14, జులై 2011, గురువారం

ప్రభుత్వం ఎక్కడ ?

సూర్య దినపత్రిక సంపాదకీయం : మూడో వంతు మంది మంత్రులు రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్ర దీక్షల పోరు బాట పట్టారు. వాస్తవానికి వారు రాజీనామాలు చేసింది శాసన సభ్యత్వాలకి, వాటిని సమర్పించింది శాసన సభ స్పీకర్‌కే. ఆ రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించినా, వారి శాసన సభ్యత్వాలు రద్దు అయినా ఆరు మాసాలపాటు మంత్రిపదవులలో కొనసాగే అవకాశమున్నది. తాము మంత్రి పదవులకు రాజీనామా చేయలేదన్న విషయాన్ని ఒకరిద్దరు మంత్రులు తామే స్వయంగా ప్రకటించారు.

అయినా ఉద్యమకారుల ఒత్తిడికి, వారి హెచ్చరికలకు భయపడి బహిరంగంగా మంత్రి పదవీ బాధ్యతల నిర్వహణకు వారు జంకుతున్నారు. వారి వారి శాఖలలో పరిపాలనకు పక్షవాతం సంప్రాప్తం చేస్తున్నదీ పరిణామం. మామూలుగా మంత్రులు శాఖాపాలనలో నిమగ్నులై ఉన్నప్పుడే ప్రభుత్వ యంత్రాంగం మత్తగజాన్ని కుంభకర్ణ నిద్రను తలపిస్తూ ఉంటుంది. అటువంటిది మంత్రులసలు పబ్లిగ్గా అలకపాన్పు ఎక్కి నిష్క్రియాపరత్వాన్ని ఆశ్రయించినప్పుడు యంత్రాంగం విధి నిర్వహణలో ఎన్ని వన్నెచిన్నెలీనుతుందో ఊహకందని విషయం కాదు. వివిధ మంత్రిత్వ శాఖల వద్ద పేరుకుపోయి ఉన్న ఫైళ్ళే ఇందుకు నిదర్శనం.

సువిశాల, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్టమ్రని పేరే గాని ఆ ఇంటిమీది కాకి ఈ ఇంటి మీద వాలని చందంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు కోస్త ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటనలు జరపడం అక్కడి ప్రజలతో మమేకం కావడం, అలాగే ఆ రెండు ప్రాంతాలకు చెందిన మంత్రులు తెలంగాణలో వివిధ ప్రాంతాలను తరచూ సందర్శించి ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం మామూలుగానే అరుదు. ఇప్పుడీ ఉద్యమాల నేపథ్యం అటువంటి దృశ్యాలను బొత్తిగా అదృశ్యం చేసేసింది. శాసన సభ విషయానికి వస్తే, సభలోని మొత్తం 294 మంది సభ్యులలో తెలంగాణకు చెందిన దాదాపు అందరు రాజీనామాలు సమర్పించి ఉన్నారు. ఆ ప్రాంతానికి చెందిన శాసన సభ్యులు మొత్తంగా 119 మంది ఉండగా అందులో 104 మంది రాజీనామాలు సమర్పించారు. ఆ ప్రాంతానికి చెందిన మొత్తం మంత్రులు 15 మందిలో 13 మంది శాసన సభ్యత్వాలకు రాజీనామాలందజేశారు.

కౌలు రైతులను సాగు రైతులుగా పేర్కొంటూ బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రాయితీలు పొందడానికి వారిని అర్హులను చేస్తూ సిద్ధం చేసిన కీలకమైన బిల్లుపై శాసన సభలో చర్చించి సమగ్రచట్టం తీసుకువచ్చే సాహసం చేయలేక అంతటి అతి ప్రధానమైన అంశంపై అనాకారి ఆర్డినెన్సు నొకదానిని చేసి ఆ రైతుల ముఖాన కొట్టింది ప్రభుత్వం. రాష్ట్రంలో నలభైలక్షల వరకు గల కౌలు రైతులకు కౌలు సాగుకు భూమి ఇవ్వడానికి యజమాని రైతులు భయపడి వెనుకాడే పరిస్థితి తల ఎత్తింది. శాసన సభ సమావేశాలు సజావుగా సాగి ఈ వ్యవహారంపై విస్తృతమైన చర్చ జరిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.

కాగితాల మీద రాతపూర్వకంగా కౌలుకు ఇస్తే గతంలో చేసిన కౌల్దారీ హక్కుల చట్టాలకు ఊపిరి వచ్చి తమ యాజమాన్య హక్కు లెక్కడ హరించుకు పోతాయోనని అసలు రైతులు భయపడే పరిస్థితి తల ఎత్తింది. అందుచేత సాగు లేకుండా భూములను అలాగే ఉండనిస్తే ఏ పీడా లేకుండా పోతుందనే అభిప్రాయానికి రైతులు రాగల పరిస్థితులు ఈ అసమగ్ర సాగు రైతు హక్కుల ఆర్డినెన్స్‌ వల్ల దాపురించాయి. ఇది కౌలు రైతుల పాలిట అశనిపాతం. అను నిత్యం బంద్‌లు, ధర్నాలు, రాస్తా, రైల్‌ రోకోలతో శాంతిభద్రతలకు, జనజీవన ప్రశాంతతకు, ప్రజల రాకపోకలకు కలుగుతున్న అంతరాయం అంతా ఇంతా కాదు.

ఇంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా, మంత్రులు సచివాలయానికి హాజరు కాకుండా ముఖం చాటు వేస్తున్నా, శాసన సభ సమావేశాలు సజావుగా సాగకుండా పోతున్నా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తల ఎత్తలేదన్న మాట వాస్తవమే కావచ్చు. రాజ్యాంగ సంక్షోభం అంటే శాసన సభలో పాలక పక్షం మైనారిటీకి పడిపోయి, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలు మృగ్యమైపోయి, అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ బొత్తిగా దుస్సాధ్యమైపోతే కలిగేది. అటువంటి పరిస్థితులు లేకపోవచ్చు. ప్రభుత్వానికి శాసన సభలో సంఖ్యాబలం సమస్య తల ఎత్తి ఉండకపోవచ్చు. అయితే రోజులు, నెలల తరబడి పాలన సజావుగా సాగని పరిస్థితులు కొనసాగుతూ ఉన్నమాట కాదనలేని కఠోర వాస్తవం.

ఏడాది ఎనిమిది మాసాలుగా ఉండి ఉడిగి తరచూ తల ఎత్తుతున్న ప్రత్యేక, సమైక్య రాష్ట్రోద్యమాలు రాష్ట్రంలో పాలనను కరి మింగిన వెలగపండును చేస్తున్నాయి. ఎంతకాలమిలా అనే ప్రశ్న ఇప్పుడే పుట్టిన పశికందుకైనా కలుగుతుంది. సమస్యను నానబెట్టినందువల్ల అది దానంతటదే సమసిపోతుందనే వల్లమాలిన నిష్క్రియాపర ధోరణి అన్ని వేళలా సత్ఫలితాన్ని ఇవ్వదు. బెడిసికొట్టి పాలక పక్షానికి ఊహించని నష్టం కలుగజేస్తుంది. అటో ఇటో స్పష్టంగా తేల్చకుండా ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను రాజకీయ లబ్ధికి గరిష్ఠంగా వాడుకొన్నదాని పర్యవసానమే కాంగ్రెస్‌ అధిష్ఠాన వర్గానికి నేడది కొరకరాని కొయ్యగా పరిణమించిన పరిస్థితి.

పాలక పక్ష శాసన సభ్యులు, మంత్రులే అధిష్ఠానానికి మాటమాత్రమైనా చెప్పకుండా నేరుగా స్పీకర్లకు రాజీనామాలు సమర్పించారంటే కాంగ్రెస్‌ కేంద్ర నాయకత్వం ఎంతటి అసమర్ధ, అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నదో వివరించనక్కర లేదు. పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కూడా వారిని బుజ్జగించి, బతిమలాడి రాజీనామాలు ఉపసంహరించుకొనేలా చేయలేక పోతున్న సంక్లిష్టత కనుపిస్తూనే ఉన్నది. ఇంతవరకూ వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ తెలంగాణ డిమాండ్‌ను ఆమోదించడం ఎంతటి అలవికాని పనో వివరించడం ఇల్లు తగలబడుతుంటే బావి తవ్వడానికి పోయిన చందంగా ఉన్నది.

ఆ మాట ఎప్పుడో చెప్పి ఆ వైపుగా ఆ ప్రాంత నాయకులను, ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేసి ఉంటే కొంతైనా ప్రయోజనం కలిగి ఉండేది. ఇంత కాలం మభ్యపెట్టి, భ్రమలు కల్పించి రాజకీయ ప్రయోజనాల ఫలాలు ఆరగించి ఇప్పుడు అది అంత సుళువు కాదని చేతులెత్తేయడం, ఒక దశలో ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటించి దానిని శాసన సభ ఏకగ్రీవ తీర్మానంతో ముడిపెట్టి, ఆ విషయమూ వివరంగా చెప్పకుండా దాటవేయడం, ఆ తర్వాత అటువైపు ఆ రెండు ప్రాంతాలు రగులుకొన్న తర్వాత మరో ప్రకటన చేసి వ్యవహారాన్ని సాగతీస్తూ రావడం- ఇవన్నీ కేంద్ర పాలనా పగ్గాలు చేపట్టి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతృత్వం చేసిన అతి పెద్ద తప్పులే.

ఆ తప్పులకు ఇప్పటికీ రాష్ట్రం అసాధారణ మూల్యం చెల్లించుకుంటున్నది. భిన్న ప్రాంతాల ప్రజల మధ్య పరస్పర విద్వేషానలం రాజుకునే దుస్థితి తల ఎత్తి నిరవధికంగా కొనసాగుతున్నది. దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన నగరంగా అనతి కాలంలోనే పేరుగాంచి శిఖరాయమాన అభివృద్ధికి కేంద్రం అనిపించుకుంటున్న హైదరాబాద్‌ నగరం సుస్తీ మంచమెక్కిన బలవంతుడి మాదిరిగా కుంగి కునారిల్లే దురదృష్టకర పరిణామం దాపురించింది. ఇకనైనా, ఇప్పటికైనా ఈ అస్తవ్యస్త, అరాచక వాతావరణానికి పూర్తిగా తెర దించే స్పష్టమైన, సమగ్రమైన నిర్ణయంతో కేంద్ర పాలకులు ముందుకు రావలసి ఉంది. రాష్ట్రాన్ని బాగు చేయలేకపోయినా నాశనం చేసే హక్కు వారికి ఎంతమాత్రం లేదు. 

http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subcat=5&contentid=36559

1 కామెంట్‌:

  1. /రాష్ట్రాన్ని బాగు చేయలేకపోయినా నాశనం చేసే హక్కు వారికి ఎంతమాత్రం లేదు. /

    Good, I agree.

    రిప్లయితొలగించండి