13, ఆగస్టు 2011, శనివారం

విద్వేషాలతో ఒక తరం నష్ట పోకూడదు

Kommineni.info: ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. చాలామంది తెలంగాణ పై మీ వైఖరి ఏమిటని అడుగుతున్నారు. అనే క వ్యాసాలలో నా వైఖరి తెలిపాను.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర ప్రాంతానికి అది మేలు కలిగిస్తుందన్నది నా అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం ప్రకటించినప్పుడు వ్యతిరేకించడం ద్వారా ఆంధ్ర నేతలు చారిత్రక తప్పిదం చేశారని కూడా పేర్కొన్నాను.కారణాలు ఏమైనప్పటికీ ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. అయినా కూడా ఎప్పుడూ ఇలా విద్వేషాలతో ఉండే కన్నా మళ్లీ ఆంధ్రులు కష్టపడి మరో రాజధానిని నిర్మించుకుని, ఆ ప్రాంతంలో అభివృద్దికి అవసరమైన ప్రాజెక్టులు చేపట్టుకుంటే అది పురోగతికి దారి తీస్తుందన్నది నా అభిప్రాయం . ఇది చెప్పినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరేవారి వ్యూహాలు, ఉద్యమాలపై విశ్లేషణలు రాయకూడదని ఎవరైనా అనుకుంటే అది వారి అవగాహనారాహిత్యంగా భావిస్తాను. అలాగే సమైక్య వాద ఉద్యమ కారుల చర్యలపై కూడా నిర్మొహమాటంగా అభిప్రాయాలు రాస్తే నే ఆ వ్యాసాలకు విలువ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు కొద్ద రోజుల క్రితం తెలంగాణ వైద్యుల దీక్ష శిబిరంలో మాట్లాడుతూ కొన్ని వివరాలు చెప్పారు. హైదరాబాదులో ఆంధ్ర వైద్యులు ఎంత మంది ఉన్నది, తెలంగాణ డాక్టర్లు ఎంత తక్కువ ఉన్నది ఆయన తెలియచెప్పారు. బాగుంది. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి. రాజకీయంగా తెలంగాణా కాజ్ కోసం పనిచేస్తున్నానని చెప్పే కెసిఆర్ ఎప్పుడైనా దీనిపై సమీక్షించుకున్నారా అని?ఆయన 1985 నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు. మూడేళ్లు మంత్రిగా కూడా ఉన్నారు. ఆ సమయంలో ఎప్పుడైనా ఎందుకు తెలంగాణకు చెందిన వారు డాక్టర్లుగా తక్కువగా ఉంటున్నారని ఆలోచించారా? నిజంగానే డాక్టర్లు తెలంగాణకు చెందినవారు ఉన్నప్పట్టికీ అవకాశాలు రాలేదా? లేక అసలు తెలంగాణకు చెందిన వారు డాక్టర్లుగా ఎంపిక కాలేదా?ఎంపిక కాకపోతే ఎందుకు కాలేదన్నదానిపై ఎన్నడైనా కెసిఆర్ కాని, తెలంగాణ ఉద్యమ నేతలు కాని దృష్టి పెట్టారా అన్నది సందేహమే. వైద్య వృత్తిలోకి రావడానికి నిర్దిష్ట పరీక్షలు ఉంటాయి. వాటిలో పాస్ అయితేనే వైద్య కోర్సులోకి రాగలుగుతారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా కెసిఆర్ ఎంతసేపు విద్వేషం రెచ్చగొట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప,తెలంగాణ ప్రాంతంలో ఆయా రంగాలలో వృత్తి నిపుణులు పెరుగుదలకు ఎన్నడైనా ఆలోచన చేశారా అన్నది సందేహమే. తెలంగాణ లో విద్యార్ధులను ఉద్యమాలకు వాడుకున్నట్లుగా , ఉద్యోగాలకు,మంచి చదువులకోసం వినియోగించడానికి ఈ నేతలు ఎందుకు శ్రధ్ద చూపలేదన్నది తెలంగాణ ప్రజలు ప్రశ్నించాలి. ఎంతసేపు తన్నండి,దంచండి, ఆంద్రోళ్లు మేము మూడో కన్ను తెరిస్తే బతుకుతారా అంటూ ప్రజలను రెచ్చగొట్టి నందువల్ల రాజకీయ నేతలుగా వారి పబ్బం గడవవచ్చు. కాని వారి మాటలు నమ్మి రెచ్చిపోతే ప్రజలకు ఎంత నష్టం కలుగుతుందో ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నప్పట్టికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అందువల్ల రాజకీయ నాయకులు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది.1969 లో తెలంగాణ ఉద్యమంలో కొంత హింస ప్రజ్వరిల్లిన మాట నిజం. అప్పుడు ఎక్కువగా బౌతిక హింస అయితే, ఇప్పుడు జరుగుతున్నది మానసిక హింస. తెలంగాణ నేతలు రెచ్చిపోతున్నారని, ఆంధ్ర నేతలు రెచ్చిపోవడం, ఇరుప్రాంతాల రాజకీయ నేతలు కలసి ప్రజలను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు.ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. తెలంగాణ రాష్ట్రం విషయంలో ఆంధ్రనేతలే ఎప్పడూ తప్పు చేశారని చెప్పకతప్పదు. అది చంద్రబాబు కావచ్చు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి కావచ్చు. రోశయ్య కావచ్చు. లేదా మరొకరు కావచ్చు. వీరంతా తెలంగాణ వచ్చేదా, పోయేదా అంటూ తెలంగాణకు వ్యతిరేకం కాదు అంటూ రాజకీయ ప్రకటనలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించారు.తెలంగాణ నేతలు మాత్రం తెలంగాణ రాష్ట్రం కావాలన్న డిమాండుకు ఎక్కువగా కట్టుబడి ఉన్నారని చెప్పక తప్పదు.ఇది వేరే విషయం.కాని తెలంగాణ కోరుతున్న తెలంగాణ నేతలు కూడా ఈ రాజకీయ క్రీడలో తమ వంతు పాత్ర పోషించారో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి.1969లో ఉద్యమానికి ప్రధాన నాయకుడిగా ఉన్న డాక్టర్ చెన్నారెడ్డి ఆ తర్వాత తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్ లో విలీనం చేశారు.తదుపరి ఆయన తనను వేర్పాటువాది అనవద్దని శాసనసభలోనే కోరారు. 1969లో ఉద్యమం కారణంగా తెలంగాణలో ఒక తరం విద్యార్ధులు ఎంత దెబ్బతిన్నారో నష్టపోయినవారికి తెలుస్తుంది. ఆందోళనకు నాయకత్వం వహించిన మదన్ మోహన్, మల్లి ఖార్జున్ వంటి కొద్దిమందికి పదవులు వచ్చి ఉండవచ్చు. కాని విశాల బాహుళ్యం గా ఉన్న విద్యార్ధులు మాత్రం అమూల్యమైన విద్యాకాలాన్నినష్టపోయారు. అంతకన్నా ఫలానా యూనివర్శిటీలో చదువుకున్న ఫలానా బాచ్ వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేయనవసరం లేదని స్పష్టంగా తెలిపేవారట.అప్పుడు ఒక తరం విద్యార్ధులు నష్టపోతే, వారి ఆందోళనల పునాదిమీద తమ భవిష్యత్తు నిర్మించుకున్నరాజకీయ నేతలు కొద్దిమంది మాత్రం బాగానే వెలిగిపోయారు. తదుపరి చాలాకాలం తెలంగాణ రాష్ట్రం పెద్దగా ఇష్యూ కాలేదు. అలాగే ఈ తెలంగాణ వాద నేతలు అప్పట్లో సమైక్య వాద నేతలుగా కూడా చాలామంది కొనసాగారు. స్వయంగా కెసిఆర్, నాగం జనార్ధనరెడ్డి వంటి వారు శాసనసభలో చేసిన ప్రకటనలు ఉదాహరణగా నిలుస్తాయి. నాగం ఇప్పుడు వీర ఉపన్యాసాలు ఇస్తున్నారు కాని, రెండువేల నాలుగులో వై.ఎస్. రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తో కలిసి అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నారో గుర్తు చేసుకోండి.ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ వస్తే, హైదరాబాదులో చాలా మందికి పనులు లేకుండా పోతాయని, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని హామీ ఇప్పించండని డిమాండు చేశారు. ఇప్పుడు అరవై ఏళ్ల దోపిడీ గురించి ఘంటాపదంగా ఆయన చెప్పవచ్చు.కెసిఆర్ జోనల్ వ్యవస్థ ఉనికినే ప్రశ్నించారు. ఫర్వాలేదు. ఆ తర్వాత ఆయన అభిప్రాయాలలో స్పష్టత తెచ్చుకుని రాజకీయంగా కూడా ఆలోచించుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణ ప్రజల వాణిని బలంగా వినిపించారు. ఆయన తనకు ఆ శక్తి ఉందని రుజువు చేసుకున్నారు. మంచి భాష, ఉపన్యాస శక్తి, ఎదుటివారిని ఆకట్టుకోగల చాతుర్యం వంటివాటితో పాటు తన పదునైన వ్యూహాలతో కాంగ్రెస్, టిడిపి లను తన దారిలోకి తెచ్చుకున్నారు. కొమ్ములు తిరిగిన జానారెడ్డి వంటి నేతలు తను ఏమి చెబితే అది చేసేలా చేయగలిగిన మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కొన్నిసార్లు వ్యూహరీత్యా ఎదురుదెబ్బలు తిన్నప్పట్టికీ, ఆయన ఆకస్మిక మరణం తర్వాత అంతా తానై కెసిఆర్ విజృంభించి రాష్ట్ర నాయకులందరిని ఒక ఆట ఆడించారు. వీటన్నిటికి ఆయనకే క్రెడిట్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవరు ఔనన్నా, కాదన్నా ఆయనదే క్రెడిట్. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నవారంతా ఆయనను తెలంగాణ పితగా గుర్తించవలసిందే.అదంతా బాగానే ఉంది.తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవడం తప్పుకాదు. అందుకోసం వాదనలను తయారు చేసుకోవడం తప్పు కాదు. కాని విద్యార్ధుల జీవితాలతో కెసిఆర్ కాని, మరే నాయకుడుగాని చెలగాటమాటడం మాత్రం బాగున్నట్లు అనిపించదు. తెలంగాణ విద్యార్ధులంతా అసలు చదువులే అక్కర్లేదనుకుంటున్నట్లు బంద్ లకు పదే, పదే పిలుపు ఇస్తున్నారు. విద్యాసంస్థలకు కొంతమంది ఉద్యమకారుల పేరుతో వెళ్లి డబ్బులు వసూలు చేయడం నిత్య కృత్యం అయిందన్న విమర్శలు వస్తున్నాయి. డబ్బులుపోతే పోయాయి, పిల్లల చదువులు అన్నా సాగనిస్తున్నారా అంటే అదీ లేదు. తెలంగాణకు చెందిన పలు జిల్లాల పిల్లలు కోస్తాజిల్లాలకు వెళ్లి చదువుకుంటున్నారంటే ఎందుకోసం హృదయమున్న ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలి.ఈ మధ్య ఎమ్సెట్ , ఇతర ముఖ్యమైన పరీక్షలలో ర్యాంకులు ఎక్కువ తెలంగాణేతర ప్రాంతాల విద్యార్ధులకు వచ్చాయి. ఇక్కడి పిల్లలు కొందరికి కూడా ర్యాంకులు వచ్చినా , వారు హైదరాబాదులో కాకుండా విజయవాడ, గుంటూరు వంటి చోట్ల చదివిన వారికి వచ్చాయని తేలింది. వైద్య రంగంలో తెలంగాణ డాక్టర్లు తక్కువ మంది ఉన్నారని ఆవేదన చెందే కెసిఆర్ నిజంగా డాక్టర్ల సంఖ్య పెరగాలంటే కచ్చితంగా అందుకు తగిన విధంగా ఎప్పుడో పరిశీలన చేసి మరింత మంది వైద్య వృత్తి అభ్యసించేలా చేసి ఉండవలసింది.అందుకు అవసరమైన సీట్ల సంఖ్య పెరిగేలా చూడడం, అందులో తెలంగాణ పిల్లలు ఎక్కువమంది ఉండేలా చూసుకోవడం వంటివి చేయకుండా, ఇప్పుడు బాధపడితే ఏమి ప్రయోజనం. ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఇలాంటివి చెబితే చప్పట్లు కొట్టడానికి బాగానే పనికి వస్తాయి.కాని అంతటితో ఆగిపోతాయి. కాని ఇక్కడ పిల్లలు బాగా చదువుకునే ఏర్పాట్లు ఏమిటో చూడకుండా నిత్యం బంద్ లని, ఉద్యమాలని ఏళ్ల తరబడి చదువులను నాశనం చేస్తుంటే తెలంగాణ కు న్యాయం జరుగుతుందా? ఉద్యమం రాజకీయ నాయకులు చేయండి. మొత్తం శాసనసభను బహిష్కరించండి. లేదా రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించండి. లేదా సమైక్య ఆంధ్రప్రదేశ్ కోరుతున్నవారితో చర్చలు జరిపి వారిని ఒప్పించే ప్రక్రియ చేపట్టండి. అంతేకాని ప్రత్యర్ధులను రెచ్చగొట్టి, వారు రెచ్చిపోయేలా చేసి, తద్వారా రాజకీయంగా లబ్ది జరిగేలా వ్యూహాలను అమలు చేయడం వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుందో కాని నాయకుల వరకు బాగానే గిట్టుబాటు అవుతుంది. ఎన్నికల వరకు ఇలాగే సాగదీస్తే ఇంకా రాజకీయ ప్రయోజనం ఉండవచ్చు. కాని ప్రస్తుత తరం విద్యార్ధులకు మాత్రం ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఉస్మానియా నిత్యం అశాంతి నిలయంగా చేయడం వల్ల ఎంతమదికి లాభం చేకూరుతుంది?ఓయు జెఎసి, ఇంకో జెఎసి అంటే అంతా భయపడుతున్నారని ఇప్పుడు అనుకోవచ్చు. కాని అది ఆ విద్యార్ధులకే నష్టం కలిగిస్తుంది. ఇది ఒక ఆవేదన మాత్రమే ఎప్పుడైనా నిరసన చెప్పడం వేరే. తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేయడం వేరు .కాని నెలలతరబడి, ఏళ్ల తరబడి ఉద్యమాలు చేయడం వల్ల మరో తరం విద్యార్ధులు నష్టపోతారు. అప్పుడు తెలంగాణ సాధించినా ఈ నేతలెవ్వరూ మీకు సాయం చేయరు. చేయలేరు. మీకు ఉద్యమాలు మిగులుతాయి. వారికి ఉద్యోగాలు వస్తాయి.అలాకాదు. మీ ఉద్యమాలు మీ భవిష్యత్తుకు మెట్లుగా ఉండాలి. మీ జీవితాలను మరింత వెలుగుబాటలోకి తీసుకువెళ్లాలి. వీరు ఉద్యోగాలకు పనికి వస్తారు. ఉద్యమాలకు స్పూర్తిగా నిలుస్తారన్నట్లు గా ఉండాలి .ఏ ప్రాంతం యువత అయినా జాతికి, దేశానికి అత్యంత ముఖ్యమైనది.నేటి బాలలే,రేపటి యువత, నేటి యువతే, రేపటి భవిత.మీ భవిష్యత్తును అసూయా,ద్వేషాగ్నిలతో నింపుకోవద్దని మాత్రం చెప్పకతప్పదు. కెసిఆర్ అయినా,మరొకరైనా తెలంగాణ బిడ్డల భవిష్యత్తును ఆకాంక్షించేవారెవరైనా ఒక తరం విద్యార్ధులు దెబ్బతినకుండా చూడాలి. అప్పుడే వారు నిజమైన తెలంగాణవాదులుగా గుర్తింపు పొందుతారు

6 కామెంట్‌లు:

  1. శ్రీకృష్ణదేవరాయలు చనిపోగానే గందరగోళంలోపడ్డ విజయనగర సామ్రాజ్యంపై దండెత్తిరావడానికి ఉపక్రమించాడు కళింగ భూపతి. పెద్ద సైన్యంతో అరివీర భయంకరంగా తరలి వచ్చి మధ్యలో కాంప్‌ చేసివున్నాడు. విజయనగరంలో హేమాహేమీలకు ముచ్చెమటలు పోసాయి; ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడ్డారు. అప్పుడు అలసాని పెద్దన ఒక అద్భుతమైన పద్యం రాసి ఒక దూతతో యిచ్చి కళింగ భూపతికి పంపుతాడు. ఆ పద్యం మొత్తం గుర్తులేదుగాని శ్రీకృష్ణదేవరాయాల శౌర్యపరాక్రమాల్ని, కళింగ రాజులు ఎలా ఓటమి పాలై, పిల్లనుకూడ యిచ్చుకుని తలవొగ్గివున్నారో ఆ వైనాన్ని ఏకరువు పెడుతూ, చివరకు అంతటి వీరుడు చనిపోయి అంతా విషాద సంభ్రమాల్లో వున్నప్పుడు ఇదే అదను అని " తెరచిన ఇలు కుక్క సొచ్చినట్లు" వచ్చుదే? అది వీరుడైన నీకు భావ్యమే? అని ప్రశ్నిస్తాడు. దాన్ని చదువుకున్న కళింగ భూపతికి తల కొట్టేసినట్లయి, సిగ్గుతో కాంపు ఎత్తేసుకుని తిరిగి వెళ్లిపోతాడు!

    రిప్లయితొలగించండి
  2. ఆ పద్యం ఇదేనండి..

    సీ. రాయ రావుతుగనండ రాచ యేనుగు వచ్చి యారట్ల కోట గోరాడు నాడు
    సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సిమ్హాద్రి జయశీలజేర్చునాడు
    సిల గోలు సిమ్హంబు చేరి ధిక్రుతి గంచు తల్పుల గరుల డీకొల్పునాడు
    ఘనతరనిర్భరగండపెండెర మిచ్చి కూతు రాయల కొనగూర్చునాడు

    గీ. నొడలెరుంగవో చచ్చితో యుర్విలేవో, చేర జాలక తలచెడి జీర్ణమైతో
    కన్నడంబెట్లుసొచ్చెదుగజపతీంద్ర! తెరచినిలుకుక్కసొచ్చిన తెరగుదోప.

    రిప్లయితొలగించండి
  3. This was quoted by Sree Veturi Prabhakar Sastry gaaru in the inro to Manucaritra. I have only the hard copy. Regards

    రిప్లయితొలగించండి
  4. ఆంధ్ర, తెలుగు శబ్దములు రెండూ పర్యాయపదాలే!

    ఆరవ ఆంధ్ర మహాసభ: నిజామాబాదు: 3వ బహమన్‌ 1349 సాయంత్రం (1939 A.D.)

    శ్రీ మందుముల నర్శింగరావు: అధ్యక్షుడు
    అధ్యక్షోపన్యాసమునుండి

    ఈ వుద్యమముయొక్క విస్తీర్ణత, విశాలతనుగురించి విమర్శించు సందర్భములో, విమర్శకుడు తెలంగానోద్యమము అనుటకు మారుగా ఆంధ్రోద్యమమను పేరిట ఎందుకు వ్యవహరింపబడవలయునని ప్రశ్నించవచ్చును. ఈ విమర్శకుడు తెలంగానా అను పేరును అనుశృతిగా వినుచున్నందున ఇట్టి ప్రశ్న సవ్యముగా అగుపడుచున్నది. ఈ ప్రశ్నకు సమాధానము చెప్పెదను. "ఆంధ్ర" అను పదము చాల పురాతనమైనది. ఋగ్వేదములోకూడ వాడబడినది. వింధ్య పర్వతములకు దక్షిణ దిగ్భాగములో నివసించుచుండిన జాతుల ప్రశంస సందర్భములో ఆంధ్రుల ప్రశంసకూడ వచ్చినది. ఈ ప్రదేశమునకు ఆర్యులు దండకారణ్యమనియు, రాకపోకల సౌలభ్యము లేక అరణ్యప్రదేశమైనందున అంధకార ప్రదేశమనియు, యీ భాగములో నివసించుచున్నవారిని ఆంధ్రులనియు వ్యవహరించిరని చరిత్రకారులు చెప్పుచున్నారు. హైందవుల పవిత్రమైన పురాణములగు రామాయణ, భారతాదు లలోకూడ ఆంధ్రుల ప్రశంస వచ్చినది.

    వేదకాలములో, పురాణ కాలములో, యీ దండకారణ్య ప్రదేశములో నివసించువారు నాగరికత లేని జాతివారో ఏమో? కాని, అశోక సార్వభౌముని కాలములోమాత్రము, ఆంధ్రులు మహోన్నత నాగరికత జెందినట్లు చరిత్ర వుద్ఘోషించుచున్నది. అశోకుని పితామహుడును, మౌర్యవంశ మూలపురుషుడునగు, చంద్రగుప్తుని దర్బారునందుండిన మెగాస్తనీస్‌ వ్రాసిన వ్రాతలవల్ల ఆంధ్ర సామ్రాజ్యమునకు ముప్పది దుర్గములు, లక్ష పదాతులు, రెండువేల అశ్వ దళము, ఒక వేయి ఏనుంగులు వున్నట్లు తెలియుచున్నది.

    అశోక మహారాజు కాలధర్మము నొందిన అచిరకాలములోనే ఉత్తర హిందూస్తానములో మౌర్యవంశము అంతమొందినది. అప్పుడు దక్షిణ హిందూస్తానములో ఆంధ్ర సామ్రాజ్యము విజృంభించినది. ఈ సామ్రాజ్యము తూర్పు సముద్రమునుండి పశ్చిమ సముద్రమువరకు వ్యాపించి, నాలుగు వందల సంవత్సరములవరకు దక్షిణ హిందూస్తానమునేకాక, ఉత్తర హిందూస్తానములో పెద్ద భాగమును తన పరిపాలనలో యిమిడ్చుకొనినది. ఆ కాలమున దక్షిణ హిందూస్తానము మహోన్నత అభ్యుదయము గాంచినది. సముద్రము దాటిన ప్రదేశములతో వర్తక వ్యాపార సంబంధము కలిగించుకొనుటతో ఆంధ్రులకు ప్రత్యేక విశేషత కలిగినది. ఆంధ్రులు ఓడల నిర్మాణములోను, వానిని నడిపించుటలోను ప్రఖ్యాతి బడసిరి. అప్పటి చరిత్రకారులు వ్రాసిన వ్రాతలవల్ల దక్షిణ హిందూస్తానము లోని యీ ఆంధ్రులే క్రీ. శ. లో పూర్వద్వీపములకు వలసపోయి, యావద్భారతదేశమునకై మార్గదర్శులై మలయా, జావా, సుమత్రా, బర్మా, సియాం మరియు ఇండోచైనాలో స్థిరనివాస మేర్పరచుకొని భారతీయ సభ్యత, భారతీయ సాహిత్యము, చిత్రకళలు మున్నగువానిని ఆయాప్రదేశమలలో వ్యాపింప జేసిరి.

    మహాశయులారా! పురాతన చారిత్రక గాథలతో తమ కాలయాపనము చేయ నుద్దేశించలేదు. కాని పూర్వమొకసారి ఆంధ్ర దేశముతో వ్యవహరింపబడుచున్న దేశము తెలంగానా [గా] ఎట్లు పరివర్తనము పొందినదో చెప్పదలచినాను. చంద్రవంశరాజగు కళింగరాజు యీ దేశమునకు రాజు కావడముతోనే [యిది] కళింగ దేశమని వ్యవహరింపబడుచు వచ్చెను. క్రమక్రమేణ 'కళింగము' 'త్రికళింగము' గా వ్యవహరింపబడెను. త్రికళింగము మారి త్రిలింగమైనదని చరిత్రకారులు చెప్పుదురు. చాళుక్యుల, కాకతీయుల నాటి చారిత్రక నిదర్శనములవల్ల త్రిలింగ దేశమని వాడబడినట్లు తెలియుచున్నది. ఇట్లు ఆంధ్ర దేశము, త్రిలింగ దేశము పర్యాయపదములుగా వ్యవహరించబడుచు వచ్చెను. ఆంధ్ర పండితుల అభిప్రాయముప్రకారము త్రిలింగములగు శ్రీశైలము, భీమేశ్వరము (లేక ద్రాక్షారామము), కాళేశ్వరముల లోని మధ్య ప్రదేశము త్రిలింగ దేశమని తెలియుచున్నది. ఈ ప్రదేశము యొక్క జనుల భాష తెలుగు. ఈ భాష ఆధారమున తెలుగు దేశమైనది. కాన తెలుగు దేశము, ఆంధ్ర దేశము ఏకార్థమును తెలుపునవి. "తెనుగు" "ఆంధ్రము" పర్యాయ పదములు – తెనుగు పండితులు గ్రాంథిక భాషలో "ఆంధ్ర" పదము వుపయోగపరచితే, సామాన్యులు వ్యవహారిక భాషలో "తెనుగు" పదము ఉపయోగించుచుందురు. తెనుగు, ఆంధ్రము – తెనుగు దేశము, ఆంధ్ర దేశములను పదములలో వ్యత్యాసము ఏమియు లేదు. ఈ ఉద్యమమునకు జాతి, సంతతి, మతములతో సంబంధము లేదు. ఈ దేశముననే జనించి, ఇక్కడనే జీవనోపాయముల సంపాదించుకొని, తుదకు యిక్కడనే మృతి నొందనున్న వారైనందున వారందరు ఆంధ్రులే. వంగదేశములో నుండువారు వంగీయులు, సింధుదేశములో నుండువారు సైంధవులు, పాంచాలదేశములో నుండువారు పాంచాలీయులని అనుట లేదా? అటులనే ఆంధ్రదేశములో నుండువారిని ఆంధ్రులనుటలో దోషమేమి? ఆంధ్రులని ఉచ్చరించినమాత్రమున భయమొందుట ఎందులకు? ఈ యుద్యమము పవిత్రమైన ఒక సూబాకు సంబంధించిన ఉద్యమము. సూబాలో నివసించు యావన్మానవకోటి అభ్యుదయమునకై యేర్పడినది.

    రిప్లయితొలగించండి