలేదు. ఉద్రిక్త వాతావరణంలో మా కార్యకర్త శ్రీనివాసరావును ముక్కుపై వేటువేస్తే సగం ముక్కు తెగింది. నేను గోపాలరావు వద్దకు వెళ్ళి ఇదేమిటని అడిగా, అతను చాలా బాధపడ్డాడు. అతను ముందుండి మా సమావేశం నడిపాడు. ఆ తరువాత వారి సమావేశం జరిగింది. రెండోరోజు గోపాలరావు నన్ను భోజనానికి పిలిచాడు. వైద్య చికిత్సకు కూడా ఇరువురు కలిసివెళ్ళాం. నిజాం ప్రభుత్వం చేసిన అన్యాయాలను ఎదిరించవలసివస్తే అందరూ కలిసి నిర్వహించే కార్యక్రమాన్ని తలపెట్టి నిర్వహించేవారు. 

తెలంగాణ పోరాటం నిర్వహించిన కమ్యూనిస్టు అగ్రనాయకుడు రావి నారాయణరెడ్డి, పోరాటాన్ని ఒక దశలో కాంగ్రెస్ తరపున నడిపిన రేపాల క్యాంప్ అధినేత కోదాటి నారాయణరావు కలిసి కూర్చొని సమీక్షించుకొని తప్పులు దిద్దుకోవటం జరిగేది. వారిరువురి సిద్ధాంతాలకు అఘాతం లేకుండా చూచుకునేవారు. ఇలాంటి వివిధ ఘట్టాలలో కూడా , ఈ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి రావద్దని కాని, ఆ ప్రాంతం వారు ఈ ప్రాంతమునకు రావద్దని కాని ఆంక్షలు విధించిన నాయకులు ఆ రోజులు వేరు. ఆ కీర్తి ప్రస్తుతం ప్రొఫెసర్ కోదండరాంవంటి వారికే దక్కింది. బహిష్కరణ ఉద్యమాలు ఎవరు ఎప్పుడు ఏ కారణంవల్ల తలపెట్టినా అందలిలోపాలను అందుకు భిన్నమైన పార్టీలు చూపటం సహజం, సమంజసం. సభలు, సమావేశాలు చేసుకొని ఆ కార్యక్రమంలో ఉన్న లోపాలను ప్రజలకు చెప్పి తమవైపు ఆకట్టుకోవడం న్యాయం. అదే ప్రస్తుతం జై ఆంధ్ర, జై తెలంగాణా నాయకులు చేయవలసిన పని. మృదువైన తీయని మాటలతో, ప్రేమ పూర్వకమైన చర్యలు దేశ సౌభాగ్యానికి ఎంతేని తోడ్పడతాయి. గతంలో ఉద్రిక్త వాతావరణంలో ఆనాటి నాయకులు ఎలా వ్యవహరించారో తెలుసుకొని వారిని ఆదర్శంగా భావించి వారి అడుగుజాడలలో నడువాలని ఆ విధంగా జాతీయ ఐక్యతకు, అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజలు నారుూ కోరికను మన్నిస్తారని ఆశిస్తాను. ప్రాంతీయ బహిష్కరణ ఉద్యమాలను ఎవరు చేసినా , ఎప్పుడు చేసినా, ఎందుకు చేసినా వాటిని తెలంగాణ ప్రజలు బహిష్కరించాలి.

ఆంధ్రభూమి పత్రికకు రాసిన మరో వ్యాసం లో రాజలింగం గారు నిజాం పరిపాలనా కాలం లో పత్రికా స్వాతంత్ర్యం మరియు ఇతర పరిస్థితులను గురించి వివరించారు. 

1935లో నేను బి.ఎస్‌సి చదువుకోవడానికి నిజాం కాలేజీలో చేరాను. ఆనాటి విద్యార్థి ఉద్యమాలకి నాయకత్వం వహించానని చెప్పవచ్చు. ఆరోజుల్లో గోల్కొండ పత్రిక (తెలుగు) హైదరాబాద్ బులెటిన్ (ఇంగ్లీషు), డెక్కన్‌క్రానికల్ (ఇంగ్లీష్) ఉండేవి. ఈ పత్రికల్లో ప్రజా చైతన్యానికి సంబంధించి చైతన్యవంతులను చేసే ఏ కార్యక్రమమైన అంత తేలిగ్గా ప్రచురింపబడేవి కావు. ఆరోజుల్లో వాక్‌స్వాతంత్య్రం, పత్రిక స్వాతంత్య్రం, ఏవిధమైన న్యాయ సంబంధమైన హక్కులు ఉండేవికావు.

సికింద్రాబాద్‌లో ఒక మూల దివ్యవాణి అనే చిన్న పత్రిక ఉండేది. అది వారపత్రికో, మాసపత్రికో గుర్తులేదు. చివుకుల అప్పయ్యశాస్ర్తీ దానికి సంపాదకులుగా ఉండేవారు. వారు ఒకరుమాత్రం మేము విద్యార్థి సంఘం నుంచి పోగానే ‘‘నాయనా పిల్లలు మీరు వచ్చారు మీటింగ్ వివరాలు ప్రచురించడం నావల్లకాదు. కానీ చివరిపేజీలో మీ మీటింగ్ జరిగిందని, ఫలానావారి అధ్యక్షతన జరిగిందని వేస్తాననేవాడు. అప్పటికదే పెద్ద వరంగా ఉండేది. 1938లో మేము ‘ఆంధ్ర సారస్వత సంచిక’ తీయాలనుకున్నాం. ఆనాటి నిజాం కాలేజి అధ్యాపకులు సరిపల్లి విశ్వనాథశాస్ర్తీ, కురుగంటి సీతారామయ్య తగు ప్రోత్సాహం ఇచ్చేవారు. వారి ప్రోత్సాహంతోనే విద్యార్థి సంచిక తీయాలనుకున్నాం. కానీ మా ప్రిన్సిపాల్ టర్నరు. (The word Andhra has political significance) ఆంధ్ర అనే శబ్దం రాజకీయ ప్రాముఖ్యత కలిగింది. దానికి బదులు మీరు తెలుగు అనే పదం వాడి తెలుగు సారస్వత సంచిక అనే సంచికగా తీయమన్నారు. దాన్ని ఉల్లంఘించాము. ఈ పత్రిక అచ్చువేసిన బుచ్చయ్యలింగశాస్ర్తీని పోలీసువారు నిర్బంధించదలిచారు. కానీ ఆయన నెత్తిపై ఉన్న రుద్రాక్ష కిరీటం, చేతికి ఉన్న రుద్రాక్షదండలు మెడలో ఉన్న రుద్రాక్ష మాలలు విభూతిరేఖలు చూసి వచ్చిన పోలీసు ‘‘అయ్యా మీరెందుకు ఈ గొడవలో పడుతున్నారు. మీరెందుకు ఈ పత్రిక అచ్చువేసారు’’ అని అడిగారు. దానికి బుచ్చయ్యలింగ శాస్ర్తీ ‘‘పోరగాండ్లు వచ్చిండ్రు నేను అచ్చేసిన. దాంట్లో ఏముంది నాకు తెలియదు. ఇక మీ ఇష్టం పట్టుకెలితే పట్టుకెళ్లండి. ఆ జైళ్లోనే కూర్చుని తీరిగ్గా 24 గం.లు శివపూజ- చేసుకుంటా’’ అన్నారు. ఆయన అమాయకత్వం మమ్మల్ని రక్షించింది. ఈ రెండు ఘట్టాల్లోని ముఖ్యోద్దేశం సనాతన ధర్మసంస్థలు తెలిసో తెలియకో పత్రికా స్వాతంత్య్ర పరిరక్షణకై కొంత తోడ్పడ్డాయని చెప్పడం. మరొక ఘట్టంతో పత్రికా స్వేచ్ఛ ఎంతగా ఉండేదో తెలుస్తుంది. మేము వరంగల్ హైస్కూలులో వున్నపుడు 1933-36 ‘వ్యాసలత’ అనే చిన్న మాసపత్రిక తీసేవాళ్లం. అందులో రజస్వలానంతర వివాహం చేయాలి అని మా మిత్రుడు లక్కినేని నర్సయ్య వ్రాసాడు. అతనిని పోలీసులు పట్టుకెళ్లారు. విద్యార్థులు పోలీసుని నిలదీసి అడిగితే ఇది నేడు చిన్న విషయం, రేపు నిజాం తఖ్త్ (సింహాసనం)ని ఉల్టా (తలకిందులు) చేస్తుంది అని అన్నాడు. ఈ భూమికలోనే మరికొన్ని ప్రాథమిక హక్కులు ఏవిధంగా దెబ్బతిన్నవో చెప్పడం అవసరం. ఉర్దూ రాజభాష అయింది. బ్రిటిష్‌వారు భారతదేశంలో ఏవిధంగా వారికి అనుకూలించిన దాస్య ప్రవృత్తిగల మంత్రాంగాన్ని మనుషుల్ని సృష్టించారో అదేవిధంగా ఉర్దూను రాజభాషగా పాలకవర్గం వారు ఉపయోగించారు. ప్రాథమిక పాఠశాల సైతం అనుమతి లేనిదే పెట్టకూడదని ఒక సర్క్యులర్ జారీచేసింది. 1929లో లార్డ్‌ఇర్విన్ ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినప్పుడు ఈ క్రిందివిధంగా ఉపన్యసించాడు. "It will be the fast of a mature statemenship so as to shape the policy of Osmania University so that it may have as strong apeal to the Hindus as to the Mohamadans subjects of your state.'' ఈ విధంగా ఉర్దూ భాష పేరిట మతఛాందసాన్ని ప్రభుత్వం పెంచింది. వారికి కీలక స్థానాల్లో ఉద్యోగాలనిచ్చింది. ఉద్యోగాలకి అర్హత కలిగినవారు ముస్లింల్లో లేకపోతేను ఉత్తరప్రదేశ్‌నుంచి ముస్లింలను పిలిచి ఉద్యోగాలిచ్చారు. ‘‘ఇత్తెహాదుల్ ముసల్మీన్’’ సంస్థ 1936లో స్థాపించబడి మతం మార్పిడిని ప్రభుత్వ సహకారంతో చేయడానికి పూనుకుంది. 18,000 హరిజనులను ఒక్క బహదూర్‌యార్‌జంగ్ ముస్లింలుగా మార్చగలిగాడు. ఆఫీసర్లు వెట్టిచాకిరికి పూనుకున్నారు. ఒక దశలో వెట్టిచాకిరి చేయించుకోలేని ఆఫీసర్లను, జాగీర్‌దారీ, వతన్‌దార్లను అసమర్ధులుగా ప్రభుత్వం చూపింది. ఇలాటి దుశ్చర్యలవల్ల బాధపడిన ఆంధ్రులు 1920లో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ పేరిట ఆంధ్ర మహాసభను ఏర్పాటుచేసారు. తద్వార గ్రంథాలయాలు స్థాపించి వెట్టిచాకిరీ నిర్మూలనకు, రైతు సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు లేవదీసారు. ఈ ఉద్యమాల తాకిడివల్ల నైతేనేమి, భారతదేశంలో రాజకీయంగా వస్తున్న మార్పులవల్లనైతేనేమి రాజ్యాంగ సంస్కరణలు అవసరమని ప్రభుత్వం భావించింది. అయ్యంగార్ కమిటీ 1939లో ఏర్పాటైంది. 132 స్థానాలు హైదరాబాద్ శాసనసభలో ఉండేటట్లు దానిలో 76గురు ఎన్నుకోబడేటట్లు సంస్కరణలు సూచించబడ్డాయి. జిన్నా సూచనపై Functional Representation (వృత్తిపరమైన ప్రాతినిధ్యం) ఇవ్వబడింది. రైతులకు, ఇండ్ల యజమానులకు, కిరాయిదారులకు, జాగీరుదారులకు, కూలీలకు, డాక్టర్లకు వకీళ్లు వ్యాపారస్తులు ఇత్యాది వృత్తులవారికి ఇవ్వబడింది. 51% ఓట్లు వస్తే వారు గెలిచినట్టు లెక్క. పై 76 సీట్లుకాక 56 మందిని ప్రభుత్వం నామినేట్ చేయ నిశ్చయించింది. ఈవిధంగా ఆందోళన జరుగుతున్న రోజులలో 1941లో వ్యక్తి సత్యాగ్రహం జరిగింది.

వ్యక్తి సత్యాగ్రహం తరువాత 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్‌వారు భాగస్వాములయ్యారు. బార్డర్ క్యాంపులు పెట్టి కాంగ్రెస్‌వారికి శిక్షణ ఇచ్చి నిజాం వ్యతిరేక పోరాటం క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్‌వారు చేశారు. కమ్యూనిస్టులు ప్రజాయుద్ధం అనే నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉన్నారు. బహదూర్‌యార్‌జంగ్ ఆనాటి హైదరాబాద్‌కు తోడు బీహార్, ఉత్తర సర్కార్‌లు కలుపుకొని ఒక స్వతంత్ర ముస్లిం రాజ్యంగా ఏర్పడాలని కోరాడు. నిజాం వరల్డ్ ముస్లిం ఫెడరేషన్‌కి హైదరాబాద్ కేంద్రంగా ఉండాలని కోరుకున్నాడు. దీనిలో బహదూర్‌యార్‌జంగ్ ప్రముఖ పాత్ర వహించాడు. 1942నుంచి 1946 వరకు తెలంగాణ కమ్యూనిస్టు సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ ఆశయాల కనుగుణంగా జరిగాయి. 1946లో స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యాన బిందు అధ్యక్షతన కాంగ్రెస్ రాష్ట్ర కార్యాచరణ సంఘం ఏర్పడింది. సత్యాగ్రహాలు, సాయుధ పోరాటాలు నిజాంకి వ్యతిరేకంగా జరిగాయి. పరిటాల లాంటి కొన్ని గ్రామాలు రిపబ్లిక్‌గా ప్రకటించుకొనబడ్డాయి. ఈవిధంగా జరిగిన పోరాటాల ఫలితంగా 17.09.1949న నిజాం ప్రభువు, రజాకార్లు భారత ప్రభుత్వానికి లొంగిపోయారు.

 
మరపురాని ధన్యజీవి,ఆంధ్రభూమి సంపాదకీయ పేజీ: ‘ఆరని నీటికొలనక్కట పూచిన తమ్మికన్, విధి ప్రేరణ రాలిపోయినవి, రేకులు తొంబది తొమ్మిది! అన్నట్లుగా కురువృద్ధుల్ గురువృద్ధబాంధవులలో ఒక్కొక్కరే తనువు చాలిస్తున్నారు. నిన్నటిరోజు కన్నుమూసిన ఎం.ఎస్.రాజలింగంఅటువంటి చరితార్థులలో ఒకరు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం ఒక ఆరని నీటి కొలను. అందులో శతపత్ర పరంపర నిర్నిద్రంగా ప్రభవించింది. జాతీయోద్యమం నాటికీ ఆ పరంపర జాతికి నాయకశ్రేణిగా మారి పతన స్థితిలో ఉన్న జాతి జనులకు ఆత్మగౌరవం కల్పించి ధర్మంకోసం పోరాటం నేర్పింది. వారి కృషి ఫలితమే నేటి, మన రాష్ట్రం. ఆ నిర్మాతలలో నిస్సందేహంగా ఎం.ఎస్.రాజలింగం ఒకరు.

రాజలింగం 1919 ఫిబ్రవరి 9వ తేదీన వరంగల్‌లో జన్మించారు. అక్కడే మెట్రిక్ పాసయ్యారు. నిజాం కళాశాలలో బిఎస్సీ చేసి ఉస్మానియాలో ఎల్.ఎల్.బి. చేశారు. విద్యార్థి దశనుండే రాజకీయాలలో పాల్గొనేవారు. అవి సాహిత్యరూపంలో ఉండేవి. సాధనా సమితిలో చేరి సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ చదువు పూర్తి అయ్యేనాటికి ఆయన మీద పోలీసు నిఘా తీవ్రమై రాష్ట్రం విడచిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. పిట్టల వాని వేషంలో స్టేటు వదలి వార్థా చేరుకున్నారు. గ్రామీణ విద్యాలయంలో జె.సి. కుమారప్ప ఆధ్వర్యంలో గ్రామ పరిశ్రమణ శిక్షణ పొందారు. సేవాగ్రాంలో ఆశ్రమ మేనేజరుతో ఏర్పడిన విభేదాల కారణంగా గాంధీజీ, కస్తూరిబా, రాజాజీ వద్దని చెప్పగా సేవాగ్రాం వదలి వచ్చారు. మొదటినుంచి ఆయనది ఒకరికి లొంగి ఉండే తత్వం కాదు.

ఆ తరువాత కరీంనగరు జిల్లాలోని ముస్తాబాద్ గ్రామంలో 1941లో గ్రామీణ కార్యక్రమాలను ప్రారంభించారు. నిజాం రాష్ట్రంలో మొట్టమొదటి చరఖా సంఘం ఏర్పాటుచేసారు. 1942-43లో క్విట్ ఇండి యా ఉద్యమ సందర్భంగా ఎం.ఎస్.ఆర్ అరెస్టయ్యారు. 1944లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షిక సభలకోసం వేసిన పందిళ్లను దుండగులు తగలబెట్టారు. ఎంఎస్ ధైర్యంగా తిరిగి కొత్త పందిళ్ళు వేయించారు. కవి సమ్మేళనం దిగ్విజయంగా జరిగింది. 1946లో ఓరుగల్లు కోటలో జెండా వందనం జరిగింది. జాతీయ విద్రోహశక్తులు మొగలయ్యను హత్య చేశారు. ఆ వార్తను జాతీయ పత్రికలు ప్రచురించే ఏర్పాటుచేసిన ఎం.ఎస్. రాజలింగంను వరంగల్ జిల్లా నుంచి మూడు నెలలు బహిష్కరించింది ప్రభుత్వం. వరంగల్ జైలు నుంచి ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. స్టేటు కాంగ్రెస్ రెండుగా చీలినప్పుడు ఎం.ఎస్.రాజలింగం ఎంతో బాధపడ్డారు. ఆయన చివరిదాకా స్వామీజీ పక్షంలోనే ఉన్నారు. 1950లో వరంగల్‌లో విశాలాంధ్ర మహాసభ జరిగింది. హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడాలనే తీర్మానాన్ని ఎం.ఎస్. ప్రవేశపెట్టారు. దాన్ని కోదాటి, కొమరగిరి, చంద్రవౌళిశ్వరరావులు బలపరిచారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

1952లో జరిగిన ఎన్నికలలో వరంగల్ జిల్లా నుంచి గెలుపొందిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు రాజలింగమే. వరంగల్‌లో ఒక తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటుచేసే బాధ్యతను వరంగల్ పట్టణ ప్రముఖులు ఎం.ఎస్‌కు అప్పగించారు. అది ఫలించి, పాఠశాల ప్రారంభోత్సవానికి అప్పటి విద్యాశాఖ మంత్రి మహమ్మద్ ఆజమ్ విచ్చేయనున్నారు. ఆ సమయంలో ఎం.ఎస్. కుమారుడు తీవ్ర జబ్బుతో బాధపడుతున్నాడు. అత్యవసర సేవలందించవలసిన సమయంలో ఎం.ఎస్. లేకపోవడం వలన అతడికి వైద్య సహాయం లభించలేదు. ఫలితంగా పిల్లవాడు అసువులు బాసాడు. కర్తవ్యం - కుమారుడు, మధ్య కర్తవ్యం గెలిచింది. నాటి నాయకుల దేశభక్తి అలాంటిది.

1946 చివరి వారంలో మహాత్మాగాంధీ హిందీ ప్రచార సభలలో పాల్గొనటానికి మద్రాసు వచ్చారు. ఆ సందర్భంలో తిరుగు ప్రయాణంలో గాంధీజీని డోర్నకల్, గుండ్రాతిమడుగు, ఖమ్మం, వరంగల్, మానుకోట, మంచిర్యాలలో ప్రయాణం చేయిస్తే జాతీయోద్యమానికి తెలంగాణలో బలం కలుగుతుందని నాయకులు భావించారు. ఆ బాధ్యత ఎం.ఎస్.పై ఉంచారు. గాంధీజీ పర్యటన వరంగల్‌లో ఒక మధురానుభూతి.

1951 ఎన్నికల అనంతరం బూర్గుల మంత్రివర్గంలో ఉపమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించారు. ఎం.ఎస్. సమైక్యవాది అయినా తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాల గురించి సమయం లభించినప్పుడల్లా గళమెత్తేవారు. వివిధ పత్రికలలో చాలా వ్యాసాలు రాశారు. బహుగ్రంథకర్తలు ఇటీవల తమ స్వీయచరిత్ర ప్రచురించారు. అది బహుళ జనాదరణ పొందింది.
 - జీ. వెంకటరామారావు

ఆదివారం 15 జనవరి 2012

Milestone Achieved!

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.'విశాలాంధ్రమహాసభ'  ఎన్నో అడ్డంకులను అధిగమించి డిసెంబర్ 29,2011న హైదరాబాద్ లో  'రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం' అనే అంశంపై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసినదే. 'విశాలాంధ్రమహాసభ' ప్రయత్నాన్ని విచ్చిన్నం చేయాలని విఫలయత్నం చేసి ఆతర్వాత అంతా రసాభస అయ్యిందని కొంతమంది పనిగట్టుగొని ప్రచారం చేసినా, రాష్ట్ర రాజధానిలో చాలా కాలం తర్వాత సమైక్యవాదం వినిపించడం సంతోషించదగ్గ పరిణామం. దౌర్జన్యంతో ఇతరుల భావవ్యక్తీకరణ స్వేచ్చను ఎప్పటికీ హరించగలుగుదామనుకోవడం మూర్కత్వమవుతుంది.


ఆ దినం జర్నలిజం ముసుగు తొడుక్కున్న కొంతమంది నోర్లను సమర్ధవంతంగా మూయించిన స్వాతంత్ర్యసమరయోధురాలు సుగుణమ్మగారికి అభినందనలు





My Telugu Roots.com : Visalandhra Mahasabha on December 29th achieved an important milestone. After months of setbacks, we've eventually achieved our goal of conducting an integrationist event in Hyderabad. It is the first of its kind.
When we asked for our right to freely express our opinion: the State government instead of coming to our rescue stifled our voices. The police have turned their back on us when we asked for protection. The "so-called" integrationists and community leaders of Hyderabad refused to come to our rescue as they felt expressing a point of view would be provocative. Our political parties and leaders said it is in VMS’ best interest that they don't stand by us as it would hurt our organization's image of an apolitical organization. When our venue was denied to us, as a last resort, when we approached the judiciary, the court system failed us. The High Court sided with the government and dismissed our most basic fundamental rights case. I was dumbfounded by the courts decision. The judiciary in our country lost course.
The essential ingredient for a free society to survive is people's ability to freely express their opinions. When a society cannot tolerate such freedoms, it gradually degenerates into a dictatorship, where only might will win.
The fight for integration is important. However, the fight for individual freedom is far more important. Alas, it is lost on the intellectuals of our state why we should stand for our fundamental rights, while risking fears of provocation. Every time you fear to freely speak your mind, the society moves one step closer to an autocracy. Need evidence? Look at how the separatist movement became violent as years went by. This has happened because integrationist voices decided to stay quiet.
VMS about a month ago lost trust in the judiciary process as the High Court kept on adjourning our petition week after week after week. We have decided to go ahead and conduct our event in a private venue instead of a government facility like the Jubilee Hall or Ravindra Bharathi. We’ve also decided not to give anything in writing to police seeking protection, as they will use it to deny our most basic rights. Technically, we did not need permission from the law enforcement to conduct an indoor event.
December 29th 2011 exhibition and media workshop was a phenomenal success. We had several freedom fighters from the Nizam region that rallied to our cause and dared to stand with our organization. They are Sri Narra Madhav Rao, Smt. Shakhamuri Suguna, Sri K.S. Mehaboob, Sri Laxman Rao, and Sri Naganna. The former two are also members of VMS executive committee.
As the session began, when Sri C. Anjaneya Reddy garu was speaking, a journalist kept on interfering demanding to name the five Chief Ministers from Telangana mentioned in our charts. Anjaneya Reddy garu insisted on allowing him to finish his speech and the answer will be given later. He eventually clarified that they are JVR, PVNR, MC, and TA. The reason for five is the two terms held by MC.
When Sri Narra Madhav Rao spoke, some of the journalists took exception to his comments and demanded an apology. 90 year old native Hyderabadi, Madhav Rao garu refused to apologize and with police intervention things returned to normalcy. Freedom fighter Suguna garu, despite her frail physical condition, took on the journalists head-on. She said, nobody can stop the event from happening that day. From that point on, the event went on smoothly. Professor and former Vice Chancellor R.V.R. Chandhra Shekhar Rao, MCPI leader Thandra Kumar and MCPI Secretary Marreddy Venkat Reddy spoke. After which Prabhakar garu did a powerpoint presentation. It was highlight of the day and his presentation was carried live on most TV channels and it was simply spectacular.
We’ve also put up an exhibition at the venue. In the lobby area we put a photo gallery of the violent activities that have happened during the course of this agitation. Some of the journalists pulled those charts down. We quickly put them back up.
The media workshop ended as planned at 2.00 PM.
Police came in around 2:30 PM and said they have protected us to the best of their ability throughout the day. In reciprocation, they requested us to conclude the exhibition early due to security concerns.  We took the exhibition down at 3:30 PM an hour and half earlier than planned. I now regret agreeing to end the exhibition early. The media completely distorted the story and declared the event was disrupted by the separatists.
Today, I am very proud of the Visalandhra Mahasabha team. There are too many names to mention. Our brave team has worked hard for weeks and never did their spirits wane. We stuck together through thick and thin. I am proud to be associated with such spectacular group of team players.
Our cause is noble, our fight is just. The fight for Telugu unity will go on.
Nalamotu Chakravarthy
President
Visalandhra Mahasabha

 


విభజన చరిత్రాత్మకంగా ఏమాత్రం సమంజసం కాదు తాటాకు చప్పుళ్లకు బెదరం… మాది ఎప్పటికీ సమైక్యవాదమే… మమ్మల్ని కొట్టినా, తిట్టినా దాడులు చేసినా వెనక్కు తగ్గేదే లేదని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ స్పష్టంచేశారు. 2012 సంవత్సరాన్ని విశాలాంధ్ర నామ సంవత్సరంగా ప్రకటించుకుందామని పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ‘రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందాం’ అనే నినాదంతో విశాలాంధ్ర మహాసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో పాటు తెలంగాణలో కూడా లక్షలాది మంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ వాదనలో సత్యం ఉంది కాబట్టే వేర్పాటు వాదులకు వినేందుకు ధైర్యం చాలక దాడులకు పూనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 30 ఏళ్లుగా పౌర హక్కులపై మాట్లాడుతున్న తమపై అనేకరకాల ఆరోపణలు, దాడులు జరుగుతున్నా బోగస్ హక్కుల సంఘాల నేతలు ఏమాత్రం స్పందించక పోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.
1956 నుంచి అన్ని రంగాల్లో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని వివరించారు. మాజీ పోలీసు ఉన్నతాధికారి సి.ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా సంస్కృతీ , సాంప్రదాయాలను కాపాడుకుంటూ రాష్ట్ర సమైక్యతకు పాటు పడాలని చెప్పారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమర యోధులు నర్రా మాధవరావు, శాఖమూరి సుగుణ, నాగయ్య, పత్తి శేషయ్య, ఎన్.లక్ష్మణ్‌రావు, పి. రామస్వామి, మహబూబ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు ఎన్. చక్రవర్తి, ఎంసీపీఐ నాయకులు ఎం. వెంకట్ రెడ్డి, తాండా కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అబీద్ రసూల్ ఖాన్, ప్రొఫెసర్ ఆర్‌వీఆర్ చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశాలాంధ్ర మహ సభ ముద్రించిన రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందామనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

మంగళవారం 27 డిసెంబర్ 2011

‘రాష్ట్ర సమైక్యతను కాపాడుదాం’

మిత్రులారా,


‘విశాలాంధ్ర మహాసభ’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యతను కాపాడడం కోసం కృషి చేస్తున్న సంస్థ. రాజకీయాలకు అతీతమైనది. ‘విశాలాంధ్ర మహాసభ’ తెలంగాణ, కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాలకు చెందిన మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు మరియు సమాజశ్రేయస్సు కోసం కృషి చేస్తున్న అనేకమంది వ్యక్తులు కలిసి స్థాపించిన సంస్థ.
మనరాష్ట్రంలో జరుగుతున్న వేర్పాటువాద ఆందోళన, హింస మరియు విధ్వంసక చర్యలను ప్రోత్సహిస్తూ, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురైయ్యారన్న అసత్య ఆరోపణల ఆధారంగా సాగుతున్నది. విభజనవాదులు అబద్ధాలను నిజాలుగా చిత్రీకరిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.మా ఉద్దేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఆందోళన పూర్తిగా అసమంజసమైనది.
ఈ సందర్భంలో, విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర సమైక్యతను కాపాడుదాంఅనే అంశం పై మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ నిర్వహించతలపెట్టింది. మన రాష్ట్రానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక మరియు చారిత్రక నిజాలను మీడియా వర్క్ షాప్ మరియు ఎగ్జిబిషన్ ద్వారా ప్రజల ముందుకు తేవడం యీ ప్రయత్నం యొక్క ముఖ్య ఉద్దేశం.
వేర్పాటువాద ఆందోళన ప్రచారం చేస్తున్న నిందలు,అవాస్తవాలు,వక్రీకరణలు, అసత్యాలను ఖండించి నిజానిజాలను తెలిసుకోవడంలో మా యీ ప్రయత్నం సహాయపడుతుందని ఆశిస్తున్నాము.

December 29th 11.00 AM – 4.00 PM

Venue: Sundaraiah Vignanan Kendram, Bagh Lingampally, Hyderabad.

శనివారం 24 డిసెంబర్ 2011

'విగ్రహాలను వెంటనే పునఃప్రతిష్ఠించండి' : విశాలాంధ్రమహాసభ

డిసెంబర్ 20 వ తేదీన విశాలాంధ్రమహాసభ ప్రతినిధులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆయన కార్యాలయంలో కలిసి ట్యాంక్ బండ్ పై విధ్వంసానికి గురయ్యిన తెలుగు మహనీయుల విగ్రహాలను వచ్చే ఉగాదిలోగా  పునఃప్రతిష్ఠించాలని కోరుతూ మెమోరాండం సమర్పించారు. దానికి సానుకూలంగా స్పందించిన సీఏం విగ్రహాల పునఃప్రతిష్ఠించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. మిలియన్ మార్చ్ రోజున ట్యాంక్ బండ్ పై ఆందోళనకారులపై చర్య తీసుకొంటే వచ్చే పరిణామాలను దృష్టిలో ఉంచుకొనే విగ్రహాల ధ్వంసాన్ని ఆపలేకపోయామన్నారు. పోలీసుచర్యలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయివుంటే పరిస్థితి అదుపుతప్పుతుందేమోనన్న ఆలోచన చేశామన్నారు.




గురువారం 22 డిసెంబర్ 2011

దార్శనికుడు పి.వి.

"ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ''

1972లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శాసనసభలో చదివిన ఈ కవితార్థం చరితార్థం కావించిన వాడు పాములపర్తి వేంకట నరసింహారావు దేశమంతా 'పి.వి'గా పిలుచుకున్న తొలి తెలుగు ప్రధాని. పి.వి. రాజకీయ చతురతలో రాణించాడు; ఏ కుల, వర్గ, మతాల గుంపును దరిచేరనివ్వలేదు. ఆయన దృక్పథం ప్రజాస్వామ్యం. దృష్టి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు జరిపారు; కాంగ్రెస్ అధ్యక్షునిగా, బడుగువర్గాలకే ప్రాధాన్యమిచ్చి రాజ్యాధికారానికి స్వాగతించారు.

తెలుగు భాషకు పట్టనున్న దుర్గతి ఊహించి తెలుగు అకాడమీ స్థాపించారు. తెలుగు అధికార భాషా సంఘ స్థాపనలో పి.వి. కృషి ఉంది. రాష్ట్రంలో, బోధనా భాషగా తెలుగు ప్రాముఖ్యత గురించి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. తెలుగు బోధన తప్పనిసరిగా పదవ తరగతి వరకు అమలులో ఉండేలా చూశారు.1973లో అకాడమీ అధ్యక్షులుగా 'ఉత్తరోత్తరా ఏమి జరుగుతుందో చెప్పలేం' అన్నారు.

1933లో అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ న్యూడీల్ అనే కొత్త ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లుగా ప్రధాని పి.వి. భావి భారతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందని గ్రహించి తన దార్శనిక దృష్టితో అటువంటి కొత్త ఆర్థిక కార్యక్రమాన్ని మన దేశంలో ప్రవేశపెట్టారు. తద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు.

కేంద్రీకృత ప్రణాళికా విధానాన్ని వదిలి, ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ మార్కెట్‌కు ప్రవేశం కల్పించారు. 1995లో పోఖ్రాన్-2 అణు పాటవ పరీక్షలను పి.వి.నే సాహసోపేతంగా నిర్వహించారు. దేశ అవసరాలు, ఆలోచనలు పూర్తిగా తెలిసిన వివేకవంతమైన పాలకుడు పి.వి. 1988లో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉంటూ అంతర్జాతీయంగా మేధావి అని గుర్తింపు పొందారు. ఐక్యరాజ్యసమితిలో ఆయన ప్రసంగానికి, వివిధ దేశాల ప్రతిని«ధలు వినమ్రంగా లేచి నిలుచుని పదినిముషాల పాటు చప్పట్లతో ప్రశంసలు కురిపించారు.

పి.వి.కి భవిష్యత్తు పట్ల చక్కని అవగాహన ఉంది. మానవుని క్రమవికాసం అరనిందులు దర్శించురని ప్రస్తావిస్తూ "ఈ అభూత పరిణామ క్రమంలో భారతదేశం అనేక ఇతర దేశాలకన్నా విజయవంతంమైన సమాజంగానూ, భాగస్వామిగా వ్యవహరించే మహదావకాశాలు కలిగి ఉందని నా ప్రగాఢ విశ్వాసం'' అని దృఢంగా చెప్పారు. పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఒకే విధంగా నడిచిన పి.వి. స్థితప్రజ్ఞుడు. తన మనసుకు నచ్చింది చేసేవాడు. అంతటి మహామనిషికి భరతజాతి చిత్తశుద్ధితో నివాళి అర్పించగా; ఆయన సేవలు నిరంతరం పొందిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మాత్రం ఆయనను చివరిదశలో అశాంతికి గురిచేసింది.

పలు కోర్టు కేసుల్లో సతమతమైనా, ఆయన ఎవరినీ విమర్శించలేదు సరికదా తన కేసులు తానే వాదించి నెగ్గారు. మరణానంతరం ఆయన అంతెవాసు లు, పార్టీ నేతలు ఘోరంగా వ్యవహరించారు. అందరు ప్రధానులకు అం తిమ సంస్కారాల వేదికలు నిర్మించిన ఢిల్లీ నేతలు పి.వి.కి. ఆరడుగుల నేల ఇవ్వ మనసురాలేదు సరికదా ఆయన దేహాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలోకి అనుమతించని 'గొప్ప' నాయకత్వం ప్రపంచంలో ఇదేనేమో! అయినా తెలుగు ప్రజల గుండెల్లో పి.వి. చిరంజీవి.

- డా. బి. దామోదరరావు
పి.వి.స్మారక పీఠం, కరీంనగర్
(డిసెంబర్ 23న పి.వి.నరసింహారావు వర్ధంతి)

యూపీ కి కేంద్రం కొర్రీలు - నమస్తే తెలంగాణా ఆక్రోశం

నాలుగు రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉత్తర్ ప్రదేశ్ చేసిన అసెంబ్లీ ప్రతిపాదన పైన కేంద్రభుత్వం అడిగిన ప్రశ్నల పై మాయావతి స్పందన ఎలా ఉన్నా మన యెల్లో జర్నల్ నమస్తే తెలంగాణా ఏడుపు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నేటి నమస్తే తెలంగాణా దినపత్రిక లో వచ్చిన ఎడిటోరియల్ చదివి తరించండి.

ఉత్తరప్రదేశ్ శాసన సభ పంపించిన రాష్ట్ర విభజన తీర్మానానికి కేంద్రం కొర్రీలు పెట్టి తిప్పి పంపడంతో కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి బయటపడ్డది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఆరోపించినట్టుపజాభివూపాయాన్ని పట్టించుకోక పోవడం, ప్రధాన సమస్యలను దాటవేయడం కాంగ్రెస్ స్వభావం. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర విభజనను కాదనలేక, తిరస్కరించలేక కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనాన్ని గ్రహించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ‘కాంక్షిగెస్ కో ఖతం కరో’ నినాదం చేపట్టారు. కానీ ఉత్తర ప్రదేశ్ ప్రజలు ఈ విషయం ఎంతో ముందే గ్రహించి అక్కడ కాంగ్రెస్ పార్టీ పాలనను సమాధి చేశారు.


రాష్ట్రాల విభజనపై కేంద్రానికే అధికారం ఉన్నదని, తాము తీర్మానం చేసినందు వల్ల ఇక బాధ్యత కేంద్రానిదే అని మాయావతి ఇప్పటికీ అంటున్నారు. మాయావతి వాదనలో ఔచిత్యం ఉన్నది. భిన్న సాంస్కృతిక, భౌగోళిక మండలాలతో వైవిధ్య భరితమైన మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక్క ప్రాంత పక్షం వహించడం వల్ల మరో ప్రాంతం అణచివేతకు గురికావచ్చు. ఆనాడు ధర్ కమిషన్ హెచ్చరించింది కూడా ఇదే. భాష పేరుతో మరో ప్రాంత సాంస్కృతిక అస్తిత్వానికి ముప్పు వాటిల్లకూడదనే భావన కూడా ఆనాడే గ్రహింపునకు వచ్చింది. అందువల్ల కేంద్రం తీర్పరి పాత్ర పోషించాల్సిందే. అయితే కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత రాష్ట్రాన్ని సంప్రదించక పోవడం అనుచితంగా ఉంటుందనే భావన కూడా ఏర్పడింది. అందుకనే రాష్ట్రాన్ని సంప్రదించాలి తప్ప, రాష్ట్ర అభివూపాయాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. రాజ్యాంగం ఇంత స్పష్టంగా ఉన్నది కనుకనే యూపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాజ్యాంగం తనకు కట్టబెట్టిన బాధ్యతకు అనుగుణంగా కేంద్రం వ్యవహరించక పోవడం వల్లనే ఇప్పుడు రాష్ట్రాల విభజనకు సంబంధించి చిక్కులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ విషయంలో మాదిరిగానే యూపీ పట్ల కూడా కేంద్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్త్తున్నది.


