31, ఆగస్టు 2012, శుక్రవారం

కె.సి.ఆర్.అవాకులు..చెవాకులు..

                    సాధారణ శాంతి భద్రతలకు,   దేశ సార్వభౌమత్వానికి భంగకరం కాని   రీతిలో ఎవరైనా తమ  కోర్కెల  సాధన కోసం ఉద్యమాలు చెయ్యడం రాజ్యాంగబద్ధమే కనుక దాన్ని  ఎవ్వరూ తప్పుబట్టబోరు. ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ఉద్యమాన్ని కూడా  - అది పెడ పోకడలు పోనంతవరకూ-వ్యతిరేకించాల్సిన అవసరం  కూడా ఎవరికీ లేదు      ఈ దేశ ప్రజలకు - ప్రత్యేకించి  ఈ రాష్ట్ర ప్రజలకు -- ఉద్యమాలు కొత్తవేమీ  కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వారు చెప్పుకునే స్వేచ్చ ఉంది.    అయితే  ఇటీవల  కొందరు ప్రత్యేక తెలంగాణ  ఉద్యమ నేతలు     ప్రజలను రెచ్చగొట్టడానికి  బాధ్యతారహితంగా తమకు తోచినట్లు మాట్లాడడం   సర్వ సాధారణం అయిపోయింది.  ఎప్పటికప్పుడు తన ఉత్తేజ పూరిత ఉపన్యాసాలతో  జనాన్ని ఆకట్టుకుంటూ,  అబద్ధాలు చెప్పి  వారిని రెచ్చగొడుతూ,తన పబ్బం గడుపుకుంటూ వస్తున్న  టి.ఆర్.యస్.అధ్యక్షుడు కేసీఆర్ తాజాగా ఇందుకోసం  చరిత్ర వక్రీకరణకు కూడా పూనుకోవడం దారుణం.

                        ఇటీవల ఆయన తవ్వి తీసిన చారిత్రక విశేషం--నన్నయ్య తెలుగులో ఆదికవి కాడనీ,ఆయన   సంస్కృత   మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం మాత్రమే చేసినందున ఆయన కేవలం అనువాదకవి మాత్రమేననీ. ‘బసవపురాణం'రాసిన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ఆదికవి అని తేల్చారాయన.’ ఈ ముచ్చట కూడా ఆంధ్రోల్లు అబద్ధం చెప్తరు. నేను ఇట్లా అంటే వాల్లు కొట్లాటకు వస్తరు. పక్కన ఓ కవి (నందిని సిద్దారెడ్డి) ఉండడం వల్ల ఈ మాట.ధైర్యంగా చెబుతున్నా’ ననికూడా సెలవిచ్చారాయన.

                           అలా కేసీఆర్ అలనాటి మహాకవులకు కూడా నేటి మన ప్రాంతీయ తత్త్వపు బురదను అంటించాలని చూడడం క్షమించరాని నేరం.పాల్కురికి సోమనాథుడు నేడు తెలంగాణ అని పిలువబడుతున్న ప్రాంతానికి చెందినవాడనే నమ్మకంతోనే, మితిమీరిన ప్రాంతీయ అభిమానంతో  ఆయన  అలా సోమనాథ కవిని ఆదికవిని చేయబూనారనేది స్పష్టం.  నన్నయ్య నేడు ఆంద్ర ప్రాంతంగా పిలువబడుతున్న ప్రాంతానికి చెందినవాడనేది నిర్వివాదాంశం. అయితే మహాభారత అనువాదాన్ని ఆరంభించిన నన్నయ్య భట్టు (క్రీ.శ.1026 ప్రాంతం) కంటే ‘కుమార సంభవ' కావ్యం రాసిన నన్నెచోడుడు ముందరివాడని  మానవల్లి రామకృష్ణ కవి గారి వంటి ప్రముఖ విమర్శకులు  కొందరు వాదించినా, నన్నయ్యే ఆదికవి అని    హెచ్చుమంది సాహిత్య చరిత్రకారులు తేల్చారు..అందుచేతనే తెలంగాణకు చెందిన  మహాకవి సినారె ‘ఆదికవి నన్నయ్య అవతరించిన నేల’ అంటూ ఓ సినీ గీతంలో  కూడా రాశారు. ఇక ఇప్పుడు , క్రీ.శ.1300 ప్రాంతంలో  ‘పండితారాధ్య చరిత్రము' రాసిన  పాల్కురికి సోమన తెలుగులో ఆదికవి  అంటున్నారు కేసీఆర్. పోనీ   భారతం అనువదించిన నన్నయ్య లాగానే  ‘కుమారసంభవం' అనే సంస్కృత కావ్యాన్ని అనువదించిన నన్నెచోడుడు, ‘గణిత సార సంగ్రహం ‘ అనే అనువాద గ్రంథం రాసిన పావులూరి మల్లన్నలు  కూడా  అనువాద కవులే కనుక   కేసీఆర్ లెక్క ప్రకారం  వారిరువురూ కూడా  ఆదికవి  గౌరవానికి  తగినవారు కాదనుకుందాం.  తేనెలొలికే తేట తెలుగులో ‘సుమతీ  శతకం', ‘నీతి శాస్త్ర ముక్తావళి' అనే రాజనీతి గ్రంథం రాసిన  బద్దెన కూడా వారి దృష్టిలో ఆదికవి గౌరవానికి నోచుకోలేదా?  పోనీ చాళుక్య యుగానికే    చెందిన తెలుగు కవులు  వేములవాడ భీమకవి, అమృత నాథుడు వీరి కంటికి ఆనలేదా ?  నేటి తూర్పు గోదావరి జిల్లా దాక్షారామానికి చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు (జననం క్రీ.శ.1140) ‘శివ తత్త్వ సారం’ అనే  తెలుగు శతకం రాసినట్లు కూడా కేసీఆర్ కు తెలియకపోవడం చిత్రం !   మరీ విచిత్రమేమిటంటే ఆ మల్లికార్జున పండితారాధ్యుని అనంతరం ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర' పేరుతో క్రీ. శ.1300 లో కావ్యం రాసిన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ‘ఆదికవి ‘ అని శ్రీవారు తీర్మానించడం !!   కేసీఆర్ గారి ఈ చారిత్రక హ్రస్వ దృష్టికి కారణం మితిమీరిన వారి ప్రాంతీయ దురభిమానమేనని వేరుగా చెప్పాల్సిన పని లేదనుకుంటాను.  ఇప్పుడిక మల్లికార్జున  పండితారాధ్యుని కంటే ఆయన చరిత్రను ద్విపద కావ్యంగా రాసిన పాల్కురికి సోమన ముందరికాలానికి చెందినవాడని నిరూపించే  దుస్సాహసానికి కేసీఆర్ పూనుకోరు కదా !!!

                    ఇక కేసీఆర్ చే  ‘ఆదికవి'గా గుర్తించబడిన పాల్కురికి సోమన వాస్తవంగా  ఏ ప్రాంతానికి చెందినవాడో విచారిద్దాం. ‘బసవ పురాణం', ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర' అన్న కావ్యాలు రాసిన పాల్కురికి సోమన ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుని సమకాలికుడని కొందరి భావన. దీనికి ఆధారం పిడుపర్తి సోమన అనే కవి రాసిన ‘బసవ పురాణం'లో పాల్కురికి సోమన ప్రతాపరుద్రుని కాలంలో ఉండేవాడని చెప్పడం. అతడు బహుశా క్రీ.శ.1296-1323 మధ్య కాలంలో ఓరుగల్లును పాలించిన  రెండవ ప్రతాపరుద్రుడికి సమకాలికుడని  మనం  భావించినా, అతడు ఓరుగల్లుకు చెందినవాడని నిర్ధారించడం కష్టం.ఓరుగల్లుకు 70 మైళ్ళ దూరంలో ఉన్న పాలకుర్తే ఒకనాటి సోమనాథుని స్వస్థలం అయినట్టి పాలకురికి అని కొందరి భావన. కాని ఈ సిద్ధాంతం సర్వజనామోదం పొందలేదు. సువిశాలమైన కాకతీయ సామ్రాజ్యంలో నాడు దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాలు అంతర్భాగాలు. ఆ సువిశాల సామ్రాజ్యంలో ప్రతాపరుద్రునికి సమకాలికునిగా సోమనాథుడు   ఉన్నాడని అంటే, వరంగల్ జిల్లా పాలకుర్తే    సోమనాథుని స్వస్థలం పాలకురికి అని నిర్ధారించబూనడం  తొందరపాటు కాగలదు. పాలకుర్తి , పాల కురికి గ్రామనామాలు వేర్వేరు. తెలంగాణ వీరవనిత ‘చాకలి ఐలవ్వ ‘ గా ప్రసిద్ధురాలైన చిట్యాల ఐలమ్మ స్వస్థలం పాలకుర్తి. ఇక ఇప్పుడు నాటి కాకతీయ సామ్రాజ్యంలో పాలకురికి గ్రామం ఎక్కడ ఉన్నదో పరిశీలిద్దాం.

              నిజాం  రాష్ట్రపు గ్రామనామాల పట్టికను నిశితంగా పరిశీలించిన విఖ్యాత పరిశోధకులు డా.చిలుకూరి నారాయణ రావు వరంగల్ జిల్లాలో అసలు పాలకురికి అనే పేరుగల గ్రామమే లేదని తేల్చారు.  మరో పరిశోధకులు ఆర్. నరసింహాచార్యులు గోదావరి జిల్లాలోని పాల కురికి గ్రామమే సోమనాథుని జన్మస్థలమని   పేర్కొన్నారుగానీ ,  వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలలోనూ పాలకురికి పేరుతో గ్రామమేదీ లేదు.  కిట్టెల్ పండితుడు  దక్షిణ మహారాష్ట్రలో పాలకురికి పేరుగల ఒక గ్రామముందని పేర్కొన్నారు.అయితే సోమనాథుని భాష, శైలి వగైరాలను పరిశీలిస్తే అతడు దక్షిణ మహారాష్ట్రకు చెందినవాడయ్యే అవకాశమే లేదు.కన్నడ భాషలో ‘కురికి', ‘గురికి' శబ్దాలు గ్రామానికి పర్యాయపదాలు.మన తెలుగులో కుర్రు (కసుకుర్రు,బోడసకుర్రు మొ.), కుచ్చి (పోతుకుచ్చి మొ.), తమిళ భాషలో కురిచ్చి (పాంచాల కురిచ్చి మొ.) శబ్దాలు ఇలాంటివే. కుర్రు శబ్దం కొన్ని గ్రామనామాలలో కాల క్రమంలో ‘కుర్తి' (పాలకుర్తి, చీమకుర్తి మొ.) గానూ, మరికొన్ని గ్రామనామాలలో ‘కూరు' (నిమ్మకూరు, పొదలకూరు)గానూ రూపాంతరం చెందింది. అలా పాలకుర్తి గ్రామనామం యొక్క  పూర్వరూపం ‘పాలకుర్రు' అవుతుందే కానీ ‘పాలకురికి' అయ్యే అవకాశమే లేదు.

పైపెచ్చు కురికి, గురికి శబ్దాలతో అంతమయ్యే గ్రామనామాలు కన్నడ దేశంలోనే ఉన్నాయి.సోమనాథుడు తెలుగులో మహాకవి. కన్నడ  భాషలోనూ    కొన్ని రచనలు చేసాడు. ఉభయ భాషలు మాట్లాడే ప్రజలు ఆయన్ని అమితంగా గౌరవిస్తారు.అతడి భాష, శైలి వగైరాలు  కూడా అతడు కన్నడ భాషా ప్రభావం ఉన్న ప్రాంతానికి చెంది ఉంటాడని సూచిస్తున్నాయి. కర్నాటక రాష్ట్రం తుమ్కూరు తాలూకాలో పాలకురికి పేరు గల ఓ గ్రామం ఉంది.ఇది మన అనంతపురం జిల్లా మడకసిరకు కేవలం ఇరవై మైళ్ళ దూరంలో ఉంది.కన్నడిగులు దీనినిప్పుడు హాలకురికి
అంటున్నారు.  ఇదే సోమనాథుని జన్మస్థలమని  డా. చిలుకూరి అభిప్రాయపడ్డారు.ఇది సమంజసమే.ఎందుకంటే కన్నడ భాషలో ‘ప' శబ్దం ‘హ' గా పలుకబడుతుంది. పల్లిని వారు ‘హళ్లి' అంటారు. పులిని ‘హులి' అంటారు.పామును ‘హావు' అంటారు. మనం ‘పాల పరిమి ‘ అనే గ్రామాన్ని వాళ్ళు ‘ హాల హరివి ‘ అంటారు..అలానే పాల కురికి గ్రామనామం  కన్నడిగుల పలుకుబడిలో ‘హాల కురికి'గా మారిందనేది సుస్పష్టం.

