11, నవంబర్ 2011, శుక్రవారం

ఆంధ్ర పితామహుడు 'మాడపాటి'

 నేడు మాడపాటి హనుమంతరావుగారి వర్ధంతి 
ఆంధ్రప్రభ : తెలుగు గడ్డను నైజాం పాలకులు ఏలుబడి కొనసాగుతున్న రోజుల్లో పారతంత్య్రంలో మగ్గిపోతున్న తెలుగుజాతిని మేల్కొలిపి వారిలో జాగృతి కలిగించి, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వికాసానికై నిరంతరం కృషి చేసిన ప్రముఖుల్లో ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు ప్రథమ స్థానం వహిస్తారు. నిజాం పాలనలో ఉర్దూ, గోండు భాషలు తప్ప తెలుగు భాషకు తెలంగాణాలో గౌరవంలేని రోజుల్లో 'మేం ఆంధ్రులం' అని చెప్పగలిగిన ధైర్యశాలిగా మాడపాటి హనుమంతరావు కీర్తించబడ్డారు. కృష్ణా జిల్లా నందిగామ తాలూకా ఐక్కుదూరు గ్రామంలో 1885 జనవరి 22వ తేదీన మాడపాటి హనుమంతరావు జన్మించారు. ఐదేళ్లకి తండ్రి మరణించడంతో హనుమంతరావు సూర్యాపేటలో ఉద్యోగం చేస్తున్న మేనమామ వద్ద పెరిగారు. నాటి నుంచి మాడపాటికి తెలంగాణాతో సంబంధం ఏర్పడింది. 1898లో ఉర్దూ మిడిల్‌ ఉత్తీర్ణులైన తర్వాత హనుమకొండలోని ఉన్నత పాఠశాలలో చేరి మద్రాసు విశ్వవిద్యాలయ మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1904లో ఆయనకు వరంగల్‌ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నెలకు రూ.40 వేతనంపై మీర్‌ మున్షీ (హెడ్‌ క్లర్క్‌) ఉద్యోగం లభించింది. ఎనిమిది ఏళ్ళు ఉద్యోగం చేసిన మాడపాటి ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌ చేరుకొని నేరుగా స్వాతంత్య్ర ఉద్యమంవైపు కాకుండా సంఘ సేవకుడిగా కొనసాగాలని నిశ్చయించుకున్నారు. నాటి నైజాం కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పటేల్‌, పట్వారీ, పోలీసుల జులం ఎక్కువగా ఉండేది. అన్నదాతల్ని అన్యాయమైన వసూళ్ళతో యమయాతనలు పెట్టేవారు. వెట్టిచాకిరీ చేయించుకునేవారు. వర్తకుల దగ్గర నిజాం ఎస్టేట్‌కు చెందిన ఉద్యోగులు సరకులు తీసుకుని డబ్బు యిచ్చేవారు కాదు. భూస్వాముల దౌర్జన్యాలకు హద్దు లేదు. ఈ నేపథ్యంలో దొరల దోపిడీతో పాటు ఇతర భూస్వామ్య, పెత్తందార్ల ఆగడాలను అరికట్టడానికి అనేక ప్రజా సంఘాలు వెలిసినాయి. ప్రజలు కళ్ళు తెరవడానికి గ్రంథాలయాలు, రైతుల ఇక్కట్లు పోగొట్టడానికి రైతు సంఘాలు, వ్యాపార పరిస్థితులు బాగు చెయ్యడానికి వర్తక సంఘాలు వెలిశాయి. ఈ సంఘాలు గ్రామ ప్రాంతాల చైతన్యానికి సంకేతాలుగా నిలిచాయి. తెలంగాణా వెనుకబాటుతనానికి కారకులైన నిజాం పాలక విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటుతోపాటు తెలుగుజాతిని జాగృతి చేయడానికి గ్రంథాలయోద్యమం, సంఘసంస్కరణ, స్త్రీ విద్యావ్యాప్తి, సాంఘికోద్యమం, ప్రజాసేవారంగంలో, స్త్రీల ప్రవేశం, విద్యాప్రచారం, సాహిత్య వికాసం వంటి అనేక ఉద్యమాలను ఏకకాలంలో నడిపించడంలో మాడపాటి హనుమంతరావు చేసిన కృషి మరువలేనిది. నిజాం రాష్ట్ర తెలుగు జాతిని మొదట మేల్కొలిపిన మాడపాటి 1921లో నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం కార్యదర్శిగా సారథ్యం వహించారు. నిజాం రాష్ట్ర పాలనలో తెలుగు భాష లేకుండా కొనసాగిస్తున్న రోజుల్లో తెలుగు భాషను కాపాడడమే కాక తెలుగుజాతిని ఐక్యం చేయడానికి గ్రంథాలయాలే పునాదిగా తలచి హనుమకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం, హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం అభివృద్ధికై మాడపాటి విశేష కృషి చేశారు. ఆ రోజుల్లో హైదరాబాద్‌ సంస్థానంలో రాజభాష ఉర్దూ -విద్యాబోధన ఉర్దూలోనే జరిగేది. బాలికలకు తెలుగు భాషలో విద్యాబోధన (ఉన్నత పాఠశాల స్థాయిలో) జరిపించడానికి మాడపాటి ఆంధ్ర బాలికల ఉన్నత పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాలకు పుణలోని థాకర్స్‌ భారత మహిళా విశ్వవిద్యాలయం వారి గుర్తింపు లభించింది. అణగారిన వర్గాల్లో జాగృతి, చైతన్యం కలిగించడానికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. నిజాం పాలన క్రింద మగ్గుతున్న తెలుగు ప్రజల భాషా, సాంస్కృతిక గుర్తింపును చాటడానికి సమర్థ ఉపకరణంగా ఆయన జర్నలిజాన్ని ఉపయోగించుకున్నారు. న్యాయమైన పౌర, రాజకీయ హక్కులను గురించి ఆనాటి 'నీలగిరి' పత్రిక, 'గోల్కొండ', 'సుజాత', 'దేశబంధు', 'తెలంగాణా' పత్రికల్లో అనేకవ్యాసాలు ఆయన రాశారు. పిరదౌసి ఫార్సీ కవితను తెలుగులోకి అనువదించారు. ముషీర్‌ ఎ దక్కన్‌ అనే ఉర్దూ పత్రికకు చాలాకాలం సంపాదకీయాలు రాసేవారు. నాయకులను తయారు చేయడమే కాని, నాయకత్వానికి ఇష్టపడని మాడపాటి 1935 లో కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. 1946లో మాడపాటి హనుమంతరావు షష్టిపూర్తి ఉత్సవాలు తెలంగాణా అంతటా జరిగాయి. ఆ సందర్భంగా సన్మాన రూపంలో వసూలైన డబ్బుతో ఆంధ్ర చంద్రికా గ్రంథమాలను స్థాపించి కొన్ని గ్రంథాలను ప్రచురించారు. అంతేకాక బంకించంద్ర ఛటర్జీ వ్రాసిన ఆనందమఠ్‌ ప్రసిద్ధ నవలను తెలుగులో ఆయన అనువదించారు. మాడవాటి తెలుగు, ఉర్దూ, పారశీక, ఇంగ్లీషు భాషలలో పండితులేకాక, మంచివక్త, రచయితగా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత 1951లో హైదరాబాద్‌ నగర పురపాలక సంఘానికి మొదట మేయర్‌గా మాడపాటి ఎన్నికై నగరాభివృద్ధి కెంతో కృషి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్‌కు శాశ్వత సభ్యులుగా కొనసాగారు. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం హనుమంతరావుకు డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్‌ మొదటి అధ్యక్షులుగా ఆరేళ్లు మాడపాటి కొనసాగారు. ఆంధ్రాభ్యుదయమే తమ జీవితంగా భావించిన మాడపాటికి భారత ప్రభుత్వం 1955 జనవరి 26న పద్మభూషణ్‌ బిరుదునిచ్చి సత్కరించింది. తెలంగాణాలో ఆంధ్రోద్యమంతోపాటు అనేక సాంఘిక, సామాజిక ఉద్యమాలకు సారథ్యం వహించి, ఆంధ్ర పితామహుడనే పేరు గాంచిన మాడపాటి హనుమంతరావు 1970 నవంబర్‌ 11వ తేదీన 86వ ఏట తనువు చాలించారు.
- డాక్టర్‌ నిమ్మాన దాస్‌

1 కామెంట్‌: