1, మే 2011, ఆదివారం

నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమానికి నాంది

 ఎం.వి.ఆర్. శాస్త్రి గారిచే ఆంధ్రభూమిలో ప్రచురింపబడుతున్న 'ఆంధ్రుల కథ' నుండి:  1921 నవంబర్ 21 సాయంత్రం. హైదరాబాదులోని వివేకవర్ధని థియేటరులో సంఘ సంస్కార సభ సీరియస్‌గా నడుస్తున్నది. నగర  ప్రముఖులందరూ అక్కడే ఉన్నారు. సామాన్య జనమూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అటువంటి సభ హైదరాబాదులో జరగటమే విశేషం. ముఖ్యఅతిథి ధోండే కేశవకార్వే ఇంకా పెద్ద ఆకర్షణ. ఆయన జగమెరిగిన పండితుడు- గొప్ప విద్యావేత్త. ఆయన పూనాలో తన పేరిట ఏకంగా ఒక మహిళ విశ్వవిద్యాలయానే్న స్థాపించాడు.

రెండురోజుల సంఘ సంస్కార మహాసభలో తొలిదినం సమావేశాలకు కార్వే పండితుడే అధ్యక్షత వహించాడు. చాలా భాగం మరాఠీలోనూ కొంత ఇంగ్లిషులోనూ ఆయన ప్రసంగించాడు. అది సభలోని ఆంధ్రులకు నచ్చలేదు. అయినా ఎవరూ నోరు మెదపలేదు. మలిరోజు ముగింపు సభకు శ్రీమతి సరళాదేవి చౌధురాణి అధ్యక్షురాలు. అనేక తీర్మానాలు ప్రతిపాదించాక వాటిపైన ఇంగ్లీషులోనూ, మరాఠీలోనూ, ఉర్దూలోనూ ఉపన్యాసాలు జోరుగా సాగుతున్నాయి. మొత్తం నైజాం స్టేటునుంచి ప్రతినిధులు వచ్చారు. వక్తలు మరాఠీ, కన్నడ, తెలుగు భాషల్లో మాట్లాడవచ్చునని విషయ నిర్ణయ సంఘంలో ముందే నిర్ణయించారు. అంతవరకూ బాగానే ఉంది.


ఆంధ్రుల పక్షాన సభా నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన పెద్దలు కూడా వేదిక మీద ఆశీనులయ్యారు. మాట్లాడటానికి తమ వంతుకోసం వేచి ఉన్నారు. ముందు మాడపాటి హనుమంతరావుగారిని పిలిచారు. ఆయన లేచి తెలుగులో ఉపన్యాసం మొదలెట్టగానే కలకలం లేచింది. సభికుల్లో ఎక్కువ మంది మహారాష్ట్రులున్నారు. వారిలో ఎక్కువ మంది యువకులు. వారికి భాషా దురహంకారం జాస్తి. హైదరాబాద్ జనాభాలో అత్యధికులు తెలుగువారైనా అన్ని రంగాల్లో మహారాష్ట్రులదే హవా. విద్యాసంస్థలు నడిపేదీ వారే. సభల్లో, సమావేశాల్లో, గణపతి ఉత్సవాల్లాంటి వేడుకల్లో హడావుడి అంతా వాళ్లదే.వారికి తెలుగంటే మహా చులకన. అందుకే
 ‘‘మాడపాటి హనుమంతరావుగారు తెలుగులో ఉపన్యాసం ఆరంభించగానే వారు అల్లరి ఆరంభించినారు. అయినా పంతులుగారి వ్యక్తిత్వ ప్రభావంవల్ల అంత వికటంగా ప్రవర్తించలేదు. కాని అల్లంపల్లి వెంకట రామారావు (హైకోర్టు వకీలు)గారు ఒక తీర్మానముపై తెలుగులో ప్రసంగించటానికి ఉపక్రమించగానే మహారాష్ట్ర యువకులు అల్లరి ప్రారంభించినారు. ఈలలు, చప్పట్లు, చివరకు వేదికవైపు వెన్ను తిప్పి కూర్చుండుట జరిగింది. తత్ఫలితంగా వెంకట రామారావుగారు తమ ఉపన్యాసం నిలిపివేయవలసి వచ్చింది... అల్లంపల్లివారు తమ ఉపన్యాసాన్ని అర్ధాంతరంగా ఆపి నిష్క్రమించగానే వేదిక మీద కూర్చున్న మాడపాటి హనుమంతరావుగారు వేదిక నుండి క్రిందికి దిగినారు. వెంటనే మందుముల నర్సింగరావు, మందుముల రామచంద్రరావు, మిట్టా లక్ష్మీనరసయ్య, టేకుమాల రంగారావు, బూర్గుల రామకృష్ణారావు మొదలైన పెద్దలు వారిని అనుసరించినారు. సభలో పాల్గొంటున్న తెలుగు ప్రేక్షకులు కూడా పెద్దలననుసరిస్తూ సభను విడిచి తమ తీవ్రమైన అసమ్మతిని ప్రకటించినారు" (హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర, వెల్దుర్తి మాణిక్యరావు, పే.104-105 )