                       ఇంత చర్చించిన తరువాత , భాషా సరిహద్దులు లేని నాటి కాకతీయ రాజ్యంలోని  (నేటి కర్నాటక రాష్ట్రంలోని ) పాలకురికి కి చెందిన  ఓ మహాకవిని , ఆయన్ని  తనకు తాను  నేటి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడని భావించేసి, ఆ కారణంగా ఆయన్ని  కూడా  తన ప్రాంతీయ దురభిమానపు కళ్ళద్దాలలోంచి చూస్తూ,  (నేటి  కోస్తా ఆంద్ర ప్రాంతానికి చెందిన )   నన్నయ్య స్థానంలో ఆదికవిని చేయబూనే కేసీఆర్ చర్య  ఎవరికైనా జుగుప్స కలిగించక మానదు. ఒకవేళ ఆ మహాకవి నిజంగా తెలంగాణ కు చెందినవాడే అనుకున్నా, ఏరకంగా చూసినా ఆయన తెలుగులో  ఆదికవి కాబోడనేది సుస్పష్టం.రాజకీయనేతలు జనం మనోభావాలు రెచ్చగొట్టడానికి పలికే పచ్చి అబద్ధాలలో భాగమే కేసీఆర్ పలికిన ఈ అవాకులు, చెవాకులు.అంతకంటే వాటికి ఎటువంటి విశ్వసనీయత లేదు.

                           నేటి కోస్తా ఆంద్ర ప్రాంతానికి చెందినంతమాత్రం చేత నన్నయ్య తెలుగులో ఆదికవీ, తెలుగు ప్రజల ఆరాధ్యకవీ కాకుండా పోతాడా ? భాషకు రాష్ట్ర, ప్రాంతీయ ఎల్లలు విధించడం సమంజసమేనా ? నేటి తెలంగాణ ప్రాంతానికి చెందిన  సురవరం ప్రతాపరెడ్డి, వానమామలై వరదాచార్యులు, పల్లా  దుర్గేశ్వర శర్మ, కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, సినారె, బిరుదురాజు రామరాజు వంటి  గొప్ప సాహితీవేత్తలను  ఎటువంటి సరిహద్దులు లేకుండా ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన  తెలుగువారైనా అభిమానిస్తారు. ఇందుకోసం ఆ అభిమానులు   కూడా తప్పనిసరిగా నేటి తెలంగాణ ప్రాంతంలో పుట్టాల్సిన అవసరమేమీ లేదు.భాషా, సాహిత్యాలు, కళలను  అభిమానించడానికి, ఆ యా సాహితీమూర్తులు, కళాకారులను ఆరాధించడానికి  మన  మనస్సులో మనం ఏర్పరచుకున్న ప్రాంతీయ అడ్డుగోడలు ఎన్నటికీ ఆటంకం కాబోవు.ఎంచేతంటే అవి సార్వకాలీనమైనవేకాక, సార్వజనికమైనవి కూడా!!

         తెలుగుతల్లి స్థానంలో కేసీఆర్ తెలంగాణ తల్లిని కొత్తగా ప్రవేశపెట్టారు.  ఆమేమో మాత అట; తెలుగుతల్లేమో దయ్యమట.తెలుగు ఆణెము - అంటే తెలుగు మాట్లాడే ప్రాంతం - అనే అర్థంలో ఆ ప్రాంతాన్ని తెలంగాణము  అన్నారని కేసీఆర్ మరచినట్లున్నారు.  యాసలో కొంత తేడా ఉన్నా,  అక్కడి వారిదీ, ఇక్కడి  వారిదీ- ఇరువురిదీ తెలుగు  మాట్లాడే ప్రాంతమే. కాకపోతే ఈ రెండు ప్రాంతాలవారూ  సుదీర్ఘ కాలంపాటు పరాయి పాలనలో మగ్గారు. ఒకరు నిజాం  నిరంకుశత్వంలో కనలిపోతే, మరొకరు బ్రిటీష్ సామ్రాజ్యవాదుల పదఘట్టనల కింద నలిగి నల్లేరయ్యారు. ఆంద్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు నిజాం పాలన యొక్క దాస్య సంకెళ్ళనుంచి ప్రజల్ని విముక్తం చేసే పోరాటంలో ముందు పీటీన నిలిచాయి. ఆ పోరాటంలో తెలంగాణ వీరులతో భుజం కలిపి నిలిచిన ఎందఱో కోస్తా ఆంద్ర ప్రాంత యోధులు సైతం నేలకొరిగారు.  ఇప్పుడు కొత్తగా ‘ఒకరిది తెలుగు భాష  - ఇంకొకరిది తెలంగాణ భాష ‘ అంటూ శ్రీవారు కొత్త పల్లవి అందుకున్నారు. ఇద్దరిదీ తెలుగు భాషే కాకపోతే విశాలాంధ్ర నిర్మాణానికీ, అందుకోసం  ముందుగా తెలంగాణ  విముక్తికీ , కోస్తా ఆంద్ర ప్రజలు ఎందుకు ఉద్యమించారు ? ఎందఱో త్యాగధనులు ఆ సాయుధ రైతాంగ ఉద్యమంలో అసువులెందుకు  కోల్పోయారు ?  

                   ‘ఆంధ్రమాత స్థానంలో ఆంధ్రోల్లు తెలుగుతల్లిని  కొత్తగా ముందుకు తీసుకు వచ్చా ‘రంటూ  మరో పచ్చి అబద్ధం పలికారు కేసీఆర్.  నిజానికి ఆంధ్రము , తెలుగు - ఈ రెండు పదాలనూ తెలుగువారు ఒకే అర్థంలో ప్రయోగించారు.’మాతా నీకిదే వందనం..ఆంద్ర మాతా నీకిదే వందనం' అనీ ,‘ మా తెలుగుతల్లికీ మల్లెపూదండ' అనీ, ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా..గతమెంతో ఘన కీర్తి కలవోడా..’ అనీ తెలుగు ప్రజలు ఇష్టంగా పాడుకునే   పాటలన్నీ  తెలుగు కవులు ఇంచుమించుగా ఒకే కాలంలో సృష్టించారు.  ఇంతకాలం విభజనవాదులు తెలంగాణ పది జిల్లాలలో ‘ఆంద్ర' అనే శబ్దం మీద వ్యతిరేకత కలిగించే ప్రయత్నం చేశారు.ఇప్పుడేమో ఏకంగా ‘తెలుగు’అనే శబ్డంపైనే వారు కత్తి కట్టారు. ప్రజల్ని ఇంకా ఎక్కడికి తీసుకుపోదలచారో వారు ? ‘తెలుగు', ‘ఆంద్ర' శబ్దాలను ఒకే అర్థంలో వాడారు కనుకనే మెదక్ జిల్లా జోగిపేటలో తెలుగువారిని ఏకం చేసే ఉద్దేశంతో జరిపిన సభను  ‘ప్రథమ ఆంద్ర మహాసభ ‘అన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ లోని తెలుగువారు స్థాపించుకున్న గ్రంథాలయానికి ‘శ్రీ కృష్ణదేవరాయ ఆంద్ర భాషా నిలయం' అని పేరు పెట్టుకున్నారు.బొగ్గుల కుంటలో ‘ఆంద్ర సారస్వత పరిషత్తు' వెలిసింది.’ఆంద్ర మహిళా సభ' అలాగే స్థాపించుకున్నారు.మాడపాటి హనుమంతరావు గారిని ‘ఆంద్ర పితామహ' అని పిలుచుకున్నారు. తెలుగువారిని ఒక్కటి చేసి,  భాషాభివృద్ధి ద్వారా వారి మధ్య సాంస్కృతిక సమన్వయం  సాధించే ఉద్దేశంతో ఏర్పరచిన  తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం సంగతి సరేసరి. అప్పుడు పనికొచ్చిన ‘ఆంద్ర', ‘తెలుగు' పదాలు ఇప్పుడెందుచేత  గిట్టనివిగా అయ్యాయో శ్రీవారే సెలవివ్వాలి. అంతేకాదు;  ‘ఆణెము ‘ అంటే దేశము అనే అర్థం ఉన్న  కారణంగానే ‘తెలుగు మాట్లాడే ప్రదేశము ‘అనే అర్థంలో తెలంగాణ అనే శబ్దం ఏర్పడితే, తీరా ఇప్పుడు  ‘మా  ప్రజలు మాట్లాడేది తెలుగు కాదు ; మా తల్లి తెలుగుతల్లి కాదు’ అని నొక్కి వక్కాణిస్తున్న  కేసీఆర్ తన మాటలవెనుక ఆంతర్యమేమిటో కూడా సెలవివ్వాలి. ఆత్మలు ఉండడమే కనుక నిజమే అయితే ‘తెలుగువాడవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడేదవు సంగతేమిటిరా; అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా ?’ అని చురకలు అంటించిన కాళోజీ నారాయణరావు గారి ఆత్మ  కేసీఆర్ తీరు చూసి ఘోషించి తీరుతుంది.
                        
