10, ఆగస్టు 2012, శుక్రవారం

తెలంగాణాలో విశాలాంధ్రోద్యమము - మొదటి భాగము

డా.దేవులపల్లి రామానుజరావు పేరు తెలియని తెలుగువారు ఈ తరంలో ఉన్నారేమో గాని మన తల్లిదండ్రుల, తాతల తరంలో ఉండి ఉండరు. తెలంగాణా ప్రాంతంలో పుట్టి పెరిగి నిజాముల పరిపాలనలో తెరమరుగవుతున్న తెలుగు భాషాసంస్కృతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఎనలేని సేవ చేసిన వారియందు ఆయన ముఖ్యుడు. ఆయన ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, అధ్యక్షులుగా సేవలందించి, గ్రంథాలయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినారు. ఆయన వ్రాసిన 'తెలంగాణాలో జాతీయోద్యమాలు'  లోని 'విశాలాంధ్రోద్యమము' భాగాన్ని ఇక్కడ సీరియల్ గా పోస్ట్ చేస్తున్నాము. మొత్తం టైపు చేయబడిన తర్వాత దానిని ఈబుక్ రూపంలో అందరికి అందుబాటులో ఉంచుతాము


ఆంధ్రావళికి మోదము - చారిత్రాత్మక ప్రకటన


భారత ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ 5వ మార్చి 1956 నాడు నిజామాబాదులో సుమారు రెండు లక్షల ప్రజలతో కూడిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో విశాలాంధ్ర ఏర్పడవలెనని భారత ప్రభుత్వము చేసిన నిర్ణయమును ప్రకటించిన సందర్భము ఆంధ్రదేశ చరిత్ర లో చరిత్రాత్మకమైన, మహోజ్వలమైన ఘట్టము. రెండువందల సంవత్సరాల తరువాత తిరిగి తెలుగు ప్రజలందరు రాజకీయముగా ఏక కుటుంబీకులు కాగల అవకాశము నిచ్చిన భారత ప్రధాని ప్రకటన ఆంధ్రావళికి మోదము చేకూర్చినది. ఈ ప్రకటన నిజామాబాదున జరుగుటయందు కూడ ఒక విధమైన ఔచిత్యము కన్పించుచున్నది. ఈ నిజామాబాదులోనే పోలీసు చర్యకు చాలా సంవత్సరాల ముందు జరిగిన ఆంధ్ర మహాసభ నాలుగవ సమావేశములో ఆంధ్రోద్యమము రాజకీయోద్యముగా రూపొందినది. పోలీసు చర్య తరువాత ఈ నిజామాబాదు పట్టణములోనే జరిగిన హైదరబాద్ స్టేట్ కాంగ్రెసు మహాసభలో హైదరాబాద్ విభజన గావించి ఆంధ్ర,మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలను పొరుగునున్న ఆ భాషా రాష్ట్రాలతో కలిపివేయవలెనని తీర్మానించనైనది.ఆ నిజామాబాదు లోనే 1956 సంవత్సరమున విశాలాంధ్ర ప్రకటన జరిగినది.

ఇంగ్లీష్ సామ్రాజ్య వ్యాప్తితో భారతదేశమున రాష్ట్రాల ఏర్పాటు ప్రజల అవసరాలతో  నిమిత్తము లేక పరదేశ పరిపాలకుల అవసరాలకు ఉపయోగ పడునట్లుగా జరిగింది.తత్ఫలితముగ కుతుబ్ షాహీల పాలన ముందే కాక నిజామ్ షాహీల పాలనమందు కూడ కొంతకాలము ఏకముగా నుండిన ఆంధ్రులు మద్రాసు, హైదరాబాదు రాష్ట్రాలలో చీలిపోవుట జరిగినది. సుమారు నూటయేబది సంవత్సరాలకు పైగా చీలిపోయిన తరువాత తిరిగి ఏకము కావలెనను అభిలాష 1900 సంవత్సరములో మొట్టమొదట పొడసూపినది. బ్రిటిష్ ఆంధ్రుడైన కీర్తిశేషులగు కొమర్రాజు వేంకట లక్ష్మణరావు గారు హైదరాబాదుకు వచ్చి 1900 సంవత్సరములో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయము, 1904 సంవత్సరములో విజ్ఞానచంద్రికా గ్రంథమండలిని స్థాపించి, ఉభయ ప్రాంతాలలో నున్న తెలుగువారిని వైజ్ఞానికముగ దగ్గరకు తీసుకొనివచ్చిరి. ఈ నైజ్ఞానికోద్యమము క్రమక్రమముగ నాటక ప్రదర్శనాలు, పత్రికలు, వైజ్ఞానికుల పర్యటనలు మొదలైన సాంస్కృతికోద్యమాల ద్వారా వ్యాపించి, బలపడి, పోలీసు చర్య జరిపిన కొన్ని సంవత్సరాలలోనే సాంస్కృతికముగ విశాలాంధ్ర స్థాపన కావించినది.అందుచేతనే తెలంగాణా నాయకులైన కొండా వెంకటరంగారెడ్డిగారు 1955 జూలై నెలలో జరిగిన తెలుగుభాషా సమితి శాఖ ప్రారంభోత్సవ సమయమున సాంస్కృతికముగ విశాలాంధ్ర ఏర్పడినదని ఉద్ఘాటించిరి. రాజకీయ 
విశాలాంధ్రకు పూర్వమే సాంస్కృతిక విశాలాంధ్ర ఏర్పడుట సహజము, స్వాభావిక పరిణామము. 

రెండు దశాబ్దాల క్రిందట భావన


రాజకీయముగ విశాలాంధ్రకూడ రెండు దశాబ్దాల క్రిందట భావించిన ఉద్యమమనియే చెప్పవచ్చును. హైదరాబాదులోని ఆంధ్రోద్యమమును గురించి ఇది విశాలాంధ్రోద్యమముగ పరిణమించ వచ్చునను అనుమానము ఇరువది సంవత్సరాల క్రిందట  అప్పటి హైదరాబాదు ప్రభుత్వమునకు కలిగినది. 1936 లో హైదరాబాదు ప్రభుత్వమునకు హోం సెక్రటరీగా నుండిన నవాబు ఆలియావర్ జంగ్ బహద్దూర్ అప్పుడు ఆంధ్రమహాసభ అధ్యక్షులుగా నుండిన మాడపాటి హనుమంతరావు పంతులుగారితో ప్రభుత్వమునకు గల పై అనుమానమును వెల్లడించియుండిరి. 1946వ  సంవత్సరములో కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్యగారు " విశాలాంధ్రలో ప్రజారాజ్యము" అను పుస్తకమును వ్రాసి, పై అనుమానము సకారణమైనదని నిరూపించియున్నారు. హైదరాబాదులోని  సాంస్కృతోద్యమము విశాలాంధ్రమునకు పునాదులు వేసినది. దేవులపల్లి రామానుజరావు సంపాదకత్వమున 1947  లో వరంగల్లు నుండి వెలువడిన " శోభ" మాస పత్రిక విశాలాంధ్ర దృక్పథముతో నడిచినది.

రెండు పాయలు


ఈ శతాబ్దమున ఆంధ్రోద్యమము రెండు పాయలుగా అభివృద్ధి పొందినది.ఇందులో మొదటిది మద్రాసు రాష్ట్రములోని ఆంధ్ర రాష్ట్రోద్యమము. మన దేశమున భాషారాష్ట్రోద్యమము భారత జాతీయోద్యమమునకు అనుబంధముగ నిర్వహింపబడినది. భాషారాష్ట్రాలను భారత జాతీయ కాంగ్రెసు స్వాతంత్య్రమునకు పూర్వమే బలపరచి తన రాష్ట్ర కాంగ్రెసు సంఘాలను ఈ ప్రాతిపదిక మీదనే నిర్మించినది. భారతదేశమునకు
స్వాతంత్య్రము రాకపూర్వము మద్రాసు రాష్ట్రములోని ఆంధ్రోద్యమము ఆ రాష్ట్రములోని ఆంధ్ర ప్రాంతమునకు మాత్రమే పరిమితమైన రాష్ట్రోద్యమముగ నుండెను. రెండవ పాయ హైదరాబాదులోని ఆంధ్రోద్యమము. ఈ ఉద్యమము యొక్క లక్ష్యము పోలీసుచర్యకు పూర్వము వరకు హైదరాబాదులో బాధ్యతాయుత ప్రభుత్వస్థాపనయై యుండెను. కాని భారతదేశమునకు స్వాతంత్య్రము ప్రాప్తించి స్వదేశ సంస్థానాలు స్వతంత్ర భారతమునందలి అంతర్భాగాలైన తరువాత ఉభయప్రాంతాలలోని ఆంధ్రోద్యమ దృక్పథములో స్పష్టమైన, సహజమైన పరిణామాలు కన్పించినవి. ఈ పరిణామమే తిరిగి ఆంధ్రులందరు ఏక రాష్ట్రవాసులు కావలెనను ఉద్యమముగ రూపొందినది.ఇటువంటివే సంయుక్త మహారాష్ట్ర, ఐక్య కర్నాటక ఉద్యమాలు. కావుననే మైసూరు,హైద్రాబాదు రాష్ట్రాలు స్వతంత్ర భారత యూనియన్ లో చేరిన తరువాత 26 వ నవంబరు 1949 వ సంవత్సరమున విశాలాంధ్ర మహాసభ స్థాపన జరిగినది. ఈ మహాసభ తరువాత 1950 ఫిభ్రవరి 13 ,14 తేదీలలో సమావేశమై, విశాలాంధ్ర తన ఆదర్శముగా ప్రకటించినది. 1953 అక్టోబరు  2వ తేదీనాడు మద్రాసు రాష్ట్ర విభజన, అక్కడి తెనుగు ప్రాంతాలతో కూడిన ఆంధ్రరాష్ట్ర స్థాపన జరిగినది. ఇది విశాలాంధ్ర రాష్ట్రస్థాపనకు తొలిమెట్టు. 

1 కామెంట్‌:

  1. తెలంగాణా లో ఆంద్ర నేతల మాయ మాటలకు భ్రమసి
    "విశాలాంధ్ర ఝెండా" పట్టుకుని ప్రజల చేతుల్లో రాళ్ళ దెబ్బలు తింటూ కూడా వరంగల్ లో ఊరేగిన వారిలో కాళోజి కూడా వున్నాడు.

    ఆయన ఆంధ్ర నేతల మోసాన్ని, తెలంగాణా చవట నాయకుల స్వార్ధాన్ని గ్రహించి ఆ తర్వాత ఎంతోమంది లాగే ప్రత్యెక తెలంగాణా ఉద్యమంలో చేరాడు .
    కాళోజీ ఎంతో ఆవేదనతో రాసిన ఈ కవితే
    మీకు తిరుగులేని సమాధానం :
    చదవండి

    ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు,
    ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని
    హామీలిచ్చినవారే అంతా స్వాహా చేస్తారని ||ఎవర||

    అన్నలు ఒప్పందానికి సున్నా చుట్టేస్తారని
    పరిపాలనతో తమ్ముల ‘ఫజీత’ పాలు చేస్తారని ||ఎవర||

    ముఖ్యమంత్రియే స్వయముగ సఖ్యత ఛేదిస్తాడని
    ప్రాంతీయాధ్యక్షుండు ప్రక్క తాళమేస్తాడని ||ఎవర||

    ‘కావలి కుక్కలు’ దొంగల గంజికాసపడతాయని
    కావలివాడే దొంగల కావళ్లను మోస్తాడని ||ఎవర||

    సిబ్బందిలోగల తమ్ముల ఇబ్బంది పెడతారని
    అన్నలమను మాట మరచి అహంకార పడతారని ||ఎవర||

    తమ్ముని తల బోడిచేసి దక్షత అనుకుంటారని
    తంతే-తమ్ముడు అన్నను తన్నిండని అంటారని ||ఎవర||

    తపుడు లెక్కతొ తమ్ముల నెప్పుడు ఒప్పిస్తారని
    అంకెల గారడి చేస్తూ చంకలు ఎగిరేస్తారని ||ఎవర||

    పోచంపాడు, శకుని పాచిక పాలౌతుందని
    తెలంగాణవాసులకు త్రిశంకుస్థాయి వస్తుందని ||ఎవర||

    ప్రాంతాన్ని పాడుచేసి శాంతి శాంతి అంటారని
    కడుపుల్లో చిచ్చుపెట్టి కళ్ళు తుడువ వస్తారని ||ఎవర||

    అధికార ప్రకటనలో అబద్దాలె ఉంటాయని
    బాధ్యతగల మంత్రికూడ బాతాలే కొడతాడని ||ఎవర||

    మంత్రి అయిన మురిపెముతో మనిషి దయ్యమౌతాడని
    ప్రజాస్వామ్య విధానాన్ని బదనాము చేస్తాడని ||ఎవర||

    ఓట్లు పొంది సీటు దొరక నోట్ల మన్ను పోస్తాడని
    నమ్మకద్రోహం చేస్తూ గమ్మున కూర్చుంటాడని ||ఎవర||

    ప్రజాస్వామ్యమీ తీరుగ పాడుచేయబడుతుందని
    శాసనసభ వుండికూడ మోసమె సాగిస్తారని ||ఎవర||

    విశాలాంద్రులను సైతము విషాదులను చేస్తారని
    తెలంగాణ వేర్పాటుకు తీరులు కల్పిస్తారని ||ఎవర||

    తీరవాసులైనంతనె తీర్థంకరులౌతారని
    తెలంగాణ వాసులను దేభ్యాలుగ చూస్తారని ||ఎవర||

    అభయమిచ్చి కుత్తుకనే అదిమి అదిమి పడతారని
    ఆక్రోశిస్తే శాంతికి అంతరాయమంటారని ||ఎవర||

    తెలంగాణ వేరంటె తెలివి లెక్క పెడతారని
    ఆత్మహత్య ధోరణంచు హంగామా చేస్తారని ||ఎవర||

    ‘ముల్కి’ మంత్రులందరును ముఖ్యమంత్రి భజన చేస్తారని
    దొడ్డిదారి పదవులతో దొడ్డవారు అవుతారని ||ఎవర||


    ప్రతినిధులు ప్రజల మరచి పదవిపథము పడతారని
    బ్రహ్మానందునిపదమున బ్రహ్మపదముకంటారని ||ఎవర||

    విచ్చలవిడి ఖర్చులతో విలాసాలు చేస్తారని
    కేంద్రంపై నిందమోపి కేరింతలు కొడతారని ||ఎవర||

    బార్డరువీరులు ద్రోహుల ఆర్డరు పాటిస్తారని
    చేటుగూర్చినోనికి తమ ఓట్లు అందజేస్తారని ||ఎవర||

    చేతకు సిద్ధాంతానికి చీమ ఏన్గు తేడాయని
    వట సావిత్రి వ్రతమును వారకాంత చేస్తుందని
    ఎవరనుకొన్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు.

    రిప్లయితొలగించండి