రాజ్యాంగంలోని 3 వ అధికరణం ప్రకారం రాష్ట్ర శాసన సభ అభివూపాయాన్ని రాష్ట్రపతి ద్వారా కోరాలే తప్ప హోం మంత్రిత్వ శాఖ లేఖ రాయడం సరైంది కాదని మాయావతి అంటున్నారు. ఇది జరగాలంటే మొదట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనను సూత్రబద్ధంగా అంగీకరించాలె. ఇష్టం లేకపోతే ఆ విషయం ధైర్యంగా చెప్పాలె. కానీ తన నిర్ణయం చెప్పకుండా, కాలయాపన కోసం కొర్రీలు పెట్టి హోం మంత్రిత్వ శాఖ ద్వారా లేఖలు పంపడం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించడమే. మనదేశంలో రాష్ట్రాల ఏర్పాటు కొత్తేమీ కాదు. ఇదే ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ కూడా విడిపోయింది. 1998 సెప్టెంబరు 22 వ తేదీన పార్లమెంటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అభివూపాయాన్ని కోరింది. 2000 సంవత్సరం మార్చి 30వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ తరువాత రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అప్పుడే జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ కూడా ఏర్పడ్డాయి. అప్పుడు రాష్ట్రాలను కాలయాపన కోసం ఇటువంటి అసంబద్ధ ప్రశ్నలు వేయలేదు. మన దేశంలో రాష్ట్రాలు ఏర్పాటు చేయడం ఇది మొదటిసారి కాదు. అందుకు అనుసరించవలసిన విధానాలు స్థిరపడి ఉన్నాయి. 

యూపీ రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వేసిన ప్రశ్నలు పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయాలని నిర్ణయించుకున్నదని తెలిసిపోతుంది. కొత్త రాష్ట్రాల సరిహద్దులు ఏమిటి? ఏ జిల్లాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయి? వాటి వైశాల్యం, జనాభా ఎంత వంటి ప్రశ్నలు అర్థం లేనివి.


అవి ముంజేతి కంకణం మాదిరిగా చూస్తేనే కనబడుతున్నాయి. ఆయా ప్రతిపాదిత రాష్ట్రాల రాజధాని సమస్య కూడా లేదు. ఏ ప్రాంతం వారూ బుద్ధి జ్ఞానం లేకుండా మరో ప్రాంత రాజధాని కావాలని కోరడం లేదు. కోరినా అసంబద్ధమైన కోరికను ఎవరూ హర్షించరు. రాష్ట్ర విభజన జరిగితే ఐఎఎస్ అధికారులు ఎంత మంది ఏ రాష్ట్రంలో ఉంటారనేది సూత్ర బద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు చర్చించాల్సిన గొప్ప అంశమా అనే ఆశ్చర్యం కలుగుతున్నది. ఆదాయ పంపకం, రుణాల గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్తగా అడగడం వింతగా ఉన్నది. రాష్ట్రాల రుణ భారాన్ని సమస్యగా చెప్పడం కూడా అర్థ రహితమే. ఈ విదేశీ రుణాల గురించి మాట్లాడాలంటే, ఈ తరహా ఆర్థిక విధానాలకు ఆద్యులలో ఒకరైన ప్రధాని మన్మోహన్‌సింగ్ జవాబుదారు అవుతారు.


ఆధిపత్య దేశాలు , వారి తాబేదారులు మొత్తం మూడవ ప్రపంచ దేశాలకు తెచ్చిపెట్టిన సమస్య ఇది. అన్ని రాష్ట్రాలూ రుణభారంతోనే ఉన్నాయి. విభజన జరిగినప్పుడు ఆస్తులు, రుణాలు న్యాయబద్ధంగా పంపకాలు చేయడానికి ఇప్పటికే అనుసరించిన విధానాలు మార్గదర్శకంగా ఉంటాయి. ఇది కూడా కేంద్రానికి తెలియదని కాదు. తెలిసి చేస్తున్న కుతర్కాలు ఇవి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యూపీ ప్రభుత్వానికి పంపిన ప్రశ్నావళిని బుద్ధి పూర్వకంగా పత్రికలకు విడుదల చేసింది. దీనిని కాంగ్రెస్ నాయకులు పారదర్శకతగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులకు పారదర్శకతపై అంత నమ్మకం ఉంటే, తెలంగాణ విషయంలో ఆజాద్, ప్రణబ్ జరుపుతున్న చర్చల సారాన్ని ఎందుకు వెల్లడించడం లేదు? తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గడియకోసారి చెబుతున్నారు. కానీ పరిష్కార యత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఎందువల్ల తాత్సారం జరుగుతున్నదో చెప్పడం లేదు. ఇక్కడి నాయకులు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్నదేమిటో తెలియదు. యూపీ విషయంలోనైనా, తెలంగాణకు సంబంధించి అయినా ప్రజలు కోరేది ఒక్కటే. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా వ్యవహరించాలె, ప్రజల మనోభావాలు గౌరవించాలె.