                  కోస్తా ఆంద్ర, రాయలసీమ ప్రజలను కించపరుస్తూ, ‘అక్కడ పన్నుల ఎగవేత ఎక్కువ.వాల్లు చట్టాలను ఉల్లంఘిస్తారు.’ అంటూ కొత్త రాగాలు తీస్తున్నారు   కేసీఆర్. రాష్ట్రంలోని ఎన్నో పరిశ్రమలు వాటి కార్యాలయాలను సౌలభ్యం కోసమని హైదరాబాద్ లో పెట్టుకుని, అక్కడే పన్నులు చెల్లిస్తున్న కారణంగానే హైదరాబాద్ ఆదాయం, అందుచేత తెలంగాణ ఆదాయం ఎక్కువగా  కనిపిస్తూ ఉన్నదనే వాస్తవాన్ని  అక్కడి ప్రజలు గ్రహించకుండా  ఇంకా ఎంతకాలమో  తాను వారి కళ్ళకు గంతలు కట్టలేనని   కేసీఆర్ గుర్తిస్తే మంచిది.ఒకప్రాంత ప్రజలంతా నిజాయతీపరులుగానూ,   మరో ప్రాంత ప్రజలంతా పన్ను ఎగవేతదారులుగానూ ఉండడం ఎలా సాధ్యమో, ఈ కుతర్కం పన్నిన కేసీఆరే వివరించి ఉంటే బాగుండేది.

                   విద్వేషం అనే విషం చిమ్మే ఇటువంటి వారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.

ఇలాంటివారిని జనం నిలదీసి, ప్రశ్నించే రోజు రావాలని కోరుకుందాం.

                                                                                                            -ముత్తేవి రవీంద్రనాథ్

4 కామెంట్‌లు:

  1. చాల బాగా వ్రాసారు. సంకుచితమైన ప్రాంతీయ తత్వానికి, విద్వేషాలకు మరియు రాజకీయ స్వప్రయోజనానికి మహానుభావులైన వారిని కించపరచటం అత్యంత బాధాకరం. ప్రపంచంలోని తెలుగు వారందరికీ ఆరాధ్యులైన వారిని ఒక ప్రాంతానికి పరిమితం చెయ్యడం మహా పాపం. ఆ భగంతుడు క చ రావు గారికి ఇంగితం ప్రసాదించు గాక.

    రిప్లయితొలగించండి
  2. చాల బాగా వ్రాసారు. సంకుచితమైన ప్రాంతీయ తత్వానికి, విద్వేషాలకు మరియు రాజకీయ స్వప్రయోజనానికి మహానుభావులైన వారిని కించపరచటం అత్యంత బాధాకరం. ప్రపంచంలోని తెలుగు వారందరికీ ఆరాధ్యులైన వారిని ఒక ప్రాంతానికి పరిమితం చెయ్యడం మహా పాపం. ఆ భగంతుడు క చ రావు గారికి ఇంగితం ప్రసాదించు గాక.

    రిప్లయితొలగించండి
  3. నిలదీయటం కాదు, వెంటబడి తరిమేరోజులు దగ్గరలోనే ఉన్నాయ్!

    రిప్లయితొలగించండి
  4. తె'లంగా'ణ వాదుల నాయకుడికి సిగ్నల్స్ తప్పుగా వస్తున్నాయని నాలుగుకోట్లలో నలుగురు తప్ప అందరూ గుర్తించారు,కొత్త నాయకుడి కోసం తెలంగాణ అంతా గాలిస్తున్నారు.ఉన్మాదియా ఆచార్యుడిని ఎన్నుకుందామంటే ఈయనకి షార్ట్ మెమొరి,బ్యాటరీ పవర్ తక్కువ,యాష్కీ గారికి టివి కెమెరాల ఎదురుగా మాత్రమే ఉద్యమంచేయడం అలవాటు,కే'శవరావ్ గారంకుంటే ఆయన మాట్లాడింది ఏబాషో తెలబానులకే అర్థం కాదు,జానా గారంకుంటే ఆయన మాట్లాడింది ఆయనకే అర్థం కాదు,గద్దర్ గారేమో ఎర్రంచు నల్లదుప్పటి కప్పుకుని ఎగిరి ఎగిరి పాడటం తప్ప ఎమీచేయలేరు! ఎవరు ఎవరు??? మంత్రిపదవి పోగొట్టుకుని ఖాళీగా ఉన్న "శంకర్"గారు అయితే ఈ పదవికి సరి అయిన నాయకుడు అని నా అభిప్రాయం, జై శంకరన్న,జై :D

    రిప్లయితొలగించండి