22, డిసెంబర్ 2011, గురువారం

దార్శనికుడు పి.వి.

"ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుంజముగ
వెలుగుటయే నా తపస్సు
వెలిగించుట నా ప్రతిజ్ఞ''

1972లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శాసనసభలో చదివిన ఈ కవితార్థం చరితార్థం కావించిన వాడు పాములపర్తి వేంకట నరసింహారావు దేశమంతా 'పి.వి'గా పిలుచుకున్న తొలి తెలుగు ప్రధాని. పి.వి. రాజకీయ చతురతలో రాణించాడు; ఏ కుల, వర్గ, మతాల గుంపును దరిచేరనివ్వలేదు. ఆయన దృక్పథం ప్రజాస్వామ్యం. దృష్టి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు జరిపారు; కాంగ్రెస్ అధ్యక్షునిగా, బడుగువర్గాలకే ప్రాధాన్యమిచ్చి రాజ్యాధికారానికి స్వాగతించారు.

తెలుగు భాషకు పట్టనున్న దుర్గతి ఊహించి తెలుగు అకాడమీ స్థాపించారు. తెలుగు అధికార భాషా సంఘ స్థాపనలో పి.వి. కృషి ఉంది. రాష్ట్రంలో, బోధనా భాషగా తెలుగు ప్రాముఖ్యత గురించి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. తెలుగు బోధన తప్పనిసరిగా పదవ తరగతి వరకు అమలులో ఉండేలా చూశారు.1973లో అకాడమీ అధ్యక్షులుగా 'ఉత్తరోత్తరా ఏమి జరుగుతుందో చెప్పలేం' అన్నారు.

1933లో అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ న్యూడీల్ అనే కొత్త ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లుగా ప్రధాని పి.వి. భావి భారతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందని గ్రహించి తన దార్శనిక దృష్టితో అటువంటి కొత్త ఆర్థిక కార్యక్రమాన్ని మన దేశంలో ప్రవేశపెట్టారు. తద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు.

కేంద్రీకృత ప్రణాళికా విధానాన్ని వదిలి, ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ మార్కెట్‌కు ప్రవేశం కల్పించారు. 1995లో పోఖ్రాన్-2 అణు పాటవ పరీక్షలను పి.వి.నే సాహసోపేతంగా నిర్వహించారు. దేశ అవసరాలు, ఆలోచనలు పూర్తిగా తెలిసిన వివేకవంతమైన పాలకుడు పి.వి. 1988లో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉంటూ అంతర్జాతీయంగా మేధావి అని గుర్తింపు పొందారు. ఐక్యరాజ్యసమితిలో ఆయన ప్రసంగానికి, వివిధ దేశాల ప్రతిని«ధలు వినమ్రంగా లేచి నిలుచుని పదినిముషాల పాటు చప్పట్లతో ప్రశంసలు కురిపించారు.

పి.వి.కి భవిష్యత్తు పట్ల చక్కని అవగాహన ఉంది. మానవుని క్రమవికాసం అరనిందులు దర్శించురని ప్రస్తావిస్తూ "ఈ అభూత పరిణామ క్రమంలో భారతదేశం అనేక ఇతర దేశాలకన్నా విజయవంతంమైన సమాజంగానూ, భాగస్వామిగా వ్యవహరించే మహదావకాశాలు కలిగి ఉందని నా ప్రగాఢ విశ్వాసం'' అని దృఢంగా చెప్పారు. పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఒకే విధంగా నడిచిన పి.వి. స్థితప్రజ్ఞుడు. తన మనసుకు నచ్చింది చేసేవాడు. అంతటి మహామనిషికి భరతజాతి చిత్తశుద్ధితో నివాళి అర్పించగా; ఆయన సేవలు నిరంతరం పొందిన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మాత్రం ఆయనను చివరిదశలో అశాంతికి గురిచేసింది.

పలు కోర్టు కేసుల్లో సతమతమైనా, ఆయన ఎవరినీ విమర్శించలేదు సరికదా తన కేసులు తానే వాదించి నెగ్గారు. మరణానంతరం ఆయన అంతెవాసు లు, పార్టీ నేతలు ఘోరంగా వ్యవహరించారు. అందరు ప్రధానులకు అం తిమ సంస్కారాల వేదికలు నిర్మించిన ఢిల్లీ నేతలు పి.వి.కి. ఆరడుగుల నేల ఇవ్వ మనసురాలేదు సరికదా ఆయన దేహాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలోకి అనుమతించని 'గొప్ప' నాయకత్వం ప్రపంచంలో ఇదేనేమో! అయినా తెలుగు ప్రజల గుండెల్లో పి.వి. చిరంజీవి.

- డా. బి. దామోదరరావు
పి.వి.స్మారక పీఠం, కరీంనగర్
(డిసెంబర్ 23న పి.వి.నరసింహారావు వర్ధంతి)

1 కామెంట్‌:

  1. ఈ విషయంలో తెలంగాణా ఆత్మగౌరవం 4కోట్ల మందిలో ఎవరికీ గుర్తుకు రాదేందుకో :(

    రిప్లయితొలగించండి