31, మే 2011, మంగళవారం

తెలంగాణ ఎక్కదలిచిన రైలు ఒక జీవితకాలం లేటు

ఆంధ్ర భూమి నుండి : తెలంగాణ ఎక్కదలిచిన రైలు ఒక జీవితకాలం లేటు ---సాక్షి

యువర్ అటెన్షన్ ప్లీజ్...మరికాసేపట్లో ప్లాట్‌ఫాం మీదికి వస్తుందని అనౌన్స్‌మెంటు అయిన రైలు రావడం అరగంటో గంటో ఆలస్యమైతేనే జనానికి చెడ్డచిరాకు వేస్తుంది. అదిగో వచ్చేస్తున్నదని 2009లో అనౌన్స్‌మెంటు అయిన స్టేట్ ఎక్స్‌ప్రెసు ఏణ్నర్థందాటినా ఇంకా అజాపజా లేదంటే చూచిచూచి కళ్లు కాయలు కాచిన తెలంగాణ జనానికి ఇంకెంత చిర్రెత్తాలి?

మామూలు రైలు ఎనౌన్స్ చేశాక కూడా లేటుఅవటానికి బలమైన కారణాలే ఉండొచ్చు. అనుకోని అవాంతరాలను నివారించటం ఎవరి చేతుల్లోనూ ఉండకపోవచ్చు. తెలంగాణ బండి సంగతి వేరు. దానికి ఢిల్లీ స్టేషనులో సిగ్నలు ఇవ్వకుండానే, ఇంకా కూత వెయ్యకముందే, అదిగో వచ్చేస్తోందని హైదరాబాదులో దొంగ అనౌన్స్‌మెంట్లు వరసపెట్టి మొదలవుతాయి. ఆడ నుంచి ఈడ దాకా అంతా బూటకమే; అందరిదీ నాటకమే.

జగమెరిగిన కె.సి.ఆర్. దీక్షతో తాజా అంకం ఆరంభం. అసలా దీక్షే నాటకమని గిట్టనివారి అభియోగం. దీక్షవల్ల తెలంగాణ అట్టుడుకుతున్న సమయాన ‘సైకిల్’బాబులోని సహజనటుడు బయటికి వచ్చాడు. తెలంగాణ తీర్మానం మీరు పెడతారా, నన్ను పెట్టమంటారా అని అసెంబ్లీలో సర్కారును ఎంచక్కా నిలదీశాడు. అది చూసి ఢిల్లీ దర్శకులు కారక్టర్ యాక్టర్ రోశయ్యకు చెప్పి ఆల్ పార్టీ పేరంటం పెట్టించారు. అన్ని పార్టీల వాళ్లూ తమతమ నటనా కౌశలాన్ని చూపించి తెలంగాణకు ఓకే కోరస్ పాడారు. అక్కడితో తెరదించకుండా, ‘సరే అయితే తెలంగాణ ఇచ్చేస్తున్నాం’ అని డైరక్టర్లు పిడుగులాంటి డైలాగు వేశారు. దాంతో రాష్ట్ర నటులకు కళ్లు తిరిగాయి. నాటకం డైలాగును పట్టుకుని నిజమంటే ఎట్లా అని వాళ్లు తెగ గింజుకున్నారు.

అక్కడి నుంచి ఢిల్లీ డ్రామా రసకందాయంలో పడింది. అసలు ప్లాట్‌ఫాం మీదికే తేని తెలంగాణ బండికి ఉత్తుత్తి సిగ్నల్ ఇచ్చినట్టు నటించి మేటి నటుడు చిదంబరం మాయ ప్రకటన చేశాడు. ‘హత్తెరీ’ అని సీమాంధ్ర నటులు- అనుకున్నట్టే దారికాచి పట్టాలకు అడ్డంపడ్డారు. రాని రైలును ఆపేసినట్టు నానాగత్తర అయ్యాక - ఎందుకు ఆగిందో, ఏమి చెయ్యాలో కనుక్కోమని శ్రీకృష్ణా అండ్ కంపెనీకి వేషాలేసి పంపారు. విచారణ ఘట్టాన్ని ఏడాది రక్తి కట్టించాక, కర్ర విరగకుండా, పాము చావకుండా వాళ్లేమో బహిరంగంలో అతి రహస్యాన్ని చొప్పించి, జంతర్‌మంతర్ చేశారు. రంగం మళ్లీ ఢిల్లీకి మళ్లింది.

కమిటీ రిపోర్టు ఇలా అందగానే, అలా తెలంగాణ ఇచ్చేయబోతున్నట్టు బిల్డప్ ఇచ్చిన కేంద్రం వారు రిపోర్టు వచ్చి అర్ధ సంవత్సరమైనా ఏదీ తేల్చరు. అటో, ఇటో, ఎటో నిర్ణయించాల్సిన సర్కారు- పార్టీల కోళ్లు వచ్చి కూస్తే తప్ప తెలంగాణ తెల్లవారదని మిషభిషలు పెడుతుంది. పార్టీలను కేకేసి రిపోర్టు చేతిలో పెట్టి పంపించి ఆరు నెలలు గడిచాక ఏమి చెయ్యాలో చెప్పడానికి పార్టీల పేరంటం మళ్లీ పెడతామన్న మాట ‘స్పీడ్ స్టార్’ చిదంబరం నోట జాలువారింది. ముహూర్తం కుదరడానికి ఇంకో ఆరు నెలలు పట్టవచ్చు. వాయిదాల పద్ధతిలో భేటీలు వేశాక ఫాయిదాలేదని ఎప్పటికి తేలుస్తారో, తదుపరి కర్తవ్యాన్ని ఎలా నిర్ణయిస్తారో రంగస్థలం మీద చూడాలి.

వాయిదాలు ఎన్ని వేసినా, నాటకాలు ఎన్ని ఆడినా కనీసం మూడేళ్లలోపల, 2014 ఎన్నికల నాటికైనా తెలంగాణను ఇవ్వక ఏమి చేస్తారన్న ధీమా ఇప్పటిదాకా తెలంగాణ వాళ్లకు ఉంది. చూడబోతే అదీ వెర్రి ఊహే అని తేలేటట్టుంది.
ఆశ పెట్టిన రాష్ట్రం తీరా తమకు ఇవ్వకపోతే తెలంగాణ జనం కోపగించి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు మాడు పగలగొట్టటం ఖాయమే. వై.ఎస్. వారి ధాటికి ఎలాగూ సీమాంధ్రలో ధరావతులు దక్కే ఆశలేని స్థితిలో తెలంగాణలో కూడా దేవిడీమన్నా అయతే సెంటర్లో కాంగ్రెసు అధికారానికి కష్టమే. కాని దానికి మించిన ఈతిబాధ ‘పైవాళ్ల’కు ఇంకొకటి వచ్చేట్టుంది.

తెలంగాణను ఇచ్చేస్తున్నారనగానే దేశంలో ఎక్కడెక్కడి రాష్ట్రాల్లోనూ వేర్పాటు ఆశలు మోసులెత్తాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌ను విడగొట్టి డార్జిలింగు రాజధానిగా గూర్ఖాలాండ్‌ను ఇవ్వాలని ఎప్పటినుంచో అడుగుతున్నవాళ్లకు మరీ హుషారు వచ్చింది. బెంగాల్‌లో ఉన్నది కమ్యూనిస్టు గవర్నమెంటు అయితే ఢిల్లీ వారికి ఏ బాధా లేకపోయేది. కాని ఇప్పుడక్కడ గద్దె మీద ఉన్నది మమతా దీదీ. సెంటర్లో యు.పి.ఎ. గుడారానికి ఆమె పెద్ద అండ. శుభమా అని రాజ్యానికి రాగానే వేర్పాటు కొరివి తనకెందుకని... తెలంగాణనిచ్చి తనకు కష్టాలు కొని తేవద్దని దీదీ నిక్కచ్చిగా చెప్పింది. ఏ కామ్రేడ్లో, మావోలో పుణ్యం కట్టుకోవటంవల్ల వేర్పాటు చిచ్చుపుట్టి 2014 ఎన్నికల్లో మమతమ్మ పుట్టి మునిగితే యు.పి.ఎ. డేరాకు పెద్ద దెబ్బే.

అలాగే తెలంగాణనిస్తే విదర్భకూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు ఇవ్వరన్న పంతం పెరుగుతుంది. అది మరాఠా మల్లుడు శరద్‌పవార్‌కు నష్టం. ఆ పవార్ కూడా యు.పి.ఎ. పవరుకు పెద్ద ఊతం. కాబట్టి ఆయనను చిక్కుల్లో పెట్టే పనికీ కాంగ్రెసు నేతలు సాహసించలేరు. అన్నట్టు ఉత్తరప్రదేశ్‌ను మూడు ముక్కలు చెయ్యాలని యు.పి.రాణి మాయావతి ఎప్పటినుంచో అడుగుతున్నది. తెలంగాణనిస్తే ఆమె కూడా గొంతు పెద్దది చేస్తుంది. ఆ అమ్మ కాంగ్రెసుకు ఎగస్పార్టీ. మాయదారి మాయకు లాభమైనది ఆటోమెటిగ్గా తమకు నష్టం కావచ్చు కనుక ఆమె ముచ్చటతీర్చటం కాంగ్రెసు వారికి ఇష్టం ఉండదు. ‘హరితప్రదేశ్’మీద కాంగ్రెసు మిత్రుడు అజిత్‌సింగు కూడా మనసుపడుతున్నమాట నిజమే. కాని - మిత్రుడుకోరేదీ శత్రువుకోరేదీ ఒకటే అయినప్పుడు ఇవ్వకపోవటమే రాజకీయం.

ఈ ప్రకారంగా ‘మమతా ఎక్స్‌ప్రెసు’ అడ్డంతగలటంవల్ల ‘తెలంగాణ పాసింజరు’ పట్టాలు ఎక్కకుండానే ఆగిపోయింది. అయినా ఆ సంగతి ఢిల్లీ మహానటులు చెప్పరు. ఎన్నిచేసినా తెలంగాణ ఉద్యమాలు ఆగేట్టు లేవు కనుక వాటిని జోకొట్టేందుకు ఇప్పుడు కొత్త జోలను ఎత్తుకున్నారు.

దానిపేరు రెండో ఎస్సార్సీ. అదీ పాతపాటే. ఇప్పుడు దాన్ని లంకించుకోవటంవల్ల ఎస్సార్సీ విచారణ తతంగం పేరిట ఇంకా కొనే్నళ్లు తెలంగాణను మాగవేయవచ్చు. ఎస్సార్సీ పేరు చెప్పి యు.పి.లో మాయావతి నోటా కరక్కాయ వేయవచ్చు. బహుశా ఈ ఎత్తుతోనే కావచ్చు కాంగ్రెసు మాతాపుత్రులు దగ్గరుండి యు.పి. కాంగ్రెసు చేత ఎస్సార్సీ సన్నాయిని నొక్కించారు.

ఈ కొత్తమేళం ఎన్నాళ్లో, తెలంగాణ రైలొచ్చేది ఏ ఏటికో చెప్పిన వారికి చక్కని బహుమతి

1 కామెంట్‌: