17, ఏప్రిల్ 2011, ఆదివారం

ఓ ప్రభుత్వోద్యోగి ఆవేదన

'నో వర్క్ నో పే ' నిబంధనను ప్రభుత్వం తెచ్చిందని సంతోషించినా అది ఎంతో కాలం నిలవలేదు.GO 177ను 'తాత్కాలికంగా' నిలిపివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.ఇప్పట్లో దానికి మోక్షం లభిస్తుందని అనుకోను.  

మొదటగా జీతం తీసుకొని చేసే పనిని సహాయం అనరు. లేని సహాయాన్ని నెట్టినబెట్టుకొని నేనేదో పొడిచేస్తున్నాను అనుకొని అదే భ్రమలో సహాయనిరాకరణ పేరుతో ప్రభుత్వ పరిపాలనకు ఆటంకాలు కలిగించిన వారు చివరకు ఏమి సాధించారు? ప్రభుత్వోద్యోగులలో ఒకరు తప్పుకున్నా ఆ స్థాయిని ఆశించే, ఎక్కువ అర్హత కలిగిన వారు వందల్లో ఉన్నారు.సాధారణ ప్రజల సాదకబాధకాలను పట్టించుకోకుండా ఎంతోమంది సహోద్యోగులను పని చేయవద్దని బెదిరించి, మరెంతో మంది క్రింది స్థాయి ఉద్యోగులతో 'అదిగో రాష్ట్రం వస్తుంది ఇదిగో మీ సమస్యలు యిట్టె తీరిపోతాయి' అని లేని పోనీ ఆశలు కల్పించి,  ఒక గంటసేపు ఆఫీసు ఆవరణలో బంతి ఆట ఆడి మిగతా టైంలో ఇంటిలో గుర్రుపెట్టి నిద్రపోయి, లేక ఒక పూట ధర్నాలో కూర్చొని సాయంత్రం ఐదు కాగానే నిమ్మకాయ రసం తాగేసి ఇంటికి చెక్కేసి, పే బిల్లుల పని మాత్రం చేసుకొని ఆలస్యంగానైన అప్పనంగా జీతాలు తీసుకొన్న వారు అసలు ఏమి సాధించారు ?

అసలు ఇదెక్కడి అన్యాయం ? ప్రభుత్వోద్యోగులు ఏ ప్రాంతంలోనైనా పనిచేయకుండా జీతాలు ఎలా తీసుకుంటారు?ప్రపంచంలోని  ఏ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ బుక్ దీనికి అంగీకరిస్తుంది? నలుగురు పోగయ్యి బెదిరిస్తే బెదిరిపోయే ఈ ప్రభుత్వానికి, పని ఎగ్గొట్టి జీతాలు తీసుకుని పార్టీ తొత్తులులాగా వ్యవహరించే ఉద్యోగసంఘాల నాయకులకు అసలు సిగ్గు అనేదే లేదా? వారి చేతలకు ఉద్యోగులంతా ఎందుకు  సిగ్గు పడాలి? అసలుఉద్యోగ సంఘాలకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పేరుతో వసూళ్ళు చేసుకునే వాళ్ళతో సమాలోచనలెందుకు?వారికి వసూళ్ళ నుండి  జీతలేమైనా వస్తున్నాయా? ప్రజలు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నుల నుండే కదా అందరికి జీతాలు వస్తున్నాయి? హుకుంలను ఎదిరించి పని చేసుకోవాలనుకునే ఉద్యోగులకు ఏది రక్షణ?



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి