6, ఆగస్టు 2011, శనివారం

14 ఎఫ్. పై ఇంత రగడ అవసరమా?

Kommineni(Honorary Chief Editor, NTV) :ఏదో ఒక సమస్య సృష్టించుకోవడం, దాని చుట్టూ పరిభ్రమించడం, ఆ వలయంలో అంతా చిక్కుకుని విలవిలలాడడం- ఇదే మన రాష్ట్ర పరిస్థితి. తెలంగాణ కావాలని డిమాండు చేసే తెలంగాణ నేతలు 14 ఎఫ్ కోసం తీవ్రంగా ఆందోళన చేస్తారు.దాంతోనే మొత్తం తెలంగాణ సమస్య పరిష్కారం అయిపోయినంతగా హడావుడి చేస్తున్నారు. నిజంగానే దీనితోనే మొత్తం సమస్య పరిష్కారం అయిపోతే అసలు గొడవేలేదు. ఆ తర్వాత మళ్లీ తెలంగాణ సమస్య ఉండనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వం కాని దీనిపై ఎందుకు ఇంత గందరగోళం సృష్టిస్తున్నాయో అసలు అర్దమే కాదు.రాజకీయ నేతల ఓట్ల మాయాజాలంలో నిరుద్యోగులైన అభ్యర్ధులు మలమలమాడిపోతున్నారు. మూడేళ్లుగా ఎస్.ఐ.పరీక్షల వ్యవహారం నానుతూ ఉంటే అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు మనల్ని పాలించాలి? ఎందుకు ఈ రాజకీయ నాయకులు మనకు ప్రతినిధులుగా ఉండాలి? ఎక్కడో ఒక చోట వీటికి చెక్ పెట్టే పరిస్థితి లేకపోతే మున్ముందు ఈ నేతలు తమ ఇష్టం వచ్చిన అంశాలపై తమ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించి ఇదే రైటని చెప్పి జనాన్ని నమ్మించి పబ్బం గడుపుకుంటారు.చివరికి నష్టపోవలసింది ప్రజలే.ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చూడండి. లేదా సమైక్య ఉద్యమం చూడండి. ఒక్క రాజకీయ నాయకుడైనా వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నారా? వారి వ్యవహారాలేమైనా ఆగుతున్నాయా?కాని వారు బంద్ లకు పిలుపు ఇస్తే, రాస్తారకోలకు పిలుపు ఇస్తే, మరో ఆందోళనకు పిలుపు ఇస్తే నష్టపోయేది రెక్కాడితేకాని డొక్కాడని బడుగు జీవులే.అసలు 14 ఎఫ్ కు ఇంత పట్టుపట్టవలసిన అవసరం ఉందా?అది ఉన్నంతమాత్రాన పరీక్షలు రాస్తే కొంపలు మునిగిపోతాయా?అదే విధంగా కేంద్రం కూడా ఒక్కసారి శాసనసభ దీనిని రద్దు చేయాలని తీర్మానం చేశాక తన అభ్యంతరాలేమిటో చెప్పకుండా మరోసారి తీర్మానం చేయాలని కోరడం ఏమిటి? అంటే వీరంతా ఎవరికి వారు దొంగాట అడుతున్నారు. 14 ఎఫ్ ఎందుకు వచ్చింది. 1973లో ప్రత్యేకాంధ్ర ఉవ్వెత్తున లేచినప్పుడు దానిని సద్దుమణచడానికి గాను ఆరుసూత్రాల పధకం వచ్చింది. దానితోపాటు అందరికి రాజధాని అయిన హైదరాబాదులో ప్రత్యేకించి భద్రత విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాంపోజిట్ బలగాలు ఉండాలని ఆంధ్ర నేతలు కోరారు. దానికి తెలంగాణ నేతలు అంగీకరించారు. అంటే అన్ని ప్రాంతాల వ్యక్తులు మెరిట్ ప్రకారం ఇక్కడ పోలీసు శాఖలో ఎస్.ఐ, ఆ కింది పోస్టులలో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించారన్నమాట. ఇది ఎందుకంటే ఇతర ప్రాంతాల ప్రజలకు భద్రత భావం కలగాలంటే పోలీసు శాఖలో ఒకే ప్రాంతం వారు ఉంటే వారు ఏకపక్షంగా వ్యవహరిస్తే మిగిలిన ప్రాంతాలవారికి ఇబ్బంది వస్తుంది అనే ఉద్దేశంతో ఇది పెట్టారు. మంచో,చెడో ఇది చాలాకాలం నడిచింది.దీనిపై కొన్నిసార్లు న్యాయస్థానాల వరకు వెళ్లింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరైన తీరులో వ్యవహరించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఒకసారి అనుకూలంగా,మరోసారి వ్యతిరేకంగా వాదించిన ఆరోపణలు ఉన్నాయి.చివరిగా ఇది రాజ్యాంగ సవరణ కాబట్టి , దీనిని అమలు చేయాల్సిందేనని సుప్రింకోర్టు తీర్పు చెప్పినప్పడు , దానిపై సహజంగానే తెలంగాణ ఉద్యమం నడుపుతున్నవారు అవకాశంగా తీసుకున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలి?వాస్తవాస్తవాలు చెప్పి ముందుగా సొంత పార్టీ నేతలను కన్విన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రజలకు ఇందులో ఉన్న మంచి, చెడు విశ్లేషించాలి. ఆనాటి రోశయ్య ప్రభుత్వం ఇవేవి చేయలేదు.పైగా కోరిందే తడవుగా 14 ఎఫ్ రద్దు చేయడానికి తీర్మానం చేసింది. దానికి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తో సహా అంతా ఒప్పేసుకున్నారు.అయితే హైదరాబాదులో ఇప్పుడు చాలా మార్పులు వచ్చినందున , అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ చాలాకాలంగా స్థిరపడినందున దీనిని రద్దుచేసినందువల్ల పెద్దగా నష్టం ఉండకపోవచ్చు.కాని అసలు చర్చ లేకుండా కేవలం తమ పబ్బం గడుపుకోవడం కోసం ప్రభుత్వ,ప్రతిపక్ష నేతలు వ్యవహరించారని మాత్రం చెప్పుకోవాలి. పోని ఆ తర్వాత ఎందుకు కేంద్రంతో దానిని ఎందుకు రద్దు చేయించలేకపోయారో కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, ఆ పార్టీ నాయకత్వంలో శాసనసభ తీర్మానం చేశాక, దానికి వ్యతిరేకంగా అదే పార్టీకి చెందిన విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ ఎందుకు కేంద్రానికి లేఖ రాశారన్నది కూడా కాంగ్రెస్ వివరణ ఇవ్వాలి. అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ ఉండాలి కదా. రోశయ్య, చంద్రబాబులు, ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కోస్తా,రాయలసీమ వారే కదా. అలాంటప్పుడు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు వ్యవహరించకపోయారని చెప్పడం లగడపాటి ఉద్దేశ్యమా?ఇక్కడ 14 ఎఫ్ రద్దు చేయడం వల్ల తెలంగాణలోని కరీంనగర్ , వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల ఉద్యోగార్ధులకు కూడా నష్టమే. అయినా అక్కడి వారు కూడా ఎందుకు రద్దు చేయాలని అడుగుతున్నారు.ఎర్రబెల్లి దయాకరరావుకాని, ఈటెల రాజేందర్ కాని లేదా మరే ఉత్తర తెలంగాణ నాయకులంతా కూడా తెలిసి అడుగుతున్నారా? తెలియక అడుగుతున్నారా? లేదా తమ ప్రాంత పిల్లలకు వ్యతిరేకంగా వారే ఉద్యమం చేస్తున్నారా? కెసిఆర్ లో ఒక గొప్పదనం ఉంది. ఆయన తన వాదన పటిమతో తిమ్మిని బొమ్మిని చేయగల సమర్ధులు.ఇప్పటికి తెలంగాణ ఉద్యమంలోకి కాంగ్రెస్ , తెలుగుదేశం హేమాహేమీలందరిని తన దారిలోకి తెచ్చుకున్న ఘనాపాటి.విచిత్రంగా ఆయన కరీంనగర్ జిల్లాకు వ్యతిరేకంగా ఉండే 14 ఎఫ్ రద్దు ప్రతిపాదనపై ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి సిద్దిపేట బయల్దేరింది కూడా కరీంనగర్ నుంచే. అప్పట్లో ఆయన అక్కడ ఎమ్.పిగా ఉండి ఆ జిల్లా ఎస్.ఐ ఉద్యోగార్ధులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినా ఆయన వారి మద్దతు కూడగట్టుకోలుగుతున్నారనుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ప్రాంతాలకు అతీతంగా తమకు నష్టమైనా సరే ఆ క్లాజును రద్దు చేయాలని ఆ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.అంటే ఇది ఒక పట్టుదల అంశంగా మారిందన్నమాట.అక్కడికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాదు సిటీ లో నియామకాలు నిలిపివేసి మిగిలిన జోన్ లన్నిటీని, అలాగే ఆరోజోన్ లో హైదరాబాద్ ను వదలిపెట్టి మిగిలిన నల్లగొండ, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల అభ్యర్ధులకు ఎస్.ఐ. పరీక్షలు పెడతామంటే కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలే ఒప్పుకోవడం లేదు.వారు ప్రధానిని కలిసి వెంటనే దీనిని తొలగించాలని కోరుతున్నారు. అసలు తెలంగాణనే సాధిస్తున్నామని వీరు చెబుతున్నప్పుడు 14 ఎఫ్ గురించి ఎందుకు పట్టుబడుతున్నారంటే దానికి ఏమి సమాధానం ఉండదు. దేనికదే ముఖ్యమని అంటారు.వీరి పట్టుదలల వల్ల సుమారు ఇరవై వేల మంది నిరుద్యోగులు మూడేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఈ నేతలకు వారిపై కనికరం లేకపోతోంది.కొంతమంది తమకు అనుకూలమైన విద్యార్ధులతోనో, ఉద్యోగార్ధులతోనో ఈ 14 ఎఫ్ రద్దు కాకుండా పరీక్షలు పెట్టడానికి వీలు లేదని డిమాండు చేయిస్తుంటారు. ఇక్కడ 14 ఎఫ్ కు అనుకూలమా?కాదా అన్నది చర్చ కాదు. దానిని రద్దు చేసుకోండి . లేదా ఉంచుకోండి . కాని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే హక్కు కెసిఆర్ కు,లగడపాటికి , అలాగే టిడిపి, కాంగ్రెస్ నేతలకు లేదు.ప్రభుత్వాల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వీరంతా ఇలా చేస్తున్నారు.నిజంగానే చేతకాని ప్రభుత్వాలు ఉంటే ఇలాగే జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వాలను, ఇలాంటి నేతలను ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు బాధపడేలా వీరు పరిస్థితిని తీసుకు రాకూడదు.ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంతా కూర్చుని వేలాదిమంది నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా తమ లక్ష్య సాధనకు అనుగుణంగా ఏమి చేయాలో ఆలోచించాలి కాని తాము పట్టిన కుందేటికి మూడుకాళ్లన్నట్లు చేస్తే ఇటు సీమాంధ్ర నిరుద్యోగులతోపాటు తెలంగాణ నిరుద్యోగులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఒక నాయకుడు ఒక మాట అన్నారు. 14 ఎఫ్. తీసేస్తే తెలంగాణ వచ్చినట్లేనని అభిప్రాయపడుతున్నారు. నిజంగా అది జరిగి వారి లక్ష్యం నెరవేరుతుందనుకుంటే కచ్చితంగా దానిని సాధించడానికి కృషి చేయవచ్చు. కాని అందులో హేతుబద్దత కనిపించదు. 14 ఎఫ్ రద్దు చేశాం కదా ఇప్పుడు తెలంగాణ అంశం గురించి కొంతకాలం అడగకండి అని కేంద్రం అంటే అప్పుడేమి చేయాలి. ఇక్కడ కేవలం రెండు వందలు లేదా మూడు వందల ఎస్.ఐ పోస్టుల వ్యవహరానికి సంబంధించి ఇంత రాద్దాంతం చేయవలసిన అవసరం ఉందని అనుకుందాం. అసలు ప్రభుత్వం హైదరాబాదుకు సంబంధించి నియామకాలే చేపట్టడం లేదని అంటున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు కాని, మంత్రులు కాని ఎందుకు పరీక్షల నిర్వహణకు అడ్డుపడుతున్నారు. ఈ మాట స్వయంగా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డే చెప్పారు.బహుశా ఇప్పుడు ఆమె కూడా 14 ఎఫ్ రద్దుచేసే పరీక్షలు పెట్టమంటారేమో తెలియదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ మాట మార్చుతారో తెలియని రోజులివి. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఈ రగడలో తనవంతు పాత్ర పోషించడానికా అన్నట్లు మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి అప్పట్లో అన్నదమ్ముల్లా ఉన్నాం కాబట్టి ఆ రోజు ఆ క్లాజు రద్దుచేయడానికి ఒప్పుకున్నాం, ఇప్పుడు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. మరి సభలో తీర్మానం చేసిన రోజున ఈయన గుర్రుపెట్టి నిద్రపోతున్నారని అనుకోవాలా?ఇక మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిది ప్రేక్షక పాత్ర గా మారింది. ఒక్క తెలంగాణ నాయకుడితోకాని, చివరికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహతోకాని, దానం నాగేందర్, ముకేష్ లతో కాని దీనిపై అనుకూలంగా ప్రకటన చేయించలేకపోయారు. హైదరాబాదు లో నియామకాలు చేపట్టడం లేదు కనుక ఇప్పుడు 14 ఎఫ్ తో సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించవచ్చని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పినా ఆయన పార్టీవారే పట్టించుకోవడం లేదు.ఈమధ్య తెలంగాణకు చెందిన కొందరు అభ్యర్ధులు ముఖ్యమంత్రిని కలిసి ఎస్.ఐ.పరీక్షలు నిర్వహించవలసిందిగా కోరారు. ఆ వెంటనే మరికొందరితో వద్దని ఆందోళనకారులు ప్రకటన చేయిస్తుంటారు అది వేరే విషయం.ఈ పరిస్థితిలో నిరుద్యోగులు తమ ఖర్మ అని సరిపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు కనీసం ఒక పని చేస్తే బాగుండు. తెలంగాణకు చెందిన ఎస్.ఐ పరీక్షలు రాసే అభ్యర్ధులందరి నుంచి దీనిపై అభిప్రాయ సేకరణ చేసి వారిలో మెజార్టీ కనుక తాము 14 ఎఫ్ రద్దు అయ్యేవరకు పరీక్షలకు హాజరుకాబోమని చెబితే అప్పుడు ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఆ పరీక్షలను వాయిదా వేసి మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహించడమో , లేక అక్కడ కూడా వాయిదా వేసి 14 ఎఫ్ ను రద్దు చేయించుకోవడమో చేయాలి.అంతేకాని ప్రభుత్వం చేష్టలుడిగినట్లు వ్యవహరించడం మంచిది కాదు.నిరుద్యోగం ఎంత బాధకరమో అనుభవించేవాడికి తెలుస్తుంది.

2 కామెంట్‌లు:

  1. Meeru chebuthunnadey Lagadapaati koodaa chebuthunnaaru. atuvant'appudu aayanni koodaa Telangaana naayakulatho samaanam chesi vimarsinchadam nyaayamaa ?

    రిప్లయితొలగించండి
  2. Centre gives into demand for removal of 14F clause
    Andhra jyothy: 14 ఎఫ్ రద్దుకు కేంద్రం ఓకే రాష్ట్రపతికి సిఫారసు చేయండి హోం శాఖకు సీసీపీఏ సూచన అమలైతే ఆరో జోన్లోనే హైదరాబాద్

    It is sad that an unnecessary controversy was created about recruitment to few hundred odd SI posts.In reality, it means nothing as second and third generation migrants in Hyderabad are well placed to take a major share of those posts.Separatists ended up making fools out of people of Adilabad, Karimnagar, Warangal and Khammam districts who are all set to lose their right to compete on a level playing field. This will also create a sense of alienation among people of other regions who were under an impression that they had equal rights over capital city

    రిప్లయితొలగించండి