23, నవంబర్ 2011, బుధవారం

విభజనుల బోషాణాల గుట్టు

ఆంధ్ర ప్రభ: ఇంతకాలంగా, తెలిసీ తెలియకుండా నిర్లిప్తంగా ఉండిపోయినందుకు మనందరం విస్తుపోయేలా విచారించేలా సిగ్గుపడేలా ఇటీవలి కాలంలో ఆధారాలతో సహా మనదేశంలోని, రాష్ట్రంలోని 'ఘనుల' నేతల అక్రమార్జన అధికార దుర్వినియోగ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి! లక్షల కోట్ల కుంభకోణాలు 2జి, కెజి బేసిన్‌ వంటి వాటితో బాటు ఎన్నో అక్రమాల అస్తిపంజరాలు ఒక్కోటీ రాజకీయ రక్షణ రహస్య బీరువాల నుంచి తొంగిచూస్తూ మనల్ని వెక్కిరిస్తున్నాయి. (మన రాష్ట్రానికే పరిమితమైనవి తెలుగులోనే వెక్కిరిస్తున్నాయి!) స్విస్‌, ఇతర విదేశీ బ్యాంకుల గోప్యతా లాకర్లలోని అపార ధనరాసుల, సిరుల గుట్లు మొత్తమంతా కాకపోయినా, బిట్లు బిట్లుగా, బహిర్గతమవుతున్నాయి.

ఇక్కడి అవినీతి, అధికార దుర్వినియోగ నల్లధనం తక్కువేం కాదు. దొంగ కంపెనీల ఓడలలో విదేశీయానం చేసి, అక్రమాల భూమి కూడా గుండ్రంగా ఉంటుందని నిరూపించే చందాన తిరిగి తిరిగి మన తీరానికే చేరుకుని, రంగు మార్చుకుని, దేశీ పారిశ్రామిక రాజకీయ చక్రవర్తుల కుటుంబ కర్మాగారాలకు, దురాశా కోశాగారాలకు ఈ ధనం చేరుకుంటున్న చోద్యాలూ చూస్తున్నాం -'హవాలా' తో దేశాన్ని దివాలా తీయించడానికి సంకోచించని సుగుణాభిరాముల లీలల్నీ వింటున్నాం -అలాంటి వాళ్లలో 'మనోళ్లూ' (పి.వి.గారి భావంలో 'తెలుగోళ్లు') ఉన్నారని తెలిసి సిగ్గుపడుతున్నాం -ఐతే, ఇదంతా ఉన్నత న్యాయస్థానాల క్రియాశీల చర్యల వలన ఇప్పుడు కూడా మొద్దు నిద్రలోనే ఉండిపోతే కుదరదులే అనే అభిప్రాయంతోనో లేదా జడి విమర్శల దాడి గోలకు కొంచెం మెలకువ తెచ్చుకొన్న రాజ్యాంగ, నిఘా, పరిశోధనా దర్యాప్తు వ్యవస్థలు చేపట్టిన చర్యల వల్లనో సాధ్యమైంది. మన అదృష్టం కొద్దీ వైరి రాజకీయ వర్గాలు ఒకరిగుట్టు నొకరు రట్టు చేసుకోవటం వలన కూడా ఇది కొంతవరకు సుసాధ్యమైందని చెప్పవచ్చు -ఏమైతేనేం, మనం సంతోషించదగ్గ పరిణామాలు కొన్నైనా సంభవించాయి. కిలాడీ 'కల్మాడీ ఆటకట్టింది -'2జి రాజా' జైల్లో ఏడుపు బాజా వాయించుకుంటున్నాడు -కనిమొళి కటకటాలపాలైంది. రెండు రాష్ట్రాల్లో అక్రమాల గాలి స్తంభించింది. కొందరు ఐఏఎస్‌ అధికారులకూ, శ్రీకృష్ణ జన్మస్థాన ప్రవేశం ప్రాప్తించింది. మన హైకోర్టు పుణ్యాన మరుగున పడిపోతాయనుకున్న ఘనత వహించిన తెలుగునేతల ఘనకార్యాలు కొన్ని సిబిఐ విచారణ అరుగెక్కాయి. వీరి బండారం త్వరలో పబ్లిక్‌ రోడ్డున పడటం ఖాయంగా కనిపిస్తోంది.

సుఖ్‌రామ్‌కి శిక్ష వేశారు. అంబానీల చమురు వదలబోతోంది. ఈ నేపథ్యంలో విభజనోద్యమ తీరుతెన్నులను, ఈ ప్రాంతపు రాజకీయ ఉద్యోగవర్గాల నేతల అసలు ధ్యేయాల్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్న తెలంగాణ ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాల్సిన అవసరముంది. ఏమాత్రం అనుమానం లేదు. భారతీయ ప్రజలందరి లానే 'మనోళ్లు' కూడా అందరు అక్రమార్కుల భరతం పట్టాలన్న అభిప్రాయంతోనే ఉన్నారు. ఐతే దేశంలోని రాష్ట్రంలోని, అన్ని కుంభకోణాలతో బాటు ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమం పేరిట జరిగిన అక్రమార్జనల గుట్టు కూడా రట్టుకావాలని కోరుకుంటున్నారు. వీటిపైన కూడా మీడియా, న్యాయవ్యవస్థ, పరిశోధనా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని, నిజానిజాల నిగ్గు తేల్చాలని అభిలషిస్తున్నారు. నిజానికి ఉద్యమ క్రమంలో జరిగిన బలవంతపు చందాల దందాలు, ముడుపుల సొంతమూటలు, కుటుంబ సంపద విస్తరణల గురించి ప్రజలతోబాటు ప్రభుత్వ వ్యవస్థలకూ ఎంతోకొంత గత కొంతకాలంగా తెలుసు. ఈ విషయాలేవో కేవలం సమైక్య వాదులో లేక ఇతర ఉద్యమ వ్యతిరేకులో అక్కసుతో చేసిన ఉత్తుత్తి అభాండాలు కానేకావు. ఇతర గుడారాలలో వేరు కుంపట్లు పెట్టుకుని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక రాజకీయ పార్టీ కన్న ఎక్కువ క్రియాశీలంగా పాల్గొంటున్న విభజనవాదులే విశ్వసించి చేస్తున్న ఆరోపణలు. అధిక సంఖ్యాకులు నిజాలుగా భావిస్తున్న విమర్శలు.

ఆ మాటకొస్తే ప్రస్తుతానికి ఎందుకనో నిష్క్రియాయోగాన్ని ఆశ్రయించి ఉన్న ప్రభుత్వ నిఘా పరిశోధనా దర్యాప్తు సంస్థల వద్ద ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలిప్పటికే సమృద్ధిగా ఉన్నాయి -అందుకే ఈ అస్తిపంజరాలన్నిటినీ ప్రజలకు పారదర్శకంగా సంపూర్ణంగా చూపించాల్సిన అవసరముంది. ఆ విధమైన సమగ్ర పరిశోధనానంతర ప్రదర్శనార్హ అస్తిపంజరాలేమిటో, అంశాలేమిటో క్లుప్తంగా క్రోడీకరించి చెప్పుకుందామా -

(1) ఒక రాజకీయ పార్టీ 2004, 2009 ఎన్నికలలో వేర్వేరు పార్టీలతో జతకట్టి అందుకు మూల్యంగా కొన్ని వందల కోట్ల నగదు, లగ్జరీ వాహనాలు తీసుకున్నదని, కాని ఉద్దేశించబడిన అంటే పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి కొంతమేరకైనా ఈయకుండా, ఆ సొమ్మంతా కుటుంబ సంపదగా పరిగణించి అంతర్జాతీయ నౌకా వ్యాపారానికి సొంత పెట్టుబడిగా వాడారన్నది రాష్ట్రంలో చాలామందికి తెలిసిన రహస్యం! ఆ ఎన్నికలలో కుటుంబ సభ్యులు మినహా, ఇతర పార్టీ అభ్యర్థులు టిక్కెట్ల కొనుక్కోవటంతో బాటు ఎన్నికల ఖర్చులు స్వయంగా పెట్టుకోవాల్సి వచ్చిందని అందుకనే చాలామంది ఓడిపోయారని పార్టీ వాళ్లే చెపుతున్న సమాచారం.
(2) అమాయక ప్రజల నుండి ఓ మోస్తరుగా వచ్చిన స్వచ్ఛంద విరాళాలతో బాటు ఒక మీడియా మొఘల్‌, భూకబ్జాదారులు, తమ అక్రమాల రక్షణ కోసం సమకూర్చిన భారీ 'గుడ్‌విల్‌ మొత్తాలు', పారిశ్రామిక సినిమారంగాల నుండి బెదిరింపు దందాల ద్వారా వచ్చిన సొమ్ములు, బడుల రాబడులు, అన్ని కుటుంబ కోశాగారానికే చేరుకున్నాయన్నది మరో బహిరంగ రహస్యం.
(3) ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమిపొంది, అక్కడ నిర్మించిన పార్టీ కార్యాలయ భవనం యాజమాన్యం ఎవరి పేరున ఉందో చెప్పనే చెప్పరు. 'ఎమ్మార్‌' దందాలో ముట్టిన అవినీతి సొమ్ములో కొంత ఆ భవన నిర్మాణానికి ఉపయోగించినందున ఆ పాపం దోషం పార్టీకి తాకిందని చాలామంది పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు.
(4) సొంత మీడియా ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన వందలాది కోట్లు ఎవరి నుండి ఏ దారిలో వచ్చాయా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు తలచుకుంటే నిర్ధారించలేని విషయం కాదు, అలాగే పోలవరం ఇతర టెండర్ల వండర్ల గుట్లు తెలుసుకోవటం కూడా అసాధ్యం కాదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది.
(5) రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలలో అందుకున్న సొమ్ముల గురించి కూడా దర్యాప్తు చేపట్టాలో లేక అదేదో ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా వదిలేయాలో ప్రభుత్వ సంస్థలు ఒక నిర్ణయం తీసుకోవాలి.
(6) ఐతే విచారణ, పరిశోధన, అంతా ఒక కుటుంబానికే పరిమితం చేయటం కూడా న్యాయం కాదు. అక్రమార్కుల శేషం ఉండకూడదు కాబట్టి పలు ఐకాసలు కూడా ఎంత చెట్టుకంత గాలి అనే రీతిలో దండుకున్న ముడుపుల రహస్యముడులూ విప్పాలి -
(7) అలాగే ఉభయ ప్రాంతాల ఉద్యోగ సంఘాల నేతలు సందట్లో సడేమియా రీతిలో ఉద్యమ ఉద్వేగ కవచాల సాయంతో ఇప్పటికే నిర్ధారణౖన ఎసిబి కేసులను కాచుకోగల్గుతున్నారు. అక్రమంగా పొందిన ప్లాట్లనూ నిలబెట్టుకుంటున్నారు. రాష్ట్రం భవిష్యత్తుతో సంబంధం లేకుండా అక్రమార్కులందరిపైనా సత్వరం ఉన్న చట్టాలు, పాలనా నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, రాజకీయ ధ్యేయాలకోసం నిరంతరం పనిచేస్తూ ఉద్యోగ విధులను సంపూర్ణంగా త్యాగం చేస్తున్న వారినింకా విస్మరించకూడదు.
(8) విద్యార్థులకు మంచి పాఠాలు చెప్పడానికి బదులు ప్రాంతీయ విద్వేషాలు నూరిపోస్తున్న ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులపై కూడా ఉన్న నిబంధనల కనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలి.
(9) అమాయకులను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు పురిగొల్పిన వారిపైనా తగిన చర్యలుండాలి.
(10) చట్టాలు తెలిసిన లాయర్లు గాని, ఇంకెవరైనా గాని చట్టవ్యతిరేక పనులు చేసిన వారిని గుర్తించి చట్ట బద్ధ చర్యలు తీసుకోవాలి / అశ్లీల తవికలు రాసి ప్రచురించిన కవిశ్రేష్టులపై కూడా తగు చర్యలుండాలి. ఇందుకు కొత్త చట్టాలు చేయనవసరం లేదు. మొత్తానికి రాష్ట్రం కలిసుండాలా, విడిపోవాలా అన్నది వేరే సంగతి కాని చట్టాల్ని ఉల్లంఘించిన వారి నెవరినీ ఉపేక్షించరాదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల అక్రమార్కుల అస్తిపంజరాలన్నీ వెలికితీయాలి. అక్రమార్జనలన్నీ స్వాధీనం చేసుకుని ప్రజలకోసం ఉపయోగించాలి.

-చేగొండి రామజోగయ్య,
విశ్రాంత బ్యాంకు అధికారి

9 కామెంట్‌లు:

  1. రాజా, కాణిమొలి, మారన్, సుఖరాం, కల్మాడి, గాలి ప్రభ్రుతులెవరూ "వేర్పాటువాదులు" కాదు కదా. అలాగే మన "అసమదీయులు" జగన్/చంద్రబాబులు కూడా.

    మీకు అవినీతిపై పోరాడాలని ఉండడం హర్షనీయం. విభజన, "సమైఖ్య" వాదాలకు ముడి పెట్టకుండా అవినీతిపై ధ్వజం ఎత్తండి, అందరూ సమర్థిస్తారు. అవినీతి ముసుగులో మీ వాదాన్ని వినిపించాలనుకుంటే భావ్యంగా లేదు.

    రిప్లయితొలగించండి
  2. >> మీకు అవినీతిపై పోరాడాలని ఉండడం హర్షనీయం. విభజన, "సమైఖ్య" వాదాలకు ముడి పెట్టకుండా అవినీతిపై ధ్వజం ఎత్తండి, అందరూ సమర్థిస్తారు. అవినీతి ముసుగులో మీ వాదాన్ని వినిపించాలనుకుంటే భావ్యంగా లేదు.

    మరి ఆత్మగౌరవం ముసుగులో అవతలి వారిని రాక్షస సంతతి అనడం, వారి కుల వివాదాలు లాగడం బావుంటుందా!

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. >>> By the way is PPR shortname for parakala?
    Why not for Ponnam?

    Height of paranoia!
    I am also prabhakar with initial P but I am not Parakala.

    రిప్లయితొలగించండి
  5. @విశ్వరూప్: unfair, why drag his personal matters?

    @PPR: two wrongs don't cancel (as Rachana keeps reminding). Anyhow the subject here is corruption.

    రిప్లయితొలగించండి
  6. కచరా దొర మొదలుకొని విశ్వరూప్ వంటివారు వరకూ వేర్పాటువాదాన్ని తలకెత్తుకొన్న వారిలో సంస్కారహీనులకు కొదువ లేదు

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగా రాసినారు. ఎవరు ఏవాదాలు చేసినా ఉద్యమాలు చేసినా వారి సొంత ప్రయొజనాల కే కదా, అమాయక విద్యార్ధులను ఆత్మహత్యల దిశ గా ప్రేరేపించి వారి వారిని కన్నవారి జీవితాలను ఫణంగా పెట్టి తమ తమ ఆస్తులను పెంచుకునే నేతల ఆటలను వెంటనే కట్టించాలి

    రిప్లయితొలగించండి