18, జులై 2011, సోమవారం

తాత్విక కోణంలో తెలంగాణ

ఆంధ్రజ్యోతి సంపాదకీయ పేజీ : "దేవుడా, నేనుమార్చలేని విషయాలను అంగీకరించే ధీరత్వమివ్వు. మార్చగలిగేవాటిని మార్చేశక్తినివ్వు. ఆ రెంటికీ తేడాతెలుసుకోగల వివేకాన్నివ్వు.''మద్యానికి బానిసలైనవారు తమ బలహీనతలను గుర్తెరిగి, తమనుతాము సంస్కరించుకోవడానికి జ రుపుకునే సమావేశాల్లో చేసేప్రార్థన ఇది. అది అందరికీ వర్తిస్తుంది.

వాస్తవిక ఆధార హేతుబద్ధ స్వేచ్ఛావాద తాత్వికత ప్రకారం అధిభౌతిక సృష్టి ప్రాథమికం. అంటే వాస్తవ భౌతిక ప్రపంచాన్ని ప్రశ్నించకుండా అంగీకరించాలి. మనిషి స్పృహ, చైతన్యం (కాన్షస్‌నెస్) వాస్తవ ప్రపంచానికి సంబంధించే ఉంటుంది తప్ప శూన్యంలో మనజాలదు. మనిషికి ఆలోచనాశక్తి ఉండడం, ఆలోచించాలో వద్దో అన్నది మనిషి స్వబుద్ధిమీద ఆధారపడి ఉండడం కూడా అంగీకరించక తప్పని వాస్తవంలో భాగం. మనిషి చేసే ఆలోచనలు, పనులు వాస్తవికతకు విరుద్ధమైనవైతే అవి ఆమోదయోగ్యం కావు, విజయం సాధించవు. సృష్టిని, వాస్తవికతను (రియాలిటీ) ప్రశ్నించకుండా అం గీకరించాల్సిందే. కానీ మనిషికున్న స్వబుద్ధి కారణంగా అతడు చేసే ప్రతి పనిని, ఆలోచనను ప్రశ్నించకుండా, 'వాస్తవంతో వైరుధ్యం లేదుకదా' అని నిర్ధారించుకోకుండా అంగీకరించకూడదు.

దీనికి భిన్న ధృవమయిన సమసమాజ సమతావాదం ప్రకారం మనిషి చైతన్యమే ప్రాథమికం. అంటే మనిషి ఆలోచనల మేరకే సృష్టి, వాస్తవం ఉంటాయి. సృష్టిని మనిషి నిజమనుకుంటే నిజం, మాయ అనుకుంటే మాయ. అంటే సృష్టి అనేది మనిషి మెదడులో, ఆలోచనల్లోనే ఉంటుంది తప్ప వాస్తవంగా ఏం లేదు. అంతా మి«థ్య.

కాబట్టి మనిషి ఆలోచనల్నీ, కోరికల్ని ఇతరుల అవసరాలకు అనుగుణంగా మలచవచ్చు, నిర్దేశించవచ్చు, ఆదేశించవచ్చు. అసమాన వ్యక్తుల నుంచి సమాన ఫలితాలను, ఉత్పాదనను ఆదేశాల ద్వారా రాబట్ట వచ్చనే సమసమాజ తాత్వికత, సోషలిస్టు భావజాలం ఈ దృష్టి కోణం నుంచే అవిష్కృతమయ్యాయి. తప్పుడు తాత్వికత మనిషిని గందరగోళంలో పడేస్తుంది. తన నమ్మకాలకు, ఆలోచనలకు, వాస్తవానికి పొంతన లేక దారితప్పిస్తుంది.

తెలంగాణ సమస్య ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో తాత్విక గీటురాయితో దాన్ని తడిమి చూడొచ్చు. ఇరువైపులా మేధావులు, ప్రజలు ఏ వాస్తవాలను విస్మరించి ఎలా గందరగోళానికి గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ముందుగా ప్రకృతి, సృష్టి సంబంధం విషయాలు. భౌగోళికంగా కృష్ణా, గోదావరి డెల్టాలు వేరు, పీఠభూమయిన తెలంగాణ వేరు. ఇదెవరూ మార్చలేని వాస్తవం. గోదావరికి కాలడ్డం పెట్టి సాగునీరు పారిస్తామని డాంబికాలు పలికిన వాళ్ళ మాటలను ప్రశ్నించకుండా ఎలా నమ్మేశారు? పండించగలిగే పంటలు వేరు, భూమి స్వభావం వేరు. మరి ఒకరితో పోలికెందుకు? ఇంతకంటే నిస్సారమయిన భూ మి కలిగి, వర్షమంటే ఏమిటో తెలియని ఇజ్రాయెల్‌లో కోస్తా కంటే వందల రెట్లు విలువ గల పంటలు పండిస్తున్నారు.

ప్రభుత్వ రాయితీలతో కాదు, ఎకరాకు సంవత్సరానికి అరవైవేల రూపాయలు చెల్లి ంచి నీళ్ళు కొనుక్కుని మరీ. కాబట్టి మనిషికున్న మేధస్సుతో అదికూడా సాధ్యమే. ఎవరూ నిస్పృహ పడాల్సిన అవసరం లేదు. అలా గే తెలంగాణ ప్రాంతం శతాబ్దాల పాటు ఆధునిక విద్యావ్యవస్థ, స్వేచ్ఛల్లేని నిజాం పాలన నుంచి బయటికొచ్చిందని, సీమాంధ్ర ప్రాంతాలు దాదాపు వంద సంవత్సరాల పాటు బ్రిటీష్ విద్యావ్యవస్థ, చట్టబద్ధ పాలనలో ఉన్నాయనేవి విస్మరించజాలని వాస్తవాలు.

ఇకపోతే మానవ కారక విషయాలు. ఒకే పార్టీలోని పెద్దమనుషులు తమలో తాము రాసుకున్న ఒప్పందం. దాన్ని వాళ్ళు బ్రతికుండి, ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఇరుపక్షాలూ ఉల్లంఘించారు. దాంతో ఇవాళొచ్చిన నష్టమేమిటి? ఉద్యోగాల దోపిడీ? ఉద్యోగమంటే జీతానికి పనిచేయడమనే వృత్తి. అదేమన్నా బంగారమా దోచుకోవడానికి? అది దోపిడీ అయితే మరి ఇంటికొక ఉద్యోగం, డబుల్ ప్రమోషన్లు ఇస్తామని చేస్తున్న వాగ్దానాలు? ఎవర్ని దోచుకోవడానికి? 2004 ఎన్నికల ఒప్పందం. దాని ప్రకారం కాంగ్రెస్ వారు ఇస్తామన్నది రెండో ఎస్సార్సీయే కదా!

సంతకాలు పెట్టిన ఇరుపార్టీలూ ఈ ఒప్పంద వివరాల్ని ఆ రోజున బహిరంగపరిచాయా? పోనీ ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకు చెప్పారా? మరిప్పుడు కాంగ్రెస్‌ను ఎవరు, ఎందుకు, ఎలా తప్పు పట్టగలరు? ఆమరణ దీక్ష రెండో రోజునే పళ్ళరసం తాగడం వాస్తవం. తర్వాత కూడా పుష్టికరమైన ద్రవాహారం మీద దీక్ష కొనసాగించడం వాస్తవం. అసలీ డిమాండును పదిహేనేళ్ళ క్రితం అందరికంటే ముందుగా మావోయిస్టులు తెరపైకి తెచ్చారన్నది వాస్తవం. వాళ్ళ భయానికి ఎవరూ వ్యతిరేకించడానికి నోరెత్తలేదన్నది వాస్తవం. ఇన్నాళ్ళూ వెనుకబడినతనం కారణం చూపి డిమాండు పెట్టారన్నది వాస్తవం. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు తర్వాత ఆత్మగౌరవ ప్రాతిపదికను ముందుకు తెచ్చారన్నదీ వాస్తవం.

ఉద్యమ క్రమంలో ఏంచేసినా అభిశంసనీయం కాదనే రాజకీయ నైతికతను మీడియా, మేధావులు పెంచి పోషించారన్నది వాస్తవం. ఆ బలంతో ఉద్యమం పేరిట వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని తుంగలో తొక్కడం వాస్తవం. పేరు ఇష్టం లేకపోతే భోజనం కోనుక్కోవడం మానేయొచ్చు. హీరో స్థానికత ఇష్టంలేకపోతే సినిమా చూడ్డం మానేయొచ్చు.

సహచరులను కూడా చూడొద్దని నచ్చజెప్పవచ్చు. అంతేగానీ ఆంధ్ర మెస్‌లను మూయించడం, ధియేటర్లు పగలగొట్టడం, షూటింగులు భగ్నం చెయ్యడం, ఇళ్ళమీద దాడులు, వాహనాల దహనం, నాలుకకోస్తాం, జాగో భాగోలన్నీ లక్షలాది మంది భయ విహ్వలతకు, కోట్లాది మంది అభద్రతా భావానికి దారితీశాయన్నది వాస్తవం.

అసలీ ఆటలన్నీ ఇరువైపులా రాజకీయాల అధికార క్రీడలే తప్ప ప్రజల బాగుకోసం కాదన్న వాస్తవాన్ని ఐదేళ్ళుగా చూస్తూ కూడా గ్రహించలేని వాళ్ళు తమ అజ్ఞానానికి తామే బాధ్యులు. చిక్కుముళ్ళ నుంచి ఎలా బయటపడాలో తెలియక గిలగిల్లాడుతున్న నాయకులు, పార్టీలు వారి పరిస్థితికి వారే బాధ్యులు. డబ్బిచ్చి పేపరు కొనుక్కునే వినియోగదారులకు వాస్తవ సమాచారం అందించాల్సిన పత్రికలు, వాటి సిబ్బంది ఉద్యమంలో పక్షాలు కట్టారన్నది వాస్తవం. అలాంటి వాళ్ళు రాసిన కథనాలు చదివి రక్తపోటు పెంచుకోవడం విజ్ఞత అవుతుందా? మనిషి చేసిన ఏ పనినయినా నిశితంగా, విమర్శనాత్మకంగా పరిశీలించకుండా అంగీకరించకూడదనే తాత్విక సూత్రాన్ని విస్మరించడం వల్లే ఈ పరిణామం.

భాష అనేది భావ వ్యక్తీకరణకు ప్రధాన మాధ్యమం. అంతమాత్రాన రాజకీయ నిర్మాణానికి అదే ప్రాతిపదిక కానక్కర్లేదు. అయినా భాష ప్రాతిపదికన రాష్ట్రాలేర్పడ్డాయనేది చారిత్రకంగా జరిగిన మానవ నిర్మిత వాస్తవం. దాన్ని మార్చుకోవడం అసంభవమూ కాదు, తప్పూ లేదు. కాకపోతే ఏ కొత్త ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించాలో దేశవ్యాప్తంగా ఒక విధానముండాలనే వాదనా ఆక్షేపణీ యం కాదు. దోపిడీదారులనబడేవారు నిజంగా దోచిఉంటే అది ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకునే చేశారు. అలాంటి విచక్షణాధికారాల్ని ప్రభుత్వాలకు మనమే ఇచ్చాం. కొత్త రాష్ట్రంలో అలాంటి అధికారాలను రద్దుచేసి దోపిడీని అరికడతామని ఏ పార్టీ కూడా చెప్పడం లే దు.

అంటే దోపిడీదారులు మారుతారు గానీ దోపిడీ మాత్రం ఆగ దు. సామాన్య ప్రజలకు ఏరాయైతేనేం పళ్ళూడగొట్టుకోవడానికి? మరి కొత్తదోపిడీ ముఠాలకు పట్టాభిషేకం చేయడానికి ప్రజా సమూహాలకు ఎందుకింత ఉబలాటం, ఇంత సెంటిమెంటు? తాత్విక శూన్యత. అహేతుక ఆత్మాశ్రయ వాదం (సబ్జెక్టివిటీ). "వాస్తవాలెలా ఉన్నా సరే, నేనడిగింది ఇచ్చి తీరాల్సిందే, ఎందుకంటే 'నేను' కావాలనుకుంటున్నాను గనక, ఇంతమంది చెబుతున్నారు కాబట్టి నిజమే అయ్యుండాలి, ఇంతమంది కోరుతున్నారు కాబట్టి న్యాయమే అయ్యుంటుంది'' అనే ఉద్వేగపూరిత గొర్రెదాటు మనస్థత్వం.

అహేతుక సెంటిమెంటుతో అప్పుడప్పుడూ ఊగిపోయే వారు కూడా తమ సొంత విషయాల్లో హేతుబద్ధంగానే వ్యవహరిస్తారు. ఇక్కడైతే చదువులు సరిగ్గా సాగేట్లు లేవని తమ పిల్లలను కోస్తా కాలేజీల్లో చేరుస్తారు. బంధుత్వాలు కలుపుకోవడానికి ప్రాంతం అడ్డురాదు. మన ప్రాంతం వాడైనా ప్రభుత్వాఫీసుల్లో లంచం ఇవ్వనిదే పని జరగదు. వ్యక్తిగతంగా ఎదగడానికి ప్రాంతం అడ్డురాదని వ్యక్తులకు తెలుసు. ఎటొచ్చీ ప్రభుత్వం, దాని వ్యవస్థల మీద పరాన్న జీవులుగా బ్రతికేవాళ్ళకే, ఇంకా ఎక్కువ పొందొచ్చనే ఆశ. వారి ఆశను ప్రజల ఆశయంగా, ప్రజలకున్న ఏకైక మోక్షమార్గంగా భ్రమింపజేస్తున్నారు. స్వంతంగా, వైరుధ్య రహితంగా, హేతుబద్ధంగా ఆలోచించలేని వాళ్ళు బుట్టలో పడుతున్నారు.

ఇరువైపుల ప్రజలు, విద్యార్థులు, మేధావులు అసలు కోరాల్సింది ప్రజల హక్కుల్ని రక్షించే ప్రభుత్వ వ్యవస్థని. ఉద్యమించాల్సింది, విప్లవించాల్సింది రాజకీయ స్వప్రయోజనాల కోసం ప్రజలకు వేసిన సంకెళ్ళను తెంచుకోవడానికి. దానికి కావలసింది ఎదుటివాళ్ళను తొక్కిపెట్టే హింసాత్మక ఉద్యమాలు కాదు. స్వేచ్ఛగా, తన నిర్ణయాలు, చేతలు, వాటి పర్యవసానాలకు బాధ్యత వహిస్తూ, ఎవరినీ వంచక, ఎవరికీ తలవంచక, సర్వసత్తాక వ్యక్తిగా బతకగల సమాజం కోసం భావోద్యమం కావాలి. అప్పుడే మనిషికి విముక్తి. దానికి ప్రాంతం, భాష, యాస, బిర్యానీ అడ్డుకావు, అడ్డురావు.
- జాహ్నవి

4 కామెంట్‌లు:

  1. శ్రీ KCR గారు దంచికొడతామని మరో స్టేట్మెంట్ ఇచ్చేరు.వీళ్ళ డిమాండ్ లోని న్యాయమెంత అన్నది చర్చించటానికి సిద్దంగా లేరు, శ్రీ కృష్ణ కమిటీ లోని లోపాలేమయినా ఉంటే వాటిని ఎత్తిచూపే ప్రయత్నం చేయాలి కానీ పదే పదే ఆంధ్రప్రజలను ఆడి పోసుకొని ప్రయోజనమేముంది.వీళ్ళ భాష మారనంత వరకూ తెలంగాణ వచ్చే పరిస్తితి కనిపించటం లేదు

    రిప్లయితొలగించండి
  2. Whether this is editorial or an article in the editorial page? Because Radhakrishna, the Manager or Editor of Andrha Jyothi, who comes frequently on the AJ TV channel and holds discussions with students, youths, etc. has recently stated that he favours separate Telangana.

    రిప్లయితొలగించండి
  3. Radhakrishna, MD of AJ as well as many of it is current and past editorial board (Sriniva, Allam Narayana, RamachandraMurthy)are heavily pro-telangana guys.
    Every now and then they publish articles like these just to make sure their market in kota-rayalaseema region hols good.
    To my knowledge there isn't any paper or media that openly supports samaikhyandhra. Not even one.(May be prajasakthi, a liitle bit).
    Thats is a real pity.

    రిప్లయితొలగించండి