7, డిసెంబర్ 2011, బుధవారం

చిన్న రాష్ట్రాలకు నేను వ్యతిరేకం : కుల్దీప్ నయ్యర్

ఆంధ్రజ్యోతి: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాను వ్యతిరేకమని, రెండో ఎస్సార్సీ వేసేందు కు ఇది సమయం కాదని ప్రముఖ జర్నలిస్టు, మాజీ హై కమిషనర్ కుల్దీప్ నయ్యర్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక రా ష్ట్రాల డిమాండ్లు అన్ని సమస్యలనూ ఆటోమేటిక్‌గా పరిష్కరించలేవని, పైగా ఎవరూ పరిష్కరించలేని మరిన్ని సమస్యలను సృష్టిస్తాయని స్పష్టం చేశారు. 'భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రాల సమస్య' అనే అంశంపై బోడోల్యాండ్ విద్యార్థి విభాగం మంగళవారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జాతీయ సదస్సు నిర్వహించింది.

ఇందులో కు ల్దీప్ నయ్యర్ పాల్గొని ప్రసంగించారు. చిన్న రాష్ట్రాల ఆ కాంక్షలు సమంజసమే కావొచ్చని, వీటి కోసం ఎస్సార్సీ వేయాల్సి ఉంటుందని, అయితే, తన దృష్టిలో రెండో ఎ స్సార్సీ వేసేందుకు కూడా ఇది సరైన సమయం కాదని వివరించారు. దేశంలో మరెన్నో సమస్యలు ఉన్నాయని, ఇప్పుడు ఎస్సార్సీ వేస్తే ఇక ఆ హంగామాలో పనులేమీ జరగవని చెప్పారు. మొదటి ఎస్సార్సీ సమయంలో ఇలాగే జరిగిందని, తాను అదంతా చూశానని, కాబట్టి ఇప్పుడు రెండో ఎస్సార్సీ వేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఏ రాష్ట్రంలోని ఆకాంక్షలపైనైనా ఎస్సార్సీ వేసే ముందు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎస్సార్సీతో ఆర్థికంగా కేంద్రంపై చాలా భారం పడుతుందని, దీనికి కేంద్రం డబ్బు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. అందుకే చిన్న రాష్ట్రాలకు తాను అనుకూలం కాదని తేల్చి చెప్పారు. తెలంగాణకు కూడా తాను అనుకూలం కాదని స్పష్టం చేశారు. మరొకవైపు కూడా మనోభావాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుకు ఇది సరైన సమయం కాదన్నారు. దీనివల్ల దేశం, రాష్ట్రం నాశనం కాకూడదని హితవు పలికారు.

ఒకవేళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటే.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కుల్దీప్ నయ్యర్ సూచించారు. తెలంగాణ అంశంలో కేంద్రం తప్పు చేసిందని, ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత కమిషన్‌ను ఏర్పాటు చేసిందని.. అలా కాకుండా ముందే కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఆ తర్వాత ప్రకటన చేసి ఉండాల్సిందని చెప్పారు.

ఒకవేళ తెలంగాణ ఏర్పాటైతే గూర్ఖాల్యాండ్, బోడోల్యాండ్, వి దర్భ, యూపీలో నాలుగు రాష్ట్రాల ఏర్పాటును డిమాండ్ చేస్తారని, ఇది సరైనదేనా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా తాను గౌరవిస్తాను. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజనకు మాత్రం అంగీకరించనని స్పష్టం చేశారు.

1 కామెంట్‌:

  1. మన దొరతనాలు యే పని సవ్యంగా చేస్తాయి కాబట్టి.
    అవి యేం చేసినా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే.
    అవి యేం చేసినా సంకుచిత పార్టీ ప్రాతిపదిక మీదనే
    అవి యేం చేసినా బడా వ్యాపారుల లాభాల కోసమే.
    అవి యేం చేసినా అందరకూ తెలిసిన అదృశ్యశక్తుల మెప్పు కోసమే
    అవి యేం చేసినా దేశం యొక్క అంటే దేశప్రజల యొక్క శాశ్వత లేదా దీర్ఘకాలికి ప్రయోజనాలకోసం కావటం లేదు. మన దౌర్భాగ్యం.
    అలాంటి వారిని మనం యెన్నుకుంటున్నాం. అనుభవిస్తున్నాం.

    రిప్లయితొలగించండి