4, మే 2011, బుధవారం

అడ్డుగోడలు, అడ్డగోలు మాటలు


నాగార్జునసాగరుకు అడ్డంగా గోడ కడతారట. అబద్ధాల గోడలు కట్టారు, ప్రజలను చీలుస్తూ గోడలు కట్టారు, ఇక సాగరును చీలుస్తారట. కోస్తా రాయలసీమ వాసుల పట్ల వీళ్ళ దౌష్ట్యం ఇదే మొదటిది కాదు, గతంలో కొన్ని వందల సార్లు అనేకమంది నాయకులు అన్నమాటలే ఇవి. ఏడుపుగొట్టు పిల్లకాయలు మారాం చేసినట్లు ఉంది వీళ్ళ గోల.

  • పులిచింతల కడితే తెలంగాణకు నష్టం లేదు, అయినా సరే దాన్ని వ్యతిరేకిస్తున్నారు.
  • ఆంధ్రా అధికారులు దొంగలన్నారు.
  • ఆంధ్రా వాళ్ళు హైదరాబాదు కాలుష్యానికి కారణం అన్నారు.
  • ఆలమట్టి కడితేనే మంచిది అంటూ అడ్డగోలుగా మాట్లాడారు.
  • మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని, మా ఆస్తులను, భూములను దోచుకున్నారన్నారు.
  • మమ్మల్ని గేలి చేసారు, మా యాసను ఎగతాళి చేసారన్నారు.
  • హైదరాబాదు మా చెమటతో కట్టుకున్నది, దాన్ని వీళ్ళు దురాక్రమణ చేసారు. ఇక్కడ భూములు కొనీ, వ్యాపారాలు పెట్టీ అభివృద్ధి చెందారు. మేం వెనకబడిపోయాం అని అన్నారు
  • తెలంగాణ వాళ్ళకు అవకాశమే లేకుండా బళ్ళూ, కాలేజీలు కూడా వాళ్ళే పెట్టేస్తున్నారు.
  • ఇక్కడ మా హోటళ్ళు లేవు అన్నీ ఆంధ్రా హోటళ్ళే! అని అన్నారు
  • సినిమా పరిశ్రమ యావత్తూ ఆంధ్ర మయమే, తెలంగాణ వాళ్ళు లేరు అని అన్నారు
  • సినిమాల్లో వాడే భాష ఆంధ్ర మాండలికమే, విలన్లకు, ఆసిగాళ్ళకు మాత్రం తెలంగాణ మాండలికం వాడుతారు.
  • తెలుగుతల్లి అనే భావనను తూలనాడారు
  • తెలుగు అనే మాటను దొంగతనం చేసారన్నారు
  • ఇలా ఎన్నో.. ఇదుగో, ఇప్పుడు సాగరుకు అడ్డంగా గోడ కడతారట.
నల్లగొండ ఫ్లోరైడు సమస్య విషయంలో జరుగుతున్నది అమానుషమనేది నిర్వివాదాంశం. సాగునీటి కంటే తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలనేది సహజ న్యాయం. ఫ్లోరైడు సమస్యను పరిష్కరించకపోవడం పట్ల నిరసన తెలియజేస్తూ ఒకప్పుడు ఎన్నికలలో నాలుగైదు వందల మంది నామినేషను వేసి దేశవ్యాప్తంగా ఈ సమస్యను వెలుగులోకి తెచ్చారు నల్లగొండ వాసులు. అయినా జరిగిందేమీ లేదు. హైదరాబాదుకు తాగునీరు తెచ్చే గొట్టాలు తమ ఇళ్ళ ముందు నుండే వెళ్తూ ఉన్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి వారిది. ఒకరు కాదు, అన్ని ప్రభుత్వాలు, పార్టీలూ దోషులే ఈ విషయంలో! గోడలు కట్టే వీరులూ అందుకు మినహాయింపేమీ కాదు.

వెనకబాటుతనం అనేది అన్నిచోట్లా ఉన్నదే అని ఆలోచించరు. ఊరికే అరిస్తే ఉపయోగమేమిటి? కేవలం భావోద్వేగం పని సాధిస్తుందా? అందరి మీదా ఇలా అరిచీ, కరిచీ తెలంగాణ వ్యతిరేకతను పెంచడం తప్ప ఉపయోగమేమిటి? ప్రతీదానికీ ఆంధ్రులే కారణమని ఇలా అన్ని రకాల తిట్లూ తిట్టి, ఆ మీదట అదే జనం అన్నదమ్ముల్లా విడిపోదామని సన్నాయి నొక్కులు నొక్కుతారు! సోదర భావం అంటే ఇలా తిట్టుకోవడమా? ఇది కేవలం తెరాస నాయకులకే పరిమితం కాదు పత్రికల్లో వచ్చిన వ్యాసాల్లో చూసాం, కొండొకచో బ్లాగుల్లోనూ చూసాం. ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారంటే, వ్యతిరేకించరూ మరి!?
http://chaduvari.blogspot.com/2007/04/blog-post_08.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి