29, ఏప్రిల్ 2011, శుక్రవారం

సామాన్యుల మాట ఏమిటి?

(ఆంధ్రజ్యోతి సంపాదకీయం పేజీ, 26.04.2011 ) : తెలంగాణ ఉద్యమం బాయిలింగ్ దశకు చేరిందని ఇక తాడోపేడో తేల్చక తప్పదనే స్థితికి అందరూ వస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ భావనకు రాలేదు, బలవంతంగా తీసుకువచ్చారు. ఇంకా చెప్పాలంటే బాయిలింగ్ దశకు వచ్చిందనే భావనను ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేతలు కొందరు మీడియాను ప్రభావితం చేస్తూ సామాన్యులపై బలవంతంగా రుద్దుతున్నారు. కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం తెలంగాణ ప్రాంతంలోని కొంతమంది నేతలు సృష్టించిన ఉద్యమం ఇది.

మంత్రిపదవి దక్కలేదని కొందరు, రాజకీయాలలో గుర్తింపు పొందాలని మరి కొందరు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంను ప్రారంభించి తెలంగాణకు చెందిన సామాన్య ప్రజలను అగ్నిగుండంలోకి నెట్టారు. ఉద్యమం కారణంగా నష్టపోయింది... నష్టపోతున్నదీ సామాన్యులే. బంద్‌లు చేసినా, ధర్నాలు, రాస్తారోకోలు చేసినా నష్టపోయేది ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకునే చేతివృత్తిదారులు, చిరు వ్యాపారులు, చిరుఉద్యోగులే. బంద్ పాటించిన రోజున వీరందరూ అప్పు చేసి తినడమో లేదా పస్తులుండటమో చేయాలి. అంతేకాకుండా ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినా, ఆ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారు, కోల్పోతున్నవారు సామాన్య ప్రజలే.

నోటితో రమ్మని నొసటితో వెక్కిరించినట్టుగా మా పోరాటం పొట్ట కూటి కోసం వచ్చినవారిపై కాదని, తెలంగాణాను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు, బడాబాబులపైనే అని చెబుతున్నారు. వాస్తవంలో దాడులన్నీ ఆంధ్రపాంతం నుంచి వలస వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన సామాన్యుల పైనే చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 40 లక్షల మంది ఆంధ్రప్రాంతానికి చెందిన వారు జీవిస్తున్నారు. వీరిలో వేలకోట్ల ఆస్తులు కలిగిన కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి చిరు ఉద్యోగులు, రోడ్డు పక్కన టీ అమ్ముకునే వారి వరకూ ఉన్నారు. అయితే, వీరిలో వేల కోట్లలో ఆస్తులు కలిగిన కుటుంబాల సంఖ్య వెయ్యికి మించదు. మిగిలిన 39 లక్షల 99వేల మంది సామాన్యులే !

రూపాయి రూపాయి కూడబెట్టి కొందరూ, సొంత గ్రామాల్లో ఉన్న ఆస్తులను తెగనమ్మి కొందరూ సొంతిల్లు సమకూర్చుకొని స్థిరపడినవారే. రాష్ట్ర విభజన జరిగితే ప్రధానంగా నష్టపోయేది వీరే.

తెలంగాణ ఉద్యమంలో భాగో.. జాగో అంటూ సామాన్యులను రెచ్చగొట్టే నాయకులు కనీసం బడాబాబులకు చెందిన ఇండ్ల ప్రహరీ గోడలను కూడా ఏమీ చేయలేరు. ఉద్యమం గురించి ఎన్ని ఊసులు చెప్పినా, ఆర్థిక అంశాలకు వచ్చేసరికి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించే దొరలు, కోస్తా బడాబాబులు ఒకటే. పైగా ప్రభుత్వం, పోలీసులు వీరికి అండగా వుంటారు. ఈ బాబులు తమలో ఎవరికి ఏ ఆర్థికనష్టం జరగకుండా మీడియాలో మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. సామాన్యులను రెచ్చకొడతారు.

ఉద్యమనేతలు గడచిన కాలంలో ఇతరత్రా అంశాలు ఎలా వున్నప్పటికీ, సామాన్యులను రెచ్చకొట్టడంలో మాత్రం విజయం సాధించారు. ఆంధ్రావాళ్ళ కారణంగానే నీకు ఉద్యోగం రాలేదని, ఆంధ్రావాళ్ళ కారణంగానే నీవు బ్రతకలేకపోతున్నావని, వాళ్ళు వెళ్ళిపోతే ఉద్యోగాలన్నీ తెలంగాణావారికే దక్కుతాయని, ఆంధ్రావారు వెళ్ళిపోతే, వారి హోటళ్ళను తెలంగాణా వారే నడుపు కోవచ్చనీ, వారు ఇళ్ళు ఖాళీచేస్తే వాటిని ఆక్రమించుకోవచ్చనే తెలంగాణనేతల రెచ్చకొట్టే తరహా ప్రకటనలు అమాయక తెలంగాణ ప్రజలను భ్రమలో పడవేస్తున్నాయి.