అలా నిరసన తెలిపి సభనుంచి నిష్క్రమించిన పెథ్దలు పదకొండు మంది వివేకవర్థనీ థియేటరు వెనకనే ఉన్న ట్రూపుబజారులో వకీలు టేకుమాల రంగారావుగారింటికి ఎకాఎకి వెళ్లారు. ఆంధ్రులు బహుళ సంఖ్యాకులుగా ఉన్న రాజధాని నగరంలో ఆంధ్ర భాషలో ఉపన్యసించటానికే వీలులేకుండా పోయి, మాట్లాడుతున్న వాడిని కేకలు వేసి కూచోపెట్టే దుస్థితి పట్టినందుకు వారు చాలా బాధపడ్డారు. విచారించి ప్రయోజనం లేదు. వెంటనే ఏదో ఒకటి గట్టిగా చెయ్యాలనుకున్నారు. తర్జనభర్జనల తరవాత ఆ రాత్రే అక్కడే ‘‘ఆంధ్ర మహాజన సంఘం’’ స్థాపించారు. తెలంగాణలో ఆంధ్రోద్యమానికి, నిజాం స్టేటులో రాజకీయోద్యమానికి అదే నాంది.

పరాయి భాషవాళ్ల చేతుల్లో తమ గడ్డమీద తమకు జరిగిన అవమానం పదేళ్ల కింద గుంటూరు న్యాయవాదులగుండెలను, మండిచినట్టే తెలంగాణ ఆంధ్ర ప్రముఖులనూ కదిలించి కార్యరంగానికి నెట్టింది. 1921లో కోస్తా ప్రాంతాన పడకేసిన ఆంధ్రోద్యమం కృత్రిమ సరిహద్దులను దాటి తెలంగాణలో అదే సంవత్సరం చరిత్రాత్మకంగా మొదలైంది.  1921 నవంబరు 12 రాత్రి 8 గంటలకు ‘‘ఆంధ్ర జన సంఘము’’ను పదకొండుమంది పెద్దలు కలిసి స్థాపించినప్పుడు నాలుగు తాత్కాలిక నియమాలు పెట్టుకున్నారు. అవేమిటంటే- పుట్టుక వల్లగాని స్థిర నివాసమువల్లగాని హైదరాబాదు స్టేటులో ఉన్న 18 ఏళ్ల పైబడిన ఆంధ్రులందరు ఈ సభలో చేరవచ్చు. (తర్వాత ఇది మారింది). సభ్యత్వ రుసుము సంవత్సరానికి కనీసం రూపాయి. తగినంతమంది సభ్యులు చేరాక అందరితో ఆలోచించి నియమావళిని రూపొందాలి.  సభ్యుల్ని చేర్చటానికి ఆట్టే కష్టపడాల్సిన పనిలేకపోయింది.  వివేకవర్ధని థియేటరులో ఆంధ్ర భాషకు జరిగిన అవమానాన్ని... దానికి బాధపడ్డవారు ఆంధ్ర జన సంఘాన్ని స్థాపించదలచిన వైనాన్ని మందుముల సోదరుల పత్రికా వ్యాసాల ద్వారా తెలుసుకోగానే చాలామంది ఆంధ్రులు తామే ముందుకొచ్చి సభ్యత్వం తీసుకున్నారు. నెల రోజుల లోపలే నూరుగురు సభ్యులయ్యారు. 1922 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన రెడ్డి హాస్టల్లో మూడుసార్లు అందరూ కలిసి మల్లగుల్లాలు పడ్డాక నియమావళి ఖరారైంది. కార్యనిర్వాహక వర్గమూ ఎన్నికైంది. ఆర్.రాజగోపాలరెడ్డి అధ్యక్షుడు. మాడపాటి హనుమంతరావు కార్యదర్శి. మందుముల నర్సింగరావు సహాయ కార్యదర్శి. కొండా వెంకట రంగారెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, టేకుమాల్ రంగారావు, ఇంకో ముగ్గురు కార్యవర్గ సభ్యులు.

కొత్త సంఘానికి ఖరారైన ప్రధాన నియమాలివి:
‘1. ఈ సంఘమునకు నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘము’అని పేరు.
2. నిజాం రాష్టమ్రునందలి ఆంధ్రులయందు పరస్పర సహానుభూతి కలిగించి వారియభివృద్ధికై ప్రయత్నించుట ఈ సంఘముయొక్క ఉద్దేశము.
3. ఈ రాజ్యములోని ఆంధ్రుల కొరకు, సంఘములను, సంస్థలను స్థాపించుట, ఉన్నవానికి సహాయము చేయుట, ఉపన్యాస సభలను సమావేశపరచుట మున్నగు కార్యముల వలన పై ఉద్దేశము నెరవేర్చబడును.
4. ఈ రాజ్యములోని ప్రతి ఆంధ్ర వ్యక్తియు, పదునెనిమిది సంవత్సరముల కంటే మించిన వయస్సు కలిగి, చదువను, వ్రాయను నేర్చియున్నచో, ఈ సంఘమున సభాసదుడు కావచ్చును.

సర్కారు జిల్లాల్లో ‘ఆంధ్ర మహాసభ’ 1913 మొదలుకుని ఏటేటా కాంగ్రెసు పందిట్లో సైడ్‌షోగా సభ చేయటమే తప్ప తనకంటూ నియమావళిని ముందుగా రూపొందించుకోలేదు... లో... మహాసభ నాటికి గానీ దానికి నియమావళి, సంస్థాగత స్వరూపం ఏర్పడలేదు. దీనికి భిన్నంగా నైజాం ఆంధ్ర మహాసభ మొదటినుంచే క్రమపద్ధతిన ముందుకు సాగటం విశేషం.

1 కామెంట్‌:

  1. ఇప్పుడు వేర్పాటువాదులు చేసిన విషప్రచారాలమూలంగా ఆంధ్ర అంటేనే ఒక తిట్టుపదంలా, ఏవగింపుగా వ్యవహరించడం తెలంగాణాలో పలుచోట్ల మామూలై పోయింది. అయితే అప్పట్లో ఆంధ్ర పదం ఎంతో గౌరవంతో, ప్రేమాభిమానాలతో వాడబడివుండడం మనం గమనిస్తాము. ఈ చరిత్ర తెలుసుకొనైనా వేర్పాటువాదులు, ముఖ్యంగా వాళ్ల మాయలో పడివున్న తెలంగాణీయులు కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాలి.

    రిప్లయితొలగించండి