23, ఏప్రిల్ 2011, శనివారం

తెరపైకి ‘కేంద్రపాలిత’ ఉద్యమం !

( సూర్య  వార్తాపత్రిక) : తెలంగాణ ఉద్యమంలో కొత్త మలుపు! ఇప్పటి వరకూ ఉత్తర-దక్షిణ తెలంగాణ కలిపి నిర్వహిస్తోన్న తెలంగాణ ఉద్యమంలో తాజాగా కీలక మలుపు! హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలు కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేయాలన్న కొత్త డిమాండ్‌ ఇక ఉధృతమవనుంది. తెలంగాణ సత్వర అభివృద్ధికి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడమే తారకమంత్రమన్న వాదన తెరపైకొస్తోంది. అంటే.. తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణను విడగొట్టి, దానిని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌ ఇకపై విస్తృతం కానుంది.
ఈ డిమాండ్‌ కోసం ‘హైదరాబాద్‌ కేంద్రపాలిత సాధన సమితి’ ఏర్పాటయింది. తమ డిమాండ్‌ నెరవేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి చేయాలంటూ హెచ్‌యుటిఎస్‌ఎస్‌ నేతలు శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కలసి వినతిపత్రాలు సమర్పించారు. మిగిలిన విపక్ష నేతలు, ఈ ఐదు జిల్లాలకు చెందిన తెలంగాణ ఉద్యమ సంస్థలు, సంఘాలు, ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి నేతలతో కూడా భేటీ కానున్నారు. ఐదు జిల్లాలను కలిపి యుటి ఏర్పాటుచేయించడం ద్వారా అభివృద్ధి పథంలో పయనించాలన్నది ఈ సమితి లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే, ఇది తెలంగాణ ఉద్యమంలో చీలికలు తీసుకువచ్చేందుకో, కొన్ని రాజకీయ పక్షాల పక్షాన చేస్తున్న ఉద్యమమో కాదని, పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిన దక్షిణ తెలంగాణ సత్వర అభివృద్ధి కోసం ప్రారంభించిన ఉద్యమమని హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంత సాధన సమితి కన్వీనర్‌ కొడిచెర్ల వెంకటయ్య స్పష్టం చేశారు. తాము ఏ రాజకీయ పార్టీకి, ఉద్యమానికి వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. రాజకీయ నాయకుల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఉద్యమం వల్ల నాయకులు-పార్టీలు బాగుపడితే అమాయకులైన విద్యార్ధుల భవిష్యత్తు నాశనమయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌తో కలసి పనిచేయవలసిన అవసరం లేదని, అయితే తమ ఉద్యమానికి ఎవరు మద్దతునిచ్చినా స్వీకరిస్తామని వెంకటయ్య చెప్పారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ చెప్పినట్లు హైదరాబాద్‌ను దేశ రెండవ రాజధానిగా చేయాలని, శ్రీ కృష్ణ కమిటీ నివేదికలోని 4వ సూచనలో మరికొన్ని ప్రాంతాలను కలిపి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఈ సమితి వాదిస్తోంది. తెలంగాణ పోరాటంలో అమరులైన ప్రతి విద్యార్థి కుటుంబంలోని వ్యక్తులకు సర్కారీ ఉద్యోగం ఇవ్వడంతో పాటు, కృష్ణా మూడవ దశను చేపట్టి నల్లగొండ, రంగారెడ్డి ప్రజలకు సాగు-త్రాగునీరు కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది.

ఈ ఐదు జిల్లాలకు చెందిన ప్రజలను కేంద్రపాలిత ప్రాంత డిమాండ్‌కు ఒప్పించేందుకు సాధన సమితి నేతలు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు వల్ల ఐదు జిల్లాలు ఆర్ధికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని.. ధరలు తగ్గడంతో పాటు దేశ, విదేశీ పెట్టుబడులు ఊపందుకుంటాయని ప్రజలకు వివరించనున్నారు.కాగా, హైదరాబాద్‌ను తెలంగాణలో కలిపితే నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ప్రజలు విపరీతంగా నష్టపోతారన్న కొత్త వాదనను తెరపైకి తీసుకు వస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్‌, ఇతరుల చేతిలోకి వెళితే అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉందని, అన్నింటికంటే ఉత్తర-దక్షిణ తెలంగాణ జిల్లాల పరిథిలోని ప్రజల్లో అంతరాలు పెరిగి, అది అంతర్యుద్ధంగా మారే అవకాశం ఉందన్న వివరణతో ప్రజలను చైతన్యం చేసేందుకు సమితి నేతలు సిద్ధమవుతున్నారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్‌, నల్లగొండ జిల్లాలకు వచ్చే లాభమేమీ లేదన్న వాదనను ప్రజల ముందు వినిపించనుంది. ఆ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణకు చెందిన కరీంన గర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ , వరంగల్‌ జిల్లాలే లబ్థి పొందుతాయని ప్రజల్లో చైతన్యం తీసుకురానుంది. హైదరాబాద్‌కు గోదావరి జలాలే దిక్కన్న వాదనతో దాని కోసం ఉద్యమించనుంది. హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంత సాధన సమితి నేతలు.. నేతల వల్ల తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టాన్ని కూడా ప్రచారం చేయనున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యులను సమిథలను చేస్తున్న వైనాన్ని ప్రజలకు వివరించనున్నారు.

విద్యార్థులను ఉద్యమాల పేరుతో రెచ్చగొట్టిన రాజకీయ నేతలు ఇళ్ళలో కూర్చుంటే.. 400 మంది విద్యార్థులు చనిపోగా, 8 వేల మంది విద్యార్ధులు జైలుపాలయిన వైనాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లనున్నారు. ఈ స్వార్థ నేతల వల్లే ప్రభుత్వానికి 7 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, పారిశ్రామికాభివృద్ధి 11 నుంచి 6 శాతానికి పడిపోయిందని, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కుప్పకూలిందని ఉదాహరణలతో సహా చాటనున్నారు. ఉద్యమాల వల్ల నగరానికి వలస వచ్చిన తెలంగాణ కూలీల జీవనోపాథి దెబ్బతిందని చెప్పనున్నారు.

తెలంగాణకు రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌నే ఉంచి, సీమాంధ్ర రాజధానిని ఏర్పాటుచేసుకొనేవరకూ హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌తో ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండ్‌ను భౌగోళిక పరిస్థితి దృష్ట్యా అంగీకరించమని చెబుతున్న వారి వాదనలో పస లేదని కన్వీనర్‌ వెంకటయ్య చెబుతున్నారు. నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల కంటే హైదరాబాద్‌ చాలా పెద్దదంటున్నారు. జనాభా, విస్తీరణంలో హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతమే పెద్దదని స్పష్టం చేస్తున్నారు. కాగా, తమ డిమాండ్‌ సాధన కోసం త్వరలో ఐదు జిల్లాల్లో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సభలు, సెమినార్లు, ఇష్టాగోష్ఠి సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా.. విద్యార్థులు, ఉద్యోగ వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి, వారిలో పూర్తి స్థాయి అవగాహనకు తీసుకురావాలని నిర్ణయించారు. అదే సమయంలో ఈ ఐదు జిల్లాలకు చెందిన అన్ని పార్టీల నాయకుల మద్దతు కూడగట్టి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.

హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం అయితే...
50 శాసనసభ నియోజకవర్గాలు, 9 పార్లమెంటు స్థానాలు, 3 జిల్లాల హెడ్‌క్వార్టర్లు ఇమిడి ఉన్నందున.. దానిని ‘ఎలక్టెడ్‌ యుటి’గా ప్రకటించ వచ్చు. అంటే ఎన్నికలు నిర్వహించవచ్చు.
హైదరాబాద్‌ జిల్లా లోని 217 చదరపు కిలోమీటర్లతో 16 మండలాలు; రంగారెడ్డి లోని 7493 చ.కి.మీలతో 38 మండలాలు; నల్లగొండలోని 5341చ.కి.మీలతో 18 మండలాలు; 3260 చ.కి.మీలతో మెదక్‌ జిల్లాలోని 12 మండలాలు; మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 18432 చ.కి.మీల పరిథిలోని 64 మండలాలతో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడుతుంది.
34743 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధి ఉంటుంది. ఇంతపెద్ద విస్తీర్ణం ప్రపంచంలోని 40 దేశాల విస్తీర్ణం కంటే పెద్దది.
గోవా విస్తీర్ణం 1,302 చ.కి.మీ; ఢిల్లీ 1,483 చ.కి.మీ; చండీగఢ్‌ 114 చ.కి.మీ; పాండిచ్చేరి 492 చ.కి.మీ; కొత్తగా ఏర్పడే హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం 34,743 చదరపు కిలోమీటర్లుగా ఉండనుంది.
 
http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=2&ContentId=25360


3 కామెంట్‌లు:

  1. మలుపు సంగతేమోగాని ముందీ ఫాంటు సైజు పెంచండి అస్సలు కనబట్టల్లేదు

    రిప్లయితొలగించండి
  2. This is good turning and welcome it. With this Hyderabad would emerge as a powerful state, free from backwardness of Telangana and with Hyderabad's resources Nalgonda and Mhbnagar can develope quickly in about 10years.

    But, RSeema & Coastal AP should remain united. New capital to be constructed with united AP's funds in 10years, preferably around Sounth of Srisailam dam, in Prakasam/Kadapa/ Kurnool borders.

    రిప్లయితొలగించండి
  3. మనకి విశాలాంధ్రమే ముద్దు. ఇప్పటికే గంజాం, బళ్ళారి తదితర ప్రాంతాలను కోల్పోయాం. ఎటువంటి విభజన అయినా తెలుగువాళ్ళకు మంచిది కాదు.

    రిప్లయితొలగించండి