4, ఆగస్టు 2011, గురువారం

సోదరులారా ఒక్కసారి ఆలోచించండి!

ఏ ఉద్యమమైనా ప్రజల నుంచి ప్రారంభమై తదుపరి కాలంలో నాయకత్వం చేతిలో స్థిరత్వం పొంది తన లక్ష్యాలను సాధిస్తుంది. కానీ తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని పరిశీలించినట్లయితే ఆ ఉద్యమం ఎప్పుడూ మొదటగా రాజకీయ నాయకత్వంలో నే ప్రారంభమౌతూ ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళల్లో ఒక విధమైన భావోద్వేగాల్ని రెచ్చగొడుతూ వస్తోంది. ఈ రాజకీయ నాయకత్వం తమ కు పదవులున్నన్ని నాళ్ళు తమ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని చెబుతుంది. పదవులు పోగానే తెలంగాణకి అన్యాయం జరిగినట్లు గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టి, ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రాంతాన్ని అభివృద్ధిచేసే అవకాశం రాలేదని గగ్గోలు పెడుతున్నది.

ప్రజలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నారని, వారి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా వుందని, ఆనాడు జరుగుతున్న సంస్కరణలకు మద్దతుగా 1996 జూలై 16న శాసనసభలో (పదవిలో ఉండగా) కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడిన మాటలు అసెంబ్లీ రికార్డుల్లోనే కాకుండా రాజకీయాల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలలో పదిలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి దిగజారడానికి ప్రధాన కారణం ఎస్టాబ్లిష్‌మెంట్ చార్జెస్ విపరీతంగా పెరగడమనే వాదనను కేసీఆర్ సాక్షాత్తు శాసనసభ వేదికగానే చేశారు.

మరి ఆయనే ఇప్పుడు చిన్న రాష్ట్రాలైతే మేలు అంటున్నారు. చిన్న రాష్ట్రాలైతే ఎస్టాబ్లిష్‌మెంట్ చార్జెస్ ఎక్కువగా ఉంటాయని అందరూ భయం వ్యక్తం చేస్తున్న విషయం గమనార్హం. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తు చార్జీల పెంపుపై మాట్లాడుతూ 'సేద్యానికి ఇచ్చే విద్యుత్తు చార్జీలను పెంచితే రైతులు వ్యతిరేకంగా లేరు. తమకు కావలసిందల్లా తమ పంట పొలాలు ఎండిపోకుండా కరెంటు సరఫరా కావడమేనని వారు కోరుతున్నారు. గతంలో ఉన్న అధ్వాన్న పరిస్థితులు లేవు. కాస్తో కూస్తో వారి దిగుబడికి గిట్టుబాటు ధర లభిస్తున్నది... ఈ విషయాన్ని పరిశీలించి కాస్తో కూస్తో టారిఫ్‌ను పెంచి ఎలక్ట్రిసిటీ బోర్డు ఆర్థిక పరిస్థితిని పరిరక్షించవలసిన అవసరం ఉంద'ని కేసీఆర్ అన్నారు.

రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంపై మాట్లాడుతూ ప్రజల కొనుగోలు శక్తి పెరిగినందున తదనుగుణంగా ధర నిర్ణయించాలని ఆనాటి ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతమేమో ప్రజలు 'ఆంధ్రోల్ల' పాలనలో నానా బాధలు పడుతున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక ఉద్యోగులకు సంబంధించి, జోనల్ వ్యవస్థ గురించి కేసీఆర్ మాటలు వింటే, ఆయన, ఆయన బృందం చేస్తున్న ప్రచారం ఏ విధంగా విషపూరితమో బట్ట బయలౌతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 'ఉద్యోగులకు సంబంధించి ఆరు సూత్రాల పథకం, జోనల్ సిస్టం వంటివి దెబ్బతీస్తున్నాయి.

సర్ప్లస్ స్టాఫ్‌ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునేలా వీలుండాలి. కానీ ఆ విధానం లేదు. మనకు మనం విధించుకున్న ఆటంకం ఆరు సూత్రాల జోనల్ విధానం. సిబ్బందిని వినియోగించుకోలేక, పని లేకపోయినా కోట్ల, లక్షల రూపాయలు నిరర్థకంగా పెట్టుకుని ఖర్చు చేస్తూ వృ«ధా చేస్తున్నాం. ఈ విధానంలో మార్పులు చేయాలి. డైనమిక్‌గా మూవ్ కావాలి. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతోను, ఉద్యోగసంఘాలతోను సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి'.

ఇప్పుడు ఆయన మాట్లాడే మాటల్ని పైన చెప్పిన ఆనాటి తన ప్రసంగంతో పోల్చి వాస్తవాలు గ్రహించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రూప్-4 ఉద్యోగాలు మొదలుకొని రాష్ట్రంలో దిగువ స్థాయి కేడర్ పోస్టులన్నీ కూడా జిల్లాను యూనిట్‌గా పరిగణించేవే. వీటికి ఏ జిల్లాకు ఆ జిల్లానే స్థానికం. ఆ పై పోస్టులన్నీ కూడా ఎపిపిఎస్సీ ద్వారా జోనల్ పద్ధతిలోనే నింపుతున్నారు. 1995 నుంచీ ఇప్పటిదాకా రాష్ట్రంలో నియమించబడిన లక్షా ఇరవై వేల మంది టీచర్లు, 70 వేల మంది పోలీసులు కూడా జిల్లాను యూనిట్‌గా తీసుకొని చేసినవే. ఇవి రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి నిర్వహించిన నియామకాలే. 610 జీవో అమలుచేయడంలో భాగంగా దాదాపుగా 90 శాతం మందిని 2000 సంవత్సరం నుంచే దశల వారీగా వారి సొంత జిల్లాలకు పంపేశారు. ఆ ఖాళీలలో తెలంగాణ ప్రాంతం నిరుద్యోగులే తప్ప వేరొకరు నియమించబడలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ భాషని, యాసని కించపరుస్తూ సినిమాలు తీస్తున్నారని, తెలంగాణ, ఆంధ్ర సంస్కృతులు వేరు వేరని, జాతులు కూడా వేరువేరని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా సినిమా నిర్మాణం కొందరు పెట్టుబడిదారులు లాభార్జన ధ్యేయంగా చేసే ఫక్తు వ్యాపారం. అలాంటి సినిమాల్లో ఒక్క తెలంగాణ భాష, యాసనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతీయ మాండలికాల్ని, యాసల్ని అవమానపరుస్తూ సినిమాలు తీస్తున్నారు. ఉదాహరణకు రాయలసీమ మాండలికాన్ని, నెల్లూరు మాండలికాన్ని, ఉత్తరాంధ్ర మాండలికాన్ని, వెనుకబడిన తరగతుల వారి వృత్తుల్ని కించపరుస్తున్నారు.

మరీ ఘోరంగా వెనుకబడిన తరగతుల వారి వృత్తుల్లోని ఆడవారిని వాంపు క్యారెక్టర్లుగా చిత్రించడం మనం చూస్తూనే వున్నాం. వీటన్నిటి మీద విస్తృత స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించకుండా, కేవలం ప్రాంతీయ స్థాయికి దీనిని దిగజార్చి కేవలం తెలంగాణ వారికే అవమానం జరిగినట్లు ప్రచారం చేయడం శోచనీయం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే గానీ ఈ ప్రాంతానికి విముక్తి లేదన్నట్లుగా తెలంగాణవాదులు మాటల గారడీ చేసి ప్ర జల్ని భ్రమల్లో ముంచుతున్నారు. తమ లక్ష్య సాధనకు ప్రజలందర్ని బలిపశువుల్ని చేస్తూ అంతర్యుద్ధాల గురించి మాట్లాడుతున్నారు. దళిత, బహుజన, మైనారిటీ వర్గాల ప్రజలు వీరి మాటలు నమ్మి, వీరి లక్ష్యసాధనకు మె ట్లుగా ఉపయోగపడుతున్నారే కానీ, నాయకత్వంలో భాగస్వాములు కాలేక పోతున్నారు.

అది చేస్తాం, ఇది చే స్తాం అని ప్రజలకు కల్పించే ఆశలు విజ్ఞులైన తెలంగాణవాదులకు కూడా అర్థం కావడం లేదు. ఉదాహరణకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఆంధ్రప్రాంతం వాళ్ళ భూముల్ని లాక్కొని తెలంగాణలో పేద ప్రజలకు పంచుతామంటున్నారు. భారత పౌరులుగా, తమ కష్టార్జితంతో రాజ్యాంగబద్ధంగా ఈ ప్రాంతంలో కొద్దో గొప్పో భూములు కొనుగోలు చేసిన ఆంధ్ర ప్రాంత ప్రజలకు చెం దిన భూములను స్వాధీనం చేసుకుని పంచు తామంటు న్నారేకానీ, తెలంగాణ పేదలను తరతరాలుగా దోపిడీ చేస్తూ, వారి రక్తమాం సాలను పీల్చి పిప్పిచేస్తున్న తెలంగాణ భూస్వాముల భూముల గూర్చి మాత్రం మాట వరసకైనా మాట్లాడటం లేదు. దీన్ని బట్టి వారి చిత్తశుద్ధిని, వర్గస్వభావాన్ని అంచనా వేయవలసినదిగా తెలంగాణ దళిత, బహుజన, మైనారిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము.

జలవనరుల గురించి చర్చిస్తే నీళ్ళను ఆంధ్రోళ్ళు దోపిడీ చేస్తున్నారనడం కూడా ఈ విషప్రచారంలో భాగమే. పై నుంచి వచ్చేనీటిని ఆంధ్ర ప్రాంతం వారు ఎలా దోపిడీ చేస్తారు? తెలంగాణలో జరిగిన మొత్త ం అభివృద్ధికి నిజాం నవాబు కారణమని చెబుతున్న వీరు, ఆ నిజాం ప్రభువు పై నుంచి వచ్చే నీటిని ఎందుకు ఆపలేకపోయారో చెప్పడం లేదు. వాస్తవంగా తెలంగాణ ప్రాంతం సముద్ర మట్టానికి వెయ్యి, రెండు వేల అడుగుల ఎత్తులో ఉంది.

రాజకీయ దురంధరులు, పాలనాదక్షులు అయిన జలగం వెంగళరావు, పి.వి.నరసింహారావు, డాక్టర్ చెన్నారెడ్డి కూడా తెలంగాణ ప్రాంతంలో నీటి ప్రాజెక్టులు కట్టలేక పోయారనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం ఆ విధంగా ఉంది. ఎత్తి పోతల పథకాల ద్వారా తెలంగాణకు నీరందించ వచ్చనే ఆలోచన ఇటీవలి కాలంలో వచ్చింది. కాబట్టి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని అందిచేందుకు చిత్తశుద్ధితో కృషి మొదలైంది.

తెలంగాణ వాదులు చేస్తున్న ముఖ్యమైన వాగ్దానమేమంటే తెలంగాణ ఏర్పడిన వెంటనే ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఖాళీచేసి వెళ్ళే ఉద్యోగాల్లో మూడు లక్షల మంది తెలంగాణ నిరుద్యోగుల్ని నియమిస్తామని. ఇది సాధ్యమేనా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని రెండు రాష్ట్రాలకు కేటాయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంలోని సిబ్బంది, శిక్షణ శాఖ క్రింద వుండే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ (ఎస్ ఆర్) విభాగంకు ఉంటుంది. సాధారణంగా గ్రామస్థాయి నుంచి, జిల్లా, డివిజన్, ప్రాంతీయ స్థాయి వరకు ఉన్న ఉద్యోగులు ఎస్ఆర్ పథకంలోకి రారు. ఎక్కడున్న వారు అక్కడే ఉద్యోగంలో ఉంటారు.

కేవలం శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి సచివాలయాలు ఈ పథకం కిందకు వస్తాయి. ఈ కార్యాలయాలలో ఉన్న సిబ్బంది సంఖ్య ఎంత? అందులో విభజన జరిగితే ఒక్కో రాష్ట్రానికి కేటాయించగలిగిన వారి సంఖ్య ఎంత? అందులో ఆప్షన్ ప్రకారం పాతవారిని కొనసాగించగా మిగిలే ఖాళీలెన్ని? అనేవి గుర్తించకుండా లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామనడం కేవలం వంచన మాత్రమే. మొదటగా కేంద్రం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి తక్కువకాని విశ్రాంత అధికారి అధ్యక్షతన రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా రాష్ట్ర సలహా సంఘం (ఎస్ఎసి)ని ఏర్పాటు చేస్తుంది.

తదుపరి ఉమ్మడి రాష్ట్రంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్యను ఖచ్చితమైన నిష్పత్తి ప్రకారం రెండు రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఆ కేటాయించిన నిష్పత్తి ప్రకారం సర్వీసులో ఉన్న ఉద్యోగులను నూతన రాష్ట్రానికి కేటాయిస్తుంది. రాష్ట్ర సర్వీసులకు చెందిన ఉద్యోగుల్ని రెండు రాష్ట్రాలకు కేటాయించే విధానంలో అనుసరించే విస్తృత సూత్రమేమంటే మొదటగా వారిDomicile (Home District) ఆధారంగా వారిని Option అడుగుతారు. తదుపరి వారి Reverse Seniority ఆధారంగా అత్యంత జూనియర్ ఉద్యోగుల్ని గుర్తించి వారి వారి ఆప్షన్ ఆధారంగా రెండు రాష్ట్రాలకు కేటాయిస్తారు. ఒక వేళ కేటాయించిన ఉద్యోగాల సంఖ్య కంటే ఆప్షన్స్ ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య అధికంగా వుంటే, అత్యంత జూనియర్ ఉద్యోగుల్ని మొదటగా వారి Domicile ఆధారంగా వారి స్వరాష్ట్రానికి కేటాయిస్తారు. ఇందులోను ఈ క్రిందివారికి మినహాయింపులు యిస్తూ వారి ఆప్షన్ ఆధారంగా వారు కోరుకున్న రాష్ట్రానికి వారిని కేటాయిస్తారు. వారు : మహిళా ఉద్యోగులు, నాల్గవ తరగతి ఉద్యోగులు, వికలాంగ ఉద్యోగులు, Spouce Policy, Medical Hardship ఉద్యోగులు, కేన్సర్‌తో బాధపడే ఉద్యోగులు, బధిర ఉద్యోగులు, బైపాస్ సర్జరీ అయిన ఉద్యోగులు.

మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్, బీహార్-జార్ఖండ్ రాష్ట్రాల విషయంలో పై సూత్రాల ప్రకారమే ఉద్యోగుల్ని రెండు రాష్ట్రాలకు కేటాయించారు. ఇక్కడ పన్నెండు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీసుగల వారినందరినీ వారి ఈౌఝజీఛిజీజ్ఛూ ఆధారంగా కాక, వారి సర్వీసు ఆధారంగా ఆప్షన్ అడిగి వారు కోరుకున్న రాష్ట్రంలో వుంచడం జరిగింది. ఇక లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెస్తారో ఏలినవారు (కేసీఆర్) సెలవిస్తే అందరూ సంతోషిస్తారు.

- డాక్టర్ సాకే శైలజానాథ్

2 కామెంట్‌లు:

  1. గదేం మాకు తెలవదు, మాకు బర్రెలం, గొర్రెలం. ఆలోచించనీకి పౌనే దమాగ్ కూడా లేనోళ్ళం.
    మాది మాగ్గావాలె, గంతనే.

    రిప్లయితొలగించండి
  2. ఆంధ్రా లో రైతు గారి అబ్బాయి వ్యవసాయం చేయడం లేదు
    సాప్టేరు సదూకుంటున్నాడు
    నీళ్ళు తెలంగాణా కిస్తే తెలంగాణా వాళ్ళు ఏమి చేస్తారు ?

    రిప్లయితొలగించండి