దాంతో తెలంగాణ ప్రజలకు రోడ్డుపక్కన హోటల్ పెట్టుకొని జీవించేవారు, తినీతినక కష్టపడి హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకుని జీవించే చిరుద్యోగులు ఆంధ్రప్రాంతానికి ప్రతీకగా కనిపిస్తున్నారు. తమ నోటి కాడికి వచ్చిన దానిని లాక్కుపోతున్న దుర్మార్గులుగా భావిస్తున్నారు. ఆంధ్ర ప్రాంత నేతలపై ఉన్న తమ అసంతృప్తిని ఆంధ్రప్రాంత సామాన్యులపై చూపిస్తున్నారు.

ఆంధ్రావారు ఎప్పుడు వెళ్ళిపోతారా... అనే రీతిలో ఎదురు చూస్తున్నారు. భౌతికంగా దాడి చేయకపోయినా, మానసికంగా తిట్లతో, దూషణలతో దాడి చేస్తున్నారు. ఈసారి ప్రత్యేక తెలంగాణ రాకపోతే ఎప్పటికీ రాదు... ఉద్యమం వేడెక్కింది... ఇంకా కొంచెం ఉద్యమిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, కనిపించే ఆస్తులన్నీ మనవే అంటూ నేతలు సామాన్యులను మరీ ఊరిస్తున్నారు.

రాష్ట్ర విభజన జరగక ముందే తమ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక రాష్ట్ర విభజన జరిగితే తమ పరిస్థితి ఏమిటి? అని హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో అమాయక తెలంగాణ ప్రజలను అడ్డుపెట్టుకుని ఆంధ్రుల ఆస్తులను చౌకగా కొట్టేయడానికి సంఘ విద్రోహులు చుట్టుపక్కల పొంచివున్నారు. విభజన జరిగితే సంఘవిద్రోహులు తమను ఏం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడపెట్టి కట్టుకొన్న ఇల్లును వదిలేయవలిసిందేనా? కారుచౌకగా తెగనమ్ముకోవలిసిందేనా? లేదా తిట్లు తింటూ రెండోతరగతి పౌరునిగా జీవించాలా? అని తీవ్రంగా మథనపడుతున్నారు.

రాష్ట్ర విభజన అనివార్యమైతే, సామాన్య ప్రజలకు, వారికి సంబంధించిన ఆస్తులకు భవిష్యత్తులోనైనా రక్షణ కలిగే విధంగా స్పష్టమైన విధానాలు రూపొందించడం అవసరం. ఒక మేజరు గ్రామపంచాయితీని పురపాలకసంఘం (మున్సిపాలిటీ)గా మార్పు చేయాలంటే ఆ పంచాయితీ జనాభా, ఆర్థిక వనురులను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.

అదే విధంగా ఒక రాష్ట్రానికి ఇంత జనాభా వుండాలని, ఇంత ఆదాయం రావాలని అంతకు మించినప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజింపవచ్చుననే తరహాలో నిబంధనలు ఉంటే బాగుంటుంది. లేదంటే ప్రతి 15 నుంచి 20 సంవత్సరాలకు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన చేయాలి. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఈ తరహా విధానాలు ఏర్పాటు చేసుకునే పక్షంలో ఉద్యమాలు, ఆందోళనలతో అవసరం లేకుండా పరిపాలనలో భాగంగా నూతన రాష్ట్రాల ఏర్పాటుకు వీలు కలుగుతుంది. ప్రజలు కూడా మానసికంగా సిద్ధపడతారు.

నేతల ఆధిపత్యం కోసమో లేదా పార్టీల ప్రయోజనాల కోసమో రాష్ట్రాల విభజన చేయడం ప్రారంభిస్తే, దేశాన్ని 25 రాష్ట్రాలుగానే కాదు 50 రాష్ట్రాలుగా విభజించినా, మళ్ళీమళ్ళీ ఏదో కారణంగా మా రాష్ట్రం మాకు కావాలి! అనే వాదన చేస్తూనే వుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలుగా విభజన జరిగినా, తర్వాత మరల తెలంగాణాలో ఉత్తర తెలంగాణవారు, ఆంధ్రలో రాయలసీమవాదులు, ఉత్తరాంధ్రవాదులు మరల మా రాష్ట్రం మాకు కావాలనే వాదన ముందుకు తీసుకురారనే గ్యారంటీ ఏదీ లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించాలనుకొనేవారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
 
- అన్నవరపు బ్రహ్మయ్య, సీనియర్ పాత్రికేయులు

1 కామెంట్